గణేశ్ నిమజ్జనోత్సవంలో ఇద్దరి మృతి
నిజామాబాద్ క్రైం / మోర్తాడ్ :
గణేశ్ నిమజ్జనోత్సవాల్లో జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. విద్యుత్ షాక్ కారణంగా నిజామాబాద్ నగరం ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందిన నవీన్(29), మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామానికి చెందిన మలావత్ శేఖర్(25) ప్రాణాలు విడిచారు. ఎల్లమ్మగుట్ట మెహర్బాబా కాలనీకి చెందిన మేకల నారాయణ, లక్ష్మిల కుమారుడు నవీన్ మెడికల్ రిప్రజెంటేటీవ్గా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం కోసం లారీలో తరలిస్తుండగా శుక్రవారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో అక్కడి విధులు నిర్వహిస్తున్న నాల్గవ టౌన్ ఏఎస్సె ముందుకెళ్లాలని మండిపడ్డాడు. లారీ ముందుకు కదిలిన క్రమంలో విద్యుత్ వైర్ ఒకటి గణేశ్ విగ్రహానికి తగిలి తెగి పడింది. అక్కడే ఉన్న నవీన్ ఆ వైర్ను పక్కన పెట్టేందుకు చేతితో ముట్టాడు. ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సహచరులు ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న నాల్గవ టౌన్ ఎస్సై మధు, సీఐ నర్సింగ్యాదవ్, డీఎస్పీ ఆనంద్కుమార్ అక్కడకు చేరుకున్నారు. నవీన్ మృతికి కారణమైన ఏఎస్సైను సస్పెండ్ చేసేంతవరకు తాము ఇక్కడి నుంచి కదలబోమని స్థానికులు రోడ్డుపైనే బైఠాయించారు. ఏఎస్సై ఆగ్రహంతో ఊగిపోతూ కర్రతో చితకబాదాడని, ఆ తొందరలోనే విద్యుత్ వైర్లు తెగి నవీన్ మృతికి కారణమైందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్లు కిందకు ఉన్నాయని, వాటిని సరిచేయని విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందని అన్నారు. ఉదయం 8 గంటల వరకు ఆందోళనను కొనసాగించారు. సుంకెట్ గ్రామంలో వినాయకుని విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేసే సమయంలో గురువారం రాత్రి మలావత్ శేఖర్(25) విద్యుత్ తీగెలు తగిలి షాక్తో మృతి చెందాడు.