breaking news
O Pannerselvam
-
పన్నీరుకు షాక్.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు
అన్నాడీఎంకే బాధ్యతలు పళనిస్వామి గుప్పెట్లోకి చేరాయి. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని ఎంపికకు పరోక్షంగా శుక్రవారం మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచ్ పచ్చ జెండా ఊపింది. జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని ఆమోదించింది. సింగిల్ బెంచ్ విధించిన స్టేను రద్దు చేసింది. దీంతో పళని మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. కాగా ద్విసభ్య బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నామని పన్నీరు సెల్వం ప్రకటించారు. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళనిస్వామి మధ్య రాజకీయ చదరంగం కొనసాగుతోంది. జూలై 11వ తేదీ జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ద్వారా పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. దీనిని వ్యతిరేకిస్తూ పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్ను గత నెల న్యాయమూర్తి జయచంద్రన్ బెంచ్ విచారించింది. సర్వసభ్య సమావేశానికి సింగిల్ బెంచ్ స్టే విధించింది. జూన్ 23వ తేదీకి ముందు అన్నాడీఎంకేలో ఉన్న పరిస్థితులు కొనసాగే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పళని స్వామి శిబిరానికి చెక్ పెట్టే విధంగా పన్నీరుసెల్వం దూకుడు పెంచారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె ప్రతినిధి దినకరన్ను కలుపుకుని ముందుకు సాగేందుకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు. అడియాసే.. పన్నీరు ఆశలన్నీ ప్రస్తుతం ఆవిరయ్యాయి. సింగిల్ బెంచ్ విధించిన స్టేకు వ్యతిరేకంగా పళనిస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు దురైస్వామి, సుందర మోహన్ బెంచ్ ఈ పిటిషన్పై శుక్రవారం తీర్పు వెలువరించింది. పళనిస్వామి తరఫు న్యాయవాది ఇన్బదురై బలమైన వాదనలను కోర్టు ముందు ఉంచారు. అన్నాడీఎంకే నిబంధనలకు అనుగుణంగానే జూలైన 11న సర్వసభ్య సమావేశం జరిగిందని వివరించారు. జూన్ 23వ తేదీ జరిగిన సమావేశంలో జూలై 11న జరిగే సమావేశం గురించి ప్రిసీడియం చైర్మన్ ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఈ సమయంలో పన్నీరుసెల్వం అదే వేదికపై ఉన్నారని, అలాంటప్పుడు ఈ సమావేశం గురించి సమాచారం లేదని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. వీటిని ద్విసభ్య బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. 128 పేజీలతో కూడిన తీర్పును న్యాయమూర్తులు వెలువరించారు. చదవండి: పొలిటికల్ గేమ్లో ప్లాన్ ఛేంజ్.. టీఆర్ఎస్కు షాకిచ్చిన బీజేపీ! తీర్పుతో పళని శిబిరంలో సంబరాలు సింగిల్ బెంచ్ విధించిన స్టేను ద్విసభ్య బెంచ్ రద్దు చేసింది. జూలై 11న జరిగిన సర్వ సభ్య సమావేశానికి ఆమోదం తెలిపింది. దీంతో పళని శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. చెన్నైలో ఎంజీఆర్ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నేతృత్వంలో స్వీట్లు పంచుకుని బాణాసంచాతో హోరెత్తించారు. పళని, దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. పళని మద్దతుదారులు జయకుమార్, ఆర్బీ ఉదయకుమార్, వైగై సెల్వం, ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ తదితరులు మీడియా ముందుకు వచ్చారు. ఇది చారిత్రక తీర్పుగా పేర్కొన్నారు. పన్నీరు సెల్వంను అన్నాడీఎంకే నుంచి ఇప్పటికే తొలగించామని, ఆయనకు పార్టీలో చోటు లేదని స్పష్టం చేశారు. మూడు నెలల్లో మరోమారు పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి పళనిస్వామిని పూర్తి స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటామని ప్రకటించారు. కోర్టు తీర్పు ఏకనాయకత్వానికి ఆమోదముద్ర వేసిందని హర్షం వ్యక్తం చేశారు. తాత్కాలికం ద్విసభ్య బెంచ్ తీర్పుతో పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇది పన్నీరు సెల్వం శిబిరానికి షాక్ గా మారింది. దీంతో సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేయడానికి పన్నీరు సెల్వం నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ద్విసభ్య బెంచ్ తీర్పు తాత్కాలికంగా మారేనా అన్న చర్చ నెలకొంది. ఇందుకు కారణం న్యాయమూర్తి జయచంద్రన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్లో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ వ్యవహారం ప్రధాన కేసుగా విచారణలో ఉండటమే. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ రద్దు చేశారా.? కాలం చెల్లిందా..? అన్న వ్యవహారాలపై ఈ బెంచ్లో వాదనలు జరగాల్సి ఉంది. కేవలం సింగిల్ బెంచ్ విధించిన స్టేను మాత్రమే ద్విసభ్య బెంచ్ రద్దు చేసింది. అయితే, సింగిల్ బెంచ్లో మున్ముందు ప్రధాన కేసు విచారణ ఎలాంటి మలుపులకు దారి తీస్తాయో, తుది వాదనలు ఎలా ఉంటాయో అన్నది వేచి చూడాల్సిందే. దీనిపై పన్నీరు శిబిరం నేత వైద్యలింగం స్పందిస్తూ ఈ తీర్పు తాత్కాలికమేనని.. సుప్రీంకోర్టులో తమ న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తిరువళ్లూరులో.. పట్టణంలో పళనిస్వామి మద్దతుదారులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఎంజీఆర్, అన్నాదురై విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి రమణ, పార్టీ నేతలు వెంకటేషన్, బాబు, ఎయిళరసన్, సుధాకర్, మాధవన్ పాల్గొన్నారు. తిరుత్తణి: హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే శ్రేణులు తిరుత్తణిలో సంబరాలు చేసుకున్నారు. పట్టణ కార్యదర్శి సౌందర్రాజన్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండు వద్ద బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. పళ్లిపట్టు మండల కార్యదర్శి టీడీ.శ్రీనివాసన్, నాయకులు కుప్పుస్వామి, త్యాగరాజన్, జయశేఖర్బాబు పాల్గొన్నారు. -
పన్నీర్ సెల్వానికి మంత్రి భారీ ఝలక్
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్ భారీ ఝలక్ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై దర్యాప్తు కోసం పోరాడుతున్న పన్నీర్ సెల్వం నేటి సాయంత్రం తన మద్దతుదారులతో సమావేశం కాగా, మరోవైపు అన్నాడీఎంకే అధికార వర్గ నేతలు పన్నీర్ పై విరుచుకు పడుతున్నారు. మంత్రి విజయభాస్కర్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నంత వరకూ అమ్మ జయలలిత మరణంపై ఎలాంటి అనుమానాలు లేవనెత్తని ఆమె వీర విధేయుడు పన్నీర్ సెల్వం.. అధికారం నుంచి తప్పుకోవాల్సి రావడంతో విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. అపోలో ఆస్పత్రిలో జయకు ఎలాంటి చికిత్స అందించారన్న విషయంలో సీఎం పదవిలో ఉండగా పన్నీర్ సెల్వానికి ఎందుకు గుర్తురాలేదో చెప్పాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అమ్మకు అందించిన ట్రీట్మెంట్, ఆమె మృతిపై అధికారం కోల్పోయిన క్షణం నుంచి పన్నీర్ వదంతులు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో ఏదైనా తప్పు అని తేలితే మాత్రం తొలి దోషి మాత్రం మాజీ సీఎం పన్నీరే అవుతారని, అందరికీ ఆయనే జవాబు చెప్పాల్సి ఉంటుందని విజయభాస్కర్ వ్యాఖ్యానించారు. మరోవైపు పన్నీర్ సెల్వం భవిష్యత్ కార్యాచరణపై తన నివాసంలో ఆదివారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జయలలిత మృతిపై దర్యాప్తు చేపట్టకపోతే మార్చి 8న తన మద్దతుదారులు, పార్టీ నేతలతో కలిసి నిరాహార దీక్షకు దిగుతానని పన్నీర్ సెల్వం హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలైన అన్నాడీఎంకే తమదేనని ఓపీఎస్ వర్గం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి సి.విజయభాస్కర్ మాజీ సీఎం పన్నీర్ అధికారం కోసం కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పన్నీర్ సెల్వం ఏం చర్చించారో?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి అనూహ్యంగా తప్పుకున్న ఒ పన్నీర్ సెల్వం భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. తన నివాసంలో ఆదివారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తనకు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే ఎంపీలతో ఆయన మంతనాలు జరిపారు. జయలలిత మృతిపై దర్యాప్తు చేపట్టకపోతే మార్చి 8న తన మద్దతుదారులు, పార్టీ నేతలతో కలిసి నిరాహార దీక్షకు దిగుతానని పన్నీర్ సెల్వం హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలైన అన్నాడీఎంకే తమదేనని ఓపీఎస్ వర్గం వాదిస్తోంది. ఒక కుటుంబం పిడికిలిలో అన్నాడీఎంకే ఉందని దాన్ని తాము ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని చెబుతోంది. మరోవైపు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ చెల్లదని పన్నీర్ సెల్వం న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన నివాసంలో జరిగిన ఉన్నతస్థాయి భేటీ ఆసక్తి రేపుతోంది. పన్నీర్ సెల్వం హెచ్చరికను అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తేలిగ్గా తీసుకున్నారు. దీక్ష చేయడం పన్నీర్ సెల్వం ఆరోగ్యానికి మంచిదని ఎద్దేవా చేశారు. -
పన్నీర్పై వేటు : శశికళ ఉత్తర్వులు
-
పన్నీర్పై వేటేసిన చిన్నమ్మ
చెన్నై: ఆవేదనాభరిత ప్రకటనతో పెనుసంచలనం సృష్టించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు చిన్నమ్మ గట్టి షాకిచ్చింది. మెరీనా బీచ్లో పన్నీర్ మీడియా సమావేశం అనంతరం పోయెస్ గార్డెన్లో ఎమ్మెల్యేలతో అత్యవసరంగా భేటీఅయిన శశికళ అన్నాడీఎంకే కోశాధికారి పదవి నుంచి పన్నీర్ను తొలగిస్తూ మంగళవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీచేశారు. సెల్వం స్థానంలో శ్రీనివాసన్ను కోశాధికారిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. ప్రజల మద్దతు ఉన్న వ్యక్తి మాత్రమే పార్టీని నడిపించాలన్నది అమ్మ(జయ) నిర్ణయమని, కానీ ప్రస్తుతం పార్టీలోని పరిస్థితులు అందుకు విరుద్ధంగా తయారయ్యాయని పన్నీర్ సెల్వం ఆరోపించడం అన్నాడీఎంకే చీలికకు దారితీసింది. మెరీనా బీచ్లోని జయలలిత సమాధి వద్ద గంటపాటు దీక్ష చేసిన అనంతరం ఓపీఎస్ మీడియాతో మాట్లాడారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తనను సీఎం పదవి నుంచి బలవంతంగా తొలిగించారని ఆయన ఆవేదన చెందారు. ఓపీఎస్ మీడియా సమావేశం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. 'ఓపీఎస్.. ఓపీఎస్..' అంటూ పెద్ద ఎత్తున నినాదాలుచేస్తూ, శశికళపై విమర్శలు చేశారు. అటు శశికళ కూడా వేగంగా స్పందిస్తూ కీలక నాయకులతో మంతనాలు సాగించారు. చివరికి పన్నీర్ను పార్టీ పదవి నుంచి తొలిగించారు. ఒకవేళ పన్నీర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లైతే అతని ఇమేజ్ మరింత పెరుగుతుందనే భావనతోనే చిన్నమ్మ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు అర్థం అవుతున్నది. (అన్నాడీఎంకేలో చీలిక..!) (తమిళనాట సంచలనం: పన్నీర్ తిరుగుబాటు)