breaking news
Plaza Hotel
-
దూరం ఒకటే దారే వేరు
మహిళల్లో ఉన్న ప్రతిభాపాటవాలకు సంప్రదాయ భావజాలం ఏ విధంగా అడ్డంకిగా మారుతోందనే విషయాలను సంకలనం చేస్తూ ‘వాక్ ద టాక్, ఉమెన్, వర్క్, ఈక్విటీ, ఎఫెక్టివ్నెస్’ పుస్తకం రాశారు అంజలి. ఇటీవల హైదరాబాద్, బేగంపేటలోని ప్లాజా హోటల్లో జరిగిన ఇంటరాక్షన్ సెషన్లో డాక్టర్ అంజలి హజారికా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘పిల్లలూ! డాక్టర్ బొమ్మ వేయండి’’. పిల్లలందరూ డాక్టర్ బొమ్మ వేశారు. ‘‘ఇప్పుడు... పైలట్ బొమ్మ వేస్తారా?’’ పైలట్ బొమ్మ కూడా వేశారు. ‘‘ఫైర్మన్ బొమ్మ?’’ అదీ వేశారు. డ్రాయింగ్షీట్ మీద తమ పేర్లు రాసిచ్చారు క్లాసులోని పిల్లలంతా. మొత్తం అరవై షీట్లు. ఆ డ్రాయింగ్ షీట్లలో ఉన్నది యాభై ఐదు మంది మగడాక్టర్లు, ఐదుగురు లేడీ డాక్టర్లు. యాభై ఐదు మంది మగ పైలట్లు, ఐదుగురు మహిళా పైలట్లు. ఫైర్మన్ దగ్గరకొచ్చేసరికి అరవై మందీ మగవాళ్లే!! ఇవి పిల్లలు గీసిన బొమ్మలు మాత్రమే కాదు, సమాజానికి దర్పణాలు కూడా. పిల్లలేం చూశారో అదే బొమ్మ వేశారు.సమాజం ఎలా ఉందో దాన్నే పిల్లలు చూశారు. డాక్టర్ అంజలి హజారికా నాలుగేళ్ల పాటు సమాజాన్ని శోధించి తెలుసుకున్న వాస్తవాలను నిర్ధారించుకోవడానికి ఏడెనిమిదేళ్ల పిల్లలనే గీటురాయిగా తీసుకున్నారు. ఆ గీటురాళ్లు చూసిన, చూపించిన సమాజం డ్రాయింగ్ షీట్లలో కనిపించింది. వేరు చేసేది సమాజమే! పురుషాధిక్య సమాజంలో మహిళలకు ఎదురవుతున్న అడ్డంకులకు ఆ రంగం, ఈ రంగం అనే తేడా లేదని.. 2009లో నోబుల్ బహుమతి అందుకున్న ఇజ్రాయెల్ మహిళ అదా యోనా మాటల్ని ఉటంకించారు... అంజలి. ఆ దేశం నుంచి నోబుల్ బహుమతి అందుకున్న పదిమందిలో ఏకైక మహిళ యోనాత్. అయితే యోనాత్ ప్రొఫెషన్లో నిలదొక్కుకోవడానికి మహిళ అనే వివక్ష కారణంగా లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పలేదని చెప్పారు అంజలి. ‘‘ఏదైనా ఒక పనిలో ఒక మగవ్యక్తి విఫలమైతే అది అతడి వ్యక్తిగత వైఫల్యంగా పరిగణిస్తుంది సమాజం. అదే ఒక మహిళ విఫలమైతే ఆ వైఫల్యాన్ని మహిళాజాతి మొత్తానికీ ఆపాదిస్తుంది. ‘అమ్మాయి అయినా అబ్బాయి అయినా పుట్టినప్పుడు వాళ్లు పిల్లలు మాత్రమే. పెరిగే క్రమంలో అబ్బాయి, అమ్మాయిల్లా వారిని వేరు చేస్తున్నది సమాజమే’’ అన్నారామె. ‘‘సమానత్వం కోసం చేసే పోరాటాలు కొన్నిసార్లు శృతి తప్పి ఆధిపత్య పోరాటాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. నిజానికి జెండర్ ఈక్వాలిటీ కోసం చేసే ప్రయత్నం మగవాళ్లను కించపరచడానికి, వారిని న్యూనత పరచడానికి కాకూడదు, వివక్షలేని సమాజ నిర్మాణం కోసం చేసే ప్రయత్నం అది. ఇప్పటివరకు ఉన్న మూస భావజాలం నుంచి మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది’’ అన్నారు అంజలి. నిర్ణయం ‘ఆమె’దే మహిళ ఏ రంగంలో కొనసాగాలనేది కూడా అత్తింటి వాళ్లే నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న ఒక మహిళ అనుభవాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు అంజలి.‘‘పెళ్లిచూపులకొచ్చాడు ఓ అబ్బాయి. తనది చాలా పెద్ద హోదా కలిగిన ఉద్యోగం. తరచూ టూర్లు ఉంటాయి. ఇంట్లో ఉండే తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఇంటికి వచ్చే కోడలిదే. కాబట్టి తన భార్య ఉద్యోగం చేయకూడదు అని నిబంధన పెట్టాడతడు. అప్పుడు పెళ్లి కూతురి తల్లి ఒకే మాట చెప్పారు. ‘మీక్కావలసింది రోజంతా ఇంట్లో ఉండే పని మనిషి. మంచి జీతం ఇచ్చి ఒక సర్వెంట్ మెయిడ్ను నియమించుకోండి. మా అమ్మాయికి తన కెరీర్ మీద కొన్ని లక్ష్యాలున్నాయి అని చెప్పారామె. అప్పుడా తల్లి అంత స్థిరంగా ఆ మాట చెప్పలేకపోయి ఉంటే ఆమె కూతుర్ని ఈ రోజు ప్రొఫెసర్ హోదాలో చూడగలిగే వాళ్లం కాదు. అలాగే మరో మహిళ విషయంలో ఆమె అత్తింటి వాళ్లు తాము చాలా ఉదారంగా ఉన్నాం చూడండి.. అన్నట్లు వ్యవహరించారు. వాళ్లు చెప్పేదేమంటే... అమ్మాయి తాను చేస్తున్న ఉద్యోగం మానేయాలి, ఇప్పటి వరకు ఉన్న సీనియారిటీని వదులుకుని పెళ్లి చేసుకుని అత్తగారింట్లో అడుగుపెట్టాలి. చదువుకుని ఇంట్లో ఖాళీగా ఉండడం కష్టంగా అనిపిస్తే ఇంటి పనులన్నీ చేసుకుని ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్లో ఉద్యోగానికి వెళ్లవచ్చు– అని. అంటే ఒక అమ్మాయికి తన జీవితం మీద నిర్ణయం తీసుకునే అవకాశం తన చేతిలో ఉండడం లేదు. అత్తింటివారి చేతిలోకి వెళ్లిపోతోంది. ఇక్కడ మనం ఆక్షేపించాల్సింది పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లడాన్ని కాదు, పెళ్లి కోసం కెరీర్ను వదిలేసుకోవాల్సి రావడాన్ని మాత్రమే. కెరీర్ అంటే డబ్బు సంపాదించే ఉపాధి మాత్రమే కాదు, అది ఆమె గుర్తింపు, ఆమెకు దక్కే గౌరవం. అందుకే మహిళలు తమ గుర్తింపుకు, గౌరవానికి భంగం కలగని విధంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా సరే తమ ఐడెంటిటీని నిలబెట్టుకోవాలి, అవసరమైతే పరిస్థితులతో పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. అందుకు ఇంటి వాతావరణం కూడా సహకరించాలి’’ అన్నారు అంజలి. తప్పని బాధ్యతలు ‘‘ప్రపంచంలో ఒక దేశానికీ మరో దేశానికీ మధ్య తప్పనిసరిగా వైవిధ్యత ఉంటుంది. ఆ దేశానికంటూ ప్రత్యేకమైన బలాలు, బలహీనతలు ఉంటాయి. మహిళల విషయానికి వస్తే... అది కమ్యూనిస్టు దేశమైనా, క్యాపిటలిస్టు దేశమైనా, సోషలిస్టు దేశమైనా సరే... మహిళల అవకాశాలకు దారులు మూసేయడంలో మాత్రం వైవిధ్యత కనిపించలేదు. నేటికీ అమెరికా వంటి అగ్రరాజ్యంలో కూడా ప్రజాప్రతినిధులుగా మహిళలను వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితే ఉంది’’ అంటారు అంజలి. దీనికి తోడు మహిళల పట్ల అనేక అపోహలు రాజ్యమేలుతున్న వైనాన్ని వివరించారామె. ‘‘ఫలానా బాధ్యతను నిర్వర్తించడానికి మహిళలు కరెక్ట్ కాదు, ఈ క్లిష్టమైన వ్యవహారాన్ని నడిపించడం మహిళలకు అసాధ్యం, మహిళలకు ప్రొఫెషన్లో ఎదగాలని, ప్రమోషన్లు తెచ్చుకోవాలని ఉండదు. మగవాళ్లతో సమానంగా పని చేయాలనుకోరు. ఇంటర్నేషనల్ అసైన్మెంట్లు అప్పగిస్తే వెళ్లడానికి ముందుకు రారు, ట్రాన్స్ఫర్కు సిద్ధంగా ఉండరు’ అనే దురభిప్రాయాలు చాలామందిలో నెలకొని ఉండడాన్ని గమనించాను. మరికొన్ని కార్పొరేట్ కంపెనీల నిర్వాహకుల మాటల్లో ‘ఈ ఉద్యోగానికి ఆమెకి అన్ని అర్హతలున్నాయి. అయితే మన కంపెనీ క్లయింట్లు మహిళా ఇంజనీర్ అంటే మనకు ప్రాజెక్టులు ఇస్తారో ఇవ్వరో’ అనే సందేహం కనిపించింది. మరొకరయితే ‘ఆమెకు ప్రమోషన్ ఇవ్వడం ఎలా, తరచూ అఫిషియల్ టూర్లుంటాయి’ అంటారు. నిజానికి ఈ తరం మహిళలు ఇలాంటి మిషలతో ఉద్యోగంలో ఎదుగుదలను వదులుకోవడం లేదు.ఈ అభిప్రాయాలు మగవారిలో నాటుకుపోయి ఉన్నాయంతే’’ అన్నారామె. పరుగు ఒక్కటే... భారమే తేడా ‘‘1991లో ‘పని ప్రదేశంలో మహిళల పరిస్థితి’ అనే అంశం మీద వాషింగ్టన్లో ఓ సదస్సులో పాల్గొన్నాను. పని చేసే మహిళలకు గృహిణి నిర్వహించిన ఇంటి బాధ్యతలను పూర్తి చేయాల్సిన అదనపు బరువు తప్పడం లేదు. వ్యవసాయ రంగంలో ఉండే మహిళ నుంచి, కార్పొరేట్ రంగంలో ఉద్యోగిని వరకు అందరి పరిస్థితీ ఇదే. ఇంటి బాధ్యతలు పూర్తి చేసి ఆఫీసుకెళ్లిన తర్వాత మగవాళ్లతో పోటీ పడి రేసులో పరుగెత్తాలి. ఒక్కమాటలో చెప్పాలంటే మగవాళ్లు ఏ బరువూ లేకుండా పరుగుపందెంలో పాల్గొంటుంటే, ఆడవాళ్లు మాత్రం కాళ్లకు ఇంటి బాధ్యతల ఇనుపగుండు కట్టుకుని రేసులో పాల్గొంటున్నారు. వర్క్ ప్లేస్లో మగవాళ్లు– ఆడవాళ్లు ఇద్దరూ సమానమేననే వాస్తవాన్ని మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా గుర్తుంచుకోవాలి. ఆడవాళ్లు పని ప్రదేశంలో తమకవసరమైన ప్రత్యేక సౌకర్యాల కోసం డిమాండ్ చేయవచ్చు కానీ, పని తగ్గించుకోవడానికి వెసులుబాటు కోరుకోకూడదు. ప్రతి మహిళకూ తన శక్తి మీద, తాను నిర్వర్తించాల్సిన పనుల మీద అవగాహన ఉండాలి. తన బాధ్యతలను పూర్తి చేయడానికి ఇతరుల మీద ఆధారపడకూడదు. తన శక్తి మీదే తాను నిలబడాలి. సమాజం నిర్దేశించిన చట్రం నుంచి బయటపడి కొత్త సామాజిక చక్రాన్ని రూపొందించాలి. అది వివక్షకు తావులేని సమానత్వం సాధించిన సమాజం కావాలి’’ అన్నారు అంజలి హజారికా. విస్తృత పర్యటనలు డాక్టర్ అంజలి హజారికా పుట్టింది మహారాష్ట్రలోని పూనాలో. సైకాలజీ, సోషల్ సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. మేనేజ్మెంట్లో డాక్టరేట్ చేశారు. పాశ్చాత్యదేశాల్లో విస్తృతంగా పర్యటించి ప్రాచ్య– పాశ్చాత్య సమాజాలను తులనాత్మకంగా బేరీజు వేశారు. భారతదేశంలోని ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోలియం కంపెనీలతో పని చేశారు. ఉద్యోగుల రక్షణ, సంక్షేమం కోసం సంస్థలు కల్పించాల్సిన సౌకర్యాల గురించి ఆయా సంస్థలకు వ్యవస్థీకృతమైన దిశానిర్దేశం చేశారు. ఆమె సేవలకు భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ ‘ఎక్సలెన్స్’ అవార్డుతో గౌరవించింది. అమెరికాలోని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ద సొసైటీ ఆఫ్ డ్రీమ్స్ సంస్థకు గౌరవ వైస్ ప్రెసిడెంట్ ఆమె. పబ్లిక్ సెక్టార్లో పని చేస్తున్న మహిళల కోసం వేదికను నెలకొల్పడంలో అంజలి విశేషమైన సేవలందించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుల సదస్సును అధ్యక్ష బాధ్యతలతో నిర్వహించారామె. అమ్మ మాట మా అమ్మ నాకు చెప్పిన మాట ఒక్కటే.. ‘ఇతరులకు నీ సహాయం అవసరమైనప్పుడు నువ్వు అక్కడ ఉండాలి. అలాగని నువ్వు వెనుకపడకూడదు’ అని. ఈ మాటే నన్ను నడిపించింది, ఈ స్థానంలో నిలబెట్టింది. యువతులు భర్తను ఎంపిక చేసుకోవడంలో తమను తాము సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అతడు తనకంటే ఎక్కువ చదువుకుని ఉండాలి, తన కంటే పెద్ద ఉద్యోగం చేస్తుండాలి అనే సంప్రదాయ భావజాలం నుంచి మహిళ బయటకు రావాలి. కలిసి జీవించడానికి ఒకరినొకరు అర్థం చేసుకోగలగడం, అభిప్రాయాలు కలవడం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. – అంజలి హజారికా, రచయిత, సామాజిక ధోరణుల అధ్యయనవేత్త – వాకా మంజులారెడ్డి -
న్యూయార్క్ ప్లాజా అమ్మకానికి భారీ డీల్!
న్యూయార్క్ : సహారా గ్రూప్కి చెందిన ప్రఖ్యాత ప్లాజా హోటల్ను ఎట్టకేలకు ఇద్దరు వ్యాపారవేత్తలు కొనుగోలు చేశారు. న్యూయార్క్లోని ప్లాజా హోటల్లో సుబ్రతా రాయ్కి చెందిన సహారా గ్రూప్కు 70 శాతం వాటాలు ఉన్నాయి. చాలా కాలంగా సహారా సంస్థ ఈ హోటల్ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు దుబాయ్కు చెందిన వ్యాపార వేత్తలు దీన్ని కొనుగోలు చేశారు. ఈ డీల్ విలువ దాదాపు 600 మిలియన్ డాలర్లు. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న వైట్ సిటీ వెంచర్స్ యజమాని షాహల్ ఖాన్, హకీమ్ సంస్థ యజమాని కమ్రాన్ హకీమ్ 70 శాతం వాటాలను సొంతం చేసుకున్నారు. ఈ డీల్ జూన్ 25తో ముగుస్తుంది. 1907లో ఈ హోటల్ ప్రారంభమైంది. అమెరికాలో ఈ ఒక్క హోటల్కే ‘నేషనల్ రిజిస్టార్ ఆఫ్ హిస్టారిక్ ప్లేసెస్’లో చోటు దక్కింది. 70 శాతం వాటాను సహారా గ్రూప్ కార్పొరేట్ పైనాన్స్ హెడ్ సందీప్ వాద్వావ, 5 శాతం వాటాను ఛత్వల్లు 2012లో కొనుగోలు చేశారు. అయితే సహారా చాలా కాలంగా ఈ హోటల్ అమ్మకానికి ప్రయత్నాలు చేస్తున్నా.. మిగతా 25 శాతం వాటాను కలిగి ఉన్న దుబాయ్ యువరాజు అల్వలీద్ బిన్ తాలీల్ వల్ల కుదరలేదు. అయితే గత ఏడాది ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జానిస్ లాంగ్ లాసల్లే హోటల్ను వేలం వేసే బాధ్యతను తీసుకుంది. దాంతో 75 శాతం వాటాను విక్రయించినట్లు సందీప్, ఛత్వల్లు ప్రకటించారు. ఈ విక్రయ ఒప్పంద వ్యవహారం చాలా రహాస్యంగా సాగినట్టు తెలుస్తోంది. అయితే ఈ హోటల్ను 2005లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనుగోలు చేసి దివాలా తీశారు. మొత్తానికి భారీ ఒప్పందంతో సహారా గ్రూప్ ఊపిరి పీల్చుకుంది. -
బతుకు 'సహారా' ఎడారేనా ?
కాలం దెబ్బకు ఎవరైనా కుదేలు కావాల్సిందే. అది ధనవంతుడు, రాజకీయనాయకుడు.... ఎవరైనా జీవితంలో ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ కాలం దెబ్బ తినక తప్పదు. అందుకు అత్యుత్తమ ఉదాహరణ సహారా పరివార్ ఇండియా ఛైర్మన్ సుబ్రత రాయ్. సహారా గ్రూప్ ఛైర్మన్గా జీవితం అనే వైకుంఠపాళిలో ఆయన ఎంతో వేగంగా అత్యున్నత స్థితికి చేరుకున్నారో ... అంతే వేగంగా కిందకి జారీ పడ్డారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఊచలు లెక్కిస్తూ... బెయిల్ కోసం కన్నులు కాయాలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దేశ విదేశాల్లోని ఆస్తులు న్యూయార్క్ ప్లాజా, గ్రోస్వెనర్ హౌస్.... విక్రయానికి లేదా తనఖా పెట్టుకునేందుకు ఎవరైనా రాకపోతారా అని ఆశాగా ఎదురు చూస్తూ... కాలం వెళ్ల దీస్తున్నారు. ఇంతకీ సుబ్రత రాయ్ కథా కమామిషూ ఏమిటి? గోరఖ్పూర్లో సహారాలో సుబ్రత చిరుఉద్యోగిగా బాధ్యతలు చేపట్టి... ఆ కంపెనీనే సొంతం చేసుకున్నారు. అనంతరం బ్యాంకింగ్, మీడియా, ఎంటర్టైనర్, అతిథ్యం.... అన్ని రంగాల్లోకి సహారా ఇండియా పరివార్గా ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగింది. దేశ విదేశీ పత్రికలు సైతం ఆయన్ని అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో ఒకరని కీర్తించింది. అంతేనా... దేశ విదేశీ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. దేశంలో అత్యధిక ఉద్యోగులు గత సంస్థ భారతీయ రైల్వే. ఆ తర్వాత స్థానాన్ని సహార ఇండియా సొంతం చేసుకుంది. దాంతో సహారా ఇండియా రికార్డు సృష్టించింది. అంతాబాగానే ఉంది. కానీ తన సంస్థలో నగదు కుదువ పెట్టిన మదుపుదారులకు దాదాపు రూ. 24 వేల కోట్లు సుబ్రతరాయ్ సకాలంలో చెల్లించలేకపోయారు. దాంతో మదుపుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు హాజరుకావాలని సుబ్రతను సుప్రీం ఆదేశించింది. ఆ ఆదేశాలను సుబ్రత పెడచెవిన పెట్టాడంతో కోర్టు ఆగ్రహానికి గురైయ్యారు. సుబ్రతను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి... కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు జైలు శిక్ష విధించింది. బెయిల్ విడుదల కావాలంటే రూ. 10 వేల కోట్లు బెయిల్ బాండ్ సమర్పించాలని ఆయన్ని కోర్టు ఆదేశించింది. దాంతో ఆ నగదును సమకూర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. అయితే ఆస్తుల విక్రయానికి లేదా తనఖా కోసం కొనుగోలుదారులు వస్తే మాట్లాడేందు... ఇతర ప్రాంతాలలో ఉన్నవారితో మాట్లాడేందుకు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా తీహార్ జైల్లో ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ సుప్రీం కోర్టు ఆయనకు వెలుసుబాటు కల్పించింది. దాంతో తన ఆస్తుల కొనుగోలు చేసేందుకు ఎవరైనా ముందుకురాకపోతారా అంటూ వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే సహారా గ్రూప్ను బ్రూనై సుల్తాన్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేయునున్నారని సమాచారం. ఆయన కొంటే సరే లేకుంటే సుబ్రత జీవితం.... సహారా ఎడారే.