breaking news
MPCB
-
నిబంధనలు పాటించని మెర్సిడెస్ బెంజ్!.. ఎంపీసీబీ
పూణె తయారీ కేంద్రంగా ఉన్న లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్ ఇండియా' పర్యావరణ ప్రమాణాలను పాటించడం లేదని మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (MPCB) ఆరోపించింది. ప్లాంట్ కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షించాలని కోరింది.మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎలాంటి వ్రాతపూర్వక నోటీసు అందుకోలేదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. అవసరమైతే ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కంపెనీ పేర్కొంది.2024 ఆగస్టు 23న నిర్వహించిన సాధారణ తనిఖీలో.. పూణేలోని చకాన్లోని మెర్సిడెస్ బెంజ్ అసెంబ్లీ ప్లాంట్ మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (MPCB) నిర్దేశించిన కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలకు కట్టుబడి లేదని గుర్తించినట్లు బోర్డు తెలిపింది. దీంతో బెంజ్ అసెంబ్లీ ప్లాంట్ మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ అధికారులను ఆదేశించింది. తక్షణ చర్యగా.. రూ. 25 లక్షల బ్యాంక్ గ్యారెంటీని జప్తు చేసినట్లు వెల్లడించింది.ఆటోమోటివ్ ఇన్నోవేషన్లో అగ్రగామిగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ స్థిరమైన ఉత్పత్తి పద్ధతుల్లో పర్యావరణ ప్రమాణాలను పాటించకపోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. ఇది బ్రాండ్ మీదున్న నమ్మకాన్ని ఒమ్ముచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణం, సుస్థిరత పద్ధతులను నిలబెట్టడానికి.. తప్పనిసరి నిబంధనలను పాటిస్తామని, ప్రమాణాలకు కట్టుబడి ఉండటానికి కంపెనీ అధిక ప్రాధాన్యతనిస్తుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది. -
నీలం రంగులోకి మారుతున్న కుక్కలు
సాక్షి, ముంబై : ముంబైలో కుక్కలు నీలం రంగులోకి మారడం సంచలనం సృష్టిస్తోంది. కుక్కలకు ఎవరో కావాలనే రంగులు వేసినట్టు ఉన్నా, అవి రంగుమారడం వెనక మానవ తప్పిదాలే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రంగు మారిన కుక్కలు మరికొన్ని రోజుల్లో మృతిచెందనున్నాయని తెలియడంతో ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత కొన్ని రోజులుగా ముంబైలో రంగుమారిన లక్షణాలు కుక్కల్లో విపరీతంగా పెరిగిపోవడంతో ముంబై కార్పొరేషన్ దీనిపై దృష్టిసారించింది. నీలం రంగు కుక్కల వ్యవహారంపై మహారాష్ట్రా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కు ముంబై యానిమల్ ప్రొటెక్షన్ సెల్ ఫిర్యాదు చేసింది. తలోజ పారిశ్రామిక ప్రాంతం నుంచి వచ్చే వ్యర్థాల వల్లే కసాడి నది కలుషితం కావడం.. ఆ నీటిని కుక్కలు తాగడంతో రంగులు మారుతున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. ముంబై మహా నగరం చుట్టూ ఉన్న ఫార్మా, కెమికల్, ఫుడ్ ప్రాసెస్ ఫ్యాక్టరీలు వెయ్యికి పైగా ఉన్నాయి. వీటి నుంచి వచ్చే వ్యర్ధాలు, రసాయననాలు కాలువలు, డ్రైనేజీ, నదుల్లో కలుస్తున్నాయి. దీంతో ఆ నీళ్లు మొత్తం విషంగా మారాయి. వీధుల్లోని కుక్కలు ఆ నీటిని తాగటంతో శరీరం అంతా విషతుల్యమై.. రంగుమారిపోతున్నాయి. తర్వాత దశలో రంగుమారిన కుక్కలు చనిపోతున్నాయట. ఇప్పటి వరకు కుక్కలే రంగు మారాయి.. ఇలాగే వదిలేస్తే తాము కూడా రంగు మారి చనిపోతామేమో అంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణాన్ని నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమని మహారాష్ట్రా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజినల్ ఆఫీసర్ అనిల్ మోహేకర్ హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్రదర్యాప్తు కోసం ప్రత్యేక అధికారిని నియమించినట్టు తెలిపారు.