పేదలకు అండగా వైఎస్సార్ సీపీ
రామచంద్రపురం(ఉంగుటూరు) : కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడంలో వైఎస్సార్ సీపీ ముందుంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని చెప్పారు. మంగళవారం రాత్రి నల్లమాడు శివారు రామచంద్రపురంలో జరిగిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం జిల్లాలో దిగ్విజయంగా జరుగుతుందని చెప్పారు. ఎన్నికలప్పుడు అలవికాని హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని మరిచిపోయారని విమర్శించారు. రెండున్నరేళ్లయినా వాటిలో ఒక్కదానిని కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు నమ్మిన ప్రజలను వంచించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ సీపీ నిరంతరం పేదల పక్షానే ఉంటుందన్నారు. రామచంద్రపురంలో వర్షం పడుతున్నా.. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం విజయవంతం అయిందంటే దీనికి ప్రజల ఆదరాభిమానాలే కారణమన్నారు. వైఎస్సార్ సీపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో 12 గ్రామాలలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించామని, విశేష స్పందన వచ్చిందని చెప్పారు. అంతకుముందు గ్రామస్తులు ఆళ్లనానికి సాదరస్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మాజేటి సురేష్, పార్టీ మండల కన్వీనర్లు మరడ మంగరావు(ఉంగుటూరు), రావిపాటి సత్యశ్రీనివాస్(భీమడోలు), సంకు సత్య కుమార్(నిడమర్రు), రామచంద్రపురం నాయకులు గౌతు అప్పారావు, గౌతు రాము, శివ శంకర్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.