breaking news
Festival organizers
-
జుబీన్ గార్గ్పై విషప్రయోగం
గౌహతి: గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై ఆయన బ్యాండ్ సభ్యుడు శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఫెస్టివల్ ఆర్గనైజర్ శ్యామకాను మహంత.. గార్గ్కు విషం ఇచ్చారని ఆయన ఆరోపించారు. పీటీఐకి అందిన అత్యంత కీలక పత్రం ప్రకారం.. గార్గ్ మరణాన్ని ప్రమాదవశాత్తు జరిగినట్లుగా చిత్రీకరించడానికి ‘కుట్ర’ జరిగిందని కూడా గోస్వామి పేర్కొన్నారు. జుబీన్ గార్గ్ సెప్టెంబర్ 19న సింగపూర్లో సముద్రంలో ఈత కొడుతూ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం తెలిసిందే. మహంత, అతని సంస్థ నిర్వహించిన 4వ ఈశాన్య భారతదేశ ఉత్సవంలో పాల్గొనేందుకు జుబీన్ గార్గ్ ఆగ్నేయాసియా దేశానికి వెళ్లారు. ‘గార్గ్ మునిగిపోతూ.. శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరవుతున్న విపత్కర సమయంలో ’జబో దే, జబో దే’ (వదిలెయ్, వదిలెయ్) అని శర్మ అరిచాడని, గార్గ్ నిపుణుడైన ఈతగాడని, అతనే తనకీ, నిందితుడికీ ఈత నేర్పించాడు కాబట్టి మునిగిపోయే అవకాశం లేదని.. సాక్షి గోస్వామి స్పష్టం చేసినట్లు రిమాండ్ నోట్ పేర్కొంది. ‘శర్మ, మహంత.. జుబీన్కు విషం ఇచ్చారని, తమ కుట్రను దాచడానికి ఉద్దేశపూర్వకంగా విదేశీ వేదికను ఎంచుకున్నారని గోస్వామి ఆరోపించారు. -
సాహిత్య సౌరభం..
భాగ్యనగరం మరోసారి సాహిత్య శోభను సంతరించుకోనుంది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్కు వేదిక కానుంది. అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు ఇందులో భాగస్వాములు అయ్యేలా కార్యక్రమాలను రూపొందిస్తామని చెబుతున్నారు ఫెస్టివల్ నిర్వాహకులు. బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరగనున్న ఈ వేడుక వివరాలను ఫెస్టివల్ డెరైక్టర్స్ అజయ్ గాంధీ, అమితా దేశాయ్, జీఎస్పీ రావ్, టి.విజయ్ కుమార్ సోమవారం వెల్లడించారు. మూడు రోజులు జరిగే ఈవెంట్లో ప్రదర్శనలు, వర్క్షాపులు, స్క్రీనింగ్స్, ప్రసంగాలు ఇలా 70కి పైగా కార్యక్రమాలు నగరవాసులను అలరించనున్నాయి. భాషకు సంబంధించిన అనేక అంశాలకు ఈ ఫెస్టివల్ వేదికగా మారనుంది. ఈ పండుగలో దేశంలోని ప్రముఖ రచయితలు, యాక్టివిస్ట్లు, కళాకారులు తదితరులు పాల్గొననున్నారు. చదివే అలవాటును ప్రమోట్ చేయడమే దీని ప్రదానోద్దేశం అని చెబుతున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఫీజు లేదని, అందరూ పాల్గొనవచ్చని తెలిపారు. ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ కవి జావేద్ అక్తర్ హాజరుకానున్నారు. ఉర్దూ కవి సాహిర్ లుధియాన్వీకి ట్రిబ్యూట్గా ‘పర్చాయియన్’ అనే నాటకాన్ని 24న ప్రదర్శించనున్నారు. మహేష్భట్, అరుణ్శౌరి, మంగళాభట్, కల్పన తదిరతర ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. బెస్ట్ ఈవెంట్.. ‘2014లో నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ ప్రపంచంలో సెకెండ్ బెస్ట్ విజిటింగ్ ప్లేస్గా హైదరాబాద్ని పేర్కొంది. ఆ లింక్లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ గురించి ప్రముఖంగా పేర్కొంది. అంతేకాదు దేశంలో జరిగే ఆరు అతిపెద్ద లిటరరీ ఫెస్టివల్స్లో ఇదీ ఒకటి’ అని తెలిపారు హెచ్ఎల్ఎఫ్ డెరైక్టర్ జీఎస్పీ రావ్. ‘ఐదేళ్లుగా ఏటా డిఫరెంట్ లొకేషన్స్లో ఈవెంట్ నిర్వహిస్తున్నాం. పర్మినెంట్ వెన్యూ ఉంటే బాగుంటుందనే ఆలోచన ఉంది. ఇందుకు ప్రభుత్వం సహకరించాల’ని కోరారు మరో డెరైక్టర్ అజయ్ గాంధీ. - ఓ మధు


