breaking news
health cards distribution
-
‘డిజిటల్ హెల్త్’లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్(ఆభా) కార్డుల జారీలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచిందని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) ఐటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ గోపాల్ తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సభ్యులకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ కృషి చేస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్యక్రమంలో ప్రైవేట్ ఆస్పత్రులు భాగస్వాములు కావాలని చెప్పారు. ఆభా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జీఎస్ నవీన్కుమార్ మాట్లాడుతూ డిజిటల్ యుగం వైపు దేశం దూసుకుపోతున్న తరుణంలో వైద్య, ఆరోగ్య రంగం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాలకు వెళ్లిన వైద్యులు ప్రజలకు అందించే వైద్య సేవలను వారి ఆభా ఐడీలకు అనుసంధానం చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల ప్రజలు ఎక్కడికి వెళ్లినా వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలిసిపోతుందని, సత్వర వైద్యం అందించేందుకు దోహదపడుతుందని వివరించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి, ఆయుష్మాన్ భారత్ ప్రత్యేకాధికారి బీవీ రావు, డాక్టర్ కోటిరెడ్డి, పాల్గొన్నారు. -
ప్రతి కుటుంబానికి హెల్త్కార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి హెల్త్కార్డు ఇవ్వాలని, క్యూ ఆర్ కోడ్తో వీటిని జారీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయన్నారు. కార్డు స్కాన్ చేయగానే సంబంధిత కార్డుదారుడికి ఓటీపీ నెంబర్ వచ్చేలా ఉండాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబర్ 21 నుంచి కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న ప్రతి ఒక్కరికీ ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ’ వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 104, 108 వాహనాలు కొత్తవి కొనుగోలు చేయాలని, సెప్టెంబర్ చివరికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం సూచనలు చేశారు. వైద్య చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 2020 జనవరి 1 నుంచి పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించాలని ఆదేశించారు. పథకాన్ని మూడు నెలలపాటు వైద్య ఆరోగ్యశాఖ అధ్యయనం చేసిన తర్వాత క్రమంగా అన్ని జిల్లాలకు వర్తింప చేస్తామని వివరించారు. సదుపాయాలను బట్టి ఆస్పత్రుల కేటగిరీలు ఆరోగ్యశ్రీలో కొత్తగా చేర్చాల్సిన వ్యాధుల జాబితాను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకునే నెట్వర్క్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. థర్డ్ పార్టీతో ఆస్పత్రులను తనిఖీలు చేయిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. నాణ్యమైన వసతులు, సౌకర్యాలు ఉన్న ఆస్పత్రులను ‘ఏ ప్లస్’, ‘ఏ’ కేటగిరీలో చేర్చాలని, నామమాత్రంగా ఉన్నవాటిని ‘బి’ కేటగిరీలో ఉంచి మెరుగైన వసతులు కల్పించేందుకు గడువు ఇవ్వాలని సీఎం సూచించారు. మళ్లీ తనిఖీలు చేసినప్పుడు లోపాలుంటే నెట్వర్క్ జాబితా నుంచి తొలగించాలని, ప్రమాణాలు, సౌకర్యాలు లేని ఆస్పత్రులను ‘సి’ కేటగిరీలో చేర్చి వాటిని జాబితా నుంచి పూర్తిగా లేకుండా చేయాలన్నారు. ఏపీ వెలుపల 150 ఆస్పత్రుల్లో.. కేవలం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న సుమారు 150 ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో ఈ ఆస్పత్రుల సేవలను నవంబర్ మొదటి వారం నుంచి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధికి చర్యలు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ‘ఏ ప్లస్’ కేటగిరీలోకి తీసుకెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఆస్పత్రుల్లో ఫొటోలు తీసి చేపట్టాల్సిన పనులను ప్రాధాన్య క్రమంలో నిర్ణయించాలన్నారు. మందులు, రక్తపరీక్షల కోసం ఎవరూ ఆస్పత్రినుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండకూడదని సీఎం ఆదేశించారు. పరికరాల నిర్వహణ టెండరులో ఒక షరతుగా ఉండాలని, దీనివల్ల ప్రతి ఆస్పత్రిలో పరికరాలు సక్రమంగా పని చేస్తాయన్నారు. 2021 సెప్టెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ వైద్య పరికరాలన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో వైఎస్సార్ క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్న భోజనం లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 5 క్యాన్సర్ ఆస్పత్రులు రాష్ట్రంలో పూర్తి సదుపాయాలతో ఐదు క్యాన్సర్ ఆస్పత్రులను కడప, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని, పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు కింద కంటి పరీక్షలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆపరేషన్లు, కళ్లద్దాలు అవసరమైన వారిని గుర్తించి వైద్యసేవలు అందించాలన్నారు. సమావేశంలో పాల్గొన్న వారిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.జవహర్రెడ్డి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా తదితరులు ఉన్నారు. సీఎంను కలసిన నిపుణుల కమిటీ వైద్య శాఖలో సంస్కరణలపై నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసింది. కమిటీ చైర్పర్సన్ సుజాతారావు ఆధ్వర్యంలోని ఈ కమిటీ ముఖ్యమంత్రి దృష్టికి పలు అంశాలను తెచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి, రోగులకు అందుతున్న సేవలు, పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్) అమలుపై వివరించింది. ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలను పకడ్బందీగా అమలు చేయటంపై నివేదించింది. సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనున్నట్టు కమిటీ తెలిపింది. పట్టాలు తప్పిన ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెడుతున్నాం పట్టాలు తప్పిన ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు. కొత్తగా 3 మెడికల్ కాలేజీలు, పేద రోగులకు అండగా ఉండేందుకు 5 క్యాన్సర్ ఆస్పత్రులు, 2 కిడ్నీ ఆస్పత్రుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రాధాన్యతల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రులను, 108, 104 సర్వీసులను మెరుగు పరుస్తున్నామని తెలిపారు. – డిసెంబర్ 21 నుంచి రాష్ట్రంలో హెల్త్కార్డుల జారీ ప్రక్రియ – క్యూ ఆర్ కోడ్తో ప్రతి కుటుంబానికి కార్డు జారీ – చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి – పశ్చిమ గోదావరి జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా జనవరి 1 నుంచి ప్రారంభం – క్రమంగా అన్ని జిల్లాలకు విస్తరణ – మెరుగైన సదుపాయాలు కల్పించే ఆస్పత్రులు ‘ఏ ప్లస్’, ‘ఏ’ కేటగిరీలోకి – ఏపీ వెలుపల 150 ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపు – హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో నవంబర్ నుంచి మొదలు – అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా కంటి పరీక్షలు -
'వీధి రౌడీలా వ్యవహరిస్తున్న కేసీఆర్'
కర్నూలు: కేసీఆర్ తన పదవికి తగినట్టు ప్రవర్తించకుండా వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఏపీ సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని అన్నారు. కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ అని గుర్తుచేశారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మైనారిటీల ఆస్తులు కబ్జాకు గురైయ్యాయని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి జీవో 18 అమలు చేశామని తెలిపారు. చంద్రబాబు చేతుల మీదుగా మే7న హెల్త్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్టు ప్రకటించారు.