breaking news
Kondavidu
-
ప్రబంధం
కొండవీడు క్రీ.శ.1515 పల్లకీకి అడ్డుగా వచ్చినందుకు భటుడి తాపుకి అటుగా వెళుతున్న చాకలివాని గాడిద మీద పడ్డాడు దండిభట్టు. ‘ఛీ గాడిదా!’ అన్నాడు భటుడు. ఆ మాట దండిభట్టును అన్నాడో గాడిదను అన్నాడో తెలియలేదు. పల్లకీ నిలిచిపోయింది. ‘ఎందుకురా దానినంటావ్? మీ ఆంధ్రదేశంలో కవులకంటే గాడిదలే నయం. కనీసం మాసినగుడ్డలైనా మోస్తాయ్’ అన్నాడు పల్లకీలోని హమ్మీరపాత్రుడు. ఆ తర్వాత అతని చూపు దండిభట్టు మీద పడింది. ‘ఏమయ్యా కవిగార్ధభా. దుక్కలా ఉన్నావ్. ఏదన్నా పనీపాటా చేసుకోలేవూ?’ అని ఛీత్కరిస్తూ ముందుకు సాగాడు. దండిభట్టుకి కోపమొచ్చింది. ‘విద్యానగరం కృష్ణరాయలు ఉదయగిరి పట్టాడట. ఇంకెంతో కాలం లేదులే. నీ చావు మూడిందిలే. నీవూ నీ వడ్డెరాజూ మట్టిగొట్టుకుపోతారులే’ అని మనసులో తిట్టుకున్నాడు. దండిభట్టు ఉద్దండపిండం. అనేక యక్షగానాలు రచించాడు. అతడు రచించిన ‘ఊర్వశీ పురూరవం’అనే ప్రబంధం అర్థ్ధశబ్దాలంకారాలలో, అష్టాదశవర్ణనలలో దానికదే సాటి. కానీ గజపతుల పాలనలో తెలుగు కావ్యానికి ఆదరణే లేదు. ‘శ్రీనాథ కవిసార్వభౌముడినే అష్టకష్టాలకి గురిచేసిన ఈ వడ్డెరాజులని ఆశ్రయించబూనడం నాదే తప్పు. కళకి గుర్తింపులేని ఈ సీమలో ఇక మనలేను. తక్షణమే దేశం విడిచి పోతాను’ అని ఉబుకుతున్న కన్నీళ్లని అణచుకుంటూ, తాను చిన్ననాటి నుండి ఎరిగిన నూనె వర్తకుడికి తన గోడు వెళ్లబోసుకున్నాడు దండిభట్టు. ‘ఎక్కడికి పోతావయ్యా భట్టూ? రాజమహేంద్రంలో రెడ్డిరాజుల వైభవం వీరభద్రారెడ్డితోనే నశించింది. ఓరుగల్లు తురకల వాతబడింది. రాచకొండ వెలమలు అన్నీ వదిలిపెట్టి వెలుగోడులో తలదాచుకున్నారు. ఇక మిగిలింది కర్నాటకం. అంతదూరం ఏం పోతావ్? కమ్మనాటిలో నాకు తెలిసిన చౌదరయ్య ఉన్నాడు. నీలాంటి పండితులంటే ప్రాణంపెట్టే చోడరాయుడు. ఒక్కగానొక్క కూతురు! ఆమెకి మంచి గురువు కావాలని అడిగాడు. నీ ప్రబంధం చూస్తే నాలుగూళ్లు ఇచ్చి జీవితాంతం పోషించగలడు. నేనెలాగూ అటే పోతున్నాను. నాతో కూడా రా’ అని సముదాయించాడు. చోడరాయుడిది కమ్మనాటిలో నూరుగ్రామాల సంస్థానం. వందమంది అశ్వికులు, దానికి పదిరెట్లు కాలిబంట్లతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే సైన్యం. తీరంలో ఉప్పుమళ్లు, రంగుబట్టల నేతగాళ్లు, కాల్పట్టణం రేవు సుంకాలు, జీడి, తమలపాకుల తోటల నుండి వచ్చే ఆదాయం వల్ల మహల్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నర్తిస్తూ ఉంటుంది. ఆశ్రీతులకూ, కవి పండితులకూ కల్పతరువు. ఇంతున్నా రాయుడికి పుత్రసంతానం లేదు. ఒక్కర్తే కూతురు! ఆమె గురువుగా చోడరాయుడి కొలువులో అన్ని సౌకర్యాలూ ఉన్నా దండిభట్టు మనసు మనసులో లేదు. ఉదయాన్నే పట్టుబట్టలతో, తలపై కురుమాపు పాగాతో మహల్ వెలుపల తోటలోని నృత్యమంటపం చేరుకున్నాడు. నల్లరాతి స్తంభాలపై అపూర్వ శిల్పసంపద, నిలువెత్తు కలంకారీ తెరల మధ్య, రంగవల్లులు చిత్రించిన చలువరాతి నేలపై, వెండిరేకుతో తాపడం చేసిన దేవదారు తమ్మపడిగిపై కూర్చొని శిష్యురాలి రాకకోసం ఎదురు చూడసాగాడు. అతడి ఆలోచనలన్నీ ఆమె మీదే! తప్పని తెలుసు. శిష్యురాలు కూతురుతో సమానం. కానీ ఆమె సమక్షంలో ఏదో నిస్సహాయత ఆవరిస్తోంది. ఆమె సౌందర్యం అలాంటిది. పండితుడనని నమ్మి కూతురి విద్యాభ్యాసాన్ని తనకప్పగించిన రాయుడికి ఆగ్రహం కలిగించడం ఆత్మహత్యా సదృశమే. తెల్లని కావంచు పరికిణీ, అదే రంగు పైటతో, సగమారిన కేశాలని జారుముడి వేసి, మెడలో సంపెంగమాల తప్ప వేరే ఆభరణాలు లేకుండా నెమలి నడకలతో ఎదురుగా వచ్చి కూర్చొన్న శిష్యురాలిని చూస్తూ కళ్లార్పలేకపోయాడు దండిభట్టు. పాట మొదలెట్టింది. అది తాను రచించిన ‘హైమవతీ కల్యాణం’ అనే యక్షగానంలోని ఘట్టం! తపోదీక్షలో ఆమెని పట్టించుకోని పరమశివుని కోసం, అభిసారికయై ఎదరుచూస్తున్న పార్వతిలా, శివరంజని రాగంలో ఆలపించసాగింది శిష్యురాలు. విరహాగ్నిలో దహించుకుపోతూ యవ్వనాన్ని ఎరగట్టి నాయకుడిని తన పొందుకు ఆహ్వానిస్తున్నట్లు ఆ అందాలరాశి పాడే ఒక్కొక్క చరణం అతడి గుండెని అదుపుతప్పేలా చేస్తోంది. తమకంతో చేయి పట్టుకున్నాడు. గురువు స్పర్శకి ఒక్క క్షణం ఏమీ తోచక నివ్వెరపోయిందా పదహారేళ్ళ ఆడబడుచు. కందిపోయిన లేతరెమ్మలాంటి మణికట్టుని విడిపించుకొని ఆందోళనతో ఇంటివైపు పరుగెత్తింది. చేతజిక్కిన ఆమె పెచైంగుని చూస్తూ నిశ్చేష్టుడై నిలిచిపోయాడు దండిభట్టు. కళింగాన్ని జయించి కొండవీడు వచ్చిన శ్రీకృష్ణదేవరాయల విజయస్కంధావారంలో కవితాగోష్ఠికి దండిభట్టుకి ఆహ్వానం దొరికింది. చక్రవర్తి ఎదుట ‘ఊర్వశీ పురూరవం’ ప్రబంధం వినిపించసాగాడు.చిన్న తప్పిదానికి తనను వీడిపోతున్న అప్సరస ఊర్వశిని గూర్చి విలపిస్తూ, పురుచక్రవర్తి పాడే ఒక్కొక్క పద్యంలో, కవి మనఃఫలకం ముందు అర్ధనగ్నంగా పారిపోతున్న ఆమె రూపే ప్రత్యక్షమై వింటున్న సభికుల కళ్ళలో నీళ్ళునింపాయి. ఆ కవి తన్మయత్వానికి ప్రతిస్పందించని పండితుడు లేడు.రాయలవారి చేతులు ఆనందపారవశ్యంతో అతడిని బంధించాయి. ‘ఆహా, ఎంత సహజమైన వర్ణన! తమ కవితావేశానికి ప్రేరణనిచ్చిన ఆ సౌందర్యమూర్తి ఎవరో సెలవిస్తే సంతోషిస్తాం’ అన్నారు రాయలవారు. దండిభట్టుకి రాయలవారి ప్రశంసకన్నా చోడరాయునిపై పగతీర్చుకునే అవకాశం వచ్చిందనే ఆనందమే ఎక్కువయింది. ఆనాడు... కూతురి చేయి పట్టుకున్నందుకు కాల్పట్టణపు వీధుల్లో తనను బెత్తాలతో కొట్టించి, నగ్నంగా పరుగెత్తించిన ఆ చౌదరయ్యను అతడు మర్చిపోలేదు. జరిగిన సంఘటనలో తన తప్పేమీ కనపడలేదు. అమాయకంగా కనిపిస్తూ ఓరచూపులతో, వలపు పాటలతో, తన నిగ్రహాన్ని ఛేదించిన ఆమె ఒక కామపిశాచి అన్నదే ఆ ఉన్మాది పిచ్చి ఆలోచన! ‘ప్రభూ! ఆమె ఎవరో కాదు, కమ్మనాటి చోడుని కుమార్తె. తన నగరిలో రాణీవాసానికి అర్హురాలు. కానీ...’ అని తటపటాయించాడు. ‘సందేహమెందుకు కవివర్యా?’ ‘చోడుడు ఓడ్ర గజపతికి ఆప్తుడు. తమతో వియ్యానికి అంగీకరించడేమో?’ ‘వియ్యం కాకపోతే కయ్యం. కావలసిన సైన్యంతో తమరే స్వయంగా వెళ్ళి మా ఆజ్ఞని చోడుడికి తెలియపర్చగలరు’ అన్నాడు రాయలు. విజయనగర మదగజాల పదఘట్టనలకి కాల్పట్టణం నేలమట్టమయింది. ఎదురుతిరిగిన చోడుడ్ని ఇనుపశూలకెక్కించి, తన అవమానాన్ని కళ్లజూసిన పౌరుల ఇళ్లు తగులబెట్టించి, తనను కాదన్న ఆమెను నగ్నంగా బండికొయ్యపై కట్టి, ఎండలో ఒంగేరు మార్గమంతా ఊరేగిస్తూ, వెర్రినవ్వుతో అట్టహాసం చేస్తూ కొండవీడు చేరాడా మదోన్మాది దండిభట్టు. తన కవితావ్యామోహం, కవి పండిత పక్షపాతంతో అనాలోచితంగా చేసిన నిర్ణయంవల్ల వచ్చిన అనర్థాన్ని తెలుసుకొన్న రాయలవారి మనస్సు పశ్చాత్తాపంతో కుంగిపోయింది. మానవ మృగమైన ఆ కుకువి దండిభట్టు నుదురుపై కుక్క పాదం ముద్ర వేయించి, దేశాన్నుంచి బహిష్కరించాడు. తన దుర్నిర్ణయానికి కారణమైన ప్రబంధాన్ని స్వహస్తాలతో అగ్నికి ఆహుతి చేసినా రాయలవారి మనసు చల్లారలేదు. సాయి పాపినేని -
గుప్తనిధుల కోసం వేట
విద్యానగర్(గుంటూరు) గుంటూరు రూరల్ మండలంలోని కొండవీడు ప్రాంతంలో గుప్తనిధుల కోసం రహస్య తవ్వకాలు జరుగుతున్నారుు. బడా నేతల అండదండలతో దుండగులు రాత్రి సమయంలో రెచ్చిపోతున్నారు. వంట సామగ్రి, తాగునీరు, ఇతర నిత్యావసరాలను ముందుగానే నిల్వ చేసుకుని మరీ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. జంతుబలులు, క్షుద్రపూజలు చేస్తున్నారు. పొలాలకు నీరు పెట్టేందుకు రాత్రి పూట ఆ ప్రాంతం మీదుగా వెళుతున్న రైతులు, పశువుల కాపర్ల ద్వారా విషయం తెలియటంతో సమీప గ్రామాల ప్రజలు భయూందోళనకు గురవుతున్నారు. గుప్తనిధుల కోసమే తవ్వకాలు జరుపుతున్నట్టు అక్కడ లభించిన ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నారుు. తవ్వకాల గురించి తెలిసినప్పటికీ పోలీసులు, అధికారులు పట్టించుకోకపోవటం విస్మయం కలిగిస్తోంది. వెంగళాయపాలెం, ఓబులునాయుడుపాలెం, నాయుడుపేట, పొత్తూరు గ్రామాల పరిధిలో ఉన్న కొండవీడు కొండల్లో తవ్వకాలు జరుగుతున్నారుు. దాదాపు 20 నుంచి 25 మంది గ్రూపుగా ఏర్పడి వీటిని చేపడుతున్నారు. దీనికోసం పెద్ద రాళ్ళ మధ్య నివాసాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. కనీసం నెల రోజులకు సరిపడా బియ్యం, ఇతర వంట సామగ్రి, గ్యాస్, మినరల్ వాటర్ బాటిళ్లు తీసుకువెళుతున్నారు. తవ్వకాలకు ముందు క్షుద్ర పూజలు చేస్తున్నారు. రాళ్లను పగలుగొట్టేందుకు తక్కువ శబ్దం వచ్చే జిలెటిన్ స్టిక్స్తో పేలుళ్లు నిర్వహిస్తున్నారు. తవ్వకాలు జరిపిన ప్రాంతంలో నిధి దొరకకపోతే గోతులను కంకర రాళ్లతోను, చెట్లను నరికి పూడ్చివేస్తున్నారు. క్షుద్రపూజలు, లైట్ల హడావుడి, పేలుడు శబ్దాలు వింటున్న సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను ఉదయం పూట కొందరు పోలీసులు పరిశీలించి వెళ్లిపోతున్నారని, తవ్వకాల విషయం అటవీ శాఖ అధికారులకు కూడా తెలుసునని స్థానికులు చెబుతున్నారు. తవ్వకాలపై ప్రశ్నిస్తే తమను బెదిరిస్తున్నారని సమీప గ్రామాల ప్రజలు అంటున్నారు. కొండ ప్రాంతంలోకి రావద్దని పశువుల కాపర్లను సైతం హెచ్చరిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
ఫిరంగిపురం, న్యూస్లైన్ :కొండవీడు-సొలస రోడ్డులో ఫిరంగిపురం శివారు బ్రిక్స్ కంపెనీ వద్ద ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఇద్దరూ స్నేహితులు వనసమారాధనకు వెళ్లి తిరిగివస్తుండగా మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన షేక్ కాగజ్ అబిద్ (30), మండలంలోని బేతపూడికి చెందిన షేక్ ఆదంషఫీ (35)లు కొండవీడు కొండల్లో ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమాలకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో అబిద్ తన మిత్రుడు ఆదంషఫీని ఫిరంగిపురంలో దించేందుకు బైక్పై వస్తున్నారు. గణపవరం నుంచి పత్తి విత్తనాల లోడ్తో ఫిరంగిపురం వైపు వేగంగా వస్తోన్న లారీ ముందు వెళుతున్న బైక్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న ఆబిద్పై నుంచి రెండు చక్రాలు ఎక్కడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. వెనక కూర్చున్న ఆదం షఫీ మిత్రుడు లారీ కింద పడిపోతాడేమోనని అతని చేతిని పట్టుకోవడంతో లారీ ఈడ్చుకుంటూ వెళ్లి రెండు చక్రాలు తలపై ఎక్కింది. దీంతో అతను కూడా అక్కడిక్కడే మృతిచెందాడు. ఫిరంగిపురం ఏఎస్ఐ ఎస్కె.మహబూబ్ జాని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలను సోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ పరారీ కాగా.. లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. గ్రామస్తుల కన్నీటిపర్యంతం.. కొండవీడు గ్రామానికి చెందిన ఆబీద్ స్థానిక సొలస బస్టాండ్ సెంటర్లో రెండేళ్ల క్రితం బట్టల షాపు పెట్టుకొని జీవిస్తున్నాడు. ఆయనకు భార్య కాగజ్ షమీలా, మూడేళ్ల కుమారుడు, నలభై రోజలు బాబు ఉన్నారు. బేతపూడికి చెందని ఆదంషఫీకి భార్య మహబూబ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతను ప్రతిరోజూ స్థానిక ఆంధ్రాబ్యాంక్, ఫిరంగపురం గ్రామంలో తిరిగి ఐస్క్రీమ్ అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. తమ కళ్లముందే కనిపించే ఇద్దరు మిత్రులు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు కంటతడిపెట్టారు. తమకుటుంబానికి పెద్దదిక్కుఅయిన తన తమ్ముడు మరణించాడని తెలుసుకొని ఫిరంగిపురం గ్రామానికి చెందిన ఆబీద్ అక్క షేక్ రిజ్వానా సంఘటనా స్థలానికి చేరుకొని తన మరదలు రెండో బిడ్డకు జన్మనిచ్చి రెండు నెలల గడవక ముందే ఇలాంటి దుర్వార్త వినాల్సి రావడం దురదృష్టమయ్య అంటూ గుండెలివిసేలా విలపించింది.