breaking news
French Revolution
-
కోపం రావడం కూడా మంచిదే! ఇలా చేస్తే విజయం మీదే!
ప్రేమ, అభిమానం, ఈర్ష్య, ద్వేషం లాగే కోపం కూడా ఓ సహజ, సహజాత ఉద్వేగం. యాంగర్ మేనేజ్మెంట్ అని దాన్ని చంపుకోవడం కంటే... ఎలా ఛానలైజ్ చేస్తే, దాన్నుంచి గరిష్ఠ ప్రయోజనం పొందవచ్చో తెలుసుకుంటే మంచిదంటున్నారు మానసికవేత్తలూ, ప్రవర్తన శాస్త్రవేత్తలు. నిజానికి కోపం అన్నది పట్టుదలకు మొదటిమెట్టు. భయం ప్రాణరక్షణకు ఉపయోగపడినట్టే... కోపం పట్టుదలకు కారణమై, ఎట్టకేలకు సక్సెస్ను సాధించి పెడుతుంది. అంటారు సైకాలజిస్టులు. అదెలాగో చూద్దాం. చాణక్యుడి చతురత మొదలుకొని, ఫ్రెంచి విప్లవం వరకు తొలి దశలోని కోపం... తొలుత పట్టుదలగా మారి... తర్వాత వివేచనతో కూడిన వ్యూహం వల్ల మంచి ఫలితాలను ఇచ్చిన సంగతి చరిత్ర చూసిందే. ఇక్కడ ఓ మంచి మార్పు కోసం ప్రజలు తమ యాంగర్ను మోటివేటింగ్ అంశంగా చేసుకున్నారన్నది మానసిక విశేషజ్ఞుల విశ్లేషణ. ఎప్పటి చాణక్యాలో, మరెక్కడి ఫ్రెంచి విప్లవాలో కాదు... ఉప్పు సత్యాగ్రహాలూ, దండి యాత్రలతో మన స్వాతంత్య్రం కూడా ఈ శతాబ్దపు మన ఆగ్రహ విజయ ఫలితమే. ‘ఆగ్రహం నుంచి ఆనందానికి దారి తీసే మంచి దారే మన కోపం’ అని చెబుతున్న ఓ సైకాలజిస్ట్... ఆగ్రహం ప్రభావాన్ని ఇలా వివరిస్తున్నాడు. ‘‘కోపం మొదట మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రేరేపించి స్ఫూర్తిని పుట్టిస్తుంది. పట్టుదల పెంచి విజయం సాధింపజేస్తుంది. చివరగా సంతోషాన్నిస్తుంది. ఇంగ్లిష్లో చెప్పాలంటే యాంగర్ క్రియేట్స్ ఇంపాక్ట్. ఇట్ మొబిలైజెస్, లీడ్స్ టు విక్టరీ దేర్ బై గివ్స్ హ్యాపీనెస్’’. ‘యాంగ్రీ పీపుల్ ఆర్ ఆప్టిమిస్టిక్’ ఆశావహ దృక్పథానికి ఆగ్రహమే మార్గం... ‘యాంగ్రీ పీపుల్ ఆర్ ఆప్టిమిస్టిక్’ అన్నది మనోవిశ్లేషకుల మరో మాట. నలుగురు స్టుడెంట్స్ ఒకే రూమ్లో చదువుకుంటూ ఉండేవారు. వాళ్లలో ఒకడికి ఓ రేంజ్ మంచి ర్యాంకే వచ్చింది. ఆ ర్యాంకుకు ఆనందించిన ఆ తండ్రి, కొడుక్కి అదే రాష్ట్రంలో సీట్ వచ్చే అవకాశం లేకపోయినా... పక్కరాష్ట్రంలోని ఓ మోస్తరు మంచి కాలేజీలో మెడిసిన్లో చేర్పించాడు. దాంతో తమ మీద తమకే కోపం వచ్చిన ఆ ముగ్గురూ... లాంగ్టర్మ్ కోచింగ్లో చేరారు. బాగా చదివారు. దాంతో ఆ ముగ్గురూ సొంతరాష్ట్రంలోనే ఫ్రీ సీట్ సాధించారు. కాస్త ధనవంతుడైన తండ్రికి పుట్టిన మొదట సీటు సాధించిన మిత్రుడి కంటే... తమ కోపం కారణంగా ఇంకా మంచి కాలేజీల్లో, ఇంకా కాస్త చవకగా చదువుకుంటున్నారా మిగతా ముగ్గురు మిత్రులు. అనేక విజయ వ్యూహాలకు కోపమే కీలకం... కోపాన్ని ఓ ప్రతికూల ఉద్వేగంగా భావిస్తారు. కానీ విజయం సాధించాలనే పట్టుదలకు కావాల్సిన వ్యూహాలను ఆలోచించేలా చేస్తుంది ఆగ్రహం. అయితే కత్తికి లాగే కోపానికీ రెండు అంచులుంటాయి. వివేకం కోల్పోయిన క్రోధం... పన్నాగాలకు దిగుతుంది. వివేచనతో కూడిన కోపం వ్యూహాలతో విజయాలందిస్తుంది. ఉగ్రతకు ఆస్కారమివ్వకుండా ఆగ్రహాన్ని జాగ్రత్తగా ఛానెలైజ్ చేసుకుని గెలుపెలా సాధించాలో తెలుస్తుంది. తనలోకి తాను చూసుకునేందుకు ఓ సాధనం తనలోకి తాను తొంగి చూసుకుని, అంతర్మధనంతో, ఆత్మపరిశీలనకు తావిచ్చేది కూడా కోపమే అంటారు జెరెమీ డీన్ అనే సైకాలజీ స్కాలర్. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ నుంచి డాక్టరేట్ పొందిన ఆయన ‘‘మేకింగ్ హ్యాబిట్స్, బ్రేకింగ్ హ్యాబిట్స్’’ అనే పుస్తకం రాశారు. మానసిక అంశాలపై బ్లాగ్ కూడా నిర్వహిస్తుంటారు. ఓ సంఘటన మనలో కోపానికి కారణమైందనుకోండి. అప్పుడు మన ఆగ్రహం సహేతుకమైనదేనా?, మన చేతగానితనం వల్ల కోపం వచ్చిందా?... ఇలా ఆత్మపరిశీలన చేసుకోవడం మానసిక ఔన్నత్యానికీ కారణమవుతుందంటారాయన. మరి అంతా మంచేనా... ఇలా చూసుకున్నప్పుడు ఆగ్రహం వల్ల అంతా మంచే జరుగుతుందా? చెడు జరగదా అంటే... కోపం వల్ల చెరుపు జరిగే అవకాశమూ ఉంది. అయితే ఆగ్రహంతో కూడిన ఉన్మాద స్థితిలో మంచికీ, చెడుకూ మధ్య తేడా గుర్తించలేనంత వివేచన కోల్పోయినప్పుడు మాత్రమే ఆగ్రహం వల్ల అనర్థం జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు మానసికవేత్తలు. అందువల్ల వివేచన కోల్పోనంత వరకు కోపం కూడా మిత్రుడే! చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే.. -
ఇదీ విగ్రహధ్వంస చరిత్ర!
రాజకీయ నాయకులు, సిద్ధాంతకర్తలు, సంఘసంస్కర్తల విగ్రహాల విధ్వంసం ఈనాటిది కాదు. మతపరమైన విగ్రహాలు, పూజా స్థలాలను ధ్వంసం చేయడం వేల ఏళ్ల క్రితమే క్రితమే జరిగిందని చరిత్ర చెబుతోంది. కొత్త పాలకులు అధికారంలోకి వచ్చినప్పుడు ఓడిపోయిన నేతల చిత్రాలు, విగ్రహాలు, వారి అధికారం, సిద్ధాంతాల చిహ్నాలను పగలగొట్టడం ఫ్రెంచి విప్లవంలో విస్తృతంగా జరిగింది. 1960వ దశకం చివర్లో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమకాలంలో పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా కోల్కతాలో రాజారామ్మోహన్రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి సంఘసంస్కర్తలు, గాంధీ, నెహ్రూ, బోస్ వంటి స్వాతంత్య్రసమరయోధుల విగ్రహాలను ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది. గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ విగ్రహాలపై దాడుల వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. కూలిన లెనిన్, స్టాలిన్ విగ్రహాలు 1991 జూన్–డిసెంబర్ మధ్య జరిగిన పరిణామాలతో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై కమ్యూనిస్ట్ పాలన ముగిసినప్పుడు రాజధాని మాస్కో, పోలండ్, బల్గేరియా వంటి తూర్పు ఐరోపా దేశాల్లోనూ లెనిన్, స్టాలిన్ల భారీ విగ్రహాలను కూల్చివేశారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో గాంధీ విగ్రహాన్ని 2015 ఏప్రిల్ 12న కొందరు దుండగులు ధ్వంసం చేశారు. కాలవలోకి నీలం విగ్రహం! 1960ల చివర్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలంటూ సాగిన ఆందోళన సందర్భంగా విజయవాడలోని అప్పటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ఉద్యమకారులు తొలగించి ఎదురుగా ఉన్న ఏలూరు కాలవలో వేశారు. 2011లో ప్రత్యేక తెలంగాణ కోసం ట్యాంక్బండ్పై సాగిన మిలియన్ మార్చ్ సందర్భంగా కొందరు అక్కడి కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంలోనే సిద్దిపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని పగలగొట్టారు. -
క్విజ్ మాస్టర్
కథ: ఫ్రెంచ్ విప్లవంతో ప్రపంచాన్ని ఆకర్షించిన నెపోలియన్ పిల్లులకు భయపడే వ్యాధితో బాధపడేవాడని తెలిసి నవ్వుకున్నారు. మనదేశంతో పాటు ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్య్ర సంబరాలు జరుపుకునే మరో దేశం పాకిస్తాన్ అనుకుని, అది కాదు దక్షిణ కొరియా అని తెలిసి నాలిక్కరుచుకున్నారు. సాయంత్రం ఏడవుతోంది. ఆడిటోరియమ్ కేకలతో హోరెత్తుతోంది. పక్కనే ఆఫీస్ రూమ్ ప్రశాంతంగా ఉంది. ఆడిటోరియమ్లో ఆనందంగా చిందులేస్తున్నారు. పక్కనే ఆఫీస్ రూమ్లో క్విజ్ మాస్టర్ మూర్తి ఏకాంతంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎంత నియంత్రించుకుందామన్నా ఆ ఆలోచనలు ఒకదానికొకటి పెనవేసుకుంటూ అలా సాగిపోతూనే ఉన్నాయి. అంతవరకూ గంభీరమైన అలల్లా ఉన్న మానసిక స్థితిని, అరగంట క్రితం జరిగిన సంఘటన పోటెత్తిన అలలలా అతలాకుతలం చేసింది. ‘‘జర్ జర్ ర్ ర్ ర్... ర్ ్రర్ ్రర్.్ర..’’ బజర్ తన గుండెల్లో మోగినట్లయి ఉలిక్కిపడ్డాడు మూర్తి. ఇంతకుముందు క్విజ్లో జరిగిన బజర్ రౌండ్ ఇంకా తనను వెంటాడుతూనే ఉంది. తనకిక్కడ ఉండాలని లేదు. ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అని చూస్తున్నాడు. తనను ఇక్కడకు ఆహ్వానించిన సైన్స్ టీచర్ కనబడితే చెప్పి వెళదామని ఆగాడు. ‘‘మిత్రులారా! ఇంతకుముందే అత్యంత ఆసక్తికరంగా సాగిన క్విజ్ కార్యక్రమం ముగిసింది కదా, కొద్ది క్షణాల్లో సభా కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈలోగా మరో డ్యాన్స్ ఐటెమ్ను ప్రెజెంట్ చేయడానికి మనముందుకొస్తున్నారు...’’ ఆఫీస్ రూమ్ని ఆనుకుని ఉన్న ఆడిటోరియమ్ నుండి ప్రకటన. ‘‘ఆసక్తికరంగా సాగిన క్విజ్ కార్యక్రమం.’’ క్విజ్ మాస్టర్ మూర్తి పెదాలపైన నిరాసక్తమైన నవ్వు. తన కాలేజీ రోజుల్లో కూడా కొన్ని వందల క్విజ్లలో పాల్గొన్నాడు. ఏనాడైనా ఇలా జరిగిందా? కొత్త విషయాలు నేర్చుకోవడమనే తహతహ, అవతలవాడి కంటే తనకు ఎక్కువ తెలిసివుండాలనే తాపత్రయం ఉండేవి. పోటీ జరుగుతున్నంతసేపు ప్రత్యర్థుల్లా ఉన్నా, ఒక్కసారి పోటీ అయిపోయాక ఛలోక్తులతో, వ్యంగ్య వ్యాఖ్యలతో చాలా సరదాగా, బాగా ఆత్మీయంగా ఉండేది వాతావరణం. అన్ని సున్నితమైన అనుభవాల మధ్య ఈ సాయంత్రం జరిగిన క్విజ్ పోటీ అతన్ని భయపడేలా చేసింది. సాయంత్రం నాలుగు గంటలకు క్విజ్ కార్యక్రమం ప్రారంభించే ముందు చివరిసారిగా ప్రశ్నల ఆర్డర్ సరిగా ఉందో లేదో చూసుకుందామని ఫైల్ తెరిచాడు. మొదట ర్యాపిడ్ ఫైర్ రౌండ్. రెండవది జనరల్ రౌండ్. ఆడియో విజువల్ మూడవ రౌండ్. చివరిగా ఐదు ప్రశ్నలతో బజర్ రౌండ్. ఒకవేళ టై అయ్యే సందర్భం వస్తే, దాన్ని ఎదుర్కోవడానికి మరో అయిదు ప్రశ్నలు. ప్రేక్షకుల కోసం మధ్యమధ్యలో కొన్ని ప్రశ్నలు. అన్నీ సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించుకుని నిర్వాహకుల పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు మూర్తి. మరో ఐదు నిమిషాల్లో అందరికీ స్వాగతం పలుకుతూ క్విజ్ నిర్వహించవలసిందిగా మూర్తిని, ఆరు టీమ్లను వేదిక మీదకు ఆహ్వానించాడు యాంకర్. మూర్తి అతనికి కృతజ్ఞతలు చెప్పి, ఈ క్విజ్లో మొత్తం ఎన్ని రౌండ్స్ ఉంటాయో, ఏ రౌండ్లో ఎన్ని ప్రశ్నలుంటాయో, వాటికి ఏ రౌండ్లో ఎన్ని మార్కులుంటాయో వివరించాడు. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పి, ఆల్ఫబెటికల్ ఆర్డర్లో కూర్చున్న టీముల్లో, మొదటి టీమ్కు మొదటి ప్రశ్న అంటూ తన యజ్ఞాన్ని ప్రారంభించాడు. ప్రశ్నల తయారీకి మూర్తి చాలా కష్టపడతాడు. ఏవో తన స్టాక్లో ఉన్న ప్రశ్నలు కొన్ని రాసేస్తే అయిపోదా? అని మిత్రులెవరైనా అంటే నవ్వి వదిలేస్తాడు. తను నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఎవరి కోసం, వాళ్ల వయస్సు, వాళ్ల నేపథ్యం ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని, వీలైనంత సందర్భోచితమైన, విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రశ్నలనేరుకుంటాడు. అందుకే మూర్వి క్విజ్ మాస్టర్గా ఉంటే, ప్రోగ్రామ్ చాలా ఆసక్తికరంగా ఉంటుందనీ, నాలుగు విషయాలు తెలుస్తాయనీ నిర్వాహకుల నమ్మకం. మొదటి రౌండ్ పూర్తయింది. అందరిలోకి ‘డి’ గ్రూప్ అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పి, ఇరవై ఐదు పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. మూడు టీములు ఇరవై పాయింట్లతో, మిగతా రెండు టీములు పదహైదు పాయింట్లతో ఉన్నాయి. రెండో రౌండ్ చాలా ఆసక్తిగా సాగుతోంది. ఇందులో ప్రశ్నను పక్క టీమ్కు పాస్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరి ప్రశ్నకి వారు సరైన సమాధానం చెబితే పది పాయింట్లు, పాస్లో వచ్చిన పక్కవాళ్ల ప్రశ్నను ఆన్సర్ చేస్తే ఐదు పాయింట్లు ఉంటాయి. మరో గంట గడిచింది. ఈ రెండు గంటలు అక్కడ ఎన్నో రసవత్తరమైన ఘటనల పరామర్శలు చోటుచేసుకున్నాయి. ఆశ్చర్యమనిపించే సంగతులు, అద్భుతమనిపించే విషయాలు, నమ్మలేని నిజాలు, కష్ట సాధ్యమైన ప్రక్రియల్లో విజేతలై నిలిచినవాళ్ల సాహసాలు అన్నింటినీ పరామర్శించుకున్నారు. ఫ్రెంచ్ విప్లవంతో ప్రపంచాన్ని ఆకర్షించిన నెపోలియన్ పిల్లులకు భయపడే వ్యాధితో బాధపడేవాడని తెలిసి నవ్వుకున్నారు. మనదేశంతో పాటు ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్య్ర సంబరాలు జరుపుకునే మరో దేశం పాకిస్తాన్ అనుకుని, అది కాదు దక్షిణ కొరియా అని తెలిసి నాలిక్కరుచుకున్నారు. జపాన్వాళ్లు అరిష్టంగా భావించే 13 సంఖ్యను ఇటలీవాళ్లు అదృష్టంగా భావిస్తారనీ, ఈ భూమ్మీద బుల్ ఫ్రాగ్ అసలు నిద్రపోని జంతువనీ తెలుసుకుని ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. బహ్రైన్ దేశపు జాతీయగీతంలో కేవలం సంగీతమే తప్ప పదాలు లేవనీ, పియానోలో 88 కీస్ ఉంటాయనీ... ఇలా అనేకానేక సంగతులు. మరో అర్ధగంట గడిచింది. చివరి అంకమైన బజర్ రౌండ్ మాత్రమే మిగిలివుంది. మూర్తి స్కోర్ బోర్డ్ చూశాడు. ఇది విజేతని నిర్ణయించే రౌండ్. ఎ, ఇ జట్లు నలభై మార్కులతో, ఎఫ్ జట్టు నలభై ఐదు మార్కులతో, బి, సి జట్లు అరవై ఐదు మార్కులతో ఉండగా, డి జట్టు అందరికంటే అత్యధికంగా ఎనభై ఐదు మార్కులతో మొదటి స్థానంలో ఉంది. అందరినీ పరికించి చూస్తూ, ‘‘ఫ్రెండ్స్, ఈ రౌండ్లో కేవలం ఐదు ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానానికి మీకు 10 మార్కులు వస్తాయి. అదే మీ సమాధానం తప్పయితే మీరు 5 మార్కులు కోల్పోతారు. ప్రశ్న పాస్ చేయడం జరగదు. మీ సమాధానం చెప్పడానికి మీకు కేవలం పది సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు కాన్ఫిడెంట్గా, కరెక్టుగా సమాధానం తెలిస్తేనే బజర్ నొక్కండి. లేకపోతే అనవసరంగా మార్కులు పోగొట్టుకుంటారు. ఆల్ ద బెస్ట్’’ అన్నాడు. మొదటి ప్రశ్న వెలువడిన వెంటనే ఎఫ్ గ్రూప్ బజర్నొక్కి సరైన సమాధానంతో 10 మార్కులు గెలుచుకుంది. రెండవ ప్రశ్నకు బి టీమ్వాళ్లకు 10 మార్కులు వచ్చాయి. మూడో ప్రశ్నకు ఎవరూ బజర్ నొక్కలేదు. క్విజ్ మాస్టరే దానికి సమాధానం చెప్పవలసి వచ్చింది. అభ్యర్థులలో ఒత్తిడి, ఆందోళన వాళ్ల ముఖాలలో ప్రస్ఫుటమౌతోంది. మూర్తి అడిగిన నాలుగో ప్రశ్నకి సి టీమ్ బజర్ నొక్కడమూ, 10 మార్కులు వాళ్ల ఖాతాలో వేసుకోవడమూ సెకన్లలో జరిగిపోయింది. ఇప్పుడు స్కోర్ బోర్డ్లో డి గ్రూప్ 85 మార్కులతో, బి, సిలు 75 మార్కులతో ఉన్నాయి. ఎఫ్ పది పెంచుకుని యాభై ఐదుకు చేరుకోగా, ఎ, ఇలు 40 మార్కులతో పాత స్కోరునే కొనసాగిస్తున్నాయి. క్విజ్ పోటీ పరాకాష్టకు చేరుకుంది. చిట్టచివరి ప్రశ్న. ఆడిటోరియమంతా ఉద్విగ్నమయమైపోయింది. అందరూ ఊపిరి పీల్చడం కూడా వాయిదా వేసుకుని, మూర్తి నోటి నుండి బయటకొచ్చే ప్రశ్నకోసం రెప్పలార్పకుండా కాసుక్కూర్చున్నారు. కొందరి చేతులు అప్రయత్నంగానే కుర్చీ హ్యాండిల్స్ని బలంగా నొక్కిపెడుతున్నాయి. అభ్యర్థులంతా తమ తమ టీమ్ మెంబర్లతో చిరుసవ్వడితో మాట్లాడుతూ గుసగుసలాడుకుంటున్నారు. సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న ఆ సమయంలో-మూర్తి, చివరి ప్రశ్న ఉన్న కార్డ్ తీసుకుని కళ్లతో ఒకసారి ప్రశ్నను చూశాడు. అభ్యర్థుల వైపు తిరిగి ప్రశ్న చదవడానికి నోరు తెరచి ‘‘తాము...’’ అని అన్నాడో లేదో - ‘‘జర్ జర్... జర్ ర్ ర్... ర్ ర్ ర్ ర్....’’మని బజర్ సౌండ్ వినిపించింది. మూర్తి చదవడం ఆపాడు. వాళ్ల క్రమశిక్షణా రాహిత్యానికి లిప్తపాటులో వెయ్యి వోల్టుల కోపం వచ్చింది. ఎందుకింత తొందరపడతారు? ఇంకా ప్రశ్న సగమైనా పూర్తికాకముందే పూర్తి ప్రశ్న ఏమై ఉంటుందో ఎలా ఊహిస్తారు? ఏం సమాధానం చెబుతారు? అనవసరంగా మార్కులు పోగొట్టుకోవడం తప్ప - అనుకుంటూ, ఇంతకీ ఎవరు బజర్ నొక్కారో చూశాడు. అది - డి గ్రూప్. ఆశ్చర్యపోయాడు. వేరే ఎవరో అయితే, గెలవాలనే ఒత్తిడిలో నొక్కారనుకోవచ్చు. వీళ్లెందుకు చేశారీ పని? వాళ్లవైపు చూసేంతలో వెంటనే, అందులో ఒకడు ప్రశ్నకు సమాధానం చెబుతున్నట్టుగా - ‘అమెరికా’ అన్నాడు. అలా అన్నాడో లేదో, రెండోవాడు బొటనవేలు పెకైత్తి చూపుతూ ఒక్క ఊపులో మొదటివాడిని కౌగిలించుకున్నాడు. ఇద్దరూ రెండు చేతులతో కిందకీ పైకీ చప్పట్లు కొట్టుకుంటూ, విజయోత్సాహాన్ని పంచుకుంటున్నారు. అన్నీ సెకన్లలో జరిగిపోయాయి. జరిగినదేంటో మూర్తికర్థమైంది. జనానికంతా అర్థమయ్యేందుకుగాను స్కోర్ బోర్డ్ మార్చారు - టీమ్ డి, చివరి ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పి, ఐదు మార్కులు కోల్పోయి 80 మార్కులతో తన ఆధిక్యాన్ని నిలుపుకుని విజేతగా నిలిచింది. బి, సి టీములు 75 మార్కులతో రెండవ స్థానంలోనే ఉన్నాయి. ప్రేక్షకులలో ఒక్కసారి కలకలం, వెంటనే డి టీమ్ను అభినందిస్తున్నట్లుగా కరతాళధ్వనులు... మూర్తి దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. బి, సిలలో ఎవరైనా ఎక్కడ కరెక్ట్ సమాధానం చెప్పి తమతో సమానమౌతారో, ఆ తరువాత జరిగే టై బ్రేక్లో ఒకవేళ తాము ఓడిపోతామేమోనని, కనీసం ప్రశ్న ఏంటో వినకుండా, సమాధానం ఏమిటో తెలుసుకోకుండా ఎదుటివాళ్లకి కనీసం ప్రశ్న వినే అవకాశం కూడా ఇవ్వకుండా, ఎదుటివాళ్ల విజయావకాశాల మీద దెబ్బకొట్టిన డి టీమ్ మీద చాలా కోపం వచ్చింది. మూర్తి ఏదైనా మాట్లాడదామని నోరు తెరిచేలోపే, యాంకర్ మైకు నిండా గట్టిగా అరుస్తూ - ‘‘సో లేడీస్ అండ్ జెంటిల్మన్, ఈ రోజు విజేతలు - మన డి టీమ్. చివరి నిమిషంలో వాళ్లు ప్రదర్శించిన తెలివితేటలు, సమయస్ఫూర్తి మరువలేనివి. అమోఘం, అద్భుతం’’ అన్నాడు. ఇంతలో ఎవడో మొబైల్ నుండి టపాకాయల చప్పుడు ప్లే చేయడం మొదలుపెట్టాడు. కింద నుండి డి టీమ్వాళ్ల శ్రేయోభిలాషులు బొటనవేలు పెకైత్తి విజయ సంకేతాలను వ్యక్తం చేస్తున్నారు. ఫేస్బుక్లో పెట్టడం కోసం కాబోలు, ఒకడు ఫోన్లోనే స్కోర్ బోర్డును, వాళ్ల మిత్రులను ఫొటో తీస్తున్నాడు. చివరి ప్రశ్న ఏమిటో తెలుసుకుందామన్న ఆసక్తి ఎవరికీ ఉన్నట్టు కనబడటం లేదు. మూర్తి అక్కడ ఉండలేకపోయాడు. మెల్లగా మెట్లు దిగి కిందకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో యాంకర్, ‘‘మిత్రులారా, మీరంతా ఒక ఉద్విగ్నభరితమైన, ఉత్సాహభరితమైన, మరిచిపోలేని అపూర్వమైన మ్యాచ్ చూశారు. ఇక కొన్ని నిమిషాల్లో బహుమతి ప్రదానం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు - ముందుగా...’’ మూర్తికి అక్కడ కూర్చోవాలనిపించలేదు. ఒక్కడే నడుచుకుంటూ ఆడిటోరియమ్ దాటి పక్కనే ఉన్న ఆఫీస్ రూమ్కి వచ్చాడు. అప్పటినుండీ సైన్స్ సార్కోసం ఎదురుచూస్తూ, ఆఫీస్ రూమ్లో కూర్చుని ఉన్నాడు. అతనింకా బజర్ రౌండ్కి సంబంధించిన ఆలోచనలో ఉండగానే, ఆడిటోరియమ్లో నుండి యాంకర్ గొంతు వినబడింది. ‘‘ఫ్రెండ్స్, ఇప్పుడు సభ ప్రారంభం కాబోతోంది’’ అంటూ పెద్ద పెద్ద వాళ్లందరినీ విశేషణాలతో సహా పేరు పేరునా, వేదిక మీదకు ఆహ్వానించాడు. ఆఫీస్ రూమ్కి ఆడిటోరియమ్లోని మాటలు స్పష్టంగా ప్రవహిస్తున్నాయి. కళాశాల చైర్మన్ మాట్లాడుతూ క్విజ్తో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుని, ఈ రోజు జరిగిన పోటీలో డి టీమ్ కనబరిచిన పరిణతి, గెలవాలన్న ఆకాంక్ష, గెలుపు మీద వారికున్న పట్టుదల బహుధా ప్రశంసనీయమని చెప్పాడు. మూర్తి మనసుని ఈ మాటలు మరింత గాయపరుస్తున్నాయి. ఆ పిల్లలు గెలుపు మీద కోరికతో ఆ పని చేశారా? ఓటమిని తట్టుకోలేని భయంతో చేశారా? అవతలవాడు గెలుస్తాడేమోననే అభద్రత, తమ స్థానాన్ని కోల్పోతామేమో అనే భయంతో ఎదుటివారి విజయావకాశాలని తుంచేయడం ఎంతవరకూ విజ్ఞతో, అలాంటి ఆలోచనలు ఎంత ప్రమాదకరమో చెప్పాల్సింది పోయి, ఆ పిల్లలని వీళ్లు గొప్ప హీరోలని చేసేస్తున్నారు. వక్త మారాడు. ఎల్సీఎస్ ఎండీ కాబోలు మాట్లాడుతున్నాడు - ‘‘మొత్తం ఎపిసోడ్లో నాకు నచ్చిన అంశం - చివర్లో ఈ పిల్లలు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం. అంత తక్కువ సమయంలో, అన్ని ఒత్తిడుల మధ్య, ఏవో వందల కోట్ల వ్యాపార లావాదేవీలలో మేం అనుసరించే వ్యూహాన్ని వీళ్లు ఇంత తక్కువ వయస్సులో అమలుచేయడం చాలా గొప్ప విషయం. ఈ సంఘటన వీళ్ల భవిష్యత్తు గురించి మంచి ఆశలు కల్పిస్తోంది. మేం వ్యాపారంలో కిల్లింగ్ ఇన్ స్టింక్ట్ అంటుంటాం. అది ఈ చిన్నారుల్లో పుష్కలంగా ఉంది...’’ మూర్తికి చికాకుగా ఉంది. భారంగా ఉంది. తల పగిలిపోయేలా ఉంది. కొంచెంసేపు బయట గాలిలో ఉంటే ఈ బరువు తగ్గుతుందని బయటకు నడిచాడు. ఎల్ సీఎస్ ఎండీ మాట్లాడుతున్న మాటలకు ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. అదేంటి, ఇంతమందిలో ఒక్కరంటే ఒక్కరైనా ఈ పిల్లలు గెలిచిన మాట వాస్తవమే గానీ, గెలిచిన తీరు మాత్రం అభ్యంతరకరం అని చెప్పరేమిటి? పిల్లలు తెలిసో తెలియకో చేశారు. దానిని ఇంతమంది సమర్ధించడం, పెపైచ్చు పొగడటం మూర్తికి బొత్తిగా నచ్చలేదు. విజయం కంటే విలువలు గొప్పవనీ, సాధించిన విషయంతో పాటు సాధన మార్గం కూడా ముఖ్యమైనదనీ ఆ పిల్లవాళ్లకు ఎవరూ చెప్పడంలేదెందుకు? ఉన్నత స్థానానికి ఎగబాకే క్రమంలో ఉదాత్తతని విస్మరించడం తప్పని వాళ్లు ఎప్పుడు తెలుసుకుంటారు? ‘‘ఇప్పుడు ఎమ్మెల్యేగారు విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు. ఆ తరువాత క్విజ్ మాస్టర్ని శాలువాతో సత్కరిస్తారు’’ స్పీకర్లో నుండి యాంకర్ మాటలు. ఎమ్మెల్యేని తలచుకోగానే అప్రయత్నంగా పిరదౌసిలోని ‘‘నీచే పూజితుండైనచో అల్లాకున్ సుఖమే’’ వాక్యం మనసులో మెదిలింది మూర్తికి. గెలుపు కోసం ఈ పిల్లలు చేసిన పనిని ఈయన పెద్ద మొత్తంలో చేశాడు. అవును, ఇలాంటి వాళ్లకు ఈ రోజు ఆ పిల్లలు చేసింది గొప్ప వ్యూహమనిపిస్తుంది. ఈ రోజు ఆ పిల్లలు క్విజ్లో గెలిచి ఉండవచ్చు. కానీ వాళ్ల ప్రవర్తన వల్ల క్విజ్ ఓడిపోయింది. ఈ ఆలోచన రాగానే మూర్తి ఆడిటోరియమ్ దాటి, ఆఫీస్ బిల్డింగ్ దాటి పార్కింగ్ వైపు అడుగులేస్తున్నాడు. ఇందాకటి నుండి ఒక ప్రశ్న మనసును తొలుస్తోంది. ఇంతకీ డి టీమ్వాళ్లు చేసిన పనికి మూలకారణమేమిటి? విజయం పట్ల మనకున్న విపరీత వ్యామోహమా? విలువల పట్ల మనకున్న సర్దుబాటు ధోరణా? వేగం మీది కోరికతో వాళ్ల వివేకాన్ని హరించిన తన బజర్ రౌండా? ఎదుటివాడు ఏమైనా ఫరవాలేదు, మనం బాగుంటే చాలనే స్వార్థమా? కొన్ని వేల ప్రశ్నలకు అవలీలగా సమాధానాలు చెప్పగలిగిన మూర్తికి, ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.బండి స్టార్ట్ చేయాలని చూస్తుంటే ఇందాకటి నుండి, తన చేతిలో ఉన్న పేపర్ అడ్డొచ్చింది. తిప్పి చూశాడు. అది ఆ క్విజ్లో అడగకుండా ఆపివేయబడ్డ చిట్టచివరి ప్రశ్న -‘‘తాము ఓడిపోతామనీ, తద్వారా సెమీస్లో అర్హత కోల్పోతామనీ తెలిసినా, క్రీజు బయట నిలబడిన ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఔట్ చేయకుండా తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్న వెస్టిండీస్ క్రీడాకారుడెవరు?’’ - .జి.ఉమామహేశ్వర్ -
పలచబడిన ఫ్రెంచ్ పరిమళం
ప్రపంచం ఇప్పటికీ మరులుగొనే ఫ్రెంచ్ విప్లవం (1789) తరువాత ఆ దేశం నెపోలియన్ బోనాపార్టి అనే సైనికుడిని పడి పడి ప్రేమించింది. ఆ మహా విప్లవానికి నాయకత్వం వహించిన రాబిస్పియర్ వంటి వారికి ఆ జాతి మరణశిక్ష విధించి, ఆ కుర్ర లెఫ్టినెంట్ను చక్రవర్తిగా వరించింది. ఇదొక చారిత్రక వైచిత్రి అనుకుంటే, నెపోలియన్ ప్రేమ గాథ అంతకు మించిన వైచిత్రి. యూరప్ అంతటా అప్రతిహత విజయాలు సాధించి మహా విజేతగా చరిత్రలో నిలిచిపోయిన నెపోలియన్, ప్రేమగాథ దగ్గర మాత్రం అపజయం పాలయ్యాడనే అనిపిస్తుంది. విప్లవంతో ఫ్రెంచ్ జాతీయులు గడగడలాడిపోతున్న కాలంలో, దేశం బయట నెపోలియన్ సాధించిన సైనిక విజయాలు దృష్టి మళ్లించాయి. విప్లవం తరువాత కలహాలతో కాపురం చేసిన రిపబ్లిక్ ప్రభుత్వాలకు కూడా ఇరవయ్యారేళ్ల నెపోలియన్ పెద్ద దిక్కులా కనిపించాడు. అందుకే వరస సైనిక విజయాలు సాధించిన నెపోలియన్ గౌరవార్ధం 1796లో ఓ రోజు పెద్ద విందు ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్ చక్రవర్తి పదహారో లూయీ, ఆయన భార్య మేరీ ఆంటోనెట్ నివాసం ఉన్న చరిత్రాత్మక వెర్సెయిల్స్ భవనంలోనే విందుకు వచ్చి కూర్చున్న నెపోలియన్ ఒడిలో తూలి పడిందొక 32 సంవత్సరాల మహిళ. ఆమె- జోసఫీన్ బ్యూహైర్నెస్. పారిస్ నగరంలోనే అందగత్తెగా ఆమెకు పేరుంది. ఆ సాయంత్రమే ఆమెను ప్రేమిస్తున్నట్టు నెపోలియన్ ప్రకటించాడు. రెండు వారాలకే- అంటే, ఆ సంవత్సరం మార్చి 9న పెళ్లి కూడా జరిగింది. నీలం, వజ్రం పొదిగిన బంగారు ఉంగరాన్ని అప్పుడే నెపోలియన్ ఆమె చేతికి తొడిగాడు(దీనిని ఏడాది క్రితం పారిస్లో వేలం వేశారు). చిత్రంగా ఆ రెండు జాతి రాళ్లు కంటి కొన నుంచి రాలుతున్న కన్నీటి చుక్క ఆకృతిలోనే ఉన్నాయి. పెళ్లి జరిగిన రెండో రోజునే నెపోలియన్ ఇటలీ దండయాత్రకు వెళ్లిపోయాడు. యుద్ధరంగం నుంచి భార్యకు కొన్ని నెలల పాటు అనేక ఉత్తరాలు రాశాడు నెపోలియన్. అందులో ఎక్కువ జోసఫీన్ను నెపోలియన్ ఎంత గాఢంగా ప్రేమించాడో చెబుతాయి. ఇటలీ తరువాత ఈజిప్ట్ దండయాత్ర జరిగింది. 1799లో సైనిక తిరుగుబాటు చేసి ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నాడు నెపోలియన్. 1802లో చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. మహారాణిగా జోసఫీన్ను ప్రకటించాడు. జోసఫీన్కు అప్పటికే ఇద్దరు పిల్లలు. మార్టినిక్యూ అనేచోట పూటతోటలు పెంచే వారి కుటుంబంలో పుట్టిందామె. ఆమె మహా సౌందర్యాన్ని చూసి పదమూడో ఏటనే అలెగ్జాండర్ డి బ్యూహైర్నెస్ అనే రాజసభ ప్రముఖుడు పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత వదిలేశాడు. ఇంతలోనే ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. అలెగ్జాండర్ విప్లవానికి పూర్తి మద్దతునే ఇచ్చాడు. అయినా విప్లవకారులు నమ్మక, అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి భర్తకు దూరంగానే ఉన్నా జోసఫీన్ను కూడా విప్లవకారులు అరెస్టు చేశారు. ఇద్దరికీ మరణ దండన విధించారు. గిలెటెన్ ద్వారా శిక్ష అమలుకు అడ్డు లేకుండా ఆమె కురులను సయితం కత్తిరించి సిద్ధం చేశారు. మొదట అలెగ్జాండర్కు మరణ దండన అమలు జరిగిపోయింది. ఇక తన వంతు. అందుకు ఆమె ఎదురు చూస్తుండగా, ప్రభుత్వం కూలిపోయింది. ఆమె శిక్ష నుంచి తప్పించుకుంది. తరువాత ఒక రాజ వంశీకుడు ఆమెను వశం చేసుకున్నాడు. తరువాతే నెపోలియన్తో వివాహం. నెపోలియన్ దండయాత్రకు వెళ్లగానే ఆమె జోసఫీన్ వేరొకరితో సంబంధం పెట్టుకుందని రూఢీ అవడంతో నెపోలియన్ తన సోదరుడితో చెప్పి 1810లో విడాకులు సిద్ధం చేయించాడు. అయితే నెపోలియన్ జోసఫీన్ను ఎప్పటికీ మరచిపోలేదు. విడాకులు ఇచ్చినా దూరం చేసుకోలేదు. 1814లో జోసఫీన్ మరణించినపుడు కూడా నెపోలియన్ వెళ్లాడు. ప్రపంచం నలుమూలల నుంచి తెచ్చి జోసఫీన్ పెంచిన గులాబీల తోటలో కొంచెం సేపు గడిపి వచ్చాడు. ట్రెఫాల్గర్, వాటర్లూ యుద్ధాలలో ఓటమి తరువాత ఇంగ్లండ్ నెపోలియన్ను సెయింట్ హెలినా ద్వీపంలో బంధించింది. అక్కడే అతడు చివరి దశలో తరుచు కొన్ని మాటలు అనేవాడట-ఫ్రాన్స్.... సైన్యం.... సైన్యాధిపతి... ఇంకోమాట- జోసఫీన్. అంటే 1821లో అక్కడే చనిపోయే వరకు ఆమెను నెపోలియన్ ప్రేమిస్తూనే ఉన్నాడు. ‘తొలి చూపులో ప్రేమ’ ఎంత నిజమో, ‘ప్రేమ గుడ్డిద’నడం కూడా అంతే నిజమని నెపోలియన్ గాథ చెబుతుంది. ఇదో కన్నీటి కథగానే మిగిలిపోతుందని విధి చెప్పదలిచిందా? ఏమో! కానీ నెపోలియన్ ఇచ్చిన పెళ్లి ఉంగరంలో రాళ్లు కన్నీటి బిందువులను పోలి ఉండడం నిజం వింతే. - డా॥గోపరాజు నారాయణరావు