breaking news
Junctions Modernization
-
Hyderabad: జంక్షన్లు జిగేల్!.. రూ.6 కోట్లతో 2 కూడళ్లకు మెరుగులు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు ఎస్సార్డీపీ ద్వారా వివిధ ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ కారిడార్లు, అండర్పాస్లు వంటి సిగ్నల్ ఫ్రీ ప్రయాణానికి ప్రాధాన్యమిచ్చిన జీహెచ్ఎంసీ.. ఇక జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ తదితర పనులపై దృష్టి సారించింది. రూ.వేల కోట్లతో ఫ్లైఓవర్లు నిర్మించి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కులు తగ్గించినప్పటికీ, పలు జంక్షన్లు చూపరులను ఆకట్టుకునేలా లేవు. కొన్ని మాత్రం వివిథ థీమ్లతో, ఆయా ప్రాంతాల్లో సుపరిచితమైన విగ్రహాలు వంటి వాటితో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, చాలా ప్రాంతాల్లో తగిన విధంగా లేవు. దీంతో మొదటి దశలో భాగంగా జోన్కు రెండు చొప్పున మోడల్ జంక్షన్లుగా ఆధునికంగా, ఆహ్లాదంగా, అందంగా ఉండేలా అభివృద్ధి చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్.. జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు తమ జోన్లోని జంక్షన్లను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. సికింద్రాబాద్ జోన్లోని నారాయణగూడ వైఎంసీఏ జంక్షన్, సికింద్రాబాద్లోని సంగీత్ జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ఎంచుకున్నారు. సంగీత్ జంక్షన్లో ఎంతో కాలం క్రితమే సంగీత వాద్య పరికరాలు ఉంచి ప్రయాణికుల దృష్టి అటు మళ్లేలా చేసినప్పటికీ, ఆ జంక్షన్ను మరింత సుందరంగా, అందంగా అభివృద్ధి చేయవచ్చని అధికారులు భావించారు. అలాగే వైఎంసీఏ వద్దా ఎంతో అభివృద్ధి చేయవచ్చని భావించి పనులకు సిద్ధమవుతున్నారు. సంగీత్ జంక్షన్ పనులకు రూ. 2.92 కోట్లు, వైఎంసీఏ జంక్షన్ పనులకు రూ.2.90 కోట్లు వ్యయమవుతాయని, రెండింటికీ కలిపి రమారమీ రూ. 6 కోట్ల వరకు ఖర్చు కావచ్చని అంచనా వేస్తున్నారు. టెండర్లు పూర్తవగానూ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: Hyderabad: 9న గణేష్ నిమజ్జనం.. ఉచితంగా 6 లక్షల విగ్రహాల పంపిణీ జంక్షన్లు విశాలంగా వాహనాలు సాఫీగా మలుపులు తిరిగేలా రోడ్లను వెడల్పు చేస్తారు. అవసరాన్ని బట్టి ఆస్తుల సేకరణ జరుపుతారు. జంక్షన్ల మధ్య ఉండే వలయాకార భాగాల్లో గ్రీనరీ, ఫౌంటెన్లు వంటి ఏర్పాట్లు చేస్తారు. కూర్చునేందుకు వీలుగా బెంచీలు.. ఇతరత్రా స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు చేస్తారు. జంక్షన్లలోని అన్నివైపులా పాదచారులు సులభంగా రోడ్డు దాటేలా ఏర్పాట్లు. అందుకోసం మార్కింగ్లు. అవసరమైన చోట పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారు. జంక్షన్ల నుంచి వివిధ మార్గాలవైపు వెళ్లే రోడ్ల మధ్య డివైడర్లలో అందంగా కనిపించేలా, ఆక్సిజన్ ఇచ్చేలా పచ్చదనం పెంచుతారు. అన్నివైపులా బస్టాప్లు ఉండేలా చూస్తారు. ఫ్రీలెఫ్ట్.. తదితర సదుపాయాలు అందుబాటులోకి తెస్తారు. విద్యుద్దీపాల ధగధగలతో జంక్షన్లు రాత్రుళ్లు మెరిసిపోయేలా చేస్తారు. -
పాదచారికి జై..
* జంక్షన్ల ఆధునికీకరణ, ఎఫ్వోబీల ఏర్పాటు * అధ్యయనం చేసిన ట్రాఫిక్ పోలీసులు * ప్రభుత్వానికి చేరిన సమగ్ర నివేదిక * రెండు విడతల్లో పనులు..! సాక్షి, సిటీబ్యూరో: ‘పాదచారే రోడ్డుకు రాజు’.. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ఈ నానుడి నగరానికి మాత్రం సరిపోవడం లేదు. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో పాదచారులది రెండో స్థానం. సిటీలో ఈ పరిస్థితులు నెలకొనడానికి అనేక కారణాలు ఉన్నాయి. హైదరాబాద్ను వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ప్రభుత్వం.. ట్రాఫిక్ స్థితిగతులను చక్కదిద్దేందుకు అధ్యయనం చేయించింది. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించిన ట్రాఫిక్ పోలీసులు పాదచారి భద్రతకు పెద్దపీట వేశారు. అనేక కోణాల్లో జంక్షన్ల అభివృద్ధి సిటీలోని ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ధిలో పాదచారుల కోణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం సిటీలో ప్రధానంగా నాలుగు రకాల జంక్షన్లు ఉన్నాయి. నాలుగు కంటే ఎక్కువ రహదారులు కలిసే జంక్షన్లు, నాలుగు రోడ్లు కూడళ్ల చౌరస్తాలతో పాటు మూడు రోడ్లతో కూడిన ‘టి’, ‘వై’ జంక్షన్లు ఉన్నాయి. ఇలా ప్రతి జంక్షన్లోనూ పాదచారులు రోడ్డు దాటేందుకు కచ్చితంగా ప్రత్యేక మార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. రెడ్ సిగ్నల్ పడేదాకా చౌరస్తాలో వేచి ఉండేందుకు రోడ్డుకు పక్కగా సౌకర్యవంతంగా ఉండే ప్లాట్ఫాములు నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రెయిలింగ్స్, హూటర్స్.. ఆయా జంక్షన్లలో పాదచారులు ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటేందుకు ప్రయత్నించడంతో తనచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని నివారించేదుకు రెయిలింగ్స్ ఏర్పాటును సూచించారు. జంక్షన్ స్థాయిని బట్టి అన్ని రోడ్లలోకూ ఎడమ వైపు ఫుట్పాత్ను అనుసరించి 100 నుంచి 200 మీటర్ల వరకు రెయిలింగ్ ఏర్పాటు చేస్తారు. రోడ్ క్రాసింగ్ మార్క్ ఉన్న ప్రాంతంలో వీటికి ఓపెనింగ్ ఇస్తారు. ఫలితంగా పాదచారి ఆ ప్రాంతంలో మాత్రమే రహదారి దాటే వీలుంటుంది. అంధులు రోడ్డు దాటుతున్న సమయంలో ఆ విషయం వాహన చోదకులకు స్పష్టంగా తెలిసేలా ‘హూటర్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక శబ్దం చేసే ఈ హూటర్ సదరు పాదచారి రోడ్డు దాటే వరకు మోగుతూనే ఉంటుంది. ప్రత్యేక డిజైన్తో ఎఫ్వోబీలు జంక్షన్లు, రోడ్డు క్రాసింగ్కు అవకాశమున్న అన్ని ప్రాంతాల్లోనూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల (ఎఫ్వోబీ) ఏర్పాటుకు ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రతిపాదించారు. వీటితోపాటు పాదచారులు రోడ్డు దాటేం దుకు అవకాశమున్న వాణిజ్య, విద్యా కేంద్రాలు ఎక్కువగా ఉన్న చోట్లా వీటిని నిర్మించాలని సూచించారు. ప్రధానంగా దిల్సుఖ్నగర్, కోఠి, బేగంబజార్, అమీర్పేట్, మెహదీపట్నం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వీటి ప్రాధాన్యం ఎక్కువని నివేదించారు. గతంలో మాదిరిగా కేవలం బ్రిడ్జి మాత్రమే నిర్మించకుండా ప్రతి ఎఫ్వోబీకి లిఫ్ట్, జనరేటర్ సౌకర్యం కచ్చితంగా ఉండాలని, అప్పుడే వీటి వినియోగం ఆశించిన స్థాయిలో ఉంటుందని నివేదికలో స్పష్టం చేశారు. ‘మెట్రో’పై ప్రత్యేక దృష్టి నగరంలో మెట్రో రైల్ ప్రారంభమైన తర్వాత ఆయా ప్రాంతాల్లో పాదచారుల తాకిడి పెరుగుతుందని ట్రాఫిక్ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రో స్టేషన్లో రైలు దిగి సమీప ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్లు, ఆటో స్టాండ్లకు చేరుకునే వారి సంఖ్య పెరుగుతుందంటున్నారు. దీనికోసం మెట్రో స్టేషన్లు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ‘స్కై వాక్స్’ సాధ్యం కావని భావిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మల్టీ డెరైక్షన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఉండే ఎఫ్వోబీల అంశాన్ని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. సాధారణంగా ఎఫ్వోబీలు ఒక మార్గంలో ఎక్కి, మరో మార్గంలో దిగేందుకు ఉపకరిస్తాయి. ‘మెట్రో’ వద్ద ఏర్పాటు చేసేవి ఆ స్టేషన్ నుంచి ఎంట్రీ ఉన్నా.. గరిష్టంగా మూడు మార్గాల్లో ఎగ్జిట్స్ ఉండేలా డిజైన్ చేయాలని నివేదించారు. రెండు విడతల్లో పనులు.. ఇప్పటికే పోలీస్స్టేషన్ల వారీగా, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అధ్యయనం పూర్తి చేసిన ట్రాఫిక్ విభాగం అధికారులు.. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రతిపాదిత పనులను సర్కారు రెండు విడతల్లో చేపట్టే అవకాశముందని పేర్కొంటున్నారు. తొలి విడతలో తక్షణం అమలు చేసే, వ్యయం తక్కువగా ఉండే వాటికి ప్రాధాన్యం ఇస్తారని చెప్తున్నారు. భారీ వ్యయం, స్థల సేకరణ వంటి అంశాలతో ముడిపడున్న పనులను రెండో విడతలో పూర్తి చేసే అవకాశం ఉందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.