breaking news
labor rights committee
-
మీ వెంటే.. మేము
అరండల్పేట (గుంటూరు) : రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాల్లో రైతులు ధైర్యంగా ఉండాలనీ, మీ వెంట మేమున్నామనీ, చివరి వరకు మీ తరఫున నిలబడి పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సోమవారం తుళ్లూరు మండల రైతులకు భరోసానిచ్చింది. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని రైతులు, కౌలు రైతులు, కూలీలు ,కుల వృత్తులు చేసుకునే వారి హక్కులను పరిరక్షించేందుకు అడుగడుగునా వెంట నడిచివస్తామని హామీ ఇచ్చింది. రాజధాని రైతుల, కూలీల, హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్, పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో మాజీ మంత్రి పార్ధసారథి, సీనీయర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), కొడాలి నాని, కోన రఘుపతి, ఉప్పులేటి కల్పన, ముస్తఫా, గొట్టిపాటి రవికుమార్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త క్రిస్టినా, తాడికొండ నియోజకవర్గ నాయకులు కత్తెర సురేష్ తదితరులు తుళ్లూరు మండలం బోరుపాలెం, లింగాయపాలెం, మందడం గ్రామాల్లో పర్యటించారు. తొలుత బోరుపాలెం గ్రామంలో రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులతో సమావేశం అయ్యారు. వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఎట్టి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే రైతు కూలీలు, కౌలు రౌతులు ఈ భూములపై ఆధారపడి ఉన్నామని, రాజధానికి భూములు ఇస్తే తమ బతుకులు ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రరాజధాని అందరికి సంబంధించిందని, టీడీపీ నాయకులకో, చంద్రబాబుకో సంబంధించిన అంశం కాదన్నారు. కొంత మంది రైతులు రాజధానికి తమ భూములు పోతున్నాయని, రాత్రిళ్లు నిద్రకూడా పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లింగాయపాలెం గ్రామంలో ... ఇక్కడ వైఎస్సార్ సీపీ నేతలు స్వయంగా పొలాల్లోకి వెళ్ళి పంటలను పరిశీలించారు. అక్కడ ఎన్ని పంటలు పండుతున్నాయి, ఎంత దిగుమతి వస్తుంది, ప్రస్తుత పరిస్థితులు రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతులు మాట్లాడారు. రాజధాని కోసం ప్రాణాలు అయినా ఇస్తాం కానీ, ఎట్టి పరిస్థితుల్లో సెంటు భూమి కూడా వదులుకొనేది లేదన్నారు. తమ భూములతో చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా అని ప్రశ్నించారు. ఏదో పది మంది రైతులు భూములు ఇస్తామంటే అందరు రైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. భూములు ఇచ్చి జానెడు పొట్ట కోసం ఎక్కడకు వెళ్లాంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మందడం గ్రామంలో.... ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో రైతులు మాట్లాడారు. తమకు ఏసీ ఇల్లు అవసరం లేదని, తమ బతుకులు తమను బతకనిస్తే చాలని తేల్చి చెప్పారు. మరెక్కడైనా రాజధాని నిర్మించుకోవాలని సూచించారు. కరకట్టకు ఆనుకుని ఉన్న పది గ్రామాలను రాజధాని భూముల జాబితాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజధానికి 30వేల ఎకరాలు ఎందుకు? రాజధాని నిర్మాణానికి 30వేల ఎకరాలు సేకరించడం ఎందుకో అర్థం కావడం లేదు. దేశంలోని ఏరాష్ట్ర రాజధాని కూడా ఇన్ని వేల ఎకరాల్లో లేదు. కేవలం ఆరు నుంచి 800ల ఎకరాల్లో రాజధాని నిర్మించుకోవచ్చు. మూడు పంటలు పండే బంగారు భూములను తీసుకుని ఇందులో రాజధాని నిర్మిస్తామంటే ఒప్పుకోం. అసలు ఇప్పటి వరకు భూసమీకరణకు విధి విధానాలు ఏంటో కూడా సరిగా చెప్పలేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడైనా సేకరించిన భూములకు సకాలంలో నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. - ఎన్.మల్లేశ్వరరావు, రైతు, బోరుపాలెం నెలకు రూ. 5వేలు జీవన భృతిగా ఇవ్వాలి మా గ్రామంలో 1500 మంది రైతు కూలీలు వ్యవసాయ భూములపై ఆధారపడి ఉన్నాం. వ్యవసాయ భూములు ఉంటేనే మాకు జీవనోపాధి . ఇప్పుడు ఈ భూములు లాక్కుంటే మాకు ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది. ఒక వేళ రాజధానికి భూములు తీసుకుంటే ఒక్కో కుటుంబానికి నెలకు రూ. 5వేలు చొప్పున జీవన భృతి అందజేయాలి. కౌలు రైతులకు బంగారు ఆభరణాలపై ఉన్న రుణాలను రద్దు చేయాలి. - వీరరాఘవులు, రైతు కూలీ, బోరుపాలెం చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లో నమ్మం. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం అన్నారు. అలాగే రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న ఆదర్శ రైతులను తొలగించారు. ఇప్పటి వరకు రుణ మాఫీ జరుగలేదు. అసలు చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లో నమ్మం. కష్ణానది కరకట్ట గ్రామాల ప్రజలు, రైతులు, భూములను ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. దౌర్జన్యం చేసి భూములు లాక్కుంటామంటే సహించేది లేదు. ఇక్కడ ఎకరాకు రూ. లక్ష కౌలు వస్తోంది. ఇక మీరిచ్చే రూ. 25వేలు దేనికి సరిపోతుంది. - దాసరి కోటేశ్వరరావు, రైతు, బోరుపాలెం ప్రజలను కాదంటే పతనం తప్పదు - ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ సీపీ కమిటీ కన్వీనర్ ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖంగా ఉన్నారని కొన్ని పత్రికల్లో కథనాలు చూసి నిజమే అనుకున్నామని, అయితే ఇక్కడ పరిస్థితి వేరుగా ఉందన్నారు. తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, వాస్తవ పరిస్థితులు తెలుసుకుని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి మాత్రమే ఇక్కడకు వచ్చామన్నారు. ఇందులో రాజకీయాలకు తావులేదని ఆయన చెప్పారు. {పజల మనోభావాలకు అనుగుణంగా ఏ ప్రభుత్వమైనా పనిచేయాలని లేకుంటే ప్రజా వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. రెండు దఫాలుగా ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, బోరుపాలెం, లింగాయపాలెం, మంద డం గ్రామాల్లో పర్యటించామని, అన్ని గ్రామా ల్లో రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని చెప్పారని ఇదే విషయాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, రైతుల పక్షాన పోరాడతామని ధర్మాన హామీ ఇచ్చారు. తప్పకుండా రైతుల, కూలీల హక్కులను పరిరక్షిస్తామన్నారు. నాకు పింఛను ఇప్పించాలి మూడు నెలలుగా పింఛను రావడం లేదు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పింఛను మంజూ రైంది. నాకు సెంటు భూమి కూడా లేదు. అయినా నా పేరును పింఛను లిస్టులో నుంచి తొలగించామని అధికారులు చెబుతున్నారు. ఎందుకు తొలగించారో చెప్పడం లేదు. వైఎస్సార్సీపీ నాయకులు కలగజేసుకుని నాకు పింఛను ఇప్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నా. - బొంతల కోటేశ్వరమ్మ, వృద్ధురాలు, బోరుపాలెం రైతులను ముష్టివాళ్లగా మార్చకండి రాజధానికి భూములు తీసుకుంటే నష్టపరిహారం ఎప్పటికి ఇస్తారో, చంద్రబాబు మాటమీద నిలబడతాడోలేదోనన్న భయంతో ఇప్పటి వరకు 3,800 ఎకరాల భూమిని రైతులు అమ్ముకున్నారు.ల్యాండ్ పూలింగ్ అంటే ఏమిటో ఎవరికి తెలియదు. ఇక్కడ ఎకరా భూమి రూ. 2 కోట్ల వరకు ఉంది. సంపదను సష్టించే భూములను కాకుండా వేరేప్రాంతంలో భూములు తీసుకొవచ్చు. ల్యాండ్ పూలింగ్కు చట్టబద్ధత లేదు. వైఎస్సార్సీపీ నాయకులు అసెంబ్లీలో రైతుల తరఫున పోరాడి మా భూములు పోకుండా చూడాలి. రైతులను ముష్టివారిగా మార్చవద్దు. - గాంధీ, రైతు, లింగాయపాలెం కూలీ ఆదాయం రోజుకు రూ. 800 మాగ్రామంలో 2500 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ 365 రోజులు పని ఉంటుంది. నాలుగు పంటలు పండిస్తాం. ఇక్కడ కూలీలకు రోజుకు రూ. 800లు వస్తోంది. అందరం సంతోషంగా ఉన్నాం. ఎక్కడైనా మెట్ట భూముల్లో రాజధాని నిర్మించుకోండి. ఈ కరకట్ట భూములైన 5వేల ఎకరాలు రాజధాని నుంచి మినహాయించాలి. లేకుంటే ఏపోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం. - మాదల మహేంద్ర, రైతు, లింగాయపాలెం జానెడు పొట్ట కోసం ఎక్కడికి పోవాల ఇక్కడ పంటలు పండే భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాం. రైతుల పంట భూములు లాగేసుకుంటే మేము ఎలా బతకాలి. రోజు నిద్రలేని రాాత్రులు గడుపుతున్నాం. పచ్చని పంటపొలాలను ఎందుకు లాక్కుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. జానెడు పొట్ట కోసం మేము ఎక్కడికి పోవాలి. రాజధానిలో మమ్మల్ని బతకనిస్తారా... తీసుకెళ్ళి మమ్మల్ని అడవుల్లో వదిలి పెడతారా. - భాను, వ్యవసాయ కూలీ, లింగాయపాలెం పోరాటానికి సిద్ధమవుతాం. చంద్రబాబు రైతుల కోసం ఇప్పటి వరకు చేసిందేమీలేదు. ఇక్కడ మేమంతా పంటలు పండించుకుంటూ సంతోషంగా ఉన్నాము. ఈ భూమి మీదే ఆధారపడి ఏళ్ళతరబడి జీవిస్తున్నాము. రుణమాఫీ కూడా చేయని చంద్రబాబును నమ్మలేము. ప్రభుత్వంలోని భూ సమీకరణపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. వ్యవసాయ రైతులు, కూలీలు, కౌలు రైతులు, ఉపాధి కోల్పోతారు. భూములు దక్కించుకునేందుకు పోరాటానికి సిద్ధమవుతాం. - బి.సాంబశివరావు, రైతు, మందడం చంద్రబాబు మారిపోయారు. ఇక్కడ భూములు ఇచ్చేందుకు ఏఒక్క రైతుకు ఇష్టం లేదు. చంద్రబాబు సింగపూర్బాబుగా మారిపోయారు. సింగపూర్ భౌగోళిక స్వరూపానికి, ఇక్కడికి ఎంతో తేడా ఉంది. పది మంది రైతులు చెబితే అందరూరైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు ప్రచారం చేయడం సమంజసం కాదు. కృష్ణానది కరకట్టన కేవలం ధనికులు ఉండాలన్న కోరికతోనే చంద్రబాబు ఇక్కడ రైతుల నుంచి భూములు లాక్కుంటున్నాడు. - జక్రయ్య, కౌలు రైతు, మందడం ఎవరిపై ఆధారపడాలి మాకు అర ఎకరం పొలం ఉంది. నాన్న పక్షవాతంతో బాధపడుతున్నారు. నెలకు వైద్య ఖర్చులకు అనేక ఇబ్బందులు పడుతున్నాం. అన్నయ్య వడ్రంగిపనులు చేస్తున్నాడు. అయితే మాకున్న అర ఎకరం పొలం ఇచ్చి ఎవరిపై ఆధారపడాలి. ఎట్టిపరిస్థితుల్లో భూమి ఇచ్చే పరిస్థితి లేదు. - సాయిలత, మహిళ రైతు, మందడం కన్నీటితో వేడుకుంటున్నా.. భూములు లాక్కోవద్దు.. మాది తాళాయపాలెం, మాకు ఎకరం పొలం ఉంది. నా భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఆమెకు వైద్య ఖర్చులు నెలకు రూ. 50వేలు అవుతుంది. ఇప్పటికే రూ. 15 లక్షలు అప్పు చేశాను. రాజధాని ప్రకటించిన తరువాత కనీసం అప్పుడు కూడా ఇవ్వడం లేదు. ఈ ఎకరం పొలం కూడా ప్రభుత్వం లాక్కుంటే మేము ఎలా బతకాలి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. - కొండెపాటి రాములు, రైతు, మందడం -
అన్నదాతకు అండగా.. మళ్లీ పర్యటన
సాక్షి,గుంటూరు: రాజధాని నిర్మించతలపెట్టిన గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సోమవారం మధ్యాహ్నం నుంచి మళ్లీ పర్యటించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. 12 గంటలకు గుంటూరులోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై ఒంటి గంటకు కమిటీ బోరుపాలెం చేరుకుంటుందని తెలిపారు. కమిటీ మొదటి విడతగా ఈ నెల 13వ తేదీన తాడేపల్లి మండలం ఉండవల్లి నుంచి పర్యటన ప్రారంభించి పెనుమాక, మంగళగిరి మండలం నిడమర్రు గ్రామాల్లో రైతుల అభిప్రాయాలను సేకరించింది. రెండో రోజు తుళ్లూరు మండలంలో పర్యటించాల్సి ఉండగా, వర్షం కారణంతో వాయిదా వేశారు. తిరిగి తుళ్లూరు మండలం బోరు పాలెం, లింగాయపాలెం, మందడం గ్రామాల్లో కమిటీ పర్యటిస్తుందని మర్రి రాజశేఖర్ తెలిపారు. కమిటీ కన్వీనర్ ధర్మాన ప్రసాదరావు, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి పార్ధసారథి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామ కృష్ణారెడ్డి (ఆర్కే), గొట్టిపాటి రవికుమార్, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, జలీల్ఖాన్, ముస్తఫా, రైతు సంఘం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, తాడికొండ సమన్వయ కర్త క్రిస్టినా, తాడికొండ ముఖ్య నేత కత్తెర సురేష్తో పాటు పార్టీ నాయకులు పాల్గొంటారని తెలిపారు. కమిటీ గ్రామాల్లో పర్యటించి రైతులు, కౌలు రైతులు, కూలీలు, ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోందని వివరించారు. భూ సమీకరణ ద్వారా గ్రామాల్లో తలెత్తే ఇబ్బందులు,రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. అంతేగాక రాజధాని నిర్మించతలపెట్టిన గ్రామాల ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతోపాటు వారి అభిప్రాయాలను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నివేదిస్తారని తెలిపారు. ఆ ప్రాంత రైతులు, కూలీలు తమ అబిఫ్రాయాలను కమిటీ ఎదుట తెలియజే యాలని మర్రి రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. -
రాజధాని రైతుకు భరోసా
{పతిప్రాదిత గ్రామాల్లో పర్యటనకు శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ కమిటీ తొలి రోజు ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల రైతులతో ముఖాముఖీ ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సహించబోమని వైఎస్సార్ సీపీ నేతల స్పష్టీకరణ ముఖ్యమంత్రి, టీడీపీ నేతల వైఖరికి అడ్డుకట్ట వేయాలని కోరిన ఆయా గ్రామాల రైతులు {పాణాలైనా ఇస్తాం గానీ భూములు ఇచ్చేదిలేదని తెగేసి చెప్పిన అన్నదాతలు గుంటూరు సిటీ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ గురువారం జరిపిన పర్యటన బాధిత రైతుల్లో భరోసా నింపింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నేతల వైఖరితో ఆందోళన చెందుతున్న ఆయా గ్రామాల రైతుల్లో నమ్మకాన్ని కలగజేసింది. నాయకులంతా మూకుమ్మడిగా తమ గ్రామాలకు తరలి రావడం, జోరు వానలో కూడా బురదలో నడుస్తూ సారవంతమైన తమ పొలాల్లో పర్యటించడం వారిలో నూతనోత్తేజాన్ని రేకెత్తించింది. రైతులు, రైతు కూలీలు, కౌలుదారుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సహించబోమని వైఎస్సార్ సీపీ నేతలు సంఘటితంగా స్పష్టం చేయడంతో వారికి తమ భూముల పట్ల, భవితపై నమ్మకం కుదిరింది. ఉదయం ఉండవల్లి నుంచి ప్రారంభమైన కమిటీ పర్యటన పెనుమాక, నిడమర్రు గ్రామాల్లో సాగింది. ► మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో మాజీ మంత్రి పార్ధసారథి, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), కోన రఘుపతి, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, ముస్తఫా, గొట్టిపాటి రవికుమార్, రైతు నేత ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు గ్రామాల్లో పర్యటించారు. ► అక్కడి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. స్వయంగా పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలించి రైతుల స్థితిగతులను అంచనా వేశారు. రైతుల ఆవేదనను ఆలకించారు. తొలుత రాజధాని నిర్మాణానికి పొలాలిచ్చే అంశంపై ఉండవల్లి ఉగ్రరూపం దాల్చింది. ఊరు ఊరంతా ఉవ్వెత్తున విరుచుకుపడింది. ప్రాణాలైనా ఇస్తాం కానీ పొలాలిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మా సమాధులపై సింగపూర్ కడతారా? అని ప్రశ్నించింది.పెనుమాక పెనుకేక పెట్టింది. లాఠీలు, తూటాలకు బెదరనంది. ప్రభుత్వ ప్యాకేజీలకు లొంగనంది. ప్రభుత్వం తమ పొలా ల జోలికొస్తే తరిమి తరిమి కొడతానంది. నిడమర్రు చిర్రు బుర్రులాడింది. ఎకరం కూడా ఇచ్చేది లేదని ఏకగ్రీవంగా తీర్మానించింది. కావాలంటే ఎకరానికో రూ. లక్ష చొప్పున రాజధాని నిర్మాణానికి చందా ఇస్తానంది. సారవంతమైన తమ పొలాలు వదిలేసి వేరే ఎక్కడైనా నిర్మించుకోవాలని హితవు పలికింది.కమిటీ నేతల ఎదుట రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పసిడి రాశులు పండించే భూములను చిన్నాభిన్నం చేసే చంద్రబాబునాయుడు ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని మనవి చేసుకున్నారు. ఈ సమయంలో తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదనీ, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి మాత్రమే తామీ పర్యటనకు వచ్చామనీ, ఇందులో రాజకీయానికి తావు లేదనీ చెప్పిన వైఎస్సార్ సీపీ నేతల మాటలకు స్థానిక రైతుల్లో అనూహ్య స్పందన కనిపించింది. ఇంతటితో ఆగమని, దఫదఫాలుగా పర్యటిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదనీ పదే పదే చెప్పడంతో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు ప్రజలు,రైతులు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా హక్కుల కమిటీ ముందుంచా రు. ఆయా గ్రామాల రైతుల అభిప్రాయాలు వారి మాటల్లోనే...... తిరుగుబాటు చేస్తాం.. మావి సారవంతమైన భూములు. తరతరాలుగా పొలాలు నమ్ముకుని బతుకుతున్నాం. అమ్ముకుని కాదు. ఎట్టి పరిస్థితుల్లో గజం భూమి కూడా ఇచ్చేది లేదు. మాకే ప్యాకేజీలు అక్కర్లేదు. కాదూ కూడదని లాక్కునే ప్రయత్నం చేస్తే తిరుగుబాటు చేస్తాం. అప్పుడు మమ్మల్ని చంపి మా సమాధులపై సింగపూర్ తరహా రాజధాని కట్టుకోమనండి. - పి.శంకర్రెడ్డి, రైతు, ఉండవల్లి మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె... రైతులకు సాగునీరు ఇవ్వడం చేతకాదు కానీ చంద్రబాబుకు వారి పొలాలు మాత్రం కావాల్సి వచ్చాయా? రాజధాని విషయంలో ఆయన వ్యవహారం చూస్తుంటే మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా ఉంది. ఇటు రైతులు, అటు ప్రజలు ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా ఆయన నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము ఆమోదించాలా? ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వం. - శివశంకరరావు, ఉండవల్లి రుణమాఫీకి పనికిరావు కానీ... మీ పొలాల్లో సాగవుతుంది ఉద్యాన పంటలు కాబట్టి మీకు రుణమాఫీ వర్తించదన్నారు. సరే బాగానే ఉంది. రుణమాఫీకి పనికిరాని పొలాలిప్పుడు రాజధాని నిర్మాణానికి మాత్రం ఎలా పనికొస్తాయి. సారవంతమైన భూములు కాబట్టే రుణమాఫీ వర్తింపజేయ లేదు. అలాంటి మా సస్యశ్యామల భూముల్ని వదిలి పనికి రాని పొలాలుంటే చూసుకుని అక్కడ రాజధాని నిర్మాణం చేపట్టండి. - విశ్వనాథం, మాజీ ఆదర్శ రైతు, పెనుమాక ఏకగ్రీవంగా తీర్మానించాం... రాజధాని నిర్మాణ విషయమై గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు విని తీవ్ర ఆందోళనకు లోనయ్యాం. చివరకు మేమంతా కలసి కట్టుగా ఆలోచించుకుని రాజధాని నిర్మాణానికి మాగ్రామం నుండి ఒక్క ఎకరం కూడా ఇవ్వకూడదని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాం. చాలా కష్టపడి పొలాలు సాగుచేసుకుని చివరికి వైఎస్సార్ పుణ్యమాని వచ్చిన ఎత్తిపోతల పథకం వల్ల ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. ఈ తరుణంలో రాజధాని పేరిట చంద్రబాబు మాకు టోకరా వేయాలని చూస్తే నమ్మేంత వెర్రి బాగుల వాళ్ళం కాదు. - గాదె వీరాంజనేయరెడ్డి, ఎత్తిపోతల పథకం గౌరవ అధ్యక్షుడు, నిడమర్రు. మా పొట్ట కొట్టొద్దు.. పొలాల్లో పని చేయడమొక్కటే మాకు తెలుసు. ఏళ్ల తరబడి రైతు కూలీలుగానే జీవనాధారాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పుడొచ్చి రాజధాని పేరిట ఈ పొలాలు లాక్కుంటామని అంటున్నారు. అదే గనక జరిగితే, ఈ పొలాలే లేకుంటే మేమెక్కడికి పోయి బతకాలి. రాజధాని అవసరమే. కాదనడం లేదు. అయితే దయచేసి మా ఊరును మాత్రం వదిలిపెట్టండి. మా పొట్ట కొట్టకండి. - చిట్టెమ్మ, రైతు కూలీ, నిడమర్రు రాజధాని నిర్మాణానికి చందాలిస్తాం, రాజధాని నిర్మాణానికి అవసరమైతే మా గ్రామంలో ఎకరానికి లక్ష రూపాయల చొప్పున చందా ఇస్తాం కానీ సారవంతమైన మా చేల జోలికి మాత్రం రావద్దు. ఏడాదికి ఎకరానికి లక్షా 40వేల రూపాయలు కౌలు రూపంలోనే మాకు ఆదాయం వస్తుంది. అంత ఆదాయాన్నిచ్చే పొలాన్ని మీ మాటలు నమ్మి మీకిచ్చేందుకు మేము సిద్ధంగా లేము. మేమిచ్చే చందాలు తీసుకుని వేరే ఎక్కడైనా రాజధాని నిర్మించండి. - శ్రీనివాసరెడ్డి, నిడమర్రు పొలాలిచ్చేందుకు సిద్ధంగా లేం.... తాడేపల్లి మండలంలోని ఏ గ్రామం కూడా పొలాలిచ్చేందుకు సిద్ధంగా లేదు. ఇటు అధికారులు, అటు పాలకులు ఈ విషయమై చెబుతున్నవన్నీ అవాస్తవాలే. ఆ గ్రామం సిద్ధంగా ఉంది. ఈ గ్రామం సిద్ధంగా ఉంది. అంటూ పాలకులు చెబుతున్నవన్నీ నిజం కాదు. వాస్తవానికి ఒక్కరంటే ఒక్క రైతు కూడా వీసమెత్తు స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. మేం అన్ని గ్రామాల్లో తిరిగి రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నాం. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోం. -దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ ఎంపీపీ, తాడేపల్లి