breaking news
reimbursement of fee
-
తండ్రి ఇక్కడ పుడితేనే ఫీజు!
రీయింబర్స్మెంట్ వర్తింపుపై అధికారుల ప్రతిపాదనలు విద్యార్థుల స్థానికతకు తండ్రి జన్మస్థలమే ప్రాతిపదిక ‘మన వాళ్లకే ఫీజులు’ అన్న కేసీఆర్ ఆదేశంతో నిర్ణయం తుది ఫైల్ సిద్ధం.. సీఎం ఆమోదమే తరువాయి సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు తెలంగాణలోనే పుట్టినా, ఇక్కడే విద్యాభ్యాసం కొనసాగిస్తున్నా సరే.. వారి తండ్రి కూడా తెలంగాణలో పుట్టినట్లయితేనే ఇక నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించనుంది. దీనికి దరఖాస్తు చేసుకునేప్పుడే తండ్రి స్థానికతను ధ్రువీకరించే పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుపై అధికారులు రూపొందించిన ప్రతిపాదనల్లో ముఖ్యమైన అంశమిది. ‘మన బిడ్డలకే ఫీజులు..’ అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులు ఈ తరహా ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో.. తెలంగాణ విద్యార్థులంటే ఎవరు? ఏ ప్రామాణికతను ఆధారంగా స్థానికతను నిర్ధారించాలనే అంశంపై కొద్దిరోజులుగా కసరత్తు చేసిన అధికారులు ఈ మేరకు తుది ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల విద్యాసంస్థల్లో వేలాది మంది సీమాంధ్ర విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న నేపథ్యంలో వారికి ఫీజులు చెల్లించడం అనవసరమనే ప్రభుత్వ భావన కూడా ఈ ప్రతిపాదనలకు కారణమవుతోంది. వీటికి సీఎం ఆమోద ముద్ర పడగానే అమల్లోకి వస్తాయి. శనివారం సీఎస్ రాజీవ్శర్మ అధ్యక్షతన ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు, సబ్ప్లాన్ల అమలు తదితర అంశాలపై సమావేశం జరిగింది. పంచాయతీరాజ్, సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు రేమండ్ పీటర్, టి.రాధా, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ప్రవీణ్కుమార్తో పాటు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సమన్వయకర్త మల్లేపల్లి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు.. తెలంగాణ విద్యార్థులుగా ఎవరిని పరిగణించాలనే అంశంపై అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముల్కీ నిబంధనను (వరుసగా 15 ఏళ్లు ఎక్కడ నివసిస్తే అక్కడ స్థానికుడు అవుతాడు) అనుసరిద్దామని కొందరు, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 4 నుంచి 10వ తరగతి వరకు వరుసగా ఏవైనా నాలుగేళ్లు తెలంగాణలో విద్యనభ్యసించిన వారందరినీ స్థానికులుగా పరిగణించాలని మరికొందరు సూచించారు. అయితే అధికారులు మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ఇటీవల జరిగిన అఖిలపక్షంలో సీఎం కేసీఆర్ ‘మన బిడ్డలకే ఫీజులు చెల్లిద్దాం..’ అని చెప్పిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వందలాది కాలేజీల్లో వృత్తివిద్యా కోర్సులు చదవటానికి సీమాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు వస్తున్న నేపథ్యంలో.. వారికి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదనేది తెలంగాణ ప్రభుత్వ భావన. ఈ మేరకు విద్యార్థులు ఇక్కడే పుట్టినా, ఇక్కడే పాఠశాల విద్య అభ్యసించినా సరే.. వారి తండ్రి కూడా ఇక్కడ పుట్టినవారైతేనే స్థానికులుగా పరిగణించాలని నిర్ణయించినట్లు సమాచారం. అప్పుడే ‘మన బిడ్డలకే ఫీజులు..’ అనే కేసీఆర్ ఆదేశం సరిగ్గా నెరవేరుతుందన్న ఆలోచనతో ఉన్నతాధికారులు ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తుది ప్రతిపాదనలతో అధికారులు ఫైల్ను రూపొందించారు కూడా. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేయడమే మిగిలింది. సబ్ప్లాన్లకు ప్రత్యేక విధివిధానాలు.. అయితే ఈ సమావేశంలో తొలుత ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ల అమలుపై చర్చ జరిగింది. వీటికి సంబంధించి స్పష్టమైన విధి విధానాలను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను సబ్ప్లాన్ నుంచి చెల్లించకూడదని తీర్మానించారు. భూముల కొనుగోలుతోపాటు ఆయా సామాజికవర్గాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అవసరమైన కార్యక్రమాల కోసం మాత్రమే సబ్ప్లాన్ నిధులను ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. -
ఏపీ విద్యార్థుల బాధ్యత టీ ప్రభుత్వానిదే
ఫీజు రీయింబర్స్మెంటుపై ఆర్థిక మంత్రి యనమల సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో చదివే ఏపీ విద్యార్థుల బోధనారుసుం, స్కాలర్షిప్ల బాధ్యత తెలంగాణ ప్రభుత్వమే చూడాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంప్రదిస్తున్నారని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ఆ ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను అనుసరించి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఒకవేళ స్థానిక తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు బోధనారుసుం ఇవ్వని పక్షంలో రాష్ట్రప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రుణమాఫీపై కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఖరీఫ్ సాగుకు ఇబ్బంది లేకుండా సకాలంలో రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లతో చర్చిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు సమీక్షలు జరుపుతున్నామని, వ్యవస్థను మెల్లమెల్లగా గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు. లోపాలను సరిదిద్ది ఆదాయాన్ని మెరుగుపర్చుకొనే చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. -
రీయింబర్స్మెంట్ పై యాజమాన్యాలదే నిర్లక్ష్యం: పితాని
హైదరాబాద్: విద్యార్థుల కొరకు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యాజమాన్యాలే నిర్లక్ష్యం చేస్తున్నాయని మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆ పథకం పేరుతో రూ.2100 కోట్ల విడుదల చేస్తే.. విద్యార్థులకు చేరింది మాత్రం రూ.82 కోట్లేనని తెలిపారు. ఫీజు రియింబర్స్ మెంట్ పై నిర్లక్ష్యం తగదని ఆయన సూచించారు. రీయింబర్స్మెంట్ పథకం 2లక్షల మంది విద్యార్థులకు మాత్రమే చేరిందన్నారు. ఈ ఏడాది బయో మెట్రిక్ విధానం నుంచి ఇంటర్మిడియట్ విద్యార్థులకు మినహాయింపు ఇస్తున్నట్లు పితాని తెలిపారు.