breaking news
RTC busstands
-
మినీ థియేటర్లు!
సాక్షి, ఆదిలాబాద్ : బస్సులు నడపడం ద్వారా వచ్చే ఆదాయానికే పరిమితం కాకుండా నష్టాల నుంచి గట్టెక్కడానికి ఆర్టీసీ సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఆర్టీసీ బస్స్టేషన్లు, డిపోల స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించే ఆలోచన చేస్తోంది. ఆర్టీసీ ఆస్తులపై ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీటికి సంబం ధించి ప్రతిపాదనలు తయారు చేస్తుండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఆర్టీసీ స్థలాల్లో వీటికిసంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించి పంపిం చారు. హైదరాబాద్లో ఈనెల 12న దీనికి సంబం ధించి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ఈ మినీ థియేటర్ల విషయంపై చర్చించనున్నారు. ఎక్కడెక్కడా.. మినీ థియేటర్ల విషయంలో ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు బస్స్టేషన్లు, డిపో స్థలాలు అనువుగా ఉన్నాయని ప్రతిపాదించారు. అందులో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆదిలాబాద్, ఉట్నూర్, జైనథ్, బోథ్, నిర్మల్ జిల్లా నుంచి భైంసా, ఖానాపూర్, సారంగాపూర్, మంచిర్యాల జిల్లా నుంచి మంచిర్యాల, చెన్నూర్, లక్సెట్టిపేట, జన్నారం, కుమురంభీం జిల్లా నుంచి కాగజ్నగర్, ఆసిఫాబాద్, సిర్పూర్(టి) స్థలాలు అనువుగా ఉన్నాయని ప్రతిపాదనలు పంపారు. ఆయా ప్రాంతాల్లో పొటెన్షియల్ను బట్టి మినీ థియేటర్లు నిర్మించేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని బట్టి సినిమా షోలు అనువును అంచనా వేస్తూ పొటెన్షియల్ను పరిగణలోకి తీసుకుంటున్నారు. మినీ థియేటర్ కోసం 1500 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఉమ్మడి జిల్లాలోని పలు బస్స్టేషన్లు, డిపోల పరిధిలో స్థలాలు అందుబా టులో ఉన్నాయి. వాటిని వినియోగంలోకి తేవా లని ఈ ఆలోచన చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ ప్రాంతంలో అసలు థియేటర్లే లేకపోవడంతో అక్కడ ఇది ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా స్థలాలను బట్టి కాగజ్నగర్, ఆసిఫాబాద్లో బస్డిపో స్థలాల్లో, మంచిర్యాలలో క్వార్టర్స్ ఉన్నచోట అనువుగా ఉంటుందని చెబుతున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో పొటెన్షియల్ను బట్టి అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. మిగతా స్థలాల్లో ప్రతిపాదనలు చేసినా అక్కడ పొటెన్షియల్ అంతగా ఉండదని, ఈ దృష్ట్యా అక్కడ తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (టీఎఫ్డీసీ) లీజు తీసుకునేందుకు ముందుకు వస్తుందా? లేదా అని మీమాంసలో ఉన్నారు.మంచిర్యాలలో ఇప్పటికే టీఎఫ్డీసీ అంగీకారం తెలిపినట్లు సమాచారం. నిర్మల్లో బస్టాండ్,మల్టీషాపింగ్ కాంప్లెక్స్ నిర్మల్లో నూతనంగా బస్టాండ్, మల్టీషాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రస్తుతం బస్టాండ్ ఉన్న పార్కింగ్ స్థలాల వెనుక లోతట్టు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. బస్టాండ్ నిర్మించి, దానిపైన మల్టీషాపింగ్ కాంప్లెక్స్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. వీటన్నింటికి సంబంధించి ఈనెల 12న అధికారులు సమాలోచనలు చేయనున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ డివిజన్లో ఆర్టీసీ బస్స్టేషన్ల ప్లాట్ఫాంల పెంపు, ఇతరత్ర అభివృద్ధి పనులు చేపట్టారు. ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు.. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, ఉట్నూర్, ఆసిఫాబాద్లో బస్డిపోలు ఉన్నాయి. రోజూ తిరిగే బస్సుల ద్వారా రూ.80లక్షల ఆదాయం లభిస్తోంది. అలాగే బస్టాండ్, డిపో స్థలాల్లోని వాణిజ్య సముదాయాల ద్వారా ఏడాదికి రూ.5కోట్ల ఆదాయం వస్తోంది. ఈ ఆదాయాన్ని పెంచేందుకు సంస్థ అడుగులు వేస్తోంది. ప్రధానంగా మినీ థియేటర్లను లీజుకు ఇవ్వడం, మల్టీషాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ద్వారా అదనంగా మరో రూ.కోటి ఆదాయాన్ని రాబట్టాలని ప్రణాళిక చేస్తోంది. ప్రతిపాదనలు పంపించాం ప్రభుత్వం ప్రతిపాదనలు కోరడంతో పంపించాం. ప్రధానంగా స్థలాలు అందుబాటులో ఉన్న దగ్గర ఈ ప్రతిపాదనలు చేశాం. అయితే పొటెన్షియల్ను బట్టి మినీ థియేటర్లు లీజుకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పలుచోట్ల మినీ థియేటర్ల కోసం ప్రతిపాదనలు చేసినప్పటికి అందులో కొన్నింటికి టీఎఫ్డీసీ ముందుకొచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా నిర్మల్లో మల్టీషాపింగ్ కాంప్లెక్స్, బస్టాండ్ నిర్మించాలని యోచిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ను అలాగే ఉంచి నూతన బస్టాండ్ను నిర్మించే ప్రతిపాదన ఉంది. – రవీంద్రనాథ్సింగ్, ఆర్టీసీ డిప్యూటీ ఈఈ -
మినీ థియేటర్స్ కోసం
రానున్న రోజుల్లో బస్టాండ్స్లో మినీ థియేటర్స్ ప్రత్యక్షం కానున్నాయి. దాని కోసం కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, అధ్యక్షుడు పి. రామ్మోహనరావులు పలువురు అధికారులతో చర్చించి, తెలంగాణా చలన చిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా ఆర్టీసీ బస్టాండ్స్లో మినీ థియేటర్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు బస్టాండ్స్లో, వాటికి సంబంధించిన ఖాళీ స్థలాల్లో 80 నుంచి 100 మినీ థియేటర్ల ఏర్పాటుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణతోనూ రామ్మోహన్ రావు చర్చించారు. ‘‘ఈ ప్రాజెక్ట్ను చేపట్టాల్సిందిగా టెండర్లను ఆహ్వానించినా సరైన స్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, మినీ థియేటర్ల ఏర్పాటుకు తగిన అనుమతులు తీసుకోవాలనుకుంటున్నాం’’ అని రామ్మోహనరావు అన్నారు. -
తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్లలో వైఫై!
హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణీకులకు వై-ఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం క్వార్డ్జన్ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. క్వార్డ్జన్ కంపెనీ బీఎస్ఎన్ఎల్తో కలిసి వైఫై సేవలు అందించనుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల బస్టాండుల్లో ఈ వైఫై సేవలు అందించనున్నారు. ఈ రెండు సంస్థలు కలిసి తొమ్మిది రాష్ట్రాలో వై ఫై సేవలు అందించనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లోని మహాత్మగాంధీ బస్స్టేషన్లో, సికింద్రాబాద్లోని జూబ్లీ బస్స్టేషన్లో వై-ఫై సేవలు వినియోగంలోకి వచ్చాయి. హన్మకొండలోని జిల్లా బస్స్టేషన్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, పటాన్చెరువు, మహబూబ్నగర్ బస్స్టేషన్లలో వైఫై సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన పరికరాలను బిగిస్తున్నారు. హన్మకొండ బస్స్టేషన్లో క్వార్డ్జెన్ కంపెనీ వైఫై సేవలు అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది. బీఎస్ఎన్ఎల్ సంస్థ నెట్ కనెక్షన్ ఇవ్వగానే, రెండు మూడు రోజుల్లో బీఎస్ఎన్ఎల్ వై ఫై సేవలు వినియోగంలోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తుంది. ప్రయాణీకులకు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినా..వీటిని చెల్లింపు ఆధారంగా సేవలు అందించనున్నారు. నెలకు 15 నిమిషాలు మాత్రమే ఉచితంగా అందించనున్నారు. 30 నిమిషాలకు లేదా 300 ఎంబీకి రూ.30లు చార్జీ చేయనున్నారు. 50 నిమిషాలు లేదా 500 ఎంబీకి రూ.50లు, రూ.124లకు 24 గంటలు వైఫై సేవలు అందించనున్నారు. దీనిని 24 గంటల లోపు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ సేవలు వినియోగించుకునేవారు కూపన్లు, ఆన్లైన్ పేమెంట్ పద్దతిలో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.