India-Pakistan relations
-
రాజకీయ జోక్యమే శాంతిని నెలకొల్పుతుంది
శ్రీనగర్: భారత్– పాక్ మధ్య నెలకొన్న సమస్యలను రాజకీయ జోక్యమే పరిష్కరిస్తుందని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. సైనిక చర్య సరికాదని, ఇరు దేశాల నాయకత్వాలు సంయమనం పాటించి, దాడులను తక్షణమే నిలిపివేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘పుల్వామా, పహల్గాం ఘటనలు రెండు దేశాలను విపత్తు అంచులకు చేర్చాయి. ఇది ఇలాగే కొనసాగితే యావత్ ప్రపంచానికే ప్రమాదం పొంచి ఉంది. కార్గిల్ అయినా, పుల్వామా అయినా, పహల్గాం అయినా, పఠాన్ కోట్ అయినా సైనిక చర్య జరిగినప్పుడల్లా అది లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తుంది. మూల సమస్యకు పరిష్కారం చూపదు. శాశ్వతంగా శాంతిని నెలకొల్పేందుకు సహాయపడదు’అని ముఫ్తీ అన్నారు. ఉద్రిక్తతల వల్ల జమ్ముకశ్మీర్కు ఇరువైపులా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధాన్ని వారు ప్రారంభించలేదని, తమ ప్రమేయం లేకుండా జరుగుతున్న యుద్ధానికి వారు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని ఆమె అన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలు ఎన్నాళ్లు ఈ భారాన్ని భరించాలంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దాడుల్లో ఇరు దేశాలు తమ లక్ష్యాన్ని నెరవేర్చినట్లు కనిపిస్తోందని, పిల్లల రక్తం ఎందుకు చిమ్ముతున్నారని ఆమె ప్రశ్నించారు. ఇరు దేశాల ప్రధానులు మాట్లాడి దాడులను ఆపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నాయకత్వం జమ్మూకశ్మీర్ ప్రజల గొంతుకను వింటుందని తాను ఆశిస్తున్నానన్నారు. రెండు వైపులా మీడియా నిజాలు మాట్లాడాలని, వారి ప్రచారాలతో ప్రజలకు భయాందోళనలు కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. -
భారత్, పాక్లది వెయ్యేళ్ల పోరు!
న్యూయార్క్: భారత్, పాక్ తమ ఉద్రిక్తతలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వెలిబుచ్చారు. పోప్ అంత్యక్రియల నిమిత్తం వాటికన్ వెళ్తూ శుక్రవారం ఎయిర్ఫోర్స్వన్ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ క్రమంలో హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్, పాక్కు ఇది కొత్తేమీ కాదు. కశ్మీర్ కోసం ఇరుదేశాల మధ్య వెయ్యేళ్లకు పైగా పోరు నడుస్తోంది. బహుశా 1,500 ఏళ్లుగా అనుకుంటా’’అని చెప్పుకొచ్చారు. అంతేగాక పహల్గాం ఉగ్ర దాడిలో 30 మందికి పైగా పర్యాటకులు మరణించారంటూ సంఖ్యను కూడా తప్పుగానే చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను నెటిజన్లు ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. కశీ్మర్ ఘర్షణల గురించి ట్రంప్కు తెలిసినంతగా బహుశా ఇంకెవరికీ తెలియదేమో అంటూ ఒకరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ‘‘అవునా! నేనింకా పాకిస్తాన్ 1947లో పురుడు పోసుకుందనే అపోహలో ఉన్నా’’అని మరొకరు ఎక్స్లో పోస్ట్ చేశారు. -
Indus Waters Treaty: సస్పెన్షన్ సాధ్యమే
పూర్తిస్థాయి యుద్ధాలు. కార్గిల్ వంటి దురాక్రమణలు. మరెన్నో లెక్కలేనన్ని దుశ్చర్యలు. గత 75 ఏళ్లలో భారత్పై పాకిస్తాన్ మతిలేని ఉన్మాద చర్యలు అన్నీ ఇన్నీ కావు. అయినా సామాన్య పాకిస్తానీలను దృష్టిలో పెట్టుకుని సింధూ జల ఒప్పందాన్ని భారత్ ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చింది. ఆర్థికంగానే గాక అన్నివిధాలా పతనావస్థకు చేరినా దాయాదికి ఇక బుద్ధి రాబోదని పహల్గాం దాడితో తేలిపోయింది. దాంతో ఓపిక నశించి పాక్కు శాశ్వతంగా బుద్ధి చెప్పే చర్యల్లో భాగంగా సింధూ ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది. ఏకపక్షంగా అలా చేసే అధికారం భారత్కు లేదంటూ పాక్ గగ్గోలు పెడుతోంది. ఇది తమపై యుద్ధ ప్రకటనేనంటూ ఆక్రోశిస్తోంది. అయితే అంతర్జాతీయ చట్టాల మేరకు భారత్ చర్య సబబేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోని పక్షంలో సింధూ ఒప్పందానికి నూకలు చెల్లుతాయంటూ పాక్ను భారత్ ఎన్నోసార్లు హెచ్చరించింది. సస్పెన్షన్కు సంబంధించి ఒప్పందంలో స్పష్టమైన నిబంధనలేవీ లేవు. పైగా అందులోని ఆర్టికల్ 12 ప్రకారం ఒప్పందానికి సవరణలు, ఇరుదేశాల ఆమోదంతో పూర్తిగా రద్దు మాత్రమే సాధ్యం. అలాంటప్పుడు సస్పెన్షన్ నిర్ణయాన్ని ఏ ప్రాతిపదికన తీసుకున్నారన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. 1969 వియన్నా కన్వెన్షన్, ఇతర అంతర్జాతీయ న్యాయ ఒప్పందాల ప్రకారం అలా చేసేందుకు వీలుందని సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ స్పష్టం చేశారు. ‘పరిస్థితుల్లో మౌలిక మార్పులు’చోటుచేసుకున్న సందర్భాల్లో వియన్నా కన్వెన్షన్లోని ఆర్టికల్ 62 ప్రకారం ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించడం కూడా సాధ్యమేనని మాజీ సింధూ జల కమిషనర్ పి.కె.సక్సేనా వివరించారు. ఈ విషయంలో ఇంకా మరెన్నో చర్యలు తీసుకునే అవకాశం కూడా భారత్కు ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్ 62 ఏమంటోంది...? ఒప్పందం కుదుర్చుకున్న నాటితో పోలిస్తే అనంతర కాలంలో పరిస్థితుల్లో తలెత్తే మౌలిక మార్పులకు సంబంధించిన నియమ నిబంధనలను వియన్నా కన్వెన్షన్లోని ఆర్టికల్ 62లో పేర్కొంటుంది. అవి ఒప్పంద సమయంలో ఊహించనివై, ఆ మార్పుల ప్రభావం వల్ల ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేని పరిస్థితులు తలెత్తితే ఒప్పందాన్ని సస్పెండ్ చేయవచ్చని అది చెబుతోంది. కనుక ఈ విషయంలో పాక్ చేసేదేమీ ఉండబోదని కౌల్ అన్నారు. ‘‘చివరికి అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టినా లాభముండదు. నిరంతర ఉగ్ర దాడులు, ఫలితంగా భౌతిక, ఆర్థిక భద్రతకు, దేశ సార్వభౌమత్వానికి తలెత్తుతున్న ముప్పు ఒప్పంద పరిస్థితుల్లో మౌలిక మార్పులకు దారి తీసిందని భారత్ వాదించవచ్చు. సింధూ ఒప్పందం కుదిరిందే ఇరు దేశాల నడుమ స్నేహం, సద్భావనల స్ఫూర్తికి కార్యరూపమిచ్చేందుకు! పాక్ చర్యల నేపథ్యంలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’’అని వివరించారు. పర్యావరణ సవాళ్లు, ఉగ్ర దాడుల నేపథ్యంలో ఒప్పందాన్ని సమీక్షించి మార్చుకోవాల్సిన అవసరముందని కొన్నేళ్లుగా భారత్ చెబుతోందని గుర్తు చేశారు. ఇవన్నీ చేయొచ్చు... → ఒప్పందం సస్పెన్షన్ వల్ల సింధూ బేసిన్ నదుల నీటి ప్రవాహ నెలవారీ డేటాను భారత్ ఇకపై పాక్తో పంచుకోవాల్సిన అవసరం లేదు. → నీటి ప్రవాహాల ఉమ్మడి తనిఖీకి పాక్ అధికారులకు భారత్లోకి ప్రవేశం నిరాకరించవచ్చు. → నీటి ప్రవాహాలను నియంత్రించడం వంటి కఠిన చర్యలకు కూడా తీసుకోవచ్చు. → సింధూతో పాటు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లె జ్ నదుల ప్రవాహాలను కాల్వల వంటివాటిలోకి మళ్లించవచ్చు. వాటిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మరింత నీటిని నిల్వ చేయవచ్చు. ఇలాంటి చర్యలతో పాక్లోకి వాటి ప్రవాహాన్ని నిరోధించవచ్చు. → సింధూ బేసిన్కు సంబంధించి భారత్, పాక్ నడుమ పలు అంతర్జాతీయ వేదికలపై న్యాయపోరాటం సాగుతోంది. జీలం ఉపనది కిషన్గంగపై నిర్మిస్తున్న జల విద్యుత్కేంద్రం వంటివి వీటిలో ఉన్నాయి. ఆ వివాదాలన్నింటి నుంచీ ఇప్పుడు భారత్ ఏకపక్షంగా వైదొలగవచ్చు కూడా. → వేసవి దృష్ట్యా సింధూ బేసిన్లోని నదీ ప్రవాహాలను భారత్ ఇప్పుడు ఏమాత్రం నియంత్రించినా తాగు, సాగునీరుతో పాటు జల విద్యుత్ తదితరాల కోసం పాక్ అల్లాడటం ఖాయమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ దేశంతో మామూలు సంబంధాలు కావాలి..కానీ ఆ విషయంలో మాత్రం..
పాకిస్తాన్తో భారత్ సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటుందని భారత్ ప్రధాని మోదీ అన్నారు. అయితే ఉగ్రవాదం లేని అనుకూలమైన వాతావరణం సృష్టించడం, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో పాక్నే భాద్యత వహిస్తుందని మోదీ చెప్పారు. జపాన్లో జరిగే జీ7 సదస్సుకు గెస్ట్ కంట్రీగా భారత్ హాజరవనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అతిపెద్ద స్వతంత్ర వ్యాపార మీడియా గ్రూపులలో ఒక్కటైన నిక్కి ఆసియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఉగ్రవాదం విషయంలో పాక్ మద్దతుపై భారత్ పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదం, చర్చలు కలిసి వెళ్లలేవని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా చైనాతో సంబంధాల గురించి ప్రశ్నించిగా..దక్షిణాసియా దేశాల గొంతును, వారి ఆందోళనను తెలియజేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు గురించి మాట్లాడారు. భారత్ తన సౌర్వభౌమాధికారం, గౌరవం కాపాడుకునేందుకు సిద్దంగానే గాక అందుకు కట్టుబడి ఉందన్నారు. 2020లో చైనా సైన్యంతో చర్యలు తర్వాత తూర్ప లడఖ్లో ప్రతిష్టంభన ఏర్పడిందన్నారు. ఈ చర్చలు కొన్ని ప్రాంతాలను విడదీసేలా ఘర్షణ కలిగించాయి. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు నెరపాలంటే సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత చాలా అవసరమని చెప్పారు. భారత్-చైనా సంబంధాల భవిష్యత్తు, అభివృద్ధి, పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనాలపై మాత్రమే ఆధారపడి ఉందన్నారు. అంతేగాదు ఇరు దేశాల విస్తృత సంబంధాలు ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు. ఇక రష్యా ఉక్రెయిన్ వివాదంలో భారత్ మధ్యవర్తి పాత్ర పోషించగలదా అని సంధించిన ప్రశ్నకు..ఉక్రెయిన్ వివాదంపై తమ దేశం వైఖరి స్పష్టంగా తిరుగులేనిదని మోదీ చెప్పారు. భారత్ ఎప్పుడూ శాంతివైపు నిలుస్తుంది. ప్రాథమిక అవసరాలను తీర్చడంలో సవాళ్లను ఎదుర్కొనే వారికి మద్దతు ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్లతో తాము కమ్యూనికేషన్ కొనసాగిస్తామన్నారు. సహాయ సహకారాలతో సమయాన్ని నిర్వచించాలి గానీ సంఘర్షణతో కాదు అని చెప్పారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన వంటి విలువలే జపాన్, భారత్ని మరింత దగ్గర చేశాయని ప్రధాని మోదీ అన్నారు. తాము ఇప్పుడూ ఆర్థిక ప్రయోజనాల్లో పెరుగుతున్న రాజకీయ, వ్యూహాత్మక భద్రత కలయికను చూస్తున్నాం అని చెప్పారు. ఇదిలా ఉండగా జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం జపాన్లోని హిరోషిమా చేరుకున్నారు. ఈ సమ్మిట్కు భారత్ను అతిధిగా ఆహ్వానించారు. 2003 నుంచే జీ7 సదస్సులో భారత్ పాల్గొంటోంది. (చదవండి: నాడు అద్దె గదిలో జూనియర్ లాయర్గా ప్రారంభమై..నేడు సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి..) -
కశ్మీర్పై బహుపరాక్!
కశ్మీర్ ఉద్రిక్తతలు ఎడతెగకుండా సాగుతున్నకొద్దీ బయటివారు ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉంటారని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్టెర్స్ చేసిన తాజా వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఇరు దేశాలూ చర్చలద్వారా కశ్మీర్ సమస్య పరిష్కరించుకునేలా ఒప్పించడం కోసమే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో మూడుసార్లు, ప్రధాని నరేంద్రమోదీతో రెండుసార్లు మాట్లాడానని ఆయన చెప్పు కున్నారు. ఆయన దీన్ని మధ్యవర్తిత్వం నెరపడంగా చెప్పడం లేదు. సమస్యను వారే మాట్లాడుకుంటారని అంటున్నారు. అయితే అమెరికా ఇంతకు మించి మాట్లా డింది. ఆమధ్య ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తమ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ‘ఒప్పందాలు కుదర్చడంలో ఉన్న అసాధారణ నైపుణ్యం’ కశ్మీర్ సమస్య పరి ష్కారానికి దోహదపడుతుందని ప్రకటించారు. సరిగ్గా పాకిస్తాన్ కోరుకుంటున్నది ఇదే. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారకుండా చూస్తే...కశ్మీర్ కల్లోలం ఎప్పటికీ ఆగకపోతే ప్రపంచ దేశాలు తన దారికి వస్తాయని, భారత్పై ఒత్తిడి తెస్తాయని ఆ దేశం అనుకుంటోంది. కనుకనే ఈ రెండు అంశాల్లోనూ మన దేశం అత్యంత జాగరూకతతో అడుగులేయాల్సిన అవసరం ఉంటుంది. మునుపటితో పోలిస్తే అంతర్జాతీయ పరిస్థితుల్లో గణనీయంగా మార్పు లొచ్చాయి. మూడేళ్లనాడు బీజేపీని విజయపథంలో నడిపించిన ‘అబ్కీ బార్, మోదీ సర్కార్’ నినాదాన్ని పుణికిపుచ్చుకుని ట్రంప్ కూడా అధ్యక్ష ఎన్నికల్లో భార తీయ అమెరికన్లను ఆకర్షించారు. చాలా విషయాల్లో మోదీ, ట్రంప్ అభిప్రాయాలు కలుస్తున్నాయి గనుక ఆయన వైఖరి మనకే అనుకూలంగా ఉంటుందని కొందరు అంచనా వేశారు. కానీ ట్రంప్ ఫక్తు వ్యాపారవేత్త. ఆయనకు భారత్–పాక్ల మధ్య ఉన్న కశ్మీర్ వివాదం రియల్ఎస్టేట్ గొడవగా కనిపిస్తున్నట్టుంది. బిల్డర్గా స్థలా లను సేకరించడం కోసం రకారకాల వ్యక్తులతో మాట్లాడటం, ఒప్పించడం ట్రంప్ కున్న చిరకాల అనుభవం. దాన్నే మైక్ పెన్స్ ‘అసాధారణ నైపుణ్యం’గా లెక్కేశారు. ఆయనే కాదు... ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఉంటున్న నికీ హెలీ రెండు నెలలక్రితం ఆ మాదిరే మాట్లాడారు. ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు తగ్గడం కోసం రెండు పక్షాలతో చర్చించి మధ్యవర్తి పాత్ర పోషిస్తామని ఆమె చెప్పారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతలు లేకుండా చూడటమే తమ ధ్యేయమన్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇటీవల మన దేశ పర్యటనకొచ్చినప్పుడు కూడా మధ్య వర్తిత్వం ప్రతిపాదన చేశారు. ఇలా పాక్ ఎప్పటినుంచో చేస్తున్న వాదనలకు అను కూలంగా లేదా దాని అభిప్రాయాలకు చేరువగా ఉండే మాటలు వినబడటం క్రమేపీ పెరుగుతున్నదని వీటన్నిటినీ గమనిస్తే అర్ధమవుతుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జరిగినప్పుడల్లా కశ్మీర్ సమస్యను లేవనెత్తడం, ఆ వివాదంలో జోక్యం చేసుకుని పరిష్కరించమని కోరడం పాకిస్తాన్కు రివాజు. అన్ని సందర్భాల్లోనూ మన దేశం ఆ వాదనను ఖండిస్తూ వస్తోంది. కశ్మీర్ విషయంలో రెండు దేశాల మధ్యా వివాదం ఉన్న సంగతిని మనం కాదనడం లేదు. చారిత్రక వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్క రించుకుందామని మన దేశం ప్రతిపాదిస్తూనే ఉంది. అయితే అందుకోసం సరిహద్దుల్లో శాంతి నెల కొనాలని, రాష్ట్రంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే పనులు మానుకోవాలని అంటోంది. ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి ప్రయత్నం జరిగిన ప్రతిసారీ పాక్ ఏదో రకంగా దానికి గండికొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అదే సమయంలో వీలు దొరికినప్పుడల్లా ఈ సమస్యలో అంతర్జాతీయ జోక్యం అవ సరమంటూ డిమాండ్ చేస్తోంది. భారత రాజ్యాంగ పరిధిలో కశ్మీరీల ఆకాంక్షలను సాకారం చేస్తామని గతంలో ప్రధానులుగా పనిచేసిన పీవీ నరసింహారావు, వాజపేయి, మన్మోహన్సింగ్ పలుమార్లు చెప్పారు. వాజపేయి అయితే జమ్ము– కశ్మీర్ సహా ఎనిమిది అంశాలపై సమగ్ర చర్చలు జరపడానికి లాహోర్కు బస్సు దౌత్యం నెరపారు. అదృష్టవశాత్తూ మన దేశంలో పార్టీల మధ్య ఎన్ని విభేదాలున్నా కశ్మీర్ సమస్యపై వాటన్నిటిదీ ఒకటే మాట. కేంద్రంలో ఏ పార్టీ లేదా కూటమికి చెందిన ప్రభుత్వాలున్నా ఆ సమస్యపై మూడో పక్షం జోక్యాన్ని నిర్ద్వంద్వంగా వ్యతి రేకిస్తూనే వస్తున్నాయి. జమ్మూ–కశ్మీర్లోని ప్రధాన రాజకీయ పార్టీలన్నిటిదీ ఇదే వైఖరి. రాజకీయంగా ఈ స్థాయిలో ఏకాభిప్రాయం ఉన్నప్పుడు రాష్ట్రంలో అంతర్గ తంగా ప్రశాంత పరిస్థితులు ఎందుకు నెలకొల్పలేకపోతున్నారు? రాష్ట్రంలోని నొవాత్తా జిల్లాలోని మసీదు వెలుపల శాంతిభద్రతల పరిరక్షణలో ఉన్న డీఎస్పీ ఒకరిపై బుధవారం గుంపు దాడిచేసి అత్యంత పాశవికంగా కొట్టి చంపిన ఉదంతం అక్కడ నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతుంది. గత కొన్ని నెలలుగా అక్కడ ఆందోళనలు సాగుతున్నాయి. భద్రతాబలగాలపై దాడులు, ఉద్యమాలు ఆగడం లేదు. ఇదిలా రావణకాష్టంలా మండుతున్నకొద్దీ ప్రపంచంలో అందరి దృష్టీ దానిపై కేంద్రీకృతమవుతుంటుంది. పాకిస్తాన్కు, కశ్మీర్లో ఉద్రిక్తతలను రెచ్చగొడు తున్న శక్తులకు మరింత ఊతమిస్తుంది. జమ్మూ–కశ్మీర్లో పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయని అందరూ ఆశపడ్డారు. అది లేకపోగా పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. పీడీపీ నాయకురాలు, ముఖ్యమంత్రి మెహబూబా అటు కేంద్రాన్ని తన ఆలోచనలతో ప్రభావితం చేయలేకపోతున్నారు. ఇటు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని చక్కదిద్ద లేకపోతున్నారు. చెప్పాలంటే ఆమెకు ఇరువైపులా విశ్వసనీయత లేకుండా పోయిందన్న అభిప్రాయం కలుగుతుంది. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు గమనించి అయినా కశ్మీర్లో ప్రశాంతత నెలకొనేలా చూడటం, ప్రజాస్వామిక వాతావరణం ఏర్పర్చడం తక్షణావసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఆ దిశగా అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి. లేనట్టయితే కశ్మీర్పై గట్టెర్స్ మొదలుకొని ఎర్డోగాన్ వరకూ ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతూనే ఉంటారు.