-
Sagubadi: మండుటెండల్లోనూ కన్నుల పండుగగా.. సౌరాష్ట్ర ‘ఫుడ్ ఫారెస్ట్లు’
నరోత్తం భాయ్ జాదవ్.. చిన్న రైతు. కరన్షి అభయ్సింగ్ పర్మర్.. పెద్ద రైతు. వీరిది గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరానికి 150 కి.మీ. దూరంలోని బొటాడ్ జిల్లా. వీరు 9 నెలల క్రితం చెరొక ఎకరంలో 5 దొంతర్ల పంటల అడవి సాగునుప్రాంరంభించారు. సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో ఎకరానికి 2 టన్నుల ఘనజీవామృతం వేస్తూ, 10–15 రోజులకోసారి ద్రవజీవామృతం డ్రిప్, పిచికారీ చేస్తూ తొలి ఏడాదే గణనీయంగా ఆదాయం పొందుతున్నారు. ఎత్తుమడులపై కొలువుదీరిన ఈ వత్తయిన ఉద్యాన తోటలు చూపరులకు కన్నుల పండుగ చేస్తున్నాయి. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ ఈ 5 లేయర్ మోడల్ క్షేత్రాలను మార్చి 31న సుమారు 500 మంది రైతులకు స్వయంగా చూపించి ఆశ్చర్యచకితులను చేశారు. ఈ క్షేత్రాలను సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు గ్రౌండ్ రిపోర్ట్. బొటాడ్ జిల్లాలో వార్షిక సగటు వర్షపాతం 500–600 ఎం.ఎం. మాత్రమే. ఎక్కువ మంది రైతులు వర్షాధారంగానే పంటలు పండిస్తారు. పత్తి, గోధుమ, సోంపు తదితర పంటలను ఏక పంటలుగా అక్కడి రైతులు రసాయనిక పద్ధతిలో పండిస్తారు. అయితే, పాలేకర్ పద్ధతిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, ఇతరత్రా పంటలతో కూడిన 5 దొంతర్ల సాగు అల్ప వర్షపాత ప్రాంంతాల్లో సైతం రైతులకు ఏడాది పొడవునా పౌష్టికాహార భద్రతను, ఆదాయ భద్రతను అందిస్తాయని ఈ ఇద్దరు రైతులు రుజువు చేస్తున్నారు. ఈ సుసంపన్న క్షేత్రాలను స్వయంగా రైతులకు చూపించిన సుభాష్ పాలేకర్.. అందుకు దోహదం చేసిన ప్రకృతి సేద్య సూక్ష్మాలను రైతులకు విశదీకరించారు. 3 రోజుల శిక్షణా శిబిరంలో ప్రతి చిన్న విషయాన్నీ విడమర్చి చెప్పి, నోట్సు రాయించారు. శ్రద్ధగా రాసుకున్న ప్రతినిధుల్లో సాధారణ రైతులతో పాటు ఇద్దరు డాక్టర్లూ ఉండటం విశేషం. 5 అడుగుల బెడ్లపై 70 పంటలు! నరోత్తమ్ భాయ్ జాదవ్ (96872 57381– హిందీ/గుజరాతీ) స్వగ్రామం గుజరాత్ బొటాడ్ జిల్లా రాంపూర్ తాలూకాలోని నగనేశ్. ఆయనకు 5 ఎకరాల నల్లరేగడి మెట్ట భూమి ఉంది. 2017 నుంచి పాలేకర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 9 నెలల క్రితం ఒక ఎకరంలో.. చివరి దుక్కిలో 2 వేల కిలోల ఘనజీవామృతం వేశారు. 5 అడుగుల వెడల్పున ఎత్తుమడులు, పక్కన 3 అడుగుల వెడల్పున కాలువలు ఏర్పాటు చేశారు. బొ΄్పాయి, చెరకు, అరటి, మునగ, చిక్కుడు, కంది, జామ, సొర, కాకర, టొమాటో, మిరప, పసుపు, గాజర్, ఉల్లి, శనగ, తులసి, సోంపు, బీట్రూట్, ముల్లంగి, ఆకుకూరలతో పాటు కొబ్బరి, బాదం, అంజీర, జీడిమామిడి, సీతాఫలం, రామాఫలం, బత్తాయి, దానిమ్మ, అవకాడో తదితర పండ్ల మొక్కల్ని కూడా నాటారు. నరోత్తమ్ ఫుడ్ ఫారెస్ట్లో రైతులతో సుభాష్ పాలేకర్ బెడ్లపై ఆ చివరన, ఈ చివరన వై ఆకారంలో పంగల ఇనుప స్టాండ్లను పాతి.. వాటికి పైన 8, కింద 4 తీగలు కట్టి.. వాటిపైకి చిక్కుడు, ఆనప, కాకార వంటి పంటలను పాకించారు. పంట వ్యర్థాలతో బెడ్లపై మొక్కల మధ్య ఆచ్ఛాదన చేశారు. బెడ్లపైన పంటలకు నాలుగు డ్రిప్ లైన్ల ద్వారా బోరు నీటిని అందిస్తున్నారు. పంటలన్నీటినీ ఒకేసారి కాకుండా 3 నెలల్లో దశల వారీగా నాటామని రైతు నరోత్తమ్ వివరించారు. ‘నా భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా రోజువారీ తోట పనుల్లో భాగస్వాములవుతారు. ఒక కూలీ కూడా పనిచేస్తుంటారు. హైవే పక్కనే ఉండటం వల్ల పంట ఉత్పత్తులను తోట దగ్గర కొన్ని అమ్ముతాం. మిగతా వాటిని అహ్మదాబాద్లో గురు, ఆదివారాల్లో అమ్ముతున్నాం. కిలో రూ. 80 నుంచి 140 ధరకు నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నాం..’ అన్నారాయన. 5 లేయర్ మోడల్ పంటల సాగుకు ఎకరానికి అన్నీ కలిపి రూ. 3,50,000 పెట్టుబడి పెట్టగా.. ఇప్పటి వరకు 9 నెలల్లో రూ. 2,87,000 ఆదాయం వచ్చిందని, మరో మూడు నెలల్లో పెట్టుబడి పెట్టిన దానికన్నా ఎక్కువ మొత్తంలోనే ఆదాయం వస్తుందని నరోత్తమ్ ధీమాగా చె΄్పారు. పండ్ల చెట్లు పెరిగిన తర్వాత ఏడాదికి ఆదాయం రూ. 6 లక్షలకు పెరుగుతుందన్నారు. సుమారు 70 రకాల ఉద్యాన పంటలను 5 దొంతర్లలో సాగు చేస్తుండటం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. కనువిందు చేసిన పంటల అడవి కరన్షి అభయ్సింగ్ పర్మర్ (99793 59711 హిందీ/గుజరాతీ) స్వగ్రామం బొటాడ్ జిల్లా రాంపూర్ తహశిల్ వెజల్క. 40 ఎకరాల ఆసామి. మెట్ట వ్యవసాయం. 2019 నుంచి పాలేకర్ పద్ధతిలోనే సేద్యం అంతా. 5 ఆవులు ఉన్నాయి. 6 వేల లీటర్ల జీవామృతం ట్యాంకు కట్టి, నేరుగా డ్రిప్ డ్వారా జీవామృతం పది రోజులకోసారి పంటలకు ఇస్తున్నారు. పది రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. 20 ఎకరాల్లో బీటీ పత్తి వేస్తారు. 5 ఎకరాల్లో పచ్చిగడ్డి, గోధుమ, మిగతా పొలంలో మొక్కజొన్న, శనగ,పెసర, జిలకర, సోంపు వంటి పంటలు వేస్తారు. గుజరాత్లోని వెజల్క గ్రామంలో కరన్షి సృష్టించిన దట్టమైన పంటల అడవి ఒక ఎకరంలో 9 నెలల క్రితం పాలేకర్ పద్ధతిలో 5 దొంతర్ల నమూనాలో అనేక పంటలను 5 అడుగుల వెడల్పు బెడ్స్పై డ్రిప్తో సాగు చేస్తున్నారు. చివరి దుక్కిలో 2 వేల కిలోల ఘనజీవామృతం వేశారు. 5 అడుగుల వెడల్పున ఎత్తుమడులు ఏర్పాటు చేసి 20 పంటలను సాగు చేస్తున్నారు. బెడ్స్పై ఆ చివరన, ఈ చివరన వై ఆకారంలో పంగల ఇనుప స్టాండ్లను పాతి.. వాటికి పైన 8, కింద 4 తీగలు కట్టి.. వాటిపైకి చిక్కుడు, ఆనప తీగలను పాకించారు. కరన్షికి చెందిన నల్లరేగడి భూమిలో ఏర్పాటైన 5 లేయర్ తోటలో ఎత్తుగా, ఆకుపచ్చగా ఆరోగ్యంగా ఎదిగిన మధుబిందు అనే దేశీ రకం బొప్పాయి చెట్లు, అరటి గెలలు, ఎత్తుగా ఎదిగిన దేశీ టొమాటో పొదలు, వంగ చెట్లు కన్నుల పండుగ చేస్తున్నాయి. ఆ చెట్లకు ఉన్న కాతను చూసి రైతులు అవాక్కయ్యారు. మార్చి ఆఖరు నాటికి చుట్టూతా ఒకటి అరా పొలాల్లో సోంపు, గోధుమ పంటలు మాత్రమే కోతకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, అనేక పంటలతో పచ్చగా ఉంది కరన్షి తోట మాత్రమే. సుభాష్ పాలేకర్ ఈ ఫుడ్ ఫారెస్ట్ గురించి ఒక్కమాటలో చె΄్పాలంటే అద్భుతం అని అభివర్ణించారు. రైతు కరన్షి మాట్లాడుతూ, తాను 9 నెలల క్రితం మొదట చెరకు నాటానన్నారు. తర్వాత నాలుగు అడుగులకు ఒకచోట అరటి, బొ΄్పాయి, మునగ, మామిడి, సపోట, జామ, నిమ్మ, కొబ్బరి, అవిశ,పోక, తమలపాకు, ఆపిల్, ఉల్లి, గాజర్ తదితర మొక్కలు పెట్టుకుంటూ వచ్చానన్నారు. అంచుల్లో దుంప పంటలు పెట్టానన్నారు. ఏ పంటైనా మార్కెట్ ధర కన్నా రూ. 20 ఎక్కువ ధరకు అమ్ముతున్నామన్నారు. ఈ 5 లేయర్ ఫుడ్ ఫారెస్ట్ను ఎకరంలో నిర్మించడానికి ఇప్పటి వరకు రూ. 1,40,000 ఖర్చు చేశానని, 9 నెలల్లో రూ. 1,38,000 ఆదాయం వచ్చిందన్నారు. మరో 2 నెలల్లో మరో రూ. లక్షకు పైగా ఆదాయం వస్తుందన్నారు. ఈ ఫుడ్ ఫారెస్ట్లో టొమాటో, వంగ మొక్కలు మనిషి ఎత్తు పెరిగి మంచి దిగుబడి ఇస్తున్నప్పటికీ వాటికి వైరస్ ఆశించటాన్ని గమనించిన రైతులు పాలేకర్ను వివరణ అడిగారు. నల్లరేగడి భూమిలో నీటిని ఎక్కువగా ఇవ్వటమే ఇందుకు కారణమని పాలేకర్ అన్నారు. డ్రిప్ కన్నా స్ప్రింక్లర్లు మేలన్నారు. పంటల అడవులు.. పలు ప్రత్యేకతలు.. నేల: నల్లరేగడి (ఏ నేలలోనైనా చేయొచ్చు) విస్తీర్ణం: 1 ఎకరం. ఎరువు: సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో సాగు. చివరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల ఘన జీవామృతం (పాలేకర్ ఎకరానికి 400 కిలోలు చాలంటున్నా రైతులు 2 టన్నులు వేశారు). బెడ్లు: 5 అడుగుల వెడల్పున ఎత్తు మడులు (బెడ్ల మధ్య 3 అడుగుల దూరం). గడ్డీగాదంతో ఆచ్ఛాదన ముఖ్యం. ఎత్తు మడులపై ఏ పంటైనా పండించొచ్చు. వర్షం ఎక్కువైనా, తక్కువైనా తట్టుకుంటాయి. పంటల వైవిధ్యం: ఖాళీ లేకుండా 20–70 వరకు వత్తుగా 4 వరుసలుగా రకరకాల ఎత్తు పెరిగే సీజనల్, దీర్ఘకాలిక పంటలు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతులు, దుంపలు, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్య పంటలు, పప్పుధాన్యాలు, చెరకు.. బెడ్లపైనే ‘వై’ ఆకారపు ఇనుప ఫ్రేమ్లకు ప్లాస్టిక్ తాళ్లు కట్టి అనేక రకాల తీగజాతి కూరగాయల సాగు. దేశీ వంగడాలు: పంట ఏదైనా దేశీ విత్తనమే. ప్రతి రైతూ విత్తన రేతే. డ్రిప్: బెడ్లపై 4 లైన్ల డ్రిప్ (మన నేలలకు డ్రిప్ కన్నా స్ప్రింక్లర్లు మేలు: పాలేకర్). 10 రోజులకోసారి నీటితోపాటు ద్రవ జీవామృతం. పిచికారీ: 15 రోజులకోసారి ద్రవజీవామృతం. అవసరాన్ని బట్టి కషాయాలు. దిగుబడి: నిరంతరం. పూర్తయ్యే పంట పూర్తవుతుంటే విత్తే పంట విత్తుకోవాలి. అనుదినం పనితో పాటు ఏడాది పొడవునా పౌష్టికాహార, ఆదాయ భద్రత. మార్కెటింగ్: రైతే ధర నిర్ణయించుకొని, నేరుగా వినియోగదారులకే అమ్మకం. ఆదాయం: తొలి ఏడాదే రూ. 2 లక్షల ఆదాయం. ఆరేళ్ల నుంచి రూ. 6 లక్షల ఆదాయం. రైతు కరన్షి పర్మర్ ప్రతి రైతుకూ ఫుడ్ ఫారెస్ట్! 5 దొంతర్ల ఫుడ్ ఫారెస్ట్ నమూనా ఒక అద్భుతం. ఆహార సార్వభౌమత్వాన్ని, స్వావలంబనను అందించే ఫుడ్ ఫారెస్ట్ రైతు కుటుంబానికి ఎంతో అవసరం. కనీసం ఒక ఎకరంలో ఏర్పాటు చేసుకోవాలి. అనేక పంటలు పండించుకుంటూ ఇంటిల్లపాదీ తినటం, మిగతా పంటలను నేరుగా వినియోగదారులకే తాము నిర్ణయించిన ధరకు అమ్ముకోవటం ద్వారా ఏడాది పొడవునా మంచి ఆదాయం కూడా పొందవచ్చు. రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో పాటు పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలు, మసాలా దినుసులు, చివరకు చిరుధాన్యాలను కూడా పండించుకోవటానికి ఈ నమూనాలో అవకాశం ఉంది. చెరకు సాగు చేసుకొని ఇంట్లోనే బెల్లం తయారు చేసుకోవచ్చు. నీరు నిలవని,సున్నపు రాళ్లు లేని భూముల్లో (రాళ్ల భూమైనా ఫర్వాలేదు) ఫుడ్ ఫారెస్ట్ను 5 అడుగుల వెడల్పున ఎత్తు మడులు చేసి, వాటి మధ్యన 3 అడుగుల కాలువలు తవ్వుకోవాలి. బెడ్స్ తయారు చేసుకోవడానికి ముందే వర్షం పడినప్పుడు లేదా తడులు పెట్టి అయినా రెండు సార్లు కలుపు మొలిపించి, నిర్మూలిస్తే ఆ తర్వాత ఇక కలుపు సమస్య ఉండదు. దుక్కిలో ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం సరిపోతుంది. అయితే, గుజరాత్ రైతులు అందుబాటులో ఉంది కాబట్టి 2 వేల కిలోలు వేశారు. దేశీ విత్తనాలు, రకాలే వాడాలి. నర్సరీ మొక్కలు వద్దు. సొంతంగానే మొక్కలను తయారు చేసుకొని నాటుకోవాలి. స్వావలంబన ద్వారా రైతులు అన్ని విధాలుగా సుస్థిరత సాధించాలి. 5 లేయర్ ఫుడ్ ఫారెస్ట్ల ద్వారా ఎకరానికి తొలి ఏడాదే రూ. 2 లక్షల (ఆరేళ్ల నుంచి రూ. 6 లక్షల) ఆదాయం పొందుతున్న ఈ రైతుల నుంచి దేశంలో రైతులందరూ స్ఫూర్తి పొందాలి. – పద్మశ్రీ గ్రహీత డా. సుభాష్ పాలేకర్ (98503 52745) -
Sagubadi: మార్కెట్ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం..
రైతు దంపతులు బండారి వెంకటేష్, విజయకు ప్రయోగాలంటే ప్రాణం. చదివింది పదో తరగతే అయినా, ఉద్యాన పంటల సాగులో భేష్ అనిపించుకుంటున్నారు. ఇతర రైతులకు భిన్నంగా మార్కెట్కు తగిన పంటలు పండించడం, దళారులకు విక్రయించకుండా నేరుగా మార్కెటింగ్ చేయటం వారి సక్సెస్కు ముఖ్య కారణాలుగా నిలిచాయి. వెంకటేష్, విజయ దంపతులది జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామం. ఖర్భూజ (పుచ్చ) పంటను తమకున్న 3 ఎకరాల్లో నవంబర్ నుండి మే నెల వరకు గత మూడేళ్లుగా సాగు చేస్తున్నారు. దీని పంట కాలం 90 రోజులు. ఒకేసారి పొలం మొత్తంలో విత్తనాలు వేయకుండా, కొన్ని రోజుల వ్యవధిలో ఐదు దఫాలుగా విత్తుతారు. శివరాత్రి నుంచి ఎండలు ముదురుతాయి. అప్పటి నుంచి మే వరకు పుచ్చకాయలు మార్కెట్కు వచ్చేలా సాగు చేస్తారు. ప్రతి రోజు టన్ను నుంచి టన్నున్నర కాయలు జగిత్యాల మార్కెట్కు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. మార్కెట్ల్లో డిమాండ్ ఉన్న ఖర్భూజ రకాలను సాగుచేస్తుంటారు. ఈ ఏడాది ఐదు రకాల ఖర్భూజ పండ్లను సాగు చేశారు. సాధారణ ఖర్భూజ (సూపర్ క్వీన్ రకం), లోపల పసుపు పచ్చగా బయట ఆకుపచ్చగా ఉండే విశాల్ రకం, లోపల ఎర్రగా బయట పసుపు పచ్చగా ఉండే అరోహి రకం, గుండ్రంగా ఉండే జన్నత్ రకం, మస్క్మిలన్ (జ్యూస్ రకం) సాగు చేశారు. ఈ విత్తనాలను బెంగళూర్ నుంచి తెప్పించారు. ఖర్భూజ విత్తనాలు వేయక ముందు భూమిలో కోళ్ల ఎరువు, పశువుల పేడ వేసి, రెండు సార్లు దున్నిస్తారు. తర్వాత, బెడ్ మేకర్తో బెడ్ తయారు చేసి, మల్చింగ్ షీట్ వేసి, డ్రిప్ ద్వారా సాగు నీరు అందిస్తుంటారు. రసాయన ఎరువులు, పురుగు మందులు పెద్దగా వాడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకుంటారు. జగిత్యాలలో ఖర్భూజ కాయలు అమ్ముతున్న వెంకటేష్ 3 నెలలు కష్టపడి పంట పండించి, ఆ పంటను దళారులకు విక్రయిస్తే కిలోకు రూ. 5–6 ధర కూడా రాదు. అందుకని ఈ రైతు దంపతులు తామే నేరుగా వినియోగదారులకు అమ్ముతారు. విజయ సాయంత్రం తోటకు వెళ్లి కూలీల సాయంతో కాయలను తెంపుతుంటారు. వెంకటేష్ ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి, ఒక్కరిద్దరి సహాయంతో కాయలను ట్రాక్టర్లో లోడ్ చేస్తారు. ఇంటి వద్ద భోజనం చేసి ఉ. 8 గంటలకు జగిత్యాలకు వచ్చి, ప్రభుత్వ మహిళా డిగ్రి కళాశాల వద్ద అమ్ముతారు. ఈ సమాచారం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో మంచి గిరాకీ వస్తోంది. కిలో రూ. 25 నుంచి 49 వరకు రకాన్ని బట్టి విక్రయిస్తున్నారు. మార్కెట్ కంటే తక్కువ ధరకు ఇవ్వడంతో పాటు కాయలు నాణ్యతగా, రంగు రంగుల్లో ఉండటంతో వినియోగదారులు సైతం ఈ రైతు దగ్గర కొనటానికి ఆసక్తి చూపుతున్నారు. ఖర్భూజ సాగుతో పాటు ఏడాది పొడవునా ఏదో రకం కూరగాయలు, పండుగలప్పుడు పూలు కూడా సాగు చేస్తున్నారు. ఏ పంట పెట్టినా, అందులో అధిక దిగుబడులు సాధిస్తారు. వ్యవసాయాన్ని వ్యాపారంలా మార్చితేనే రైతులకు లాభం అనే మాటను వీరు చేసి చూపిస్తున్నారు. పలువురు యువ రైతులు వీరిని అనుసస్తున్నారు. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ డిమాండ్ను బట్టి పంట మార్చుతాం! ఐదారు రకాల ఖర్భూజ కాయలు పండించేందుకు చాలా కష్టపడుతున్నాం. ఆ పంటను దళారులకు విక్రయిస్తే విత్తనాల ఖర్చు కూడా రావడం లేదు. మార్కెట్లో డిమాండ్ను బట్టి రకాన్ని మార్చుతాం. నా పంటకు నేనే రాజును. నేరుగా అమ్ముతున్నాను. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రజలు మా దగ్గర కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ను గమనించుకుంటూ.. భార్యభర్త కలిసి పనిచేస్తే వ్యవసాయం తృప్తిగా ఉంటుంది. మంచి ఆదాయమూ వస్తుంది. – బండారి వెంకటేష్, విజయ (62818 13273). నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Sagubadi: నేలపైన కాదు.. నేరుగా వేర్లకే 'తడి తగిలేలా'.. -
సాగుబడి: సస్యగవ్యతో.. బంజరు భూమి సాగు!
మన దేశంలో 28.7% భూమి (9 కోట్ల 78 లక్షల హెక్టార్ల భూమి బంజరు భూమి ఉంది. విచ్చలవిడిగా రసాయనాల వినియోగం వల్ల పూర్తిగా నిస్సారమై సాగుయోగ్యం కాకుండా పోయిన భూమి కూడా ఇందులో కలసి ఉంది. ఇటువంటి రాళ్లూ రప్పలతో కూడిన బంజరు, నిస్సారమైన భూములను సైతం కేవలం ద్రవరూప ఎరువు ‘సస్యగవ్య’తో పునరుజ్జీవింపచేయ వచ్చని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. వేదకాలం నాటి కృషిపరాశర గ్రంథం నుంచి తీసుకున్న సాగు పద్ధతిలో బంజరు భూములను, నిస్సారమైన భూములను పునరుజ్జీవింపజేస్తూ తిరిగి సాగులోకి తేవడానికి ఉపయోగపడే వినూత్న ప్రకృతి సేద్య పద్ధతిని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ అనుసరిస్తోంది. అనేక రకాల పండ్ల మొక్కలను ఐదేళ్లుగా ఈ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తోంది. వనపర్తి జిల్లా మదనాపురంలోని ఉద్యాన బోధనా క్షేత్రంలో 11 ఎకరాల రాళ్లతో కూడిన బంజరు భూమిలో అసిస్టెంట్ ్రపొఫెసర్ డా. జడల శంకరస్వామి 2019 నుంచి ఈ ప్రయోగాత్మక సాగు పద్ధతిని అవలంభిస్తూ భూమిని క్రమంగా సారవంతం చేస్తున్నారు. ఎత్తుమడులు.. అధిక సాంద్రత.. 11 ఎకరాలను ఎకరం ప్లాట్లుగా చేసి నేల తీరుకు సరిపోయే పంటలను సాగు చేస్తున్నారు. ఉదాహరణకు రాళ్లు రప్పలతో కూడిన నేలలో దానిమ్మ (భగువ) రకం మొక్కల్ని అధిక సాంద్రతలో ఎకరానికి 300 నాటారు. అదేవిధంగా, 7 రకాల మామిడి, మూడు రకాల అంజూర, జామ, మునగ తదితర తోటలను వేశారు. భూమిని దుక్కి చేసి 2.5 అడుగులు (75 సెం.మీ.) వెడల్పుతో.. సాళ్ల మధ్యలో మీటరు లోతున తవ్విన మట్టిని పోసి 2 మీటర్ల ఎత్తున బెడ్స్ చేశారు. సాళ్ల మధ్య 16 అడుగులు, మొక్కల మధ్య 10 అడుగుల దూరం పాటించారు. ఎత్తుమడులపై మొక్కలు అధిక సాంద్ర పద్ధతిలో నాటి డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. గుంతకు 5 కిలోల వర్మీ కంపోస్టు వేసి మొక్కలు నాటారు. ఇక ఆ తర్వాత ఎటువంటి రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ, పిచికారీలు గానీ చేయటం లేదు. కలుపు మొక్కలే బలం! ఏ పొలంలో మొలిచే కలుపు మొక్కలను పీకి ఆ పొలంలోనే ఆచ్ఛాదనగా వాడటంతో పాటు.. ఆ మొక్కలను మురగబెట్టి సస్యగవ్య అనే ద్రవ రూప ఎరువును తయారు చేస్తున్నారు. దీన్ని అదే పొలంలో గడ్డీ గాదాన్ని కుళ్లించడానికి వినియోగించటం ద్వారా భూమిని సారవంతం చేసుకోవచ్చు. బంజరు భూముల్ని, సారం కోల్పోయిన భూముల్ని సాగులోకి తేవటానికి బయటి నుంచి ఎటువంటి ఉత్పాదకాలను ఖర్చుపెట్టి కొని తెచ్చి వేయాల్సిన అవసరం లేదని రైతులకు తెలియజెప్పడానికే ఈ ప్రయోగాన్ని చేపట్టామని డా. శంకరస్వామి ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. కలుపు మొక్కలుగా మనం భావించేవాటిలో చాలా మటుకు నిజానికి ఔషధ మొక్కలేనని అంటూ.. వాటిని పీకి పారేయటం కాకుండా అదే నేలలో కలిపేస్తే చాలు. కలుపు ఆచ్ఛాదనపై సస్యగవ్య పిచికారీ ఇక ఏ రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు చల్లకుండా ఉంటే.. ఆ భూమిలోనే ఉండే సూక్ష్మజీవరాశి సంరక్షించబడి భూమిని క్రమంగా సారవంతం చేస్తుందని ఆయన తెలిపారు.గులక రాళ్లు సైతం భూసారాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని తమ అనుభవంలో వెల్లడైందన్నారు. గణనీయంగా పెరిగిన సేంద్రియ కర్బనం.. సస్యగవ్యతో సేద్యం చేయనారంభించిన తొలి దశలో, నాలుగేళ్ల తర్వాత పండ్ల తోటలో భూసార పరీక్షలు చేయించగా భూసారం గణనీయంగా వృద్ధి చెందింది. 11 ఎకరాల్లో సగటున సేంద్రియ కర్బనం 0.24 నుంచి 0.53కి, సేంద్రియ పదార్థం 0.1 నుంచి 1%కి పెరిగింది. వీటితో పాటు మట్టిలో టోటల్ నైట్రోజన్ 0.015 నుంచి 0.045కి పెరిగిందని డా. శంకర స్వామి తెలిపారు. సస్యగవ్యను వరుసగా నాలుగేళ్లు వాటం వల్ల సాగుకు యోగ్యం కాని భూమిని కూడా తిరిగి సారవంతం చేయటం సాద్యమేనన్నారు. ఒక్కో రకం పండ్ల తోట సాగులో ఉన్న తోటలో వేర్వేరు రకాల కలుపు మొక్కలు, ఔషధ మొక్కలు మొలుస్తున్న విషయం గుర్తించామన్నారు. మట్టిలోని గులకరాళ్లు కూడా పరోక్షంగా మట్టిని సారవంతం చేయడానికి పరోక్షంగా దోహదపడుతున్నట్లు కూడా గుర్తించామని అంటూ.. సాగు భూమిలోని గులక రాళ్లు పనికిరానివేమీ కాదన్నారు. బెడ్స్ మధ్యలో రాళ్ల భూమి - బోడ్స్ మధ్య కలుపు ఆచ్ఛాదన ‘సస్యగవ్య’ తయారీ ఇలా.. పొలంలో మొలిచిన కలుపు మొక్కలను ఏడాదికి మూడు దఫాలు పీకి వాటితో సస్యగవ్యను డా. శంకర స్వామి తయారు చేయిస్తున్నారు. ఆ పొలంలోని తాజా కలుపు మొక్కలు కిలో, తాజా ఆవు పేడ కిలో, ఆవు మూత్రం లీటరు, రెండు లీటర్ల నీటి (1:1:1:2)తో కలిపి పొలంలోనే నీడన ఫైబర్ పీపాల్లో మురగబెడుతున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం కలియదిప్పుతుంటే 10–12 రోజుల్లో సస్యగవ్య ద్రవ రూప ఎరువు సిద్ధమవుతుంది. ఆ పొలంలోనే సాళ్ల మధ్యలో ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం, ఆకులు అలములు, కొమ్మలు రెమ్మలపై సస్యగవ్యను 1:1 పాళ్లలో నీరు కలిపి పిచికారీ చేస్తున్నారు. వారం తర్వాత ఆ గడ్డీ గాదాన్ని రొటోవేటర్తో మట్టిలో కలియదున్ని, ఆ మట్టిపై మరోసారి సస్యగవ్యను పిచికారీ చేస్తున్నారు. తద్వారా ఈ సేంద్రియ పదార్థం కుళ్లి మట్టిలో కలిసిపోయి భూమి సారవంతం అవుతోంది. ఏడాదిలో మూడు సీజన్లలో కొత్తగా కలుపు మొలిచినప్పుడు ఆ కలుపు మొక్కలతో మాత్రమే దీన్ని తయారు చేసి వాడుతున్నారు. భూమిని సారవంతం చేయటానికి ఈ ఒక్క పని తప్ప మరే ఎరువూ వేయటం లేదు. డ్రిప్ ద్వారా అవసరం మేరకు నీరు మాత్రం క్రమం తప్పకుండా ఇస్తున్నారు. రైతులు అనుసరించడానికి ఇది చాలా అనువైన, ఖర్చులేని పద్ధతని డా. శంకరస్వామి అంటున్నారు. ఇంతకీ దిగుబడి ఎంత? స్వల్ప ఖర్చుతోనే బంజరు భూముల్ని, రసాయనిక వ్యవసాయం వల్ల నిస్సారమైన భూముల్ని తిరిగి సారవంతం చేసుకొని ఫలసాయాన్నిచ్చేలా పునరుజ్జీవింపచేయొచ్చని మా ప్రయోగం రుజువు చేసింది. సస్యగవ్యతో కూడిన ప్రకృతి సేద్యంలో 4 ఏళ్ల తర్వాత ఒక్కో దానిమ్మ (భగువ) చెట్టుకు 3.96 కిలోల పండ్లు, అంజూర (డయాన) చెట్టుకు 13.8 కిలోల పండ్లు, జామ (అలహాబాద్ సఫేది) చెట్టుకు 1.65 కిలోల దిగుబడి వచ్చింది. బయటి నుంచి ఏదీ కొని వేయకుండా సాధించిన ఫలసాయం ఇది. – డా. జడల శంకరస్వామి (97010 64439), ఉద్యాన కళాశాల, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం -
పండ్ల తోటలకు ప్రభుత్వ తోడ్పాటు
ఈ రైతు పేరు ఉడుముల పిచ్చిరెడ్డి. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం రాచకొండ స్వగ్రామం. 2019 వరకు తనకున్న రెండెకరాల్లో మిర్చి, పత్తి లాంటి వాణిజ్య పంటలు సాగు చేసేవాడు. నాటుకునే మొక్కలు మొదలు.. పండ్ల తోట ద్వారా ఫలసాయం వచ్చే దాకా వివిధ రూపాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలుసుకుని 2020లో తైవాన్ జామ పంట సాగు చేశాడు. మొక్కలు తెచ్చుకోవడానికి ప్రభుత్వమే డబ్బులిచ్చింది. నాటేటప్పుడు గుంతల ఖర్చు, తర్వాత కలుపు తీసేందుకు కూలి డబ్బులు, అవసరమైనప్పుడు నీళ్లకు డబ్బులిచ్చింది. మొక్కలు నాటిన ఏడు నెలల నుంచే ఫలసాయం రావడం మొదలైంది. కాయల కోత ఖర్చులు పోను ఏటా రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల దాకా మిగులుతోంది. గతంలో మిర్చి, పత్తి పంటలు వేసినప్పటి కంటే ఇప్పుడే నికర ఆదాయం వస్తోందని పిచ్చిరెడ్డి ఆనందంగా చెబుతున్నాడు. ఇదే జిల్లా పీసీపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వీరపునేని బాలచెన్నయ్య తన పొలం, తన సోదరుడి పొలం.. మొత్తం రెండెకరాల్లో 2021 జూన్లో 800 తైవాన్ జామ మొక్కలు నాటాడు. గుంతలు తీసేందుకు ప్రభుత్వం రూ. 50 వేలు ఆర్థిక సాయం చేసింది. కాపలా, నీటి తడుల కోసం ఇప్పటి దాకా రూ.72 వేలు ఇచ్చింది. ప్రస్తుతం పంట తీరును బట్టి ఎకరాకు రూ.50 వేలకు పైగా నికర ఆదాయం వస్తుందని సంతోషంగా చెబుతున్నాడు. సాక్షి, అమరావతి: మెట్ట భూముల్లో వర్షాధారంగా కంది, పత్తి వంటి పంటలు పండించుకునే రైతులు 1,18,842 మందికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మూడేళ్లుగా పండ్ల తోటల పెంపకానికి పూర్తి స్థాయిలో ఆర్థిక తోడ్పాటును అందజేసింది. మొక్కలు నాటుకోవడానికి గుంతలు తవ్వడం మొదలు.. మొక్కల కొనుగోలు, నాటిన మొక్కలకు నీటి తడుల ఖర్చు, పెంపకంలో అవసరమయ్యే ఎరువు ఖర్చుల వంటిì వాటన్నింటికీ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ రూపాల్లో ఆర్థిక సహాయం చేసింది. మూడేళ్లలో రైతులకు ఎకరాకు రూ.1,35,141 దాకా లబ్ధి చేకూర్చింది. ప్రభుత్వం అందజేస్తోన్న ఆర్థిక సహాయంతో ఆగస్టు 2019 – 2022 మార్చి మధ్య 1,18,842 మంది రైతులు 1,75,493 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు రూ.400.28 కోట్లు ఆర్థిక సహాయం అందజేసిందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది కూడా పండ్ల తోటల సాగుకు ముందుకొచ్చే రైతులను గుర్తించే ప్రక్రియ అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని చెప్పారు. మూడో వంతు మామిడి సాగే మామిడి, జీడిమామిడి, బత్తాయి, నిమ్మ, జామ, సపోట, కొబ్బరి, దానిమ్మ, రేగు, సీతాఫలం, నేరేడు, ఆయిల్ పామ్, అంజూర వంటి పండ్ల మొక్కల పెంపకానికి ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తోంది. పండ్ల తోట సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతుకు తొలి ఏడాది రూ.65 వేల దాకా, రెండో ఏడాది మరో రూ.35 వేలు, మూడో ఏడాది రూ.33–34 వేల మధ్య ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని అధికారులు వెల్లడించారు. మూడేళ్లుగా ఈ పథకం ద్వారా 33 శాతం మంది రైతులు మామిడి తోటలనే సాగు చేశారని అధికారులు వెల్లడించారు. 2019లో 20,824 ఎకరాల్లో, 2020లో 22,147 ఎకరాల్లో మామిడి తోటలు సాగయ్యాయి. ఏటా రూ.1000 కోట్ల ఆదాయం మామిడి, జీడి, కొబ్బరి పంటలను సాగు చేసుకునే రైతులకు ఏటా ఎకరాకు రెండు లక్షల దాకా నికర ఆదాయం ఉంటుంది. మార్కెట్లో వివిధ రకాల పండ్లకు ఉన్న డిమాండ్ మేరకు పంట తక్కువ వచ్చే ఏడాది కూడా ఎకరాకు లక్ష ఆదాయం గ్యారంటీగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. పండ్ల తోటలు సాగు చేసిన వారిలో దాదాపు మూడో వంతు మంది రైతులు ఏటా నికర ఆదాయం పొందుతున్నారు. వీరి ఆదాయం ఏటా రూ.1,000 కోట్లకు తక్కువ లేదన్నది అంచనా అని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. -
మొన్నటి వరకు కరువు ఛాయలు.. ఇప్పుడు ఉద్యాన సిరులు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లాలో పండ్ల తోటల సాగు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్న ఈ జిల్లాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక సాగునీటి వనరులు అందుబాటులోకి రావడంతో పండ్ల తోటల సాగు పెరిగింది. గతంతో పోలిస్తే గడిచిన మూడేళ్లలో 70 శాతానికి పైగా సాగు పెరగడం గమనార్హం. అరటి, మామిడితోపాటు సన్ననిమ్మ, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలం, కమల, చీనీ, దానిమ్మ తదితర పండ్ల తోటలను జిల్లా వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలోని 36 మండలాల పరిధిలో 86,844 ఎకరాల్లో ప్రస్తుతం పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. గడిచిన మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతోపాటు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో జీఎన్ఎస్ఎస్, తెలుగుగంగ పరిధిలోని అన్ని సాగునీటి వనరులను ప్రభుత్వం నీటితో నింపింది. దీంతో జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు దాదాపుగా భూమి పైకి వచ్చాయి. దీంతో మెట్ట ప్రాంతాల్లోనూ బోరు బావుల ద్వారా నీరు అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా రైతులు వాణిజ్య పంటల సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. అత్యధికంగా మామిడి సాగు జిల్లాలో 36 మండలాల పరిధిలో ఒక్క లింగాల, పెద్దముడియం మండలాలు మినహా మిగిలిన 34 మండలాల్లోనూ రైతులు మామిడి సాగు చేశారు. చక్రాయపేట మండలంలో అత్యధికంగా 2825 ఎకరాల్లోనూ, ఆ తర్వాత సిద్దవటం మండలంలో 1514 ఎకరాల్లోనూ మామిడి సాగైంది. మిగిలిన మండలాల్లో 500 ఎకరాలకు తగ్గకుండా మామిడి సాగులో ఉంది. జిల్లా వ్యాప్తంగా 8090 ఎకరాల్లో మామిడి సాగైంది. ఇక జిల్లా వ్యాప్తంగా 51,451 ఎకరాల్లో బత్తాయి సాగులో ఉంది. సింహాద్రిపురం మండలంలో అత్యధికంగా 14,461 ఎకరాల్లో సాగైంది. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ బత్తాయి పంట సాగులో ఉండడం గమనార్హం. దీంతోపాటు జిల్లాలో 3533 ఎకరాల్లో సన్న నిమ్మ సాగులో ఉంది. గోపవరం మండలం మినహా మిగిలిన 35 మండలాల్లోనూ నిమ్మను రైతులు సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2285 ఎకరాల్లో రైతులు దానిమ్మ పంటను సాగు చేశారు. పోరుమామిళ్ల, అట్లూరు మండలాల్లో దానిమ్మ సాగు అధికంగా ఉంది. చాపాడు, దువ్వూరు, చక్రాయపేట, చెన్నూరు మినహా మిగిలిన 32 మండలాల్లోనూ దానిమ్మ పంట సాగులో ఉండడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 17059 ఎకరాల్లో అరటి పంటను రైతులు సాగు చేశారు. అత్యధికంగా లింగాల మండలంలో 6317 ఎకరాలు, పులివెందులలో 2346 ఎకరాల్లో అరటి సాగైంది. జిల్లాలోని చెన్నూరు, వల్లూరు, చక్రాయపేట, ప్రొద్దుటూరు, రాజుపాలెం, అట్లూరు మండలాల్లో మినహా మిగిలిన 30 మండలాల్లోనూ అరటి పంట సాగైంది. ఇక 1977 ఎకరాల్లో రైతులు బొప్పాయి పంటను సాగు చేశారు. మైదుకూరు, దువ్వూరు, కాశినాయన, వేముల తదితర మండలాల్లో రైతులు ఈ పంటను అధికంగా సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో రైతులు బొప్పాయి పంటను సాగు చేశారు. వీటితోపాటు 2849 ఎకరాల్లో అంజుర, డ్రాగన్ ఫ్రూట్స్, జామ, ద్రాక్షతోపాటు పలు రకాల పండ్ల తోటలను రైతులు సాగు చేశారు. రాజుపాలెం మినహా మిగిలిన 35 మండలాల్లోనూ ఈ తరహా పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా సింహాద్రిపురంలో 15,165 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు కాగా, లింగాలలో 14,098, ముద్దనూరు 5,324, కొండాపురం 4977, వీఎన్ పల్లె 4583, వేముల 4562, చక్రాయపేట 4196 ఎకరాల్లో పండ్ల తోటలు సాగయ్యాయి. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 86,844 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు కావడం విశేషం. అరటికి మంచి ధర లభిస్తోంది గడిచిన మూడేళ్లుగా అరటి పంటకు మంచి ధర లభిస్తోంది. కరోనా కష్టాల్లోనూ ప్రభుత్వం స్వయంగా అరటి కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. ఈ ప్రాంతంలో పండే అరటి తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఈ పంట సాగుతో ఆదాయం కూడా బాగుంది. అందువల్ల అరటి సాగువైపు రైతులు మొగ్గు చూపిస్తున్నారు. – ఎ.భాస్కర్రెడ్డి, రైతు, నల్లపురెడ్డిపల్లె అన్ని ప్రాంతాలకు మామిడి ఎగుమతులు మా ప్రాంతంలో బేనీషా, లాల్ బహార్, అల్ఫాన్సా, నీలం తదితర మామిడి రకాలను పండిస్తున్నాము. బెంగళూరు, కేరళతోపాటు పలు రాష్ట్రాలకు ఇక్కడి మామిడి ఎగుమతి అవుతోంది. మేము 100 ఎకరాల్లో మామిడిని సాగు చేశాము. గడిచిన మూడేళ్లలో మామిడికి మంచి ధరే లభిస్తోంది. టన్ను రూ. 50 వేలకు తగ్గకుండా అమ్ముడవుతోంది. అందువల్ల రైతులు మామిడి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. – సూర్యప్రసాద్రెడ్డి, రైతు, చక్రాయపేట మండలం నీటి వసతితో పండ్ల తోటల సాగు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయి. దీంతో నీటి కొరత లేకుండా పోయింది. రైతులు చీనీ పంట అధికంగా సాగు చేశారు. చీనీ కాయలకు గిట్టుబాటు ధర లభిస్తోంది. టన్ను రూ. 80 వేల వరకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం రూ. 30 వేల వరకు ధర ఉంది. – అరవిందనాథరెడ్డి, రైతు, సింహాద్రిపురం పండ్ల తోటల సాగుకు రైతుల ఆసక్తి రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుండడంతో పండ్ల తోటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాల్లో డిమాండ్ మేర జిల్లా నుంచి వివిధ పండ్లను ఎగుమతి చేస్తున్నారు. ఒకవైపు అనుకున్న మేర దిగుబడులు రావడం, మరోవైపు మార్కెట్లో ఆయా పండ్లకు ఉన్న ప్రాధాన్యతను బట్టి రైతులు సాగు చేస్తున్నారు. వ్యవసాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతాంగానికి మా వంతుగా తోడ్పాటు అందిస్తున్నాము. – మైఖేల్ రాజీవ్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, వైఎస్సార్ జిల్లా దేశ వ్యాప్తంగా ఎగుమతులు పులివెందుల నియోజకవర్గంతోపాటు జిల్లా వ్యాప్తంగా సాగు చేస్తున్న అరటి పంటను ఇక్కడి నుండి తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, హైదరాబాదుతోపాటు పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ సంవత్సరం టన్ను అత్యధికంగా రూ. 24 వేల వరకు ధర పలికింది. ప్రస్తుతం టన్ను రూ. 13 వేల ధర ఉంది. కరోనా సమయంలో అరటి రైతులు ఇబ్బందులు పడ్డారు. కడప ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి చొరవతో ప్రభుత్వం టన్ను రూ. 3,500 చొప్పున రైతుల వద్ద కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి రైతులను ఆదుకుంది. జిల్లాలో బేనీషా, అల్ఫోన్సా, లాల్ బహార్, బెంగుళూర, నీలం తదితర రకాల మామిడి సాగవుతోంది. ఈ పంటను బెంగుళూరు, కేరళ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ పండే బేనీషా దేశ వ్యాప్తంగానే కాకుండా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. గత మూడేళ్లలో మామిడికి మంచి ధరలే ఉన్నాయి. టన్ను రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అమ్ముడుపోయింది. రూ. 50 వేలకు ఎప్పుడూ తగ్గలేదు. జిల్లాలో పండుతున్న చీనీకి దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. తెలంగాణ ప్రాంతంలో పండే చీనీ కంటే మన జిల్లాలో పండుతున్న చీనీకి మంచి నాణ్యత కలిగినదిగా పేరుంది. ఈ రకం ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. గడిచిన మూడేళ్లలో చీనీకి మంచి ధర లభించింది. అత్య«ధికంగా టన్ను రూ. 80 వేల వరకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం టన్ను రూ. 30 వేలకు పైగానే ధర ఉంది. చీనీ ఇక్కడి నుంచి బెంగళూరు, ఢిల్లీతోపాటు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. వీటితోపాటు జిల్లాలో పండుతున్న అన్నిరకాల పండ్లు దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. గడిచిన మూడేళ్లుగా పండ్లకు మంచి ధర వస్తోందని, గిట్టుబాటు అవుతోందని రైతులు పేర్కొంటున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement