breaking news
post-paid
-
మొబైల్ కనెక్షన్ మార్పు సులభతరం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ యూజర్లు .. పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ–పెయిడ్కు, ప్రీ–పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కు మారడాన్ని సులభతరం చేసే దిశగా టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సిమ్ మార్చక్కర్లేకుండా వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధృవీకరణ ద్వారా ఈ ప్రక్రియ జరిగేలా టెలికం శాఖకు (డాట్) ప్రతిపాదించింది. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆధారాలు (పీవోసీ) ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్లకు డాట్ సూచించింది. పీవోసీని బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు డాట్ ఏడీజీ సురేశ్ కుమార్ మే 21న జారీ చేసిన నోట్లో పేర్కొన్నారు. టెల్కోల ప్రతిపాదన ప్రకారం.. కనెక్షన్ను మార్చుకోదల్చుకున్న వారు తమ సర్వీస్ ప్రొవైడర్కు ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్, వెబ్సైట్, అధీకృత యాప్ ద్వారా అభ్యర్ధన పంపాల్సి ఉంటుంది. దీన్ని ఆమోదిస్తూ .. టెలికం సంస్థ ఒక ప్రత్యేక ఐడీ, ఓటీపీని మొబైల్ యూజరుకు పంపిస్తుంది. ఈ ఓటీపీ 10 నిమిషాల దాకా చెల్లుబాటు అవుతుంది. ఓటీపీని ధృవీకరిస్తే.. కనెక్షన్ మార్పునకు యూజరు సమ్మతించినట్లుగా టెలికం సంస్థ పరిగణిస్తుంది. ఏ తేదీ, సమయం నుంచి మార్పు అమల్లోకి వస్తుందనేది సమాచారం అందజేస్తుంది. ఇలా కనెక్షన్ స్వరూపం మారే క్రమంలో గరిష్టంగా అరగంట పాటు మాత్రమే సర్వీసుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని డీవోటీ తన నోట్లో పేర్కొంది. -
ఎయిర్సెల్ ఐపీఎల్ హై ఫ్లయర్ కాంటెస్ట్
హైదరాబాద్: ఎయిర్సెల్ కంపెనీ వినియోగదారుల కోసం ఎయిర్సెల్ హై ఫ్ల్లయర్ కాంటెస్ట్ను ప్రారంభించింది. ఈ పోటీలో గెల్చిన అభ్యర్థులు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) క్రికెట్ జట్టుతో ప్రయాణించే, ఆ జట్టు బస చేసిన హోటల్లోనే బస చేసే అవకాశాలతో పాటు, ఈ జట్టు ఆడే ఐపీఎల్ మ్యాచ్లకు ఉచిత టికెట్లను పొందవచ్చని ఎయిర్సెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోటీలో ప్రి-పెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులందరూ పాల్గొనవచ్చని ఎయిర్సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, అనుపమ్ వాసుదేవ్ పేర్కొన్నారు. రూ.100 అంతకుమించి రీచార్జ్ చేసుకునే ప్రి-పెయిడ్ వినియోగదారులు, చివరి బిల్లులో ఎలాంటి బకాయిలు లేని పోస్ట్-పెయిడ్ వినియోగదారులు ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని బుధవారం నుంచే ప్రారంభించామని వివరించారు. ఇక ఈ పోటీలో పాల్గొనే వారందరికీ 10 నిమిషాల టాక్ టైమ్ను (ఎయిర్సెల్ నుంచి ఎయిర్సెల్)కు ఉచితంగా అందిస్తామని, అంతేకాకుండా ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి 800 టికెట్లను గెల్చుకునే అవకాశముందని అనుపమ్ పేర్కొన్నారు.