breaking news
Merchant Navy
-
ఎరుపెక్కిన సముద్ర వర్తకం
సమీపకాలంలో భారత్కు అత్యంత ఆందోళనకర పరిణామం ఇది. బలవత్తరమైన శక్తిగా ఎదగడానికి సముద్ర వర్తకం ముఖ్యమైన వేళ... వాణిజ్య నౌకలపై వరుస దాడులు నిరంతర అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. వేర్వేరు వాణిజ్య నౌకలపై అరేబియా సముద్రంలో ఇటీవల జరిగిన దాడులతో, భారత నౌకాదళం మూడు క్షిపణి విధ్వంసక నౌకలను మోహరించాల్సి వచ్చింది. వాటిని వివిధ ప్రాంతాల్లో గస్తీకి నిలిపి, ముష్కరుల దొంగదాడులకు మన నేవీ చెక్ పెట్టే పనిలో పడింది. వారం రోజుల్లో... భారతీయ సిబ్బందితో కూడిన రెండు వాణిజ్య నౌకలు మన దేశానికి వస్తూ, దాడికి గురవడం మన సముద్ర వర్తకం భద్రతపై ప్రశ్నలు రేపింది. పోర్బందర్కు 217 నాటికల్ మైళ్ళ దూరం నుంచి 21 మంది భారతీయ సిబ్బందితో కూడిన ఎమ్వీ చెమ్ ప్లూటోపై డిసెంబర్ 23న డ్రోన్ దాడి జరిగింది. అప్రమత్తమైన భారత నౌకాదళం, భారత తటరక్షక దళం సదరు వర్తక నౌకకు రక్షణగా నిలిచాయి. తర్వాత కొద్ది గంటలకే... పాతిక మంది భారతీయ సిబ్బందితో కూడిన వాణిజ్య క్రూడాయిల్ ట్యాంకర్ ఎమ్వీ సాయిబాబాపై ఎర్రసముద్రం దక్షిణ ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగింది. దీంతో,నౌకాదళం గస్తీ పెంచింది. దాడులు జరిపిన ముష్కరులు సముద్ర గర్భంలో దాగివున్నా సరే, వెతికి పట్టుకొని, కఠిన చర్యలు తీసుకుంటామంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. లెక్కలు తీస్తే... నవంబర్ 19 నుంచి ఇప్పటికి ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై 30 డ్రోన్ దాడులు, సముద్రపు దొంగల దాడులు జరిగాయి. అంటే, దాదాపు రోజుకో దాడి. ఈ 30 దాడుల్లో సగం ప్రపంచంలోనే అతి రద్దీగా ఉండే సముద్ర వర్తక మార్గంలో ఎర్ర సముద్రంలో జరిగినవే. ఇది ఆందోళనకరం. తాజాగా ఎమ్వీ చెమ్ ప్లూటోపై జరిగిన దాడి తాలూకు శిథిలాలను సేకరించి, దాడి తీరుతెన్ను లను కనిపెట్టే ప్రయత్నం సాగుతోంది. దాడి మరో నౌకపై నుంచి చేశారా, లేక తీర ప్రాంతం నుంచి జరిగిందా లాంటి అంశాలను నిర్ధారణ చేసే పనిలో ఇండియన్ నేవీ నిమగ్నమైంది. ఒకపక్క గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంతో ఉద్రిక్తతలు పెరగగా, అదే సమయంలో వాణిజ్య నౌకలపై ఇలా డ్రోన్ దాడులు జరగడం యాదృచ్ఛికమేమీ కాదు. అక్కడి యుద్ధం తాలూకు ప్రభావం ఇక్కడకు విస్తరించింది. యెమెన్లో అధిక ప్రాంతాలను తమ నియంత్రణలో పెట్టుకున్న హౌథీ రెబల్స్ నవంబర్ మధ్య నుంచి ఎర్ర సముద్రంలో వెళుతున్న నౌకలపై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తున్నారు. గాజా లోని హమాస్కు సంఘీభావంగా రెబల్స్ ఈ దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్తో స్పష్టమైన సంబంధం లేని నౌకలపైనా ఈ దాడులు సాగడం గమనార్హం. వీరికి ఇరాన్ అండదండలున్నట్టు కథనం. దాడులకు బాధ్యత తమదేనంటూ ఈ యెమనీ రెబల్స్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఎమ్వీ సాయిబాబాపై హౌథీలు దాడి జరిపారనీ, ఎమ్వీ చెమ్ప్లూటోపై ఇరాన్ నుంచి డ్రోన్ను ప్రయో గించారనీ అమెరికా కేంద్ర కమాండ్ సమాచారం. దాడులకు ఎర్ర సముద్రాన్ని ఎంచుకోవడంలో ముష్కరులకు పెద్ద వ్యూహం ఉంది. ప్రపంచ నౌకా రవాణాలో 30 శాతం, వ్యాపారంలో 12 శాతం, సముద్రజలాలపై పెట్రోలియమ్ వాణిజ్యంలో 10 శాతం మధ్యధరా ప్రాంతాన్ని హిందూ మహాసముద్రంతో కలిపే ఎర్ర సముద్రం మీదుగానే జరుగుతాయి. దాడుల వల్ల నౌకలు రూటు మార్చి, ఒకప్పటిలా గుడ్హోప్ అగ్రం చుట్టూ తిరిగిరావాలి. దూరం, దరిమిలా ప్రయాణకాలం పెరిగే ఈ సుదీర్ఘయానం వల్ల చమురు, దిగుమతుల ధరలు గణనీయంగా పెరుగుతాయి. పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు మరింత ప్రియమవుతుంది. చమురు సరఫరాలకు ప్రధానంగా ఆ ప్రాంతంపై ఆధారపడే భారత్కు ఇది దెబ్బ. ఇజ్రాయెల్ – హమాస్ పోరు ప్రారంభమైనప్పటి నుంచి ముడి చమురు ధరలు అంతకంతకూ పెరగడమే అందుకు నిదర్శనం. అమెరికా, ఇజ్రాయెల్లను సైద్ధాంతికంగా వ్యతిరేకించే హౌథీల దాడుల దెబ్బకు ఎర్ర సముద్రం ఇప్పుడు యుద్ధ క్షేత్రమైపోయింది. గాజాకు మానవతా సాయం అందేవరకు ప్రపంచ సరఫరా వ్యవస్థలకు అవరోధాలు కల్పించాలన్న వారి ఆలోచన ఫలిస్తోంది. దీన్ని ప్రతిఘటించి, ముష్కరుల దాడుల నుంచి రక్షణ కోసం అమెరికా గత వారం ‘ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్’ పేర బహుళ దేశీయ నౌకా దళాన్ని ప్రారంభించింది. అయితే, అగ్రరాజ్య సారథ్యంలోని ఈ బలగంలో పలు దేశాలు చేరలేదు. సూయజ్ కాలువ ద్వారా వర్తకం తగ్గినందు వల్ల భారీగా నష్టపోయే ఈజిప్ట్ ఇంతవరకు హౌథీల దుశ్చర్యలను ఖండించలేదు. చివరకు యెమెనీ గ్రూపుతో శాంతి ప్రక్రియ చర్చలు సాగిస్తున్న సౌదీ అరేబియా సైతం అమెరికా సారథ్య నౌకాబలగాన్ని సమర్థించలేదు. ఉత్తరాన హిమాలయాలు, పశ్చిమాన శత్రుత్వం వహించే పాకిస్తాన్ ఉన్నందున, మిగిలిన దిక్కుల్లో వాణిజ్యానికి సంబంధించి ఆచరణలో భారత్ ద్వీపదేశమే. అందుకే, మనకు సముద్ర వర్తకం కీలకం. మన దేశ వాణిజ్య పరిమాణంలో 98 శాతం, విలువలో 68 శాతం సముద్ర మార్గాల్లోనే సాగుతాయి. దానికి తగ్గట్టే హిందూ మహాసముద్ర ప్రాంతానికి కావలి పాత్రను భారత్ పోషిస్తోంది. వాణిజ్యం పెరగాలంటే, మిత్రదేశాలతో కలసి ఈ సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచాలి. ఆ పనే భారత్ చేస్తోంది. అయితే, ఇజ్రాయెల్ – గాజా యుద్ధంలో సమదూరం పాటిస్తూ వచ్చిన మనకు తాజా పరిస్థితులు కొత్త బరువ నెత్తిన పెట్టాయి. సోమాలీ సముద్ర దొంగల్ని నిరోధించేందుకు ఈ సరికే గస్తీ సాగిస్తున్న భారత్, ఇకపై వాణిజ్య నౌకల్ని భద్రంగా ఎర్ర సముద్రం దాటించే పని తప్పదు. ఒకవేళ దాడులు సాగితే, అది మరో యుద్ధభేరి అవుతుంది. అందుకే, ఈ సమస్యలన్నిటికీ అసలు పరిష్కారం గాజాలో యుద్ధానికి తెర పడడం, శాంతి నెలకొనడమే! -
మర్చంట్ నేవీతో ఖండాంతర అవకాశాలు
నిత్య జీవితంలో ఉపయోగించే ఎల్పీజీ, పెట్రోల్ వంటివి మనకు అందుబాటులోకి రావడం వెనుక ఎంతో మంది కృషి ఉంది. అవి వేల మైళ్ల దూరంలోని విదేశాల నుంచి నౌకల్లో దిగుమతి అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే 90 శాతం వస్తువులు ఒక దేశం నుంచి మరో దేశానికి నౌకల్లో రవాణా అవుతుంటాయి. నౌకల్లో వస్తువుల రవాణా, వ్యక్తుల ప్రయాణాలు సాఫీగా జరిగేలా పర్యవేక్షించేవారే.. మర్చంట్ నేవీ సిబ్బంది. ప్రస్తుతం భారత్లో అనుభవజ్ఞులైన మర్చంట్ నేవీ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ రంగంలో నిపుణులైన వారికి ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. మరోవైపు విదేశీ షిప్పింగ్ కంపెనీలు సైతం భారత్లో శిక్షణ పొందినవారిని నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇంగ్లిష్ పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యం, తక్కువ వేతనాలకే లభిస్తుండడమే ఇందుకు కారణం. భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో మర్చంట్ నేవీలో పనిచేస్తున్నారు. సిటీ యువత సాహసాలతో కూడిన మర్చంట్ నేవీ కెరీర్ పట్ల ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.. అధిక వేతనాలు, సముద్ర యానం, ప్రపంచ దేశాలను సందర్శించే అవకాశం... మర్చంట్ నేవీ ప్రత్యేకతలు. మర్చంట్ నేవీ అంటే చాలామంది నావికా దళంగా పొరపాటు పడుతుంటారు. ఈ రెండు పూర్తిగా భిన్నమైనవి. నావికా దళం సిబ్బంది సముద్ర తీరాల్లో దేశ రక్షణ బాధ్యతలను నిర్వహిస్తారు. మర్చంట్ నేవీ అధికారులు సరకుల ఎగుమతి, దిగుమతి వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. నౌకల్లో మనుషుల ప్రయాణాలు కూడా వీటి పరిధిలోనే కొనసాగుతాయి. మర్చంట్ నేవీ అధికారులకు ప్రస్తుతం దేశ విదేశాల్లో ఎన్నో అవకాశాలున్నాయి. నౌకలో డెక్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, స్టీవార్డ్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. ట్రెయినీగా కెరీర్ ప్రారంభిం చి కేవలం 12-15 ఏళ్లలో కెప్టెన్/మాస్టర్ స్థాయికి చేరుకోవచ్చు. ఇందులో కుటుంబ జీవితాన్ని కొంత త్యాగం చేయగలిగితే ఈ రంగంలో భవిష్యత్తును బంగారుమయంగా మార్చుకోవచ్చు. షిప్పై బాధ్యతలు నిర్వర్తించడానికి సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ(సీఓసీ) పొందాల్సి ఉం టుంది. ఇది ఒక లెసైన్స్లాంటిది. చాలా దేశాలు సీఓసీని జారీ చేస్తున్నాయి. ఇండియా, యూకే, సింగపూర్, న్యూజిలాండ్ జారీ చేస్తున్న సీఓసీలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. పేరున్న మర్చంట్ నేవీలు బ్రిటిష్ మర్చంట్ నేవీ కెనడియన్ మర్చంట్ నేవీ గ్రీక్ మర్చంట్ నేవీ ఇండియన్ మర్చంట్ నేవీ న్యూజిలాండ్ మర్చంట్ నేవీ పాకిస్థాన్ మర్చంట్ నేవీ పోలిష్ మర్చంట్ నేవీ స్విస్ మర్చంట్ నేవీ యునెటైడ్ స్టేట్స్ మర్చంట్ నేవీ ఏయే సంస్థల్లో ఉద్యోగాలు: బీఎస్సీ నాటికల్ సైన్స్ కోర్సును అభ్యసించినవారికి బ్రిటిష్ పెట్రోలియం, పసిఫిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఆంగ్లో ఈస్ట్రన్ షిప్ మేనేజ్మెంట్(ఇండియా) లిమిటెడ్, ఫ్లీట్ పర్సనల్ ప్రైవేట్ లిమిటెడ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, షెల్ షిప్పింగ్, సీ లాండియా గ్రూప్, ఎగ్జిక్యూటివ్ షిప్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థల్లో కొలువులు అందుబాటులో ఉన్నాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారత్లో షిప్పింగ్ కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పర్యవేక్షిస్తోంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఇతర నగరాల్లో శాఖా కార్యాలయాలున్నాయి. వెబ్సైట్: www.shipindia.com కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు మర్చంట్ నేవీ అధికారులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. భిన్న భాషలు, సంస్కృతులకు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు అవసరం. కొన్ని నెలలపాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి చేరుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. అందుకు సంసిద్ధంగా ఉండాలి. నౌకలపై పనిచేసే సిబ్బందికి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఎప్పటికప్పడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టిపెట్టాలి. అర్హతలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్లో ఉత్తీర్ణులైన తర్వాత జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(జేఈఈ)లో అర్హత సాధించి మూడేళ్ల బీఎస్సీ నాటికల్ సైన్స్ కోర్సులో చేరొచ్చు. అంతేకాకుండా ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా వర్సిటీ అనుబంధ కళాశాలల్లో ఈ కోర్సులో చేరే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా సొంతంగా ప్రవేశ పరీక్షను నిర్వహించి, సీట్లను భర్తీ చేస్తున్నాయి. నౌకల్లో డెక్ ఆఫీసర్గా పనిచేయాలంటే.. ఉపరితల రవాణా శాఖ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. నిపుణులకు భారీ వేతనాలు: మర్చంట్ నేవీ సిబ్బందికి నౌకలను బట్టి వేతనాలు వేర్వేరుగా ఉంటాయి. గ్యాస్, కెమికల్, ఆయిల్ ట్యాంకర్లు, కంటెయినర్ షిప్లు, బల్క్ క్యారియర్స్, జనరల్ కార్గో వెస్సల్స్లో అధిక వేతనాలు అందుతాయి. డెక్ ఆఫీసర్కు ప్రారంభంలో నెలకు రూ.1.25 లక్షలు, సెకండ్ ఆఫీసర్కు రూ.1.50 లక్షలు, చీఫ్ ఆఫీసర్కు రూ.2.20 లక్షలు, కెప్టెన్కు రూ.3 లక్షల వేతనం ఉంటుంది. విదేశీ నౌకల్లో పనిచేస్తే ఇంకా అధిక జీతభత్యాలు పొందొచ్చు. షిప్పింగ్ కంపెనీలు తమకు అవసరమైన సిబ్బందిని ఆరు ఏడు నెలల చొప్పున కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకుంటాయి. మర్చంట్ నేవీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ-విశాఖపట్నం వెబ్సైట్: www.nsdrc.com ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ-చెన్నై వెబ్సైట్: www.imu.edu.in టీఎస్ చాణక్య, ఐఎంయూ-ముంబై వెబ్సైట్: www.imumumbai.com తొలానీ మారిటైమ్ ఇన్స్టిట్యూట్-పుణె వెబ్సైట్: www.tolani.edu అప్లయిడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్-న్యూఢిల్లీ వెబ్సైట్: www.ariedu.com ఇంటర్నేషనల్ మారిటైమ్ ఇన్స్టిట్యూట్-గ్రేటర్ నోయిడా వెబ్సైట్: www.imi.edu.in వ్యాపార నౌకలో విభాగాలు: డెక్ డిపార్ట్మెంట్ మాస్టర్ చీఫ్ ఆఫీసర్ సెకండ్ ఆఫీసర్ థర్డ్ ఆఫీసర్ డెక్ కేడెట్ బోట్స్వెయిన్ ఏబుల్ సీమెన్ ఆర్డినరీ సీమెన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ సెకండ్ ఇంజనీర్ థర్డ్ ఇంజనీర్ ఫోర్త్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్/ఎలక్ట్రీషియన్ ఫిఫ్త్ ఇంజనీర్/ జూనియర్ ఇంజనీర్ ఆయిలర్/మోటార్మేన్ వైపర్/యుటిలిటీ మేన్ స్టీవార్డ్స్ డిపార్ట్మెంట్ చీఫ్ స్టీవార్డ్ చీఫ్ కుక్ స్టీవార్డ్స్ అసిస్టెంట్