breaking news
Peda kakani
-
‘లింగమనేని’కి భూ విందు
సాక్షి, మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా, నిడమర్రు, చినకాకాని.. పెదకాకాని మండలం నంబూరు.. తాడికొండ మండలం కంతేరు గ్రామాల మధ్యలో జాతీయ రహదారి పక్కనే ఉన్న డొంక రోడ్డును విజయవాడకు చెందిన లింగమనేని రియల్ ఎస్టేట్ కంపెనీ అప్పనంగా కొట్టేసింది. రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఉపయోగపడే ఈ రహదారిని మూసివేసి, ప్రహరీ నిర్మాణం చేపట్టింది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఏసీసీ యాజమాన్యం కింద విలువైన భూములు ఉండేవి. 2004 సంవత్సరానికి ముందే ఈ భూములు తొలుత ప్రభుత్వానికి చెందిన ‘ఉడా’కు, తర్వాత లింగమనేని రియల్ ఎస్టేట్ కంపెనీ పరమయ్యాయి. ఆయా గ్రామాలకు చెందిన వివిధ సర్వే నంబర్లలో 146.68 ఎకరాల భూములుండగా, వాటిలో 115.91 ఎకరాలను ‘ఉడా’ కొనుగోలు చేసి, లింగమనేని సంస్థకు విక్రయించింది. రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం నిబంధనలకు విరుద్ధంగా డొంకదారిని కూడా విక్రయించడం గమనార్హం. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 143 సర్వే నంబర్లో దాదాపు కిలోమీటర్ పొడవున, 40 అడుగుల వెడల్పుతో ఈ రహదారి ఉంది. కంతేరు, నంబూరు గ్రామాల పొలిమేరల్లో ఉన్న ఈ డొంకరోడ్డును గతంలో రైతులు ఉపయోగించుకునేవారు. ఈ డొంకరోడ్డు విస్తీర్ణం 2.15 ఎకరాలు కాగా, 2004కు ముందు ఉడా అధికారులు లింగమనేని రియల్ ఎస్టేట్కు కేవలం రూ.15 లక్షలకే విక్రయించారు. లింగమనేని సంస్థ కొనుగోలు చేసిన 115.61 ఎకరాలతోపాటు 2.15 ఎకరాల డొంకరోడ్డు భూమిలో లేఔట్ వేసేందుకు ఉడా అనుమతులు ఇచ్చేసింది. దాంతో డొంక రోడ్డు చుట్టూ లింగమనేని కంపెనీ ప్రహరీ నిర్మించింది. ‘ఉడా’ ఎంతో ఉదారంగా రూ.15 లక్షలకు విక్రయించిన 2.15 ఎకరాల భూమి విలువ ఇప్పుడు అక్షరాలా రూ.30 కోట్లకు చేరడం గమనార్హం. డొంక దారి విక్రయంపై స్థానికులు కోర్టుకు వెళ్లడంతో పాటు లోకాయుక్తను సైతం ఆశ్రయించారు. డొంకదారి విక్రయంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఆ రహదారిని లింగమనేని చెర నుంచి విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి
పెదకాకాని (గుంటూరు) : పాఠశాల నుంచి వస్తున్న అన్నయ్యతో కలిసి ఆడుకోవడానికి ఎదురుచూస్తున్న చిన్నారి అన్నయ్య స్కూల్ బస్సు రాగానే పరిగెత్తుకెళ్లి ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడి మృతిచెందాడు. బస్సు కింద చిన్నారి పడిన విషయాన్ని గమనించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో.. వెనుక చక్రాల కింద ఆ చిన్నారి చిధ్రమయ్యాడు. ఈ హృదయవిదారక ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రదీప్(6) స్థానిక బీవీఆర్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో రోజూ స్కూల్ బస్సు ద్వారా రాకపోకలు సాగిస్తున్నాడు. అలాగే శుక్రవారం పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న రెండేళ్ల చిన్నారి బబ్లూ అన్నయ్య కోసం పరిగెత్తుకుంటూ బస్సు వద్దకు వచ్చాడు. ఆదే సమయంలో అన్నయ్య బస్సులో నుంచి స్కూల్ బ్యాగ్, బాస్కెట్తో దిగుతున్న క్రమంలో బబ్లూ స్కూల్ బస్సు కిందికి వెళ్లాడు. ఇది గుర్తించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో వెనక చక్రాల కిందపడిన చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు.