breaking news
labour migration
-
ఉపాధి పెంపునకు అవకాశాలెన్ని?
ఆర్థిక వృద్ధి, సాంకేతిక ప్రగతి భారత్లో అభివృద్ధికి నూతన మార్గాలుగా రూపొందినప్పటికీ ఉపాధి సృష్టి, సమానత్వ సాధనలో వ్యత్యాసాలు పెరగడానికీ కారణమయ్యాయి. ఆధునిక ఆర్థిక వృద్ధి లక్ష్యసాధనలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల మధ్య వనరుల పునఃపంపిణీ ప్రక్రియను నిర్మాణాత్మక మార్పుగా భావిస్తాం. చారిత్రకంగా, వివిధ దేశాలు ఈ నిర్మాణాత్మక మార్పులో భాగంగా రెండు దశలను చవి చూశాయి. వ్యవసాయ రంగం నుండి తయారీ; తయారీ రంగం నుండి సేవా రంగానికి శ్రామికుల బదిలీ. తక్కువ ఉత్పాదకతతో కూడిన ప్రాథమిక కార్యకలాపాల నుండి ఆధునిక, అధిక ఉత్పాదకతతో కూడిన రంగాల వైపు శ్రామిక, మూలధన, సాంకేతికత లాంటి వనరుల బదిలీ; ఉపాధి పంపిణీ, విలువ జోడించిన పంపిణీ, అంతిమ వినియోగ పంపిణీలో తయారీ, సేవా రంగాల వాటా అధికంగా ఉండటం; భౌతిక, మూల ధన కల్పన; గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వల సలు; జనన, మరణ రేట్లలో తగ్గుదల లాంటి అంశాలను ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పునకు సూచికలుగా భావిస్తాం. భారత ఆర్థిక వ్యవస్థలో 2011–12 తదుపరి కాలంలో ఈ నిర్మాణాత్మక మార్పులలో తగ్గుదలను గమనించవచ్చు.ఎందుకీ మందగమనం?గడచిన ఐదు దశాబ్దాల కాలంలో గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తి ఏడు రెట్లు పెరిగినప్పటికీ, ఉపాధిలో పెరుగుదల కనీసం రెట్టింపు కాలేదు. శ్రామిక మార్కెట్లో దృఢత్వం, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, సమగ్ర ఆర్థిక విధానాలు అమలు చేయక పోవడం, ఆహారానికి సంబంధించి సాపేక్ష ధరలలో పెరుగుదల, పరపతి వృద్ధి తక్కువగా ఉండటం, తూర్పు ఆసియాలో మాదిరి వ్యవసాయ రంగం నుండి ఇతర రంగాల వైపు శ్రామికుల బదిలీలు తక్కువగా ఉండటం, తక్కువ వేతనంతో కూడిన నిర్మాణ రంగం, అసంఘటిత రంగంలో ఉపాధిలో తక్కువ నైపుణ్యత కల్గిన అధిక శ్రామిక శక్తి కేంద్రీకృతం కావడం లాంటి అంశాలు భారత్లో నిర్మాణాత్మక మార్పు ప్రక్రియ నెమ్మదించడానికి కారణాలుగా పేర్కొనవచ్చు. సంస్కరణల అమలు కాలంలో నిర్మాణాత్మక మార్పు వేగంగా ఉండగలదని భావించినప్పటికీ సప్లయ్ వైపు వ్యవసాయ రంగాన్ని తయారీ రంగం అధిగమించినప్పటికీ, డిమాండ్ వైపు తయారీ రంగం వ్యవసాయ రంగాన్ని అధిగమించలేక పోయింది. తయారీ రంగ ఉత్పత్తి కార్యకలాపాలు ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలకు బదిలీ అవుతున్నప్పటికీ గడిచిన ఐదు దశాబ్దాల కాలంలో గ్రామీణ ఉపాధి వృద్ధిలో ఆశించిన పెరుగుదల సంభవించలేదు.యువతలో ఉపాధిభారత్ మొత్తం జనాభాలో 15–29 వయో వర్గ జనాభా 27 శాతం కాగా, మొత్తం శ్రామిక శక్తిలో వీరి వాటా 26.9 శాతం. ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం, యువతలో నిరుద్యోగిత 2000 సంవత్సరంలో 5.7 శాతం నుండి 2023లో 10 శాతానికి పెరిగింది. పారిశ్రామిక, సేవా రంగాలతో పోల్చినప్పుడు వ్యవసాయ రంగంపై ఆధారపడిన యువత తక్కువ. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, 2022లో యువతలో నిరుద్యోగిత భారత్లో 23.2 శాతం కాగా మొత్తం నిరుద్యోగం 7 శాతంగా అంచనా. అంత ర్జాతీయ శ్రామిక సంస్థ అంచనా ప్రకారం, 2023లో భారత్లోని మొత్తం గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత 42.3 శాతం. నియంత్రణతో కూడిన శ్రామిక చట్టాల వల్ల సంఘటిత రంగంలో ఉపాధి తగ్గుదల, సేవారంగ ఆధారిత వృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం, ఆటోమేషన్ కారణంగా ఉపాధి క్షీణించటం; ఐటీ, ఇంజినీరింగ్, ఆటోమొబైల్ లాంటి రంగాలలో అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేంద్రీకృతం కావడం, వివిధ అంశాలలో లింగ సంబంధిత అసమానతలు, నాణ్యతతో కూడిన శిక్షణ కొరత, నూతన సాంకే తికతకు అనుగుణంగా తగిన నైపుణ్యత శ్రామికులలో లేకపోవడం వంటివి నిరుద్యోగం పెరుగుదలకు కారణాలుగా నిలిచాయి. వివిధ దేశాల అనుభవాలుమానవ మూల ధనం, సేవలు, నవకల్పనలపై అధిక పెట్టు బడుల ద్వారా సింగపూర్ శ్రమ సాంద్రత ఆర్థిక వ్యవస్థ నుండి నాలెడ్జ్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈ స్థితి అధిక వేతనాలు, ఉపాధి నాణ్యత పెరుగుదలకు దారి తీసింది. వృత్తి విద్య, శిక్షణకు జర్మనీ ప్రాధాన్యమిచ్చిన నేపథ్యంలో ఆధునిక తయారీ, అధిక నైపుణ్యత అవసరమైన సేవలలో ఉపాధి అవకాశాలు పెరి గాయి. చైనాలో నిర్మాణాత్మక మార్పులు కొన్ని కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి విముక్తి కావడానికీ, పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాల పెరుగుదలకూ, గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య లింకేజెస్ పెరగడానికీ దోహదపడ్డాయి. మలేషియాలో నిర్మాణాత్మక మార్పుల కారణంగా ప్రాథమిక వస్తువులపై ఆధారపడటం తగ్గి తయారీ, సేవలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో మలేషియా అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆదాయ స్థిరీకరణ సాధించింది. దక్షిణ కొరియా, తైవాన్ నిర్మాణాత్మక మార్పుల కారణంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల నుండి పారి శ్రామిక పవర్ హౌసెస్గా రూపాంతరం చెందాయి. తక్కువ ఉత్పా దకతతో కూడిన వ్యవసాయ రంగం నుండి అధిక ఉత్పాదకతతో కూడిన తయారీ రంగానికి శ్రామికుల బదిలీ ఆయా దేశాల ఆర్థిక సామర్థ్య పెరుగుదలకు దారి తీసింది.యువతలో ఉపాధి పెంపునకు చర్యలుభారత్లో ముఖ్య ఆర్థిక రంగాలకు సంబంధించి ఒక అంచనా ప్రకారం 2030 నాటికి యువతలో ఉపాధి వృద్ధి అధికంగా వ్యవ సాయం, దాని అనుబంధ రంగాలలో ఉంటుంది. ఈ రంగం నైపుణ్యత లేని, తక్కువ నైపుణ్యత కల్గిన శ్రామిక శక్తికి ఉపాధినందిస్తుంది. ప్రస్తుత ఉపాధి వృద్ధిని కొనసాగించడంతో పాటు, పెరుగు తున్న ఉపాధి డిమాండ్ను తీర్చాలంటే 2030 నాటికి ప్రతి సంవత్సరం 78.5 లక్షల మందికి వ్యవసాయేతర రంగాలలో ఉపాధి కల్పించాలి. యువతలో ఆర్థిక అవకాశాలు మెరుగుపర్చడానికి ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్, ఆంట్రప్రెన్యూర్షిప్పై ఆసక్తి కనబరచే విధంగా వారిని ప్రోత్సహించాలి. 2022–23లో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత 13.4 శాతంగా నమోదైంది. ఉపాధి సామర్థ్య రంగాలైన డిజిటల్ సర్వీసులు, ఫైనాన్షియల్ సర్వీసులు, ఆరోగ్య సేవలు, హాస్పిటాలిటీ, ఈ–కామర్స్; చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలి. ఉన్నత విద్యలో పరిశ్రమల లింకేజ్ను పటిష్టపరచడం ద్వారా, ప్రపంచ డిమాండ్కు అనుగుణంగా కరికులంలో మార్పులు చేయాలి. నియంత్రణల సడలింపు ద్వారా ప్రైవేటు రంగ అభివృద్ధికి తీసుకొనే చర్యలు యువతలో ఉపాధి అవకాశాలను విస్తృతపరచ గలవు. కృత్రిమ మేధ, ఆటోమేషన్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి సాంకేతికమైన నవ కల్పనలు యువతలో ఉపాధి క్షీణతకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో బ్లూ కలర్ ఉపాధి సృష్టికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి. శ్రమ సాంద్రత పరిశ్రమలను ప్రోత్సహించే విధానాల ద్వారా తయారీ రంగాన్ని పటిష్ట పరచాలి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్చార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
వెలిసిపోతున్న వలస బతుకులు
-
‘హామీ’లేని ఉపాధి!
పట్నం కార్మికుని పల్లెబాట - వెలిసిపోతున్న వలస బతుకులు - పేదల పొట్ట కొట్టిన ‘నోట్ల రద్దు’ - నగరాల్లో కుదేలైన నిర్మాణ రంగం - ఆగమాగమైన కూలీలు - పనుల కోసం సొంతూళ్లకు పయనం - అక్కడా ఉపాధి దొరక్క తిప్పలు సాక్షి, నెట్వర్క్: పెద్దనోట్ల రద్దుతో వలస బతుకులు వెతల పాలవుతున్నాయి. బడుగుల బతుకు బండి గాడి తప్పుతోంది. రాజధాని ‘అడ్డా’పై ఇన్నాళ్లూ ఉపాధి పొందుతూ ఉన్నంతలో సర్దుకొని బతికినవారంతా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పట్నంలో పనులు కరువై పొట్ట చేతబట్టుకుని సొంతూళ్లకు పయనమవుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవారు హైదరాబాద్తోపాటు బెంగళూరు, రాయచూర్, చెన్నై, ముంబై, పుణే నగరాల్లో భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా పెద్ద సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. దీంతో భవననిర్మాణ కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. వారంతా ఉపాధి హామీ పనులపై గంపెడాశలతో సొంతూళ్లకు చేరుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉపాధి హామీ పథకం అమలవుతున్న తీరు.. నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు చేరుకుంటున్న కూలీలు, కార్మికుల పరిస్థితిపై ‘సాక్షి’ తొమ్మిది జిల్లాల్లోని తొమ్మిది గ్రామాల్లో అధ్యయనం చేసింది. జాబ్ కార్డుంటేనే ఉపాధి నగరాలు, పట్టణాల్లో ఆదరువు కోల్పోయి ఊళ్లకు చేరుకుంటున్నవారికి ప్రస్తుతం వెంటనే పని దొరికే పరిస్థితి ఎక్కడా లేదు. ఉపాధి హామీ పనులు సాధారణంగా ఏటా జనవరి–జూలై మధ్యలో జరుగుతాయని, ఆ తర్వాత వ్యవసాయ పనులు ఉంటాయనే ఉద్దేశంతో పనులను నిలిపివేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్లు చెబుతున్నారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఉపాధి పనులు చేపట్టే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా ఏ జిల్లాలోనూ ప్రత్యేక కార్యాచరణ కనిపించడం లేదు. పెద్దనోట్లు రద్దయి నెలన్నర అవుతున్నా.. ఒక్క జిల్లాలోనూ కొత్తగా పనులు చేపట్టలేదు. మరోపక్క వ్యవసాయ పనులూ కరువైపోయాయి. ఫలితంగా పల్లెబాట పట్టిన వారికేగాక స్థానికంగా ఉంటున్న వారికీ పనులు దొరకడం లేదు. రోజూ 70 దరఖాస్తులు ఉపాధి హామీ కింద ఏదో విధంగా పని చేసుకుని బతికేందుకు, జాబ్ కార్డు పొందేందుకు నగరం నుంచి పల్లెలకు వెళ్తున్న భవన నిర్మాణ రంగ కార్మికులు, ఇతర వలస కూలీలు పడుతున్న వెతలు అన్నీ ఇన్నీ కావు. ఉపాధి పనులు దక్కించుకోవాలంటే జాబ్కార్డు ఉండాలి. పెద్దనోట్ల రద్దు తర్వాత జాబ్కార్డుల కోసం తెలంగాణవ్యాప్తంగా ఒక్కో మండలంలో సగటున రోజూ 70 నుంచి వంద వరకు దరఖాస్తులు అందుతున్నాయని అంచనా. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం కేశవరావుపల్లిలో 97 మంది పట్నం నుంచి వచ్చి జాబ్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసిన వారం–15 రోజులకు జాబ్ కార్డులు వస్తాయని కొందరు అధికారులు చెబుతుంటే, ప్రస్తుతం కార్డుల జారీ ఆపేశారని, కొత్త కార్డులు ప్రస్తుతం ప్రింట్ అవుతున్నందున ఇప్పట్లో ఇవ్వలేమని మరికొందరు పేర్కొంటున్నారు. పెరుగుతున్న వలసలు పెద్దనోట్ల రద్దుతో పట్టణాల నుంచి పల్లెలకు వలసలు పెరుగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో 1,700 మంది ఉపాధి పనులు చేసేవారు. పెద్దనోట్ల రద్దు తర్వాత వీరితోపాటు కొత్తగా ఉపాధి పనులు అడుగుతున్న వారి సంఖ్య ఒక్కసారిగా 2800కి పెరిగింది! దీని పొరుగునే ఉన్న గద్వాల జోగులాంబ జిల్లాలోని గట్టు గ్రామానికి కూడా నగరం నుంచి వలసలు పెరిగాయి. హైదరాబాద్, రాయచూర్, బెంగళూరులో భవన నిర్మాణ పనులు చేసే వారిలో దాదాపు 70 మంది తిరిగి వచ్చేశారు. ఇక నిర్మల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 4,700 మంది కార్మికులు, కూలీలు ఉపాధి కోల్పోయారు. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఉపాధి కూలీలకూ భరోసా లేదు భవన నిర్మాణ రంగ కార్మికులు, వలస కూలీల పరిస్థితి ఇలా ఉంటే.. గ్రామాల్లోనే ఉండి ఇన్నాళ్లూ ఉపాధి పనులతో పొట్టపోసుకున్న వారికి కూడా భరోసా కరువైంది. ఇప్పుడు వారంతా అడ్డాలపై నిలబడి రోజువారీ పనుల కోసం దిక్కులు చూస్తున్నారు. ఇప్పటికే పలు జిలాల్లో ఉపాధి హామీ చెల్లింపులు ఆరు నెలలుగా నిలిచిపోయాయి. ‘సాక్షి’పరిశీలించిన తొమ్మిది గ్రామాల్లో కూలీలకు గత ఆరు నెలలుగా రూ.37.85 లక్షల మేర చెల్లించాల్సి ఉంది. గోరు చుట్టుపై రోకటి పోటులా పెద్దనోట్ల రద్దుతో ఇప్పట్లో ఆ డబ్బులు వస్తాయనే ఆశ కూడా లేకుండాపోయింది. చెన్నై నుంచి సొంతూరికి: తాడూరి మురళి, జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి మండలం, సూర్యాపేట జిల్లా తొమ్మిదేళ్ల క్రితం తల్లిదండ్రులు, భార్య, చెల్లెలుతో కలిసి చెన్నై వెళ్లా. నాన్న వాచ్మన్గా, అమ్మ ఇళ్లలో పనికి కుదిరింది. నేను కిరాణా షాపులో గుమస్తాగా చేస్తున్నాను. పెద్ద నోట్ల రద్దుతో యజమాని జీతం తగ్గించాడు. దీంతో స్వగ్రామంలోనే పని చేసుకుని బతుకుదామని వచ్చా. ఇక్కడా ఏ పనీ దొరకట్లేదు. వచ్చే ఫిబ్రవరిలో చెల్లి పెళ్లి ఉంది. బ్యాంకులో రూ.3 లక్షలు దాచి ఉంచా. అవి బయటికొచ్చే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకూ పని కరువే: వెంకటరెడ్డి, భనవ నిర్మాణ మేస్త్రి, జామ్, నిర్మల్ నిర్మల్లో రెండు భవన నిర్మాణాలకు ఒప్పందం కుదుర్చుకున్నా. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇప్పుడు డబ్బులు ఇవ్వలేం.. ముందు పని కానివ్వు.. తర్వాత సర్దుబాటు చేస్తామని భవన యజమానులు షరతు పెట్టారు. నా కింద 18 మంది కూలీలు ఉన్నారు. నేను ఏదోలా సర్దుకున్నా కూలీలకు రోజువారీ చెల్లింపులు లేకుంటే నడవదు కదా! అందుకే కాంట్రాక్టు వదులుకున్నా. ప్రస్తుతం నాకు, 18 మంది కూలీలకు పని లేదు. ఊళ్లోనైనా ఏమైనా పనులు దొరుకుతాయని ప్రయత్నిస్తున్నా. సెల్ఫోన్ అమ్ముకుని ఊరికొచ్చా: నగేశ్, భవన నిర్మాణ కార్మికుడు, గట్టు, జోగులాంబ గద్వాల జిల్లా హైదరాబాద్లో భవన నిర్మాణ పనులతో క్షణం తీరిక లేకుండా ఉండేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత పనులు ఆగిపోయాయి. వేరే చిన్నా చితకా పనులు చేసుకుందామన్నా.. నగదు ఇబ్బందులతో ఎవరూ పని ఇవ్వడం లేదు. అక్కడ ఉండలేక, చార్జీలకు డబ్బుల్లేక నా సెల్ఫోన్ అమ్ముకుని ఊరికి వచ్చేశాను. ఉపాధి హామీ పని కల్పించాలని అడిగితే.. ఇప్పుడు లేవని అధికారులు అంటున్నారు. పని దొరకడం లేదు: బోయిని బుగ్గయ్య, బడెంపల్లి, వికారాబాద్ జిల్లా నెల నుంచి ముంబైలో పని దొరకడం లేదు. గతంలో చేసిన కూలీ డబ్బులు ఇంకా చేతికి రాలేదు. నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకూ కుటుంబ పోషణ భారంగా మారింది. చేసేదేమీ లేక సొంత గ్రామానికి వచ్చాం. ఉపాధి పనులడిగితే జాబ్కార్డు ఉందా అంటున్నారు. జాబ్కార్డు ఉంటేనే: గొల్ల గంగారాం, కిచ్చన్నపల్లి, సంగారెడ్డి జిల్లా నేను మెహిదీపట్నంలో అడ్డా కూలీని. నా భార్య భవన నిర్మాణ పనులు చేసేది. అక్కడ పనుల్లేక ఊరికొచ్చినం. ఉపాధి పనులు అడిగితే జాబ్కార్డు ఉండాలంటున్నారు. దరఖాస్తు చేసిన 15 రోజులకు వస్తదని చెప్పారు. వ్యవసాయ పనులైనా దొరుకుతాయని చూస్తున్నాం. పని దొరక్క వచ్చిన: వల్లెపు సంపత్, కొత్తకొండ, వరంగల్ అర్బన్ జిల్లా హైదరాబాద్ మేడ్చల్ ప్రాంతంలో భవన నిర్మాణ పనులతో పొట్టబోసుకునేవాడిని. కానీ పెద్దనోట్ల రద్దుతో యజమానులు నిర్మాణాలు ఆపేశారు. భార్య, కొడుకుతో కలిసి సొంతూరికి వచ్చేశాను. ఇక్కడ ఉపాధి పనులు లేవు. వ్యవసాయ పనులూ లేవు. రోజు గడుసుడే కష్టంగా ఉంది. ఇప్పుడు పనుల్లేవంటున్నారు: లక్ష్మణ్, కడ్తాల, రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో సెంట్రింగ్ పని చేసేవాడిని. ఇప్పుడు నిర్మాణ పనులు ఆపేశారు. పాత నోట్లకే పనులు చేస్తావా అని అడుగుతున్నారు. ఏం చేసుకోవాలి? సొంతూరికి వస్తే.. ఇక్కడ ఉపాధి పనులకు ఇది సీజన్ కాదంటున్నారు.


