breaking news
intintiki telugudesa program
-
కాసింత సహృదయత లేదా?
ఆలోచనం గత కొద్ది కాలంగా ‘ఇంటింటికీ తెలుగు దేశం’ పేరుతో ఇంటింటికీ తిరుగుతున్న తెలుగుదేశం వారికి ఇంట్లోంచి లేచి బయటకు రాలేని విధంగా రోగులున్న ప్రకాశం జిల్లా ఇళ్ల గురించి చీమ కుట్టినట్టు కూడా ఎందుకు లేదో? కుటుంబాన్ని ఒక్కడై పోషిస్తున్న ఎలియేలుకు ఒక నెల క్రితం బాగా జ్వరమొచ్చింది. ఒంగోలుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలియేలు మొదట తన ఊర్లోనే ఉన్న ఆర్ఎంపీ దగ్గరకి వెళ్లి చూపించుకున్నాడు. ఆయనేవో మందులు ఇచ్చాడు. జ్వరం తగ్గింది. కానీ ఒకటే నీరసం. పనికి పోవడం ఆపి చేతిలో ఉన్న 4 రూపాయలూ ఖర్చుపెట్టి ఇల్లు గడపడం మొదలు పెట్టాక ఎలియేలు వాళ్ళ కాలనీలోనే పదకొండేళ్ల చిన్న అబ్బాయి చనిపోయాడు. డెంగ్యూ అన్నారు. ఎలియేలుకు భయం వేసింది. మళ్ళీ జ్వరం కాయడం మొదలుపెట్టింది. ప్రభుత్వాసుపత్రిలో చూపిస్తే పరీక్షలు చేయాలి, ప్లేట్లెట్ కౌంట్ చూడాలన్నారు. చూడటానికి అవసరమైన మెషీను తమవద్ద లేదు కాబట్టి పరీక్షలకు ప్రైవేటు ఆస్పత్రికి పొమ్మన్నారు. అతని దగ్గర డబ్బులేదు. అతని భార్యకి బాగా భయం పట్టుకుంది. వేకువజామునే బస్సెక్కి పుట్టింటికెళ్లి తండ్రిని, అన్నల్నీ అడిగి ఐదువేలు తెచ్చి పరీక్షలు చేయించింది. అప్పట్నుంచి, మొన్న విజయవాడ నుంచి ఇంటికొచ్చేదాకా దాదాపు లక్షదాకా ఖర్చయింది. తర్వాతే అతను ఇంటికొచ్చాడు. ఇలాంటి కేసులు ప్రకాశం జిల్లాలో బోలెడు. ఒంగోలుకు దగ్గర్లోనే ఉన్న దర్శిలోనే ఇప్పటివరకు డెంగ్యూతో 15మంది పిల్లలు మరణించినట్టు వార్తలు. ప్రజారోగ్యం మన ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలలో అతి ముఖ్యమైనది. మందుల నుంచి ప్రతి ఒక్కటీ మన వైద్యశాలలో ఫ్రీ. అయితే కాగితాలలో కనిపించే మాటలకు కంటి ముందు కని పించే దృశ్యాలకు పొంతన ఉండదు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలన ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు పరిగెత్తుతున్నారు. ఒకప్పుడు మనకు ప్రతి ఊరిలో ఆయుర్వేద వైద్యులుండేవాళ్లు. వీరు డబ్బుకోసం కాక వైద్య సేవ మీద తృష్ణతో వైద్యం చేసేవారు. కొన్ని రోగాలకు, కొన్ని ఆపత్సమయాలకు అక్కరకు వచ్చే దేశీయ ప్రత్యామ్నాయ వైద్యాన్ని పెకలించివేసింది ఇంగ్లీష్ వైద్యం. ప్రకాశం జిల్లా అంతటా వీస్తున్న విషపు గాలి నన్నూ టైఫాయిడ్ రూపంలో ఆవహించింది. ఎంతకూ తగ్గని ఈ రోగం నాకు టైఫాయిడ్ మేరీని జ్ఞాపకం తెచ్చింది. టైఫాయిడ్ మేరీ యుఎస్లో మొదట గుర్తిం చిన టైఫాయిడ్ వ్యాధి లక్షణాలను కనిపించకుండా మోసుకొచ్చే వాహకం. 1900–1907 వరకు ఆమె వంటమనిషిగా పనిచేసిన ప్రతి ఇంటివారు జ్వరపడటమూ, కొంతమంది మరణించటం జరిగింది. దీనికి మేరీ కారణమని భావించి చేసిన పరిశోధనలో అది నిజమని రుజువయ్యాక ఆమె అరెస్టై అనేక ఏళ్ళ పాటు ఏకాకితనాన్ని అనుభవించింది. ఆ తరువాత ఏటా వేల సంఖ్యలో టైఫాయిడ్ కేసులు నమోదయ్యే అమెరికా మెరుగైన పారిశుధ్య పద్ధతులను అవలంబించి నేడు ఆ కేసులను మూడొందలు నాలుగొందలకి కుదించింది. ఆ కొన్ని కేసులు కూడా మెక్సికో, నార్త్ అమెరికా నుంచి వస్తున్న ప్రయాణికులు మోసుకొస్తున్నవే తప్ప అక్కడివి కావట. మనకి మన చుట్టూతా అందరూ టైఫాయిడ్ మేరీలే. మనం కూడా మన చుట్టు పక్కల వారికి టైఫాయిడ్ మేరీలమే. అమెరికా ఎప్పుడో శతాబ్దం పూర్వం ఆరోగ్యం పట్ల, పారిశుధ్యం పట్ల చూపించిన శ్రద్ధ మనం ఇప్పుడు కూడా చూపించలేక పోతున్నాం. ఒక రోజు నేను నా తమ్ముడి వెట్ క్లినిక్లో కూర్చుని వున్నాను. ఆరోగ్యంగా ఉన్న ఒక కుటుంబం బలహీనంగా వున్న ఒక దేశీ జాతి కుక్కను తీసుకుని వచ్చింది. ఊరకుక్క అని చిన్న చూపు చూడకండి అని వేడుకున్న యజమానురాలు ఆ శునకం రోగాన్ని నివేదించింది. అప్పటికప్పుడు ఎక్స్రేలు, రక్త పరీక్షలు జరి గాయి. అంతసేపు ఆ కుక్క, ఆవేదన చెందుతున్న ఆ తల్లి ఒడిలో అలసటగా పడుకుని ఉంది. ఆ పడుకోవడంలో అది ఒక సుఖాన్ని అనుభవిస్తూ ఉంది. ఇది రాస్తున్నపుడు నాకెందుకో దాని ముఖంలో ఆ రోజు కనిపించిన ఆ సౌఖ్యం పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంది. గాలి మార్పుకోసం ఒంగోలు నుంచి పారిపోయి వచ్చాను నేను. ఇవాళ పొద్దుటే కళ్లు తెరవగానే ఎదుట కనిపించిన ఆకు పచ్చటి మైదానం నాకు శరత్ చంద్ర ఛటోపాధ్యాయ ‘దత్త’ నవలలో డాక్టర్ నరేంద్రుడుని జ్ఞాపకం తెచ్చింది. మైదానంకి ఆవలనుంచి నడుచుకుంటూ వస్తున్న అతని రూపం, ఆ పుస్తకంలో అక్కడక్కడా కనిపించే మసూచి రోగం జ్ఞాపకం వచ్చాయి. అందులో ఒక మాట.. ‘‘సహృదయం అనే వస్తువు ఒకటి ఉంది. మీరు దాన్ని ఇంకెక్కడా చూడలేదా’’ అని. తెలుగుదేశం పార్టీ గత కొద్ది కాలంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ పేరుతో ఇంటింటికీ తిరుగుతూ ఉంది. మరి ఇంటింటికీ తిరుగుతున్న టీడీపీ వారికి ఇంట్లోంచి లేచి బయటకు రాలేని విధంగా రోగులున్న ప్రకాశం జిల్లా ఇళ్ల గురించి చీమ కుట్టినట్టు కూడా ఎందుకు లేదో? బహుశా బాబుగారు ఇచ్చేదేదయినా ఇప్పుడే ఇచ్చేస్తే ఓటేసేనాటికి మరచిపోతారని అనుకుంటున్నారేమో. ఈ పార్టీలు, రాజకీయాలు అంతా పక్కన పెట్టేసి ఆలోచించి చూడండి, సహృదయత అనే వస్తువు ఒకటి వుంది. మీకింతవరకు పరిచయం కాకుంటే పరిచయం చేసుకోండి. మన రాష్ట్రంలో 70 శాతం కుటుంబాలు వైద్య ఖర్చులు భరించలేనివే. రాజకీయాలు పక్కన పెట్టి వారికి వెచ్చటి ఓదార్పును ఇవ్వండి. ఆరోగ్య సేవలు మెరుగుపరచండి. వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి : సామాన్య కిరణ్ 91635 69966 -
టీడీపీలో ఇంటిపోరు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో ‘ఇంటింటికీ తెలుగు దేశం’ కార్యక్రమం పార్టీలో విభేదాలను పెంచుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీటు ఆశిస్తున్న ముఖ్య నేతలను, వ్యతిరేక వర్గాలను నాయకులు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదు. సొంత కార్యక్రమంగా భావిస్తూ కొందరికే పరిమితం చేస్తున్నారు. ముఖ్య నేతలను పిలిస్తే ప్రజల్లో పలుకుబడి పెరిగి రానున్న ఎన్నికల్లో సీటుకు పోటీ అవుతారనే భయంతో సమాచారమే ఇవ్వడం లేదు. పార్టీని పటిష్టం చేసేందుకు అధినేత చంద్రబాబు రూపొందించిన ఈ కార్యక్రమ నిబంధనలను నేతలు పాటించకపోవడం వల్లనే ఇంటిపోరు పెరుగుతోందని అభిమానులు చెబుతున్నారు. తొలి విడత కార్యక్రమం పేలవంగా ముగియడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు డిసెంబరు నెలాఖరులో నాయకులతో సమావేశం నిర్వహించి రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే ప్రారంభించిన పదిరోజుల్లోనే డొల్లతనం బయట పడింది. జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు, 11 మంది నియోజకవర్గ ఇన్చార్జిలు ఇంటింటికీ దేశం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అయితే నియోజకవర్గ ఇన్చార్జిలకు సీటు కేటాయింపుపై అధినేత నుంచి ఎటువంటి భరోసా లేకపోవడంతో మిగిలిన నేతలను కూడా ప్రజలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి ఈ కార్యక్రమాల సమాచారం అందనీయడం లేదు. ఆహ్వానం పంపడం లేదు. ఆహ్వానాలు అందడం లేదు.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇన్చార్జి బాధ్యతలను నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ తన వ్యతిరేక వర్గానికి ఆహ్వానం పంపడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక్కడ ఆయనతోపాటు మరో ఐదారుగురు సీటు ఆశిస్తున్నారు. వీరిలో కొందరికి సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. నగర పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ మీరావలి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జాగర్లమూడి శ్రీనివాసరావులకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన నాయకులను విస్మరించడం ఎంత వరకు సమంజసమనే అభిప్రాయం వినపడుతోంది. పోటీ చేయాలని పుష్పరాజ్పై ఒత్తిడి తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణ్కుమార్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజ లతో మమేకం అవుతుండటంతో ఆయన వ్యతిరేక వర్గం మాజీ మంత్రి పుష్పరాజ్ను కొత్తగా తెరపైకి తీసుకువచ్చి, రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి తమకు ఎటువంటి ఆహ్వానం లేదని శ్రావణ్ వ్యతిరేక వర్గం పేర్కొంటున్నది. మాజీ మంత్రి, నరసరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి కోడెల శివప్రసాద్ ఆత్మీయపాదయాత్ర పేరుతో సొంత కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ పాదయాత్రలో అన్ని వర్గాల నాయకుల ను కలుసుకునే యత్నం చేస్తున్నారు. అయితే ఆయన వ్యతిరేక వర్గమైన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పులిమి వెంకట రామిరెడ్డి, బీసీ విభాగ రాష్ట్ర నాయకులు వెల్లపు నాగేశ్వరరావు తదితరులు దీనికి దూరంగానే ఉంటున్నారు. కోడెలకు సీటు ఇవ్వరాదనే ప్రధాన ఉద్దేశంతో ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. సొంత కార్యక్రమానికి రూపకల్పన సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మకాయల రాజనారాయణ అక్కడ సీటు ఆశిస్తున్న మరో నాయకుడు మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులుకు ఎటువంటి ఆహ్వానం పంపడం లేదు. దీంతో వైవీ ఆంజనేయులు సొంతంగా ఓ కార్యక్రమానికి రూపకల్పన చేసుకున్నారు. ప్రతి రెండు రోజులకు ఓ మారు ఒక గ్రామానికి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో సీటు ఆశిస్తున్నానని ప్రజలకు చెబుతున్నారు. మొత్తం మీద ఇంటింటికీ తెలుగుదేశం నియోజకవర్గాల్లో విభేదాలను పెంచుతోందని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.