breaking news
Online bids
-
అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే?
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాల్లోని హెచ్ఎండీఏ స్థలాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. అందుబాటు ధరల్లో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎమ్మెస్టీసీ ఈ వేలం ప్రక్రియను నిర్వహించనుంది. మధ్యతరగతి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్లు ఈ ల్యాండ్ పార్సిళ్లను కొనుగోలు చేసేందుకు అనుగుణంగా స్థలాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఔటర్రింగ్ రోడ్డుకు దగ్గరలో 39 ల్యాండ్ పార్సిళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6 ప్లాట్లు, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సిళ్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ స్థలాల వివరాలను కేఎంఎల్ ఫైల్ ద్వారా చూసుకునే సదుపాయం ఉంది. 121 నుంచి 10,164 గజాల వరకు ఈ స్థలాలు ఉన్నాయి. గండిపేట వద్ద 3 ప్లాట్లు, శేరిలింగంపల్లిలో 5, ఇబ్రహీంపట్నంలో 2 ప్లాట్లు, అమ్మకానికి ఉన్నాయి. మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో 4, ఘట్కేసర్లో 1, బాచుపల్లిలో 1 చొప్పున ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో 16, ఆర్సీపురంలో 6 ప్లాట్లు, జిన్నారంలో ఒకటి చొప్పున స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఆన్లైన్ వేలం.. 39 స్థలాలను వచ్చే నెల మార్చి 1న ఎమ్మెస్టీసీ ఆధ్వర్యంలో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా క్లియర్ టైటిల్ కలిగిన ఈ స్థలాలను కొనుగోలు చేసిన వారు సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు అవకాశం ఉంది. ఆన్లైన్ వేలంలో పాల్గొనడానికి వీలుగా ఈ నెల 27న సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెస్టీసీలో నమోదు చేసుకోవాలి. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలలోపు నిర్దేశించిన ఈఎండీ (ధరావత్తు) రుసుమును చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 21న రంగారెడ్డి జిల్లా పరిధిలోని స్థలాలకు శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసులో, 22వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని స్థలాలకు ఆర్సీపురంలోని లక్ష్మీ గార్డెన్స్లో 23న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్థలాలపై ఉప్పల్ సర్కిల్ ఆఫీసులో ప్రీ బిడ్ సమావేశాలను నిర్వహించనున్నారు. చదవండి: ధర తక్కువ.. డిమాండ్ ఎక్కువ..హైదరాబాద్లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి! -
తేలని ఈ-వేలం!
శ్రీకాకుళం టౌన్: జిల్లాలోని వంశధార, నాగావళి నదుల్లో 14 ఇసుక రేవుల కేటాయింపు కోసం ఈ-వేలం తేదీలను మైన్స్ అండ్ జియాలజీ అధికారులు సిద్ధం చేశారు. ఎంఎస్టీసీ పర్యవేక్షణలో ఆన్లైన్ బిడ్లు స్వీకరిస్తామని ప్రకటించినా ఇంతవరకు వేలం తేదీలు మాత్రం ఖరారు కాలేదు. ఈ నెల 15, 16 తేదీల్లో వేలం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మంత్రివర్గ సమావేశం ఉందన్న సాకుతో రద్దు చేశారు. ముందుగా ఈ-వేలానికి తొలుత 17 రేవులను ఎంపిక చేసిన అధికారులు ఆ తరువాత కోరాడ, మడపాం, పోతయ్యవలస రేవులకు వేలం నిలిపివేశారు. ఇప్పటికే రేవుల వారీగా దరఖాస్తులను విక్రయించిన ఎంఎస్టీసీ అధికారులు ఈ-వేలానికి సర్వం సిద్ధం చేయగా..కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలు సన్నద్ధమయ్యారు. ఇంతలోనే మూడు రేవులను రద్దు చేయడం వెనుక ఆంతర్యం అంతు చిక్కడం లేదని దరఖాస్తు దారులంటున్నారు. అక్రమ తవ్వకాలు వంశధార నదిపై ఫీజుబులిటీ పొందిన రేవుల్లో సరుబుజ్జిలి మండలం యరగాం, పురుషోత్తపురం, ఆమదాలవలస మండలం చెవ్వాకులపేట, దూసి, పొందూరు మండ లం సింగూరు, కొత్తూరు మండలం సిరుసువాడ, కడుమ, భామిని మండలం సింగిడి, బిల్లుమడ, శ్రీకాకుళం మండలం కళ్లేపల్లి, పొన్నాం, హయాతీనగరం, నరసన్నపేట మండలం బుచ్చిపేట, హిరమండలం మండ లం అందవరం రేవుల్లో ఇసుక తవ్వకాలకు సిద్ధం చేశారు. ఈ రేవుల్లో అత్యధికంగా దూసి రేవుకు 11 మంది దరఖాస్తు చేసుకోగా, చెవ్వాకులపేట, బుచ్చిపేటకు పదిమం ది దరఖాస్తు చేసుకున్నారు. హయాతీనగరం రేవుకు 9, పురుషోత్తపురం, పొన్నాం, సింగూరు రేవులకు ఎనిమిది వంతున దరఖాస్తులు వచ్చాయి. కళ్లేపల్లిలో 7, అందవరంలో ఆరు, కుడుమ, సింగిడి ఐదు, యరగాం, సిరుసువాడ రేవులకు ఏడు, బిల్లమడ రేవులో అత్యల్పంగా మూడు దరఖాస్తులు వచ్చాయి. అయితే వేలం నిర్వహించకపోవడంతో వీటితో పాటు ఇంకా పరిశీలనలో ఉన్న రేవుల్లో కూడా అక్రమ తవ్వకాలు ఊపందుకున్నాయి. రాత్రివేళ అడ్డూఆపులేకుండా ఇసుక తవ్వకాలు సాగిపోతున్నా అడ్డుకునే నాథుడే లేకుండా పోయాడు. 22వ తేదీతో ముగుస్తున్న పర్యావరణ అనుమతులు జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనుమతులు జాప్యం వల్ల ప్రభుత్వ పనులకు అడ్డంకిగా మారింది. నదుల్లో ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు సైతం ఈ నెల 22వ తేదీతో ముగుస్తున్నాయి. ఈ-వేలంలో రేవులను దక్కించుకున్న వారే కొత్తగా పర్యావరణ అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ అనుమతులు రావాలంటే మరో పది రోజులు పడుతోంది. ఈ-వేలం జరిగిన తర్వాత కూడా పర్యావరణ అనుమతులు రాక పోతే అవి వచ్చినంతవరకు తవ్వకాలకు జరపడానికి వీలుండదు.