breaking news
Rajiv home project
-
‘స్వగృహ’ బంపర్ ఆఫర్
ప్రాజెక్టు ధరలు భారీగా తగ్గింపు బండ్లగూడలో చదరపు అడుగుకు రూ.2,200 పోచారంలో రూ.2,050 చొప్పున నిర్ధారణ! ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలో అమ్ముడు పోకుండా తెల్ల ఏనుగుల్లా మిగిలిన రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులను వదిలించుకునేక్రమంలో ప్రభుత్వం వాటి ధరలను భారీగా తగ్గించింది. కొనేవారు లేకున్నా ధరలను మాత్రం తగ్గించబోమంటూ ఇప్పటి వరకు భీష్మించుకు కూర్చున్న అధికారులు వాస్తవాలను గుర్తించి దిగొచ్చారు. ఇప్పటి వరకు చదరపు అడుగు ధర దాదాపు రూ.2,800కు పైగా ఉన్న బండ్లగూడ స్వగృహ ప్రాజెక్టు ధరను రూ.2,200కు, చదరపు అడుగు ధర రూ.2,600 వరకు ఉన్న పోచారం ప్రాజెక్టు ధరను రూ.2,050కు తగ్గించేలా కసరత్తు చేస్తున్నారు. ఏకమొత్తంలో ఇళ్లను కొనేందుకు ముందుకొస్తే ధరలను మరింత తగ్గించేలా ‘బేరసారాల’కు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి మరో రెండుమూడు రోజుల్లో అధికారికంగా ఆదేశాలు వెలువడనున్నాయి. దీంతో సింగిల్ బెడ్రూం ఫ్లాట్ ధర రూ.2 లక్షలు, డబుల్ బెడ్రూం ఫ్లాట్ ధర రూ.3 లక్ష ల మేర తగ్గనున్నాయి. పోచారం, బండ్లగూడ ప్రాజెక్టులకు ఈ కొత్త ధరలను వర్తింపజేయనున్నారు. ప్రస్తుతం బండ్లగూడలో రెండు వేలు, పోచారంలో రెండున్నరవేల ఫ్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. స్వగృహను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడంతో అప్పట్లో ప్రభుత్వం వాటి నిర్మాణంలో మన్నికకు పెద్దపీట వేసింది. కానీ, ధరలు భారీగా ఉండడంతో ఇళ్ల కొనుగోలుకు ప్రజలు పెద్దగా ముందుకురాలేదు. ఇప్పుడు ధరలను భారీగా తగ్గించడంతో అమ్మకాలు జోరుగా సాగుతాయని అధికారులు భావిస్తున్నారు. బండ్లగూడ ప్రాజెక్టును రాయితీ ధరలకు ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మాలని మొదట నిర్ణయించినా ఇప్పుడు సాధారణ ప్రజలు ముందుకొస్తే వారికి కూడా అమ్మాలని భావిస్తున్నారు. భారీగా ‘అదనపు’ ధరలు .. ధరలు తగ్గించడం వరకు బాగానే ఉన్నా అధికారులు ఇక్కడ చేసిన ప్రయోగం కొనుగోలుదారులను కలవరపెట్టేలా ఉంది. ప్రైవేటు బిల్డర్ల తరహాలో కొత్త ధరలను నిర్ధారించాలని నిర్ణయించడమే దీనికి కారణం. ఫ్లాట్ ధరకు ఇతర వసతుల రుసుం అదనం అని ప్రకటించాలని నిర్ణయించారు. స్వగృహ ప్రాజెక్టుల్లో పైప్డ్ గ్యాస్, కామన్ సోలార్వాటర్ హీటర్, కబ్బోర్డ్స్తో పాటు పూర్తిస్థాయిలో ఫర్నిషింగ్... ఇలా కొన్ని హంగుల ధరను ఇంటి ధరలో కలపకుండా విడిగా చూపారు. చదరపు అడుగు ధరగా అధికారులు ప్రకటించే మొత్తంలో ఇవి కలవవు. సింగిల్ బెడ్ రూంకు రూ. లక్షన్నర, డబుల్ బెడ్ రూం ఫ్లాట్కు రూ. రెండున్నర లక్షలు... ఇలా విస్తీర్ణం పెరిగే కొద్దీ ఈ ‘అదనపు’ ధరలు పెరుగుతాయి. అలాగే వాహన పార్కింగ్కు విడిగా ధర ఖరారు చేస్తున్నారు. కవర్డ్ పార్కింగ్ స్థలం (యజమానికి శాశ్వత నిర్ధారిత స్థలం) కోసం పోచారంలో రూ.1.25 లక్షలు, బండ్లగూడలో రూ.1.75 లక్షలుగా నిర్ధారించాలని నిర్ణయించారు. కేవలం చదరపు అడుగు ధర ప్రకారం లెక్కిస్తే ఇంటి ధర తక్కువగా కనిపించినా... ఇవన్నీ కలిపితే మళ్లీ ఎక్కువగానే ఉండనుంది. అయితే కొన్ని ఫ్లాట్లలో ఆ హంగులు లేవు. వాటికి అదనపు ధరలు ఉండవని అధికారులు పేర్కొంటున్నారు. కార్పస్ ఫండ్ ఏర్పాటు.. మెగా ప్రాజెక్టులు కావటంతో వాటి నిర్వహణ భారంగా ఉంటుంది. భవిష్యత్తులో వాటికి రంగులేయాలన్నా, మరమ్మతులు చేయాల్సి వచ్చినా నిర్వహణ సులభంగా ఉండేందుకుగాను కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం కొనుగోలుదారులు చదరపు అడుగుకు రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. దానిపై వచ్చే వడ్డీతో అవసరమైన పనులు చేయిస్తారు. -
ఎట్టకేలకు అమ్మకానికి ‘స్వాభిమాన్’
జవహర్నగర్ ప్రాజెక్టుపై కదలిక స్వగృహ ప్రాజెక్టులపై టీ సర్కార్ దృష్టి సీఆర్పీఎఫ్, బిట్స్ పిలానీ ప్రతినిధులతో చర్చలు త్వరలో ధరల ఖరారు హైదరాబాద్: ప్రైవేటు బిల్డర్లకు కట్టబెట్టి ఎంతోకొంత కమీషన్ దండుకోవాలన్న దురుద్దేశంతో కొందరు ఉన్నతాధికారులు తెల్ల ఏనుగులా మార్చిన జవహర్నగర్లోని రాజీవ్ స్వగృహ ప్రాజెక్టు (స్వాభిమాన్)ను అమ్మేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ శివారులో ఉన్న ఈ భారీ గృహ సముదాయం పనులు రెండేళ్ల కిందట నిలిచిపోయాయి. ఈ సముదాయంలో మొత్తం 2,858 ఫ్లాట్లు ఉన్నాయి. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ రూపురేఖలు మార్చాలని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు దాని విషయంలో ప్రత్యేక నిర్ణయమంటూ తీసుకోలేదు. అయితే కమీషన్ల కక్కుర్తితో కొందరు అధికారులు చేసిన నిర్వాకాన్ని మాత్రం సరిదిద్దాలని భావిస్తోంది. ఈమేరకు గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రస్తుతం ఆ పనిలో కొన్ని కేంద్రప్రభుత్వరంగ సంస్థలు, పెద్దపెద్ద విద్యాసంస్థలతో సంప్రదింపుల్లో ఉన్నారు. తాజాగా కేంద్రప్రభుత్వరంగ సంస్థ అయిన సీఆర్పీఎఫ్ ప్రతినిధులు ఆయనతో చర్చించారు. కొద్దిరోజుల క్రితం వారు ఆ భవనాలను పరిశీలించి కొనేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. మరోవైపు బిట్స్ పిలానీ విద్యా సంస్థ కూడా దాన్ని కొనేందుకు ఉత్సాహం చూపుతోంది. ఆ సంస్థ ప్రతినిధులు కూడా బుర్రా వెంకటేశంతో చర్చించారు. కొద్ది రోజుల్లో ఏ సంస్థ ఎన్ని భవనాలు కొనుగోలు చేస్తుందో స్పష్టత రానుంది. త్వరలో దాని ధరను కూడా నిర్ణయించాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో ముందుకొచ్చినా... హైదరాబాద్ శివారులోని జవహర్నగర్లో ఈ భారీ గృహసముదాయం ఉంది. దీనికి సమీపంలోని ఆల్వాల్లో సీఆర్పీఎఫ్ అనుబంధ దళం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) ప్రధాన కేంద్రం ఉంది. అందులో పనిచేసే సిబ్బంది కుటుంబాలంతా ఒకేచోట ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ గృహసముదాయాన్ని కొనుగోలు చేసేందుకు సీఆర్పీఎఫ్ గతంలో ఉన్నతాధికారులను సంప్రదించింది. అయితే ఈ గృహసముదాయాన్ని వీలైనంత చవకగా ప్రైవేటు నిర్మాణ సంస్థలకు కట్టబెట్టి సొంతలాభం చూసుకునే ఆలోచనతో ఓ ఉన్నతాధికారి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సీఆర్పీఎఫ్ అధికారులు సంప్రదింపులకు వస్తే సహకరించకపోగా... సమీపంలోనే డంపింగ్యార్డు ఉన్నందున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తుతాయంటూ బెదరగొట్టారు. దీంతో ఆ బేరం కాస్తా ఎత్తిపోయింది. ప్రైవేటు బిల్డర్లకు దాన్ని కట్టబెట్టే యత్నంలో భాగంగా పత్రికల్లో నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్ర విభజన జరగడం, ఆ తర్వాత ఎన్నికల కోలాహలం ఉండటంతో అమ్మకం తంతు పూర్తి కాలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. దీంతోపాటు నిర్మాణాలు దాదాపు పూర్తయిన బండ్లగూడ, పోచారంలోని ప్రాజెక్టులను కూడా విక్రయించనున్నారు. గృహసముదాయ స్వరూపం ఇదీ.. {పాజెక్టు పేరు: స్వాభిమాన్ {పాంతం: హైదరాబాద్ శివారులోని జవహర్నగర్ మొత్తం స్థలం: 50 ఎకరాలు నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రాంతం: 10 ఎకరాలు నిర్మాణానికి అయిన వ్యయం: దాదాపు రూ.350 కోట్లు ఫ్లాట్ల సంఖ్య: 2,858 అంతస్తులు : 14 చొప్పున