breaking news
Missing Air Force Plane
-
భూపేంద్రసింగ్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
విమానాలను నడుపుతున్న తీరు బాధాకరం
విశాఖపట్నం: దేశంలో విమానాలను నడుపుతున్న తీరు బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం అదృశ్యంకావడం విచారకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విమానంలో ప్రయాణిస్తూ గల్లంతయిన ఆరుగురి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సోమవారం మాధవధార కళింగనగర్లో వరప్రసాద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అంతకుముందు భూపేంద్రసింగ్ కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. విశాఖ మర్రిపాలెంలోని 104 ఏరియాలోని ఆయన నివాసానికి విచ్చేసిన వైఎస్ జగన్ ...ఘటనపై కుటుంబసభ్యుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూపేంద్రసింగ్ కుమారుడితో వైఎస్ జగన్ మాట్లాడి, ధైర్యం చెప్పారు. విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అధైర్యపడవద్దని సూచించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ మిస్ అయినప్పుడు తాము కూడా చాలా టెన్షన్ పడ్డామని, ఆరోజు ఎంతో కష్టం అనుభవించామని, ఆ కష్టం తనకు తెలుసని వారితో చెప్పారు. ఇప్పుడు గల్లంతైన భారత వాయుసేన విమానం ఆచూకీని గుర్తించేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతామన్నారు. కాగా అదృశ్యమైన ఏఎన్-32 విమానంలో భూపేంద్రసింగ్ ఎగ్జామినర్ కూడా ఉన్నారు. ఆయనకు భార్య సంగీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి స్వస్థలం ఉత్తరప్రదేశ్. భూపేంద్ర సింగ్ ఆర్మీలో కూడా పనిచేశారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు అయినా తమవారి జాడ తెలీకపోవడంతో కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు. కాగా ఎన్ఏడీ నుంచి ఈ నెల 20వ తేదీన ఎనిమిది మంది ఉద్యోగులు బయలుదేరి వెళ్లారు. 21వ తేదీ ఉదయం 8 గంటలకు చెన్నై చేరుకున్నారు. ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్ఎస్) బట్టిమాల్వ్లో సీఆర్ఎన్-91 అనే ఆయుధంలో తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ రాజధాని పోర్టుబ్లెయిర్కు ఐఏఎఫ్ విమానం ఏఎన్ 32 ఈ నెల 22వ తేదీ ఉదయం 8.30కి బయలుదేరింది. 8.46 గంట లకు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం విమానం అదృశ్యమైనట్లు వైమానిక దళ అధికారులు ప్రకటించారు. విమానంలో 29 మంది ఉండగా వారిలో విశాఖపట్నంలోని నేవల్ ఆర్మమెంట్ డిపో (ఎన్ఏడీ)కి చెందిన ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారని అధికారులు నిర్ధారించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
చిన్నారావు కుటుంబానికి చంద్రబాబు పరామర్శ
విశాఖ: ఎయిర్ఫోర్స్ విమానంలో గల్లంతైన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పరామర్శించారు. విశాఖపట్నం వచ్చిన ఆయన బాజీ జంక్షన్, బుచ్చిరాజుపాలెంలో బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. ఎన్డీయే ఉద్యోగి నమ్మి చిన్నారావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. నేవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారని ఆయన ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా గల్లంతు అయిన విమాన జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గంటలు గడుస్తున్నా విమానం జాడ తెలియటం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి శిథిలాలు లభ్యం కాలేదని అధికారులు చెబుతున్నారు. 16 నౌకలు, ఏడు విమానాలు, ఒక సబ్ మెరైన్తో గాలింపు సాగుతోంది. చెన్నైకు 300 కిలో మీటర్ల దూరంలో గాలింపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం విమానం టేకాఫ్ తీసుకున్న 15-20 నిమిషాల్లో సిగ్నల్ కట్ అయింది. చెన్నైకు 151 నాటికల్ మైళ్లదూరంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి. ఏఎన్ 32 రకం విమానం అత్యవసర సమయంలో కూడా ఎగరగలదని అధికారులు అంటున్నారు. ఎమర్జెన్సీ సమయంలో అత్యవసర సందేశం పంపే అవకాశం కూడా ఈ విమానంలో ఉంది. సాధారణ విమానాల్లా ఏఎన్-32 కూలిపోయే ఛాన్స్ లేదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ విమానం నిరంతరం రాడార్ పర్యవేక్షణలో ఉంటుందని.. అనుకోని ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. తుపాను లాంటి ప్రతికూల వాతావరణం ఎదురై ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. రెండు ఇంజిన్ల ఫెయిల్యూర్, అగ్నిప్రమాదం, ఇంధనం లీకేజ్, ఫ్లైట్ కంట్రోల్స్ స్తంభించడం లాంటి అవకాశాలపై విచారణ సాగిస్తున్నారు.