breaking news
Grand Prix Gold title
-
'మకావు'లో సింధు కేక
మళ్లీ మన ‘రాకెట్’ మెరిసింది. రెండు వారాల క్రితం చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా నెహ్వాల్, శ్రీకాంత్ సాధించిన అపూర్వ విజయాలు మదిలో మెదులుతుండగానే... మరో తెలుగు తేజం పి.వి.సింధు తీపి కబురు అందించింది. మకావు ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి దిగ్విజయంగా తన టైటిల్ను నిలబెట్టుకుంది. ఈ ఏడాదిని విజయంతో సగర్వంగా ముగించింది. టైటిల్ నిలబెట్టుకున్న తెలుగు తేజం ⇒ ఫైనల్లో అలవోక విజయం ⇒ కెరీర్లో మూడో గ్రాండ్ప్రి గోల్డ్ టైటిల్ ⇒ రూ. 5 లక్షల 60 వేల ప్రైజ్మనీ సొంతం మకావు: నిలకడగా రాణిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు నిరూపించింది. అపార ప్రతిభ సొంతమైనా... ఆటలో నిలకడలేమి కారణంగా ఈ హైదరాబాద్ అమ్మాయి ఈ సీజన్ను ఒక్క టైటిల్ కూడా నెగ్గకుండానే ముగిస్తుందా అనే అనుమానం కలిగింది. కానీ ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఈ సంవత్సరం చివరి గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నమెంట్ మకావు ఓపెన్లో 19 ఏళ్ల సింధు చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సింధు 21-12, 21-17తో కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సింధుకు 9 వేల డాలర్ల ప్రైజ్మనీ (రూ. 5 లక్షల 60 వేలు)తోపాటు 7 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 45 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సింధు ఆద్యంతం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. కళ్లు చెదిరే స్మాష్లు... నెట్ వద్ద అప్రమత్తత... ర్యాలీల్లో పైచేయి... ఇలా ప్రతి అంశంలో ఈ తెలుగు తేజం తన ఆధిపత్యాన్ని చాటుకొని కొరియా అమ్మాయికి ఏ దశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వలేదు. సెమీఫైనల్లో ప్రపంచ 19వ ర్యాంకర్ యూ సున్ (చైనా)ను ఓడించిన కిమ్ హ్యో మిన్ ఫైనల్లో మాత్రం సింధు దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో విఫలమైంది. తొలి గేమ్ ఆరంభంలో సింధు 0-3తో వెనుకబడినా ఆ వెంటనే కోలుకొని స్కోరును 8-8 వద్ద సమం చేసింది. ఆ తర్వాత సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13-8తో ఆధిక్యంలోకి వెళ్లింది. కిమ్ పుంజుకునేందుకు కృషి చేసినా సింధు అవకాశమివ్వకుండా ఈసారి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 19-9తో ముందంజ వేసింది. అదే జోరులో తొలి గేమ్ను దక్కించుకుంది. రెండో గేమ్లో సింధుకు కాస్త పోటీ ఎదురైంది. ఒకదశలో ఇద్దరి మధ్య తేడా ఒక పాయింట్ ఉంది. కానీ కీలకదశలో ఈ హైదరాబాద్ అమ్మాయి పైచేయి సాధించి మూడు పాయింట్లు నెగ్గి 20-16తో ఆధిక్యాన్ని సంపాదించి, అదే ఉత్సాహంలో మరో పాయింట్ కైవసం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. సింధు కెరీర్లో ఇది మూడో గ్రాండ్ప్రి గోల్డ్ టైటిల్. గతేడాది ఆమె మలేసియా ఓపెన్, మకావు ఓపెన్ టైటిల్స్ను సాధించింది. ఈ ఏడాది సింధు ప్రపంచ చాంపియన్షిప్లో, ఆసియా చాంపియన్షిప్లలో కాంస్య పతకాలు గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో, ఉబెర్ కప్లోనూ కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. ఇండియన్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్గా నిలిచింది. స్విస్ ఓపెన్లో సెమీస్లో ఓడిన సింధు... డెన్మార్క్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, సింగపూర్ ఓపెన్లలో మాత్రం క్వార్టర్ ఫైనల్స్లో వెనుదిరిగింది. ఒకే అంతర్జాతీయ టోర్నీని వరుసగా రెండుసార్లు గెల్చుకున్న రెండో భారతీయ క్రీడాకారిణిగా సింధు నిలిచింది. గతంలో సైనా నెహ్వాల్ ఈ ఘనతను మూడుసార్లు సాధించింది. సంతోషంగా ఉంది విజయంతో 2014 సంవత్సరాన్ని ముగించడం సంతోషంగా ఉంది. వరుసగా రెండో ఏడాది మకావు గ్రాండ్ప్రి గోల్డ్ టైటిల్ను గెల్చుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. నా ప్రత్యర్థి ఫైనల్కు ముందు అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించింది. కాబట్టి ఆమెను బలహీన ప్లేయర్గా చెప్పలేం. వరుస గేమ్లలో మ్యాచ్ ముగిసినా ఆమె గట్టి పోటీ ఇవ్వడంతో గెలుపు కోసం శ్రమించాల్సి వచ్చింది. నా ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాను. కెరీర్లో గుర్తుంచుకోదగ్గ విజయాలు ఈ ఏడాది నాకు లభించాయి. వరల్డ్ చాంపియన్షిప్లో, ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచాను. కొన్ని పరాజయాలు ఉన్నా ఎలాంటి బాధ లేదు. గ్లాస్గోలో స్వర్ణంతో పాటు ఏషియాడ్లో వ్యక్తిగత పతకం గెలవాల్సింది. మరింత కష్టపడి వచ్చే సంవత్సరం ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తాను. - పీవీ సింధు -
ప్రణయ్ ‘పవర్
పాలెమ్బాంగ్ (ఇండోనేసియా): అంచనాలకు మించి రాణించిన భారత యువతార హెచ్ఎస్ ప్రణయ్... ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఐదోసీడ్ ప్రణయ్ 21-11, 22-20తో క్వాలిఫయర్ ఫిర్మాన్ అబ్దుల్ కొలిక్ (ఇండోనేసియా)పై గెలిచాడు. తద్వారా కెరీర్లో తొలి గ్రాండ్ప్రి గోల్డ్ టైటిల్ను సొంతం చేసుకోవడమే కాకుండా... విదేశీగడ్డపై ఈ ఘనత సాధించిన మూడో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. గతంలో శ్రీకాంత్ (థాయ్లాండ్ ఓపెన్), అరవింద్ భట్ (జర్మన్ ఓపెన్) ఈ ఘనత సాధిం చాడు. గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రణయ్కు విజేత హోదాలో తొమ్మిది వేల డాలర్ల (రూ. 5 లక్షల 50 వేలు) ప్రైజ్మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. అబ్దుల్తో 43 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో ప్రణయ్ ఆకట్టుకున్నాడు. తొలి గేమ్ ఆరంభంలో 6-2 ఆధిక్యంలో నిలిచిన అతను దాన్ని అలాగే కొనసాగిస్తూ చివర్లో ఐదు వరుస పాయింట్లతో గేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్లో కాస్త పుంజుకున్నట్లు కనిపించిన ఫిర్మాన్ పలుమార్లు స్కోర్లు సమం చేశాడు. అయితే కీలకదశలో ప్రణయ్ పైచేయి సాధించాడు. ‘ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. గ్రాండ్ప్రి గోల్డ్ టైటిల్ గెలుస్తానని అనుకోలేదు. వియత్నాం ఓపెన్ ఫైనల్లో ఓడిన తర్వాత చాలా నిరాశకు గురయ్యా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కో మ్యాచ్పై దృష్టిపెట్టా. ప్రాథమికాంశాలకు కట్టుబడి ఆడితే గెలుపు గురించి ఆలోచించాల్సిన పని లేదు. అది ఫలితాన్నిచ్చింది’ అని ప్రణయ్ వ్యాఖ్యానించాడు. Pranay HS, badminton, Grand Prix Gold title