breaking news
Placements Mela
-
జలమండలిలో 1480 ఉద్యోగాలు ఖాళీ !
పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రికి లేఖ సాక్షి, సిటీబ్యూరో: జలమండలిలో కొలువుల మేళాకు రంగం సిద్ధమైంది. బోర్డులో దీర్ఘకాలంగా 1480 పోస్టులు ఖాళీగా ఉండడంతో గ్రేటర్ పరిధిలో మంచినీటి సరఫరా, డ్రైనేజి వ్యవస్థ నిర్వహణ, మరమ్మతు పనుల్లో తరచూ జాప్యం జరుగుతుందని, వినియోగదారులకు సకాలంలో సేవలు అందించలేకపోతున్నట్లు బోర్డు యాజమాన్యం తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదించినట్లు తెలిసింది. ఇటీవల స్వచ్ఛ హైదరాబాద్పై ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీకి సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేయడం విదితమే. కాగా హోదారీత్యా జలమండలికి ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి మున్సిపల్ పరిపాలన శాఖ బాధ్యతలు సీఎం వద్దే ఉన్నాయి. ఈనేపథ్యంలో నగరంలో అత్యంత కీలకమైన వాటర్ బోర్డులో ఉద్యోగాల భర్తీని తక్షణం చేపట్టేందుకు ఆయన గ్రీన్సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నట్లు బోర్డు వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. అయితే మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అప్పగించాలా..? లేదా అసిస్టెంట్, టెక్నీషియన్ స్థాయి ఉద్యోగాలను బోర్డు యాజమాన్యం ప్రత్యేక పోటీ పరీక్ష నిర్వహించి సొంతంగా భర్తీ చేయవచ్చా..? అన్న అంశంపై ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం ఆధారంగానేస్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా ఖాళీలే.. జలమండలి బోర్డు 1989లో ఏర్పాటైంది. ప్రారంభంలో బోర్డులో 6111 మంది పనిచేసేవారు. శివారు ప్రాంతాల్లోని 11 మున్సిపల్ సర్కిళ్లు గ్రేటర్లో విలీనమవడంతో బోర్డు పరిధి అనూహ్యంగా విస్తరించింది. ప్రస్తుతం 8.34 లక్షల నల్లాలకు జలమండలి మంచినీరు సరఫరా చేస్తోంది. కానీ ఏటా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల స్థానంలో కొత్త ఉద్యోగుల భర్తీ కాలానుగుణంగా జరగడంలేదు. దీంతో బోర్డు పరిధిలో పలు సేవల్లో అంతరాయం, జాప్యం ఏర్పడుతోంది. ప్రస్తుతం 16 డివిజన్ల పరిధిలో 4631 మంది రెగ్యులర్ ఉద్యోగులు, మరో 1004 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఖాళీగా 1480 పోస్టులున్నట్లు బోర్డు యాజమాన్యం ముఖ్యమంత్రికి సమర్పించిన లేఖలో పేర్కొంది. ఈ ఉద్యోగాల భర్తీతో జలమండలి పౌరసేవలు మెరుగవడంతోపాటు ఉద్యోగాల కోసం సుదీర్ఘకాలంగా వేచిచూస్తున్న నగర యువతకు కొలువులు దక్కే భాగ్యం దక్కుతుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. కొలువుల భర్తీకి తక్షణం నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగ, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
సీఆర్డీఏలో కొలువుల మేళా!
సాక్షి, విజయవాడ బ్యూరో : సీఆర్డీఏలో త్వరలో కొలువుల మేళాకు తెరలేవనుంది. తొలివిడతగా ఈ సంవత్సరం 300 మంది ఉద్యోగులను నియమించనున్నారు. వీరిని నేరుగా రిక్రూట్ చేసుకోవాలా లేక ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలా? అనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా అయితే ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో నేరుగా నియమించుకునే యోచనలో సీఆర్డీఏ ఉన్నతాధికారులున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. రాజధాని అవసరాలకు అనుగుణంగా సీఆర్డీఏను పటిష్టం చేస్తున్న ప్రభుత్వం కొత్తగా ఇటీవల 778 పోస్టులు మంజూరు చేసింది. వాటిలో 40 శాతం పోస్టులను తొలివిడతగా ఈ సంవత్సరమే భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన పోస్టుల్ని దశల వారీగా భర్తీ చేయాలని భావిస్తున్నారు. 20 విభాగాలకు మంజూరైన పోస్టుల్లో ప్లానింగ్ విభాగానికి అత్యధికంగా 294 కేటాయించారు. ఆ తర్వాత రవాణా, యుటిలిటీస్, మానవవనరులు, ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాలకు ఎక్కువ పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఉడా సిబ్బందితోనే సర్దుబాటు వీజీటీఎం ఉడాలో ఉన్న 69 మంది సిబ్బందితోనే నాలుగు నెలల నుంచి సీఆర్డీఏ పనిచేస్తోంది. డెరైక్టర్, హెచ్ఓడీ స్థాయిలో పలువురు అధికారులను గతంలోనే నియమించారు. ఉద్యోగులను వెంటనే నియమించే పరిస్థితి లేకపోవడంతో ఉన్నవారితోనే ప్రస్తుతం నెట్టుకొస్తున్నారు. పనిభారం ఎక్కువకావడం, ఒత్తిడి పెరుగుతుండడంతోపాటు రాజధాని అవసరాల నేపథ్యంలో ఉద్యోగులను తీసుకోవడం తక్షణావసరంగా మారింది. దీంతో కొత్తగా 20 విభాగాలు ఏర్పాటుచేయాల్సివుందని, వాటిలో 700 మంది ఉద్యోగులు కావాలని ప్రభుత్వానికి సీఆర్డీఏ ఉన్నతాధికారులు ఇటీవల నివేదిక పంపారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ దీనిపై మరింత అధ్యయనం చేసి 21 విభాగాలు, 778 ఉద్యోగులు నియమించడానికి అంగీకరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆ పోస్టుల్ని మంజూరు చేసింది. విభాగాధిపతుల నియామకం షురూ 20 విభాగాలకు ఉన్నతాధికారులను నియమించేందుకూ ప్రయత్నాలు చేస్తున్నారు. కీలకమైన 8 ఫంక్షనింగ్ విభాగాలకు డెరైక్టర్ స్థాయి అధికారులను నియమిస్తున్నారు. ప్లానింగ్, డెవలప్మెంట్ కంట్రోల్, రవాణా విభాగాలకు డెరైక్టర్లున్నా యుటిలిటీస్, గృహనిర్మాణం, ఎస్టేట్, ఆర్థికాభివృద్ధి విభాగాలకు డెరైక్టర్లు లేరు. వారికోసం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. విజిలెన్స్, ఐటీ, కమ్యూనికేషన్, స్ట్రాటెజీ, క్వాలిటీ కంట్రోల్, గ్రీవెన్స్ విభాగాధిపతులను నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విభాగాలు, వాటిలోని సిబ్బందిని విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంతోపాటు రాజధాని ప్రాంతంలోని మందడంలో నిర్మించే రాజధాని నగర కార్యాలయంలో పనిచేయించనున్నారు.