Indus Waters Treaty: సస్పెన్షన్‌ సాధ్యమే  | International Law Allows India To Suspend Indus Waters Treaty With Pakistan, Know Complete Details Inside | Sakshi
Sakshi News home page

Indus Waters Treaty: సస్పెన్షన్‌ సాధ్యమే 

Apr 27 2025 12:58 AM | Updated on Apr 27 2025 4:13 PM

International law allows India to suspend Indus Waters Treaty with Pakistan

సింధూ ఒప్పందంపై నిపుణుల స్పష్టీకరణ 

పూర్తిగా తిరస్కరించవచ్చు కూడా

అంతర్జాతీయ చట్టాల్లో వీలుంది

పూర్తిస్థాయి యుద్ధాలు. కార్గిల్‌ వంటి దురాక్రమణలు. మరెన్నో లెక్కలేనన్ని దుశ్చర్యలు. గత 75 ఏళ్లలో భారత్‌పై పాకిస్తాన్‌ మతిలేని ఉన్మాద చర్యలు అన్నీ ఇన్నీ కావు. అయినా సామాన్య పాకిస్తానీలను దృష్టిలో పెట్టుకుని సింధూ జల ఒప్పందాన్ని భారత్‌ ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చింది. ఆర్థికంగానే గాక అన్నివిధాలా పతనావస్థకు చేరినా దాయాదికి ఇక బుద్ధి రాబోదని పహల్గాం దాడితో తేలిపోయింది. 

దాంతో ఓపిక నశించి పాక్‌కు శాశ్వతంగా బుద్ధి చెప్పే చర్యల్లో భాగంగా సింధూ ఒప్పందాన్ని భారత్‌ సస్పెండ్‌ చేసింది. ఏకపక్షంగా అలా చేసే అధికారం భారత్‌కు లేదంటూ పాక్‌ గగ్గోలు పెడుతోంది. ఇది తమపై యుద్ధ ప్రకటనేనంటూ ఆక్రోశిస్తోంది. అయితే అంతర్జాతీయ చట్టాల మేరకు భారత్‌ చర్య సబబేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోని పక్షంలో సింధూ ఒప్పందానికి నూకలు చెల్లుతాయంటూ పాక్‌ను భారత్‌ ఎన్నోసార్లు హెచ్చరించింది. సస్పెన్షన్‌కు సంబంధించి ఒప్పందంలో స్పష్టమైన నిబంధనలేవీ లేవు. పైగా అందులోని ఆర్టికల్‌ 12 ప్రకారం ఒప్పందానికి సవరణలు, ఇరుదేశాల ఆమోదంతో పూర్తిగా రద్దు మాత్రమే సాధ్యం. అలాంటప్పుడు సస్పెన్షన్‌ నిర్ణయాన్ని ఏ ప్రాతిపదికన తీసుకున్నారన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. 

1969 వియన్నా కన్వెన్షన్, ఇతర అంతర్జాతీయ న్యాయ ఒప్పందాల ప్రకారం అలా చేసేందుకు వీలుందని సీనియర్‌ అడ్వకేట్‌ నీరజ్‌ కిషన్‌ కౌల్‌ స్పష్టం చేశారు. ‘పరిస్థితుల్లో మౌలిక మార్పులు’చోటుచేసుకున్న సందర్భాల్లో వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్‌ 62 ప్రకారం ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించడం కూడా సాధ్యమేనని మాజీ సింధూ జల కమిషనర్‌ పి.కె.సక్సేనా వివరించారు. ఈ విషయంలో ఇంకా మరెన్నో చర్యలు తీసుకునే అవకాశం కూడా భారత్‌కు ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. 

ఆర్టికల్‌ 62 ఏమంటోంది...? 
ఒప్పందం కుదుర్చుకున్న నాటితో పోలిస్తే అనంతర కాలంలో పరిస్థితుల్లో తలెత్తే మౌలిక మార్పులకు సంబంధించిన నియమ నిబంధనలను వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్‌ 62లో పేర్కొంటుంది. అవి ఒప్పంద సమయంలో ఊహించనివై, ఆ మార్పుల ప్రభావం వల్ల ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేని పరిస్థితులు తలెత్తితే ఒప్పందాన్ని సస్పెండ్‌ చేయవచ్చని అది చెబుతోంది. కనుక ఈ విషయంలో పాక్‌ చేసేదేమీ ఉండబోదని కౌల్‌ అన్నారు. ‘‘చివరికి అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టినా లాభముండదు. 

నిరంతర ఉగ్ర దాడులు, ఫలితంగా భౌతిక, ఆర్థిక భద్రతకు, దేశ సార్వభౌమత్వానికి తలెత్తుతున్న ముప్పు ఒప్పంద పరిస్థితుల్లో మౌలిక మార్పులకు దారి తీసిందని భారత్‌ వాదించవచ్చు. సింధూ ఒప్పందం కుదిరిందే ఇరు దేశాల నడుమ స్నేహం, సద్భావనల స్ఫూర్తికి కార్యరూపమిచ్చేందుకు! పాక్‌ చర్యల నేపథ్యంలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’’అని వివరించారు. పర్యావరణ సవాళ్లు, ఉగ్ర దాడుల నేపథ్యంలో ఒప్పందాన్ని సమీక్షించి మార్చుకోవాల్సిన అవసరముందని కొన్నేళ్లుగా భారత్‌ చెబుతోందని గుర్తు చేశారు. 

ఇవన్నీ చేయొచ్చు... 
→ ఒప్పందం సస్పెన్షన్‌ వల్ల సింధూ బేసిన్‌ నదుల నీటి ప్రవాహ నెలవారీ డేటాను భారత్‌ ఇకపై పాక్‌తో పంచుకోవాల్సిన అవసరం లేదు. 
→ నీటి ప్రవాహాల ఉమ్మడి తనిఖీకి పాక్‌ అధికారులకు భారత్‌లోకి ప్రవేశం నిరాకరించవచ్చు. 
→ నీటి ప్రవాహాలను నియంత్రించడం వంటి కఠిన చర్యలకు కూడా తీసుకోవచ్చు. 
→ సింధూతో పాటు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లె జ్‌ నదుల ప్రవాహాలను కాల్వల వంటివాటిలోకి మళ్లించవచ్చు. వాటిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మరింత నీటిని నిల్వ చేయవచ్చు. ఇలాంటి చర్యలతో పాక్‌లోకి వాటి ప్రవాహాన్ని నిరోధించవచ్చు. 
→ సింధూ బేసిన్‌కు సంబంధించి భారత్, పాక్‌ నడుమ పలు అంతర్జాతీయ వేదికలపై న్యాయపోరాటం సాగుతోంది. జీలం ఉపనది కిషన్‌గంగపై నిర్మిస్తున్న జల విద్యుత్కేంద్రం వంటివి వీటిలో ఉన్నాయి. ఆ వివాదాలన్నింటి నుంచీ ఇప్పుడు భారత్‌ ఏకపక్షంగా వైదొలగవచ్చు కూడా. 
→ వేసవి దృష్ట్యా సింధూ బేసిన్‌లోని నదీ ప్రవాహాలను భారత్‌ ఇప్పుడు ఏమాత్రం నియంత్రించినా తాగు, సాగునీరుతో పాటు జల విద్యుత్‌ తదితరాల కోసం పాక్‌ అల్లాడటం ఖాయమే.     

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement