breaking news
Kochi artist
-
నటి కిడ్నాప్ ప్లాన్: ముఠా అరెస్టు
కొచ్చి: నటి షమ్నా కాసిం (పూర్ణ)ను కిడ్నాప్ చేసి భారీ ఎత్తున డబ్బు దోచుకోవాలని ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మంది సభ్యుల ముఠాలోని ఎనిమిది మందిని అరెస్టు చేశామని మిగతా నలుగురు పరారీలో ఉన్నారని కొచ్చి పోలీస్ కమిషనర్ విజయ్ సఖారే వెల్లడించారు. అలాగే వీరంతా గత మార్చి నెలలో పాలక్కాడ్లో ఎనిమిది మంది మోడల్స్ ను బంధించి, డబ్బుల వసూలు చేసిన కేసులో కీలక నిందితులని చెప్పారు. ఈ సందర్భంగా కిడ్నాప్, బెదిరింపునకు ప్రయత్నించిన ముఠా పథకాన్ని విజయ్ సఖారే మీడియాకు వివరించారు. మొదట షమ్నాతో వివాహ ప్రతిపాదన ద్వారా కుటుంబ సభ్యులతో సంబంధాలు ఏర్పరచుకుని, ఆ తరువాత కిడ్నాప్ చేసి, ఒక హోటల్ గదిలో బంధించి పెద్ద ఎత్తున డబ్బు గుంజాలని ప్లాన్ వేశారని వివరించారు. ఈ క్రమంలోనే షమ్నా నుండి ఒక లక్ష 50 వేల రూపాయలు డిమాండ్ చేశారని ఇది విఫలం కావడంతో కిడ్నాప్ ప్రయత్నాలను ముమ్మరం చేశారని తెలిపారు. సినిమా ఆఫర్ల పేరుతో నటీనటుల వివరాలను సేకరించి, బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయాలనేది వీళ్ల పథకమని పేర్కొన్నారు. సినిమా ప్రొడ్యూసర్లమని చెప్పి ప్రొడక్షన్ కంట్రోలర్ షాజీ ద్వారా అనేకమంది ప్రముఖుల ఫోన్ నంబర్ తదితర వివరాలను సేకరించినట్టు వెల్లడించారు. షమ్నా, ఇతర మహిళల ఫిర్యాదుల ఆధారంగా ఈ ముఠాపై ఏడు కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హాస్య నటుడు ధర్మజన్ బోల్గట్టిను కూడా పోలీసులు విచారించారు. గ్యాంగ్లోని అస్గర్ అలీ తనకు రెండుమూడు సార్లు ఫోన్ చేశాడని బోల్గట్టి మీడియాకు చెప్పారు. ప్రొడక్షన్ కంట్రోలర్ షాజీ తన నంబర్ను ఆ గ్యాంగ్కు ఇచ్చాడని చెప్పుకొచ్చారు. లాక్డౌన్ సమయంలో తనను సంప్రదించిన ఈ గ్యాంగ్ షమ్ కాసింను పరిచయం చేయాలని అడిగారని బోల్గట్టి వెల్లడించారు. అయితే, ఈ కేసులో సినీ ప్రముఖులకు ఎలాంటి పాత్ర లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా తెలుగులో సీమ టపాకాయ్, అవును సినిమాల ద్వారా పూర్ణ ప్రేక్షకులకు సుపరిచితమే. -
ఆ ముఖానికి నల్లరంగు ఎందుకు?
కొచ్చి: నగరానికి సమీపంలోని త్రిపునితురలో నివసిస్తున్న ఆర్టిస్ట్ పీఎస్ జయ ప్రతి రోజు ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు ముఖానికి, కాళ్లకు, చేతులకు నల్లటి రంగు పూసుకుంటోంది. బస్కెక్కుతోంది. నేరుగా ఓ ప్రైవేటు ఆర్ట్ ఇనిస్టిట్యూట్కు వెళ్లి అక్కడ పిల్లలకు పాఠాలు చెబుతోంది. బయటకు రాగానే అలాగే బంధు మిత్రుల ఇంటికి వెళుతోంది. అటు నుంచి స్నేహితుల వద్దకు... వారితో కలసి రెస్టారెంట్కు వెళుతోంది. అలా...అలా...నలుగురితో మాటా మంతి కలిపి ఎప్పటికో ఇల్లు చేరుతోంది. ఆమె గత 70 రోజుల నుంచి క్రమం తప్పకుండా ఓ దిన చర్యగా ఇది చేస్తూ వస్తోంది. ఎందుకు నల్ల రంగు వేసుకొని తిరుగుతున్నావని ఎవరైనా అడిగితే వారితో వాదనకు దిగుతుంది. మనుషులు నల్లగా ఉంటే తప్పేంటి? నల్లవారి పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ముఖ్యంగా నల్లగా ఉండే దళితుల పట్ల ఎందుకు వివక్ష కొనసాగిస్తున్నారు? అని ప్రశ్నిస్తుంది. భారత్లో అనాది కాలంగా కొనసాగుతున్న కుల వ్యవస్థ గురించి కడిగేస్తుంది. ఇలా ప్రశ్నించడమే కాకుండా ఎదుటి వారి అభిప్రాయాలను, భావాలను పూసగుచ్చినట్లు తెలుసుకుంటుంది. వారిలో కుల వ్యవస్థ గురించి అవగాహన పెంచేందుకు, వీలైనంత మేరకు వారిలో చైతన్య భావన కలిగించేందుకు కృషి చేస్తోంది. తనకు తారసపడ్డ అందరి అభిప్రాయాలను వీడియోలో రికార్డు చేస్తోంది. వారి ఫొటోలను తీసుకుంటున్నది. వీటన్నింటిని కలిపి ఓ డాక్యుమెంటరీ తీసేందుకు ప్రయత్నిస్తోంది. శాస్త్రవిజ్ఙానపరంగా, ఆర్థికంగా భారత్ ఎంతో ఎదుగుతున్నప్పటికీ సామాజికంగా ఇంకా ఎందుకు ఎదగడం లేదన్నది ఆర్టిస్జ్ జయ బాధ. తెలుపు, నలుపు, అగ్రవర్ణాలు, నిమ్నవర్ణాలు, మగవాళ్లు, ఆడవాళ్లు అన్న వివక్షలేని సమాజం ఏర్పడాలన్నది ఆమె తపన. అందుకే నలుపు రంగు పూసుకునే వినూత్న కార్యక్రమాన్ని ఓ ఉద్యమంగా చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని వంద రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించుకున్నానని, జనవరి 26న ప్రారంభించిన ఈ కార్యక్రమం మే 5వ తేదీతో ముగుస్తుందని ఆమె మీడియాకు తెలిపింది. దేశాన్ని కుదిపేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యతో తాను కదిలిపోయానని, దళిత వివక్ష కారణంగానే అతన్ని సమాజం బలితీసుకుందని, అలాంటి వివక్షకు వ్యతిరేకంగా పోరాడడమే తన కర్తవ్యమని జయ వివరించారు. తన ప్రస్తుత కార్యక్రమం ముగిశాక దళితులపై ఓ ప్రత్యేక కేలండర్ను తీసుకొస్తానని, అందులో దళితుల పండుగల వివరాలతో పాటు చరిత్రలో దళిత ఉద్యమాలకు సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు, వాటి ప్రాముఖ్యత గురించి వివరిస్తానని ఆమె చెప్పింది.