breaking news
krishnarayapuram
-
వీడని తనూజ కేసు మిస్టరీ
పెందుర్తి : కృష్ణరాయపురంలో ఓ అపార్ట్మెంట్ పక్కన అనుమానాస్పదంగా మృతి చెందిన 14 ఏళ్ల బాలిక తనూజ కేసులో పురోగతి అంతగా లేదు. బాలిక మరణం ఇంకా మిస్టరీగానే ఉంది. పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించినప్పటికీ అవి కేసును ఛేదించలేకపోతున్నాయి. మంగళవారం వచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో బాలికది అసహజ మరణం అని మాత్రం స్పష్టమైంది. తీవ్రమైన గాయాలు, ఒంట్లో ఎముకలు విరిగిపోవడంతోనే ఆమె మరణించిందని వైద్యులు నివేదిక ఇచ్చారు. అంతకుమించి ఆధారాలు ఆ రిపోర్ట్లో లేవని పోలీసులు చెబుతున్నారు. కేసులో మరిన్ని ఆధారాల కోసం బాలిక కీలక శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. మరో పది రోజుల్లో రిపోర్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నివేదిక వస్తే కేసు మిస్టరీ కొంత వరకు వీడవచ్చునని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు బాలిక స్నేహితుడిపైనే దృష్టి సారించిన పోలీసులు ఇప్పుడు మరో కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. తనూజ స్నేహితుడి ప్రమేయాన్ని బలంగా విశ్వసించిన పోలీసులు అతడితో పాటు మరో ఇద్దరి అదుపులోనికి తీసుకుని విచారించారు. కానీ నిందితుల్లో ఒకడిగా భావించిన యువకుడి మేనమామతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు మంగళవారం రాత్రి విడిచిపెట్టారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో తనూజ స్నేహితుడు మాత్రమే ఉన్నాడు. వీరి నుంచి ఎటువంటి సమాచారం లభించలేదని బోగట్టా. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని ఆ యువకుడు చెబుతున్నట్లు తెలిసింది. పాపం ఎవరిదీ? తనూజ ఓ యువకుడితో అపార్ట్మెంట్లోకి వెళ్లడం చూశామని ఆ అపార్ట్మెంట్ వాచ్మన్తో పాటు స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది ప్రశ్న తేలడం లేదు. ఈ ప్రాంతంలో నిత్యం రాత్రి సమయంలో మద్యం సేవించి రోడ్లపై తిరిగే ఆకతాయిలు కోకొల్లలు. రౌడీ గ్యాంగ్లకు లెక్కే లేదు. ఒకవేళ ఇంట్లో నుంచి వచ్చేసిన తనూజ వారి వలలో చిక్కుకుపోయిందా? అన్న సందేహం కూడా స్థానికంగా వ్యక్తమవుతోంది. -
తనూజ మృతిపై వీడని మిస్టరీ
-
తనూజ మృతిపై వీడని మిస్టరీ
విశాఖపట్నం : విద్యార్థిని తనూజ మృతి కేసులో మిస్టరీ వీడలేదు. ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులు తమ దర్యాప్తు ముమ్మరం చేశారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనూజ హత్య కేసులో బంధువుల ప్రమేయంపై కూడా పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులోభాగంగా బంధువుల ప్రమేయంపై పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కృష్ణరాయపురంలో తనూజ తన తల్లిదండ్రులతో కలసి నివసిస్తుంది. అయితే శనివారం సాయంత్రం సెల్ ఫోనులో అదే పనిగా స్నేహితుడు మాట్లాడటంతో తనూజను తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆగ్రహించిన ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరునాడు ఆదివారం ఉదయం వారి ఇంటి సమీపంలో తనూజ నగ్న మృతదేహం పడి ఉంది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఆమె స్నేహితుడుతోపాటు అతడి స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. -
ఎంత పనిచేశావు చిట్టితల్లీ!
పెందుర్తి: తల్లి మందలించిందని జనారణ్యంలోకి అడుగు పెట్టిన బాలిక.. కొద్ది గంటలు కూడా కాకముందే ప్రాణాలు పోగొట్టుకుంది. ఓ యువకుడితో మాట్లాడిందని అమ్మ మందలించడంతో అలిగి బయటకు రావడమే ఆమె పాలిట శాపమైంది. బాలిక మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెందుర్తి పోలీస్స్టేషన్ పరిధి కృష్ణరాయపురంలో జరిగిన ఈ ఘటన నగరవ్యాప్తంగా సంచలనం రేపింది. వివరాలివి.. కృష్ణరాయపురంలో నివాసం ఉంటున్న కె.నాగేశ్వరరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్నకుమార్తె తనూజ (14) పురుషోత్తపురంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజూ ఇంటి నుంచి పాఠశాలకు నడుచుకుని వెళ్లివస్తుంది. శనివారం తనూజ పాఠశాల నుంచి ఓ యువకుడితో కలిసి వస్తుండగా ఆమె అక్క చూసింది. విషయాన్ని తల్లికి చెప్పడంతో శనివారం రాత్రి తనూజని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన తనూజ ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉంటున్న స్నేహితురాలి వద్దకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అదే అపార్ట్మెంట్ వద్ద ఆమె స్నేహితురాలు ఉంటున్న ఫ్లాట్కి కింద ఉన్న గోడకు ఆనుకుని తనూజ మృతదేహం ఆదివారం ఉదయం కనిపించింది. దీంతో స్థానికులు తనూజ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి దిలీప్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యువకుడి తల్లిదండ్రులను కూడా ప్రశ్నిస్తున్నారు. తనూజ మృతదేహానికి వైద్యులు ఇవాళ పోస్ట్మార్టం నిర్వహించనున్నారు. అనుమానాలెన్నో.. మరోవైపు తనూజ మరణం మిస్టరీగా మారింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన తనూజ స్నేహితురాలు ఉంటున్న అపార్ట్మెంట్ వైపు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. తనూజ స్నేహితురాలి వద్దకు వెళ్లి ఉంటే ఆ సమాచారం తల్లిదండ్రులకు చేరేది. ఎందుకంటే తనూజ రాత్రి 7 గంటలకు బయటకు రాగా రాత్రి 1 గంట వరకు ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం గాలిస్తున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీసిన తరువాత రాత్రి 1 గంటకు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే తనూజ వెళ్లినట్టు చెబుతున్న స్నేహితురాలిని కూడా వీరు ఆరా తీసి ఉంటారు. మరో కోణంలో చూస్తే తనూజ మాట్లాడిన యువకుడు ఓ బ్యాచ్ తో ఉన్నట్లు సమాచారం. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తనూజ ఆ యువకుడిని కలిసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆ గ్యాంగ్తో కలిసి తనూజపై ఆ యువకుడు లైంగికదాడికి పాల్పడి ఆమెను హతమార్చాడా అన్నది మరో అనుమానం. తనూజ మృతదేహంపై సగం వస్త్రాలు, రక్తస్రావం ఆనవాళ్లు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఆమె ముఖంపై మాత్ర మే తీవ్ర గాయాలుండడంతో అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందనుకోవడానికి ఆస్కారం తక్కువ. తనూజను హతమార్చి ఈ అపార్ట్మెంట్ వద్ద మృతదేహాన్ని పడేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఘటనా స్థలానికి వంద మీటర్ల దూరంలో పోలీసుల నైట్బీట్ పాయింట్ ఉండడం గమనార్హం. ముమ్మర దర్యాప్తు తీవ్ర సంచలనం రేపిన తనూజ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఏసీపీ భీమారావు, సీఐ జె.మురళి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులతో పాటు స్నేహితులను, స్థానికులను విచారించారు. తనూజతో మాట్లాడినట్లు చెబుతున్న యువకుడిని తక్షణమే అదుపులోనికి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. డాగ్స్క్వాడ్ను రప్పించి తనిఖీ చేయించారు. ఘటనపై సీపీ యోగానంద్ ఫోన్ ద్వారా ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ భీమారావ్ మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మరిని నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.