breaking news
rituparna
-
సెమిస్టర్ స్టూడెంట్ 72 లక్షల జీతం
72 లక్షల ప్రీ ప్లేస్మెంట్ ఇచ్చి భారీ జీతం పొందిన అండర్ గ్రాడ్యుయేట్గా వార్తల్లో నిలిపింది. సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో రోబొటిక్స్ అండ్ ఆటోమేషన్ చదువుతున్న రితుపర్ణ గతంలో చేసిన ప్లేస్మెంట్ ప్రయత్నాలు విఫలమైనా పట్టుదలతో ఇంత భారీ అవకాశాన్ని పొందగలిగింది. ఈ కాలపు యువతకు స్ఫూర్తిని ఇవ్వదగ్గ రితుపర్ణ పరిచయం...రితుపర్ణ కథ అచ్చు సినిమా కథలాగే మలుపులతో ఉంటుంది. సామాన్యమైన అమ్మాయని అందరూ అంచనా వేస్తే అసామాన్యురాలిగా కనిపించి, నిరూపించి నివ్వెర పరిచింది. అర్హతలున్నాయా అని ప్రశ్నించిన చోటే ఆశ్చర్య పోయే అంగీకారం పొందింది. మరి ప్రఖ్యాత రోల్స్ రాయిస్ సంస్థ నుంచి ఏడాదికి రూ.73.3 లక్షల ప్రీ–ప్లేస్మెంట్ ఆఫర్ పొందడం అంటే మాటలా? దేశంలో ఈ అవకాశాన్ని పొందిన అతి కొద్దిమంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో ఒకరు కె.ఎస్. రితుపర్ణ.డాక్టర్ కాబోయి...కర్నాటకలోని తీర్థహళ్లి తాలూకా కోడూరుకు చెందిన కె.ఎన్.సరేష్, గీత దంపతుల కుమార్తె రితుపర్ణ. ఆమె చెల్లెలు రిత్విక. రితుపర్ణ పీయూసీ పూర్తి చేసిన తర్వాత మెడిసిన్ చదవాలని అనుకుంది. ఆ తర్వాత యూపీఎస్సీ రాసి సివిల్ సర్వీసెస్లో చేరాలన్నది ఆమె కల. ఇందుకోసం 2002లో నీట్ రాసింది. అయితే ఆమెకు ప్రభుత్వ సీటు రాలేదు. ప్రైవేటులో చదివేంత స్థోమత లేదు. ఆ సమయంలో ఇంజినీరింగ్లో చేరమని ఆమె తండ్రి సలహా ఇచ్చారు. ఇంజినీరింగ్ చదివితే ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చని సలహా ఇచ్చారు. అలా సీఈటీ కౌన్సెలింగ్లో ప్రభుత్వ సీటు సం పాదించి సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజినీరింగ్లో చేరింది రితుపర్ణ. మొదట్లో బి.టెక్ పట్ల అంత ఆసక్తి చూపక పోయినా రాను రాను ఆసక్తి పెంచుకొని ఉన్నతి సాధించింది. రోబొటిక్స్ కోర్సు ఆసక్తికరంగా అనిపించి కొత్తగా ఆలోచించడం, కొత్త మార్గాలు అన్వేషించడం ఆమెకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆమె ఆవిష్కరణదేశానికి వెన్నెముకగా నిలిచే రైతు వ్యవసాయంలో ఇంకా శ్రమపడుతూ ఉన్నాడు. అతని శ్రమను తగ్గించే క్రమంలో ఏదైనా కొత్తగా కనుక్కుంటే బాగుంటుందని ఆమె భావించింది. ప్రధానంగా వక్కలు పండించడం చాలా శ్రమతో కూడుకున్న పని అని ఆమె గమనించింది. ఆ శ్రమను తగ్గించేందుకు తన బృందంతో కలిసి రోబోటిక్ హార్వెస్టర్ స్ప్రేయర్ మోడల్ను అభివృద్ధి చేసింది. ఈ ఆవిష్కరణ గోవా ఐనెక్స్ పోటీలో బంగారు, వెండి పతకాలను గెలుచుకుంది. ఇది ఆమె తొలి విజయం. తరువాత ఎన్ఐటీకే సూరత్కల్లోని పరిశోధనా బృందంలో రితుపర్ణ చేరింది. అక్కడ ఆమె ప్రాజెక్టులు ప్రయోగశాలకే పరిమితం కాలేదు. డిప్యూటీ కమిషనర్ ముల్లై ముహిలన్ను కలిసింది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఒక యాప్ అభివృద్ధికి కృషి చేసింది. అందరూ తన ప్రతిభను మెచ్చుకుంటున్నా రితుపర్ణ దృష్టి మాత్రం అంతర్జాతీయ గుర్తింపుపైనే ఉంది. ఇదీ చదవండి: Vidya Balan మైండ్ బ్లోయింగ్.. గ్లామ్ అవతార్, అభిమానులు ఫిదా!రోల్స్ రాయిస్ సందేహంతన ప్రతిభకు తగిన గుర్తింపు కోసం ఇంటర్న్షిప్ కోరుతూ రోల్స్ రాయిస్ను సంప్రదించింది రితుపర్ణ. అయితే అక్కడి నుంచి ఆమెకు విచిత్రమైన సమాధానం వచ్చింది. ‘మీరు మా సంస్థలో భాగం కావడానికి అర్హతలున్నాయా?‘ అని మొదలుపెట్టి, ‘ఒక నెలలో మేం చెప్పే పనుల్లో ఒక్కటి కూడా మీరు పూర్తి చేయలేరని‘ అని వాళ్లు సమాధానం ఇచ్చారు. దీంతో కంపెనీ తన అర్హతను ప్రశ్నిస్తోందని ఆమె అర్థం చేసుకుంది. అయినా నిరుత్సాహపడకుండా ధైర్యంగా తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం కోరింది. కంపెనీ అంగీకరించి ఒక నెల గడువు తో కూడిన పనిని అప్పగించింది. దీక్ష, పట్టుదల, సంకల్పంతో నెల రోజుల గడువున్న ఆ పనిని ఆమె వారంలోనే పూర్తి చేసింది. ఆమె వేగం, కచ్చితత్వం, పట్టుదలకు రోల్స్ రాయిస్ యాజమాన్యం ఆశ్చర్య పోయింది. ఆమెపై నమ్మకంతో మరిన్ని పనులు అప్పగించారు. అలా ఎనిమిది నెలల పాటు ఒక పక్క కళాశాలకు వెళ్తూనే మరోవైపు వారిచ్చిన పనులన్నీ సకాలంలో పూర్తిచేసింది. గతేడాది డిసెంబర్లో రోల్స్ రాయిస్ ఆమెకు వారి జెట్ ఇంజిన్ తయారీ విభాగంలో ప్రీ–ప్లేస్మెంట్ అవకాశాన్ని అందించింది. దీంతో అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య ఆ కంపెనీలో పనిచేస్తూ, ఉదయం కాలేజీకి వెళ్లి వచ్చేది రితుపర్ణ. ఆమె పనితీరు గమనించి తన ప్రారంభ ప్యాకేజీని సంవత్సరానికి రూ.39.6 లక్షల నుండి రూ.72.3 లక్షలకు పెంచింది కంపెనీ. ఏడో సెమిస్టర్ పూర్తి చేసిన తర్వాత, రితుపర్ణ అధికారికంగా అమెరికాలోని టెక్సాస్ యూనిట్లో చేరనుంది. ‘ఈ విజయం మీకెలా ఉంది’ అని రితుపర్ణని అడిగితే, ‘ప్రముఖ సంస్థలు కేవలం పట్టణం, నగరంలో చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశాలు ఇస్తాయని చాలామంది అనుకుంటారు. అది అబద్ధమని నిరూపించడం ఆనందంగా ఉందని’ పేర్కొంది. ప్రభుత్వ సీటు పొందిన స్థాయి నుండి రోల్స్ రాయిస్లో ఉద్యోగిగా ఎదగడం వరకూ ప్రోత్సహించిన తన అమ్మానాన్నలు, కుటుంబసభ్యులు, అధ్యాపకులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపింది. -
ప్రిక్వార్టర్స్లో జయరామ్, రితూపర్ణ
హో చీ మిన్ (వియత్నాం): భారత షట్లర్లు అజయ్ జయరామ్, రితూపర్ణ దాస్ వియత్నాం ఓపెన్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో జయరామ్ 21–17, 21–16తో పిలియాంగ్ ఫిఖీలా (ఇండోనేసియా)పై... మహిళల సింగిల్స్లో రితూపర్ణ 21–13, 21–14తో షియోరి సైటో (జపాన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్కు చేరారు. మరో భారత ఆటగాడు కార్తీక్ జిందాల్ 9–21, 21–16, 21–16తో జూలియన్ పాల్ (మారిషస్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరాడు. ఇతర మ్యాచ్ల్లో సిరిల్ వర్మ తొలి రౌండ్లో 21–17, 21–16తో శ్రేయాన్‡్ష జైస్వాల్ (భారత్)పై గెలిచి... రెండో రౌండ్లో 20–22, 21–17, 17–21తో టాప్ సీడ్ యగోర్ కొలెహో (బ్రెజిల్) చేతిలో ఓడాడు. శివాని ఓటమి: తెలంగాణ యువ క్రీడాకారిణి రుత్విక శివాని మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 19–21, 17–21తో యిన్ ఫన్ లిమ్ (మలేసియా) చేతిలో ఓడింది. ఇతర మ్యాచ్ల్లో రసిక రాజే, ముగ్ధ, వైదేహి కూడా పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్లో భారత్ పోరాటం ముగిసింది. తొలి రౌండ్లో ధ్రువ్ కపిల–జక్కంపూడి మేఘన జంట 17–21, 21–18, 21–23తో జియాంగ్ జెన్బాంగ్–చెన్ యింగెక్సూ(చైనా) జోడీ చేతిలో, శివమ్ శర్మ– పూర్విషా ద్వయం 15–21, 16–21తో తడయూకీ ఉరాయి– మియౌర (జపాన్) జంట చేతిలో ఓడింది. -
పోలిష్ ఓపెన్ చాంప్ రితూపర్ణ
బీరన్ (పోలాండ్): పోలీష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు రెండు విభాగాల్లో టైటిల్స్ లభించాయి. మహిళల సింగిల్స్లో రితూపర్ణ దాస్ విజేతగా నిలువగా... మహిళల డబుల్స్లో సంజన సంతోష్-ఆరతి సారా సునీల్ జంట టైటిల్ దక్కించుకుంది. పురుషుల సింగిల్స్లో సౌరభ్ వర్మ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రితూపర్ణ దాస్ 11-21, 21-7, 21-17తో భారత్కే చెందిన రసిక రాజెను ఓడించింది. డబుల్స్ ఫైనల్లో సంజన-ఆరతి సారా ద్వయం 19-21, 21-19, 21-14తో టాప్ సీడ్ నటాల్యా వొట్సెక్-ఝెలిజవెటా జర్కా (ఉక్రెయిన్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ 27-29, 13-21తో విక్టర్ స్వెండ్సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. -
సెమీస్లో కృష్ణప్రియ, రితుపర్ణదాస్
ఎల్బీ స్టేడియం,న్యూస్లైన్: రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అండర్-19 బాలికల సింగిల్స్లో కృష్ణ ప్రియ, రితుపర్ణదాస్(హైదరాబాద్)లు సెమీస్లోకి అడుగు పెట్టారు. అండర్-19 బాలుర సింగిల్స్లో ఎం.కిరణ్ కుమార్, ఆర్.అనీత్ కుమార్(రంగారెడ్డి) సెమీఫైనల్లోకి చేరారు. అలాగే డి.బి.ఎస్.చంద్రకుమార్ (తూర్పు గోదావరి), ఎస్.బాలు మహేంద్ర (విశాఖపట్నం) సెమీస్కు చేరారు. తణుకులో జరుగుతున్న ఈపోటీల్లో మూడో రోజు మంగళవారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ రితుపర్ణదాస్ 21-9, 21-14స్కోరుతో సంతోషి (విశాఖ)పై ఘన విజయం సాధించింది. మరో క్వార్టర్ ఫైనల్లో కృష్ణ ప్రియ 21-17, 21-14తో పి.సోనిక సాయి(కర్నూలు)పై, జి.వృశాలి(రంగారెడ్డి) 21-23, 21-16, 24-22తో డి.పూజ(చిత్తూరు)పై, జి.రుత్విక శివాని (ఖమ్మం) 21-15, 21-6తో సి.హెచ్.ఉత్తేజిత రావు (విశాఖపట్నం)పై నెగ్గారు. బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఎం.కిరణ్ కుమార్ 20-22, 21-18, 21-18 స్కోరుతో మూడో సీడ్ ఎం.కనిష్క్(గుంటూరు)పై సంచలన విజయం సాధించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్లో ఆర్.అనీత్ కుమార్ 21-6, 21-13తో కె.జగదీష్ కుమార్(విశాఖ)పై, చంద్ర కుమార్ 19-21, 21-14, 23-21తో డి.ఆర్.రఘునాథ్ (గుంటూరు)పై, బాలుమహేంద్ర 21-19, 21-15తో సి.ఉపేందర్(కర్నూలు)పై గెలిచారు.