breaking news
gulzarilal nanda
-
Nanda Birth Anniversary: సొంతిల్లు లేని ప్రధాని.. జీవన భృతి కూడా వద్దంటూ..
భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే మన దేశ రెండవ ప్రధాని(తాత్కాలిక) గుల్జారీలాల్ నందా గురించి చాలా తక్కువమందికే తెలుసు. ఆయన 1964, 1966లలో రెండుసార్లు భారతదేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించారు. నేడు (జూలై 4) గుల్జారీలాల్ నందా జన్మదినం. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం.గుల్జారీలాల్ నందా 1898, జులై 4న ప్రస్తుత పాకిస్తాన్లోని సియాల్కోట్లో జన్మించారు. నందా తన విద్యాభ్యాసాన్ని లాహోర్, ఆగ్రా, అలహాబాద్లలో పూర్తి చేశారు. 1997లో ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. గుల్జారీలాల్ నందా 1957, 1962లలో రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం నందా 1964 మే 27న తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నాడు అతని పదవీకాలం 13 రోజులు. దీని తరువాత తాష్కెంట్లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత నందా 1966, జనవరి 11న మరోమారు తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం చేశారు. గుల్జారీ లాల్ నందా 1962, 1963లో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిగా, 1963 నుంచి 1966 వరకు హోం వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు.దేశానికి రెండుసార్లు ప్రధానిగా, దీర్ఘకాలం కేంద్రమంత్రిగా పనిచేసిన గుల్జారీ లాల్ నందాకు చివరి రోజుల్లో సొంత ఇల్లు కూడా లేదు. అద్దె చెల్లించడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు. కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో గుల్జారీ లాల్ నందాను ఇంటి యజమాని వెళ్లగొట్టాడు. ఈ వార్త దావానంలా మారడంతో నాటి కేంద్ర ప్రభుత్వం కొందరు అధికారులను నందా దగ్గరకు పంపింది. వారు స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే రూ. 500 భృతిని తీసుకునేందుకు నందాను అతికష్టం మీద ఒప్పించారు. గుల్జారీలాల్ నందా మాజీ ప్రధాని అని ఆ ఇంటి యజమానికి తెలియడంతో అతను నందాకు క్షమాపణలు చెప్పాడు. గుల్జారీ లాల్ నందా తన 99 సంవత్సరాల వయసులో 1998, జనవరి 15న కన్నుమూశారు. -
రెండు సార్లు ఆయాచిత ప్రధాని!!
ప్రధానమంత్రి పదవి రావడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా ఏమాత్రం ప్రయత్నించకుండా.. దానంతట అదే వచ్చి వరిస్తే? అలాంటి అదృష్టం ఒకటి కాదు, రెండుసార్లు వచ్చిన వ్యక్తి గుల్జారీ లాల్ నందా. ఇప్పటి పాకిస్థాన్లోని సియాల్కోట్ ప్రాంతంలో 1898లో పుట్టిన నందా.. 1952లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పుడే ఆయన ప్రణాళిక, నీటిపారుదల, విద్యుత్ శాఖల మంత్రిగా నియమితులయ్యారు. అనంతరం 1957 ఎన్నికల్లో మళ్లీ గెలిచి కార్మిక, ఉపాధికల్పన, ప్రణాళిక శాఖల మంత్రిగా చేశారు. 1962లో నందా మరోసారి గుజరాత్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పుడు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరణించినప్పుడు 1964లో తొలిసారి నందాను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించారు. అప్పుడు ఆయన 13 రోజుల పాటు ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. మరోసారి 1966లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించినప్పుడు కూడా మళ్లీ నందానే ఆపద్ధర్మ ప్రధానిగా ఎంచుకున్నారు. రెండుసార్లూ ఆయన 13 రోజుల చొప్పున మాత్రమే ఈ పదవి నిర్వహించడం మరో విశేషం. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఆ పదవిని చేపట్టి, దేశానికి ఎలాంటి ముప్పు లేకుండా చూడగలిగిన సమర్థత నందా సొంతం. 1962లో చైనాతో యుద్ధం, 1965లో పాకిస్థాన్తో యుద్ధం వచ్చిన తర్వాత అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఆ పదవిని నిర్వహించి, తదుపరి ప్రధానమంత్రులకు జాగ్రత్తగా అప్పగించారు.