పెంచిన ప్రేమ డెన్మార్క్ది.. పేగు బంధం ఆదిలాబాద్ది!
ఆదిలాబాద్ టౌన్: తమ బిడ్డ ప్రాణం పోసుకున్న నేల కోసం, ఆ ప్రాణం పోసిన కన్నవారి కోసం డెన్మార్క్ నుంచి ఆదిలాబాద్కు వచ్చారు లూయిస్ – రాస్ముస్ దంపతులు. 2016లో రెండు నెలల పసికందుగా ఉన్న అర్జున్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రిమ్స్ ఆసుపత్రి సమీపంలో వదిలేశారు. ఆ చిన్నారి జిల్లా కేంద్రంలోని శిశుగృహకు చేరగా, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఈ విదేశీ దంపతులు అర్జున్కు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ బాలుడు డెన్మార్క్లో వారితోనే పెరుగుతున్నాడు.అయితే, ‘అడాప్టి రైట్ కౌన్సిల్’అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అర్జున్ అసలు తల్లిదండ్రులను గుర్తించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సంస్థ ఇప్పటికే వంద మంది చిన్నారుల మూలాలను వెతికి పట్టుకుని, వారిని కన్నవారికి పరిచయం చేసింది. ఏడాదికోసారైనా అర్జున్ను కన్నవారికి కలిపించాలనేది వీరి సంకల్పం. బాలుడు పెద్దయ్యాక తన మూలాలు తెలియక మానసిక ఆవేదనకు గురికాకూడదనే ఉద్దేశంతోనే ఈ అన్వేషణ సాగిస్తున్నట్లు ఎన్జీవో డైరెక్టర్ అంజలి పవార్ వెల్లడించారు.బాలుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడని, దత్తత తీసుకున్న వారి దగ్గరే ఉంటాడని ఆమె స్పష్టం చేశారు. రెండు చేతుల వేళ్లకు వైకల్యం ఉండటం వల్లే ఆనాడు తల్లిదండ్రులు చిన్నారిని వదిలేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ బాలుడిని గుర్తించిన వారు 9822206485, 8329403661 నంబర్లలో సంప్రదించవచ్చు. వారం రోజుల పాటు వారు ఆదిలాబాద్లోనే ఉంటారు. వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, కన్నవారు తమ కుమారుడిని చూసే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తనను కన్నవారిని ఒక్కసారైనా చూడాలని ఆ బాలుడు సైతం ఆశపడుతున్నాడు.