breaking news
former police
-
బాంబు పెట్టింది మాజీ హెడ్ కానిస్టేబుల్
చండీగఢ్: పంజాబ్లోని లూథియానా జిల్లా, సెషన్స్ కోర్టులో గురువారం బాంబు పేలుడు ఘటనలో మరణించిన వ్యక్తిని మాజీ హెడ్ కానిస్టేబుల్ గగన్దీప్ సింగ్గా పోలీసులు గుర్తించారు. బాంబును అమర్చే క్రమంలో అతను మరణించాడని, అందుకు ఆధారాలు లభించాయని పోలీసులు చెప్పారు. మాదకద్రవ్యాల ముఠాతో సంబంధాలున్నాయని అతడిని 2019లో పోలీస్ విధుల నుంచి తప్పించారు. రెండేళ్ల కారాగార శిక్ష అనుభవించాక సెప్టెంబర్లో జైలు నుంచి విడుదలయ్యాడని తెలుస్తోంది. గగన్దీప్ది పంజాబ్లోని ఖన్నా జిల్లా. బాంబు తయారీ పరిజ్ఞానాన్ని ఆన్లైన్లో నేర్చుకుని ఉంటాడని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అనుమానిస్తున్నారు. -
కోల్కతా మాజీ చీఫ్పై లుకౌట్ నోటీసు
న్యూఢిల్లీ: శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్కు గట్టి షాక్ తగిలింది. రాజీవ్ దేశం విడిచి వెళ్లకుండా ఆదివారం ఆయనపై సీబీఐ లుకౌట్ నోటీసు జారీ చేసింది. ఈమేరకు అన్ని ఎయిర్పోర్టులు, ఇమిగ్రేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రూ.2,500 కోట్ల శారదా కుంభకోణం దర్యాప్తు వ్యవహారంపై సీబీఐ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘రాజీవ్కు తప్పనిసరిగా నిర్బంధ విచారణ అవసరం. ఆయన దర్యాప్తునకు సహకరించకుండా సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఆయన్ని ప్రశ్నించే సమయంలో అహంకారంతో వ్యవహరిస్తున్నారు’ అని సీబీఐ ఆరోపించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాజీవ్ కుమార్ 27వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతోపాటు ఆయన్ను అరెస్టు చేయకుండా ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘ఈ కేసులో వేసిన సిట్ దర్యాప్తు సంస్థకు రాజీవ్ కుమార్ అప్పుడు ఇన్చార్జిగా ఉన్నారు. కుంభకోణానికి సంబంధించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, పలువురు నేతల కీలక ఆధారాలను బాధితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపకుండా ఆధారాలను నాశనం చేశారు’ అని సీబీఐ తెలిపింది. -
మాజీ పోలీసులకు జీవితఖైదు
న్యూఢిల్లీ: హషింపురా ఊచకోత కేసులో 16 మంది మాజీ పోలీసులకు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. ఉత్తరప్రదేశ్ మీరట్లోని హషింపురాలో 1987లో 42 మంది మైనారిటీలను చంపినందుకు వారికి ఈ శిక్ష విధించింది. నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టేసింది. 1987 మే 22న మీరట్లోని హషింపురా గ్రామానికి చెందిన 50 మంది ముస్లింలను పోలీసులు తీసుకెళ్లారని, ఆ తర్వాత వారిని చంపేసి కెనాల్ కాలువలో పడేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో 42 మంది మైనారిటీలు చనిపోయారని తేలింది. ఈ ఘటనలో దోషులందరికీ జీవిత ఖైదు విధిస్తూ.. మృతుల కుటుంబాలు న్యాయం కోసం 31 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని, వారికి జరిగిన నష్టానికి ఆర్థిక పరిహారం సరిపోదని వ్యాఖ్యానించింది. నవంబర్ 22లోగా లొంగిపోవాల్సిందిగా దోషులను కోర్టు ఆదేశించింది. ఆ 16 మంది పోలీసులు రిటైర్ అయ్యారని, వారిపై సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఈ కేసులో మొత్తం 19 మంది పేర్లు చేర్చగా, 17 మందిపై చార్జి షీటు దాఖలైంది. అందులో ఒకరు కేసు విచారణలో ఉండగానే చనిపోయాడు. -
నయీమ్ ‘ఐపీఎస్’ గాయబ్
-
నయీమ్ ‘ఐపీఎస్’ గాయబ్
కేసులో విచారిస్తారన్న భయంతో అజ్ఞాతంలోకి.. ► గ్యాంగ్స్టర్తో చేతులు కలిపి కోట్లకు పడగలెత్తిన వైనం ► సెటిల్మెంట్లు, భూదందాలు, కబ్జాలతో అడ్డగోలు సంపాదన ► ఆస్తులకు బినామీగా తోడల్లుడు... ఇటీవలే ఆయన షోరూంలో సిట్ సోదాలు ► నయీమ్తో చుట్టరికం కూడా కలుపుకొన్న మాజీ ఐపీఎస్ అధికారి ► కేసులో తన పేరు బయటకు రాకుండా మాజీ డీజీపీతో స్కెచ్ ► అరెస్ట్ తప్పదని మాయమైపోయారంటున్న సిట్ సాక్షి, హైదరాబాద్: ఆయన పోలీస్ శాఖలో సీనియర్ ఐపీఎస్గా పనిచేశారు.. అదనపు డీజీపీ హోదాలో పని చేసి పదవీ విరమణ పొందారు.. మావోయిస్టు కార్యకలాపాలపై డేగ కన్ను వేసే ఎస్ఐబీ(స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)కు చీఫ్గా రెండున్నరేళ్లు పనిచేసిన ఆయన గ్యాంగ్స్టర్ నయీమ్తో చేతులు కలిపారు.. సెటిల్మెంట్లు, భూదందాలు, కబ్జాలకు పాల్పడ్డారు.. వందల కోట్లకు పడగలెత్తారు.. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్ది భూమిని వెనకేసుకున్నారు.. ఇప్పుడు నయీమ్ కేసులో ఉచ్చు బిగుస్తుండటంతో జంప్ అయ్యారు! అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు!! పరువు పోతుందని.. నయీమ్ కేసులో తనను ఎక్కడ విచారిస్తారో నన్న భయంతోనే సదరు రిటైర్డ్ అదనపు డీజీపీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. నయీమ్ కేసులో సస్పెండ్ అయిన ముగ్గురు అధికారులు, విచారణ ఎదుర్కొంటున్న మరో ముగ్గురు అధికారుల ద్వారా ఈయన కార్యకలాపాలు సాగించినట్టు సిట్ ఇప్పటికే ధ్రువీకరించింది. భూలావాదేవీలు, రిజిస్ట్రేషన్ పత్రాలతోపాటు ఢిల్లీలోని ఓ ఇంటిని సైతం నయీమ్ ఈ మాజీ అధికారికి ఇప్పించాడని, ఇందుకు తమ వద్ద ఆధారాలున్నాయని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తనను విచారిస్తారని భావించి అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. నోటీసులు జారీ చేస్తే ఎక్కడ పరువు పోతుందోనని హైదరాబాద్కు రావడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో ఉంటూ కేంద్రం ద్వారా ఒత్తిడి తెచ్చే యత్నాలు చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఇటీవలే తోడల్లుడి షోరూంలో సోదాలు నయీమ్ అండదండలతో రెచ్చిపోయిన సదరు మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి బంజారాహిల్స్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 500 గజాల స్థలం కబ్జా చేసి భవనం నిర్మించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇందులో ఆయన కుటుంబీకులు ఓ షోరూం నిర్వహిస్తున్నారని, అందులో రెండు నెలల క్రితం తాము సోదాలు కూడా నిర్వహించి సంబంధిత పత్రాలు తీసుకున్నట్లు సిట్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈయన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలోని ఓ కీలక కమిషనరేట్కు కమిషనర్గా పనిచేసిన సమయంలోనూ నయీమ్ను అక్కడకు పిలిపించి సెటిల్మెంట్లు చేసినట్టు ఫిర్యాదులు వచ్చినట్లు సిట్ వర్గాలు తెలిపాయి. నయీమ్తో ద్వారా చేయించిన భూకబ్జాలు, ఆస్తులన్నింటిని తన పేరిట కాకుండా తోడల్లుడి పేరిట సదరు మాజీ అధికారి రిజిస్ట్రేషన్ చేయించారని, ప్రస్తుతం తోడల్లుడు షోరూం నిర్వహణలో భాగంగా విదేశాల్లో ఉంటూ బిజినెస్ చేస్తున్నారని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన ఆయన కూడా.. నయీమ్ కేసులో విచారిస్తారని భయపడి విదేశాలకు వెళ్లినట్టు తెలిసిందన్నారు. మొత్తం ఆస్తులన్నీ వారి పేరిటే ఉండటంతో తనకేమీ సంబంధం లేన్నట్టు రిటైర్డ్ ఐపీఎస్ వ్యవహరిస్తున్నారని, కానీ త్వరలోనే ఆయనకు నోటీసులిచ్చి విచారిస్తామని దర్యాప్తు అధికారులు స్పష్టంచేశారు. నయీమ్తో చుట్టరికం కూడా.. మాజీ సీనియర్ ఐపీఎస్ కుటుంబంలో నయీమ్ కుటుంబానికి సంబంధించిన యువతి ఉందని, ఆమె ఎవరన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉందని సిట్ వర్గాలు తెలిపాయి. ఆమె పేరిట నగర శివారులో నాలుగెకరాల భూమి పత్రాలున్నాయని పేర్కొన్నాయి. ఆ యువతిని రిటైర్డ్ ఐపీఎస్ తోడల్లుడి కుమారుడికి ఇచ్చి నయీమ్ స్వయంగా వివాహం జరిపించాడు. ఈ విషయాన్ని నయీమ్ భార్య తన వాంగ్మూలంలో పేర్కొందని సిట్ అధికారి ఒకరు తెలిపారు. ఈ బంధుత్వాన్ని అడ్డుపెట్టు కొని సదరు మాజీ ఐపీఎస్ భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్టు తమ దర్యాప్తులో బయటపడిందన్నారు. వీటింన్నింటిపై త్వరలోనే విచారణ జరుపుతామని, ఆయన దర్యాప్తునకు హాజరుకావాల్సి ఉంటుందని సిట్ అధికారులు స్పష్టంచేశారు. రిటైర్డ్ డీజీపీతో గేమ్ తన వద్ద పనిచేసి సస్పెండ్ అయిన వారు విచారణలో తన పేరు చెప్పకుండా ఉండేందుకు సదరు మాజీ ఐపీఎస్ అధికారి పథకం రచించారు. ఇందులో భాగంగానే రిటైర్డ్ డీజీపీని రంగంలోకి దించాడని పోలీస్ అధికారులు తెలిపారు. తన పేరు బయటపడకుండా ఉండాలంటే సస్పెండ్ అయిన వారిని కాపాడాలని భావించారు. అందుకే ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగలిగే రిటైర్డ్ డీజీపీని సీఎంవో కార్యాలయానికి పంపినట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే అది సాధ్యపడకపోవడంతో నగరం విడిచి ఢిల్లీ వెళ్లినట్టు తెలిసిందన్నారు. రాజకీయాల్లో కలసి రాని అదృష్టం.. అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులన్నింటికి తన తోడల్లుడిని బినామీగా పెట్టుకొన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రాజకీయాల్లోకి కూడా దిగారు. అయితే రాజకీయాల్లో అదృష్టం కలిసి రాకపోవడంతో ఏపీలో బిజినెస్లు ప్రారంభించారు. పేరుకు తెలంగాణ అని చెప్పుకునే ఈయన పక్క రాష్ట్రంలో కోట్లు పెట్టుబడి పెట్టి ఢిల్లీలో ఉంటూ చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.