breaking news
MLA paasam Sunil
-
క్రీడా స్పూర్తిని పెంపొందించడమే లక్ష్యం
ఉత్సాహంగా 1–కె, 2–కె రన్ గూడూరు: విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు 1–కె, 2–కె రన్ల లక్ష్యమని మున్సిపల్ చైర్ పర్సన్ పొనకా దేవసేనమ్మ అన్నారు. జిల్లా విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కో–ఆర్డినేటర్ కోట సునీల్కుమార్ సహకారంతో స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో విద్యార్థినులకు 1–కె రన్, విద్యార్థులకు 2–కె రన్లను బుధవారం ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్, చైర్పర్సన్ ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఆటలకు దూరం అయ్యారన్నారు. వారిని క్రీడలపై మక్కువ పెంచేందుకు కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు జేడీ సుందరరావు మాట్లాడారు. అనంతరం బాలికలు, బాలుర విభాగాల్లో జీఎస్రాయలు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులైన హేమలత, మౌరేంద్రలకు నగదు, మెమోంటోలను అందజేశారు. అలాగే ద్వితీయ, తృతీయ, చతుర్ద, పంచమ స్థానాల్లో విజేతలకు నగదు, మెమోంటొలను అందజేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు సుందరరామయ్య, కార్యదర్శి జిలానీ పాల్గొన్నారు. -
సత్తా ఉంటే రాజీనామా చేసి గెలవాలి
పాశం సునీల్కు ఎంపీ వరప్రసాద్రావు హితవు వాకాడు: గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కు సత్తా ఉంటే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని తిరుపతి ఎంపీ వరప్రసాద్రావు పేర్కొన్నారు. వాకాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు డాక్టర్ నేదురుమల్లి పద్మనాభరెడ్డి నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పార్టీ నుంచి పిరికివాడిలా పారిపోవడం దారుణమన్నారు. ఆయన్ను మొదటిసారి ఎమ్మెల్యే చేసిన గూడూరు నియోజవర్గ ప్రజలకు జీవితాంతం దణ్ణం పెట్టుకోవాలని సూచించారు. విలువల్లేని రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. పాశం సునీల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటం చాలా బాధాకరమన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే తాను ఎంపీగా, సునీల్ గూడూరు ఎమ్మెల్యేగా గెలిచామని వివరించారు. ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహించడం దారుణమన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని చంద్రబాబు చూడటం అన్యాయమని చెప్పారు. అనంతరం పద్మనాభరెడ్డి మాట్లాడారు. వరప్రసాద్రావు ఎంపీగా గెలిచిన అనంతరం మండలాల్లో అనేక సార్లు తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకొని నిధులను కేటాయిస్తున్నారని కొనియాడారు. అనంతరం పాపారెడ్డి మనోజ్కుమార్రెడ్డి కుటుంబసభ్యులను కలిశారు. పార్టీ మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయ్శేఖర్రెడ్డి, కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్కుమార్రెడ్డి, నేదురుమల్లి శ్రీధర్రెడ్డి, కోట ఎంపీటీసీ దారా సురేష్, నాయకులు దుష్యంతయ్య శెట్టి, తుమ్మల మోహన్నాయుడు, ఎస్సీ సెల్ అధ్యక్షులు అడపాల ఏడుకొండలు, సుధాకర్రెడ్డి, గాది భాస్కర్, కుంబాల మస్తానయ్య, తదితరులు పాల్గొన్నారు.