breaking news
Employee Appointment
-
పోస్టుల అమ్మకం!
►అనుభవం, అర్హత లేకున్నా... ►గుట్టుగా నాలుగో తరగతి ఉద్యోగుల నియామకం ►ప్రభుత్వాసుపత్రుల్లో కొనసాగుతున్న దందా ►తాజాగా నిలోఫర్ హెల్త్ ఇన్స్పెక్టర్పై పోలీసులకు ఫిర్యాదు సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని నాలుగో తరగతి ఉద్యోగాలు కొంత మందికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆయాలు, స్వీపర్లు, డ్రైవర్లు, వార్డుబాయ్లు, టెక్నికల్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి ఉద్యోగ ఖాళీలను ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాల్లో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీలతో పాటు ఆయా ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యాధికారులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూ. 50 వేల వరకూ.... ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొలువులు కావడంతో నిరుద్యోగుల నుంచి వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఎంపికకు ప్రత్యేక మార్గదర్శకాలేమీ లేకుండానే ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు, ఆయా ఆస్పత్రుల్లోని కార్మిక సంఘాల నాయకులు, అధికారులు... ఇలా ఎవరికి వారు తమకు నచ్చిన వారితో ఈ పోస్టులను భర్తీ చేసుకున్నారు. ఇందు కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిలోఫర్లో బహిర్గతం... నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో ఇటీవల ప్రారంభించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పని చేసేందుకు కొత్తగా వంద పోస్టుల (నర్సులు, ఆయాలు, వార్డు బాయ్లు, డ్రైవర్)ను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తాత్కాలిక ప్రతిపాదికన భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా వెలువడలేదు. కానీ అప్పుడే వసూళ్ల పర్వం మొదలైంది. ఇప్పటికే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కింద పని చేస్తున్న వారితో బేరసారాలు మొదలయ్యాయి. ఒక్కో పోస్టుకు రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశంపై ఇటీవల నిలోఫర్ ఆస్పత్రికి చెందిన ఓ హెల్త్ ఇన్స్పెక్టర్పై పారిశుద్ధ కార్మికులు నాంపల్లి పోలీస్స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం కొసమెరుపు. అభివృద్ధి కమిటీలు.. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సహాయంగా ఉండేందుకు పేషంట్ కేర్ ప్రొవైడర్స్ (క్లాస్ 4 ఉద్యోగాలు) పేరుతో రాష్ట్రంలోని 11 ఆస్పత్రుల్లో 1001 ఫోస్టులను (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఇప్పటికే ఆయా ఆస్పత్రుల అభివృద్ధి కమిటీలు 475 మందిని ఎంపిక చేసుకోగా, మిగిలిన 526 వాటిని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించింది. ఉస్మానియాలో 416 పోస్టులకు గాను ఇప్పటికే 199 మంది ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కింద పని చేస్తున్నారు. మిగిలిన 217 పోస్టులను ఇటీవల భర్తీ చేశారు. ఇక గాంధీలో 27 పోస్టులు ఉండగా, వీటిలో ఇప్పటికే 20 మంది పని చేస్తుండగా, మిగిలిన ఏడు ఖాళీల భర్తీకి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఉస్మానియా వైద్య కళా శాలలో 162 ఖాళీలకు, 79 మంది ఇప్పటికే పని చేస్తుండగా, మరో 83 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆదేశించింది. ఇక సరోజినిదేవీ కంటి ఆస్పత్రిలో 72 ఖాళీల్లో ఇప్పటికే 16 మంది పని చేస్తుండగా , మిగిలిన 56 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫీవర్ ఆస్పత్రిలో 55 ఖాళీలకు 35 మంది పని చేస్తుండగా, మిగిలిన 20 ఖాళీల భర్తీకి ఆదేశాలు జారీ అయ్యాయి. -
ఏం మాయ చేశారో!
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని సామెత. దేవాదాయ శాఖలో ఉన్నతాధికారులకు తెలియకుండానే ఇద్దరు వ్యక్తులు ఉద్యోగులుగా చలామణీ అవుతున్నారు. ఓ ఆలయ మేనేజర్ వారికి ఉద్యోగాలు ఇచ్చాడు. వాళ్ల పేరుతో సర్వీసు రికార్డులు సృష్టించాడు. ఏడేళ్ల సర్వీసు తర్వాత పీఆర్సీ కూడా అమలు చేయించాడు. వీరికి ప్రభుత్వం నెల నెలా ఠంఛనుగా జీతాలు చెల్లిస్తోంది. డిప్యూటీ కమిషనర్ కార్యాలయ సూపరింటెండెంట్ సహకరించడంతో ఈ వ్యవహారాలు గుట్టుచప్పుడు కాకుండా నడిచాయి. దొంగ ఉద్యోగులిద్దరికీ బదిలీ అయినప్పుడు 14 ఏళ్ల తర్వాత ఈ విషయం బయటపడింది. ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకొని దర్యాప్తు జరపడంతో ఎన్నో విస్మయకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. వ్యవస్థలోని డొల్లతనాన్ని తేటతెల్లం చేశాయి. దీంతో ముగ్గురిని విధుల నుంచి తొలగించి, సూపరింటెండెంట్ను సస్పెండ్ చేశారు. - దేవాదాయశాఖలో దొంగ నియామకాలు - 14 ఏళ్ల కిందటి అడ్డగోలు వ్యవహారం - ఉన్నతాధికారులకు తెలియకుండా కథ నడిపించిన ఆలయ మేనేజర్ - సహకరించిన డీసీఓ సూపరింటెండెంట్ డాబాగార్డెన్స్(విశాఖ): దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకంలో అవకతవకలు బయటపడ్డాయని, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని సహాయ కమిషనర్ ఇ.వి.పుష్పవర్థన్ తెలిపారు. సోమవారం టర్నర్ చౌల్ట్రీలో ఉన్న తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఈ విషయమై రీజనల్ జాయింట్ కమిషనర్ ఆదేశాల మేరకు నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఆయన వెల్లడించిన వివరాలు.. విశాఖపట్నం కంచరపాలెం బర్మా క్యాంపు జై భారత్నగర్లో ఉన్న నూకాంబిక అమ్మవారి దేవాలయంలో చెంబోలు శ్రీనివాసరావు మేనేజర్గా విధులు నిర్వహించేవాడు. 2001లో భక్త సమాజం సెక్రటరీ ద్వారా జి.సత్యనారాయణ అనే వ్యక్తిని రూ.వెయ్యి జీతానికి నియమించాడు. ఎల్.వి.కృష్ణారావు అనే వ్యక్తిని కూడా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండానే అడ్డగోలుగా ఉద్యోగమిచ్చాడు. అంతేగాక 1993 పీఆర్సీ అమలు చేస్తూ 2008 నుంచి జి.సత్యనారాయణకు నెలకు రూ.16 వేలు,(ఫైల్ నెంబరు ఏ1/2084/08, తేది 2008 మే 25) ఎల్.వి.కృష్ణారావుకు నెలకు రూ.10 వేలు జీతంగా జూనియర్ అసిస్టెంట్ కేడర్లో పర్మినెంట్ చేశారు. వాస్తవానికి ఆ ఫైల్ నెంబరుతో యలమంచిలిలోని ఓ దేవాలయంలో పనిచేస్తున్న అర్చకుడిపై ఫిర్యాదు నమోదు చేసి ఉంది. దేవాలయానికి మంజూరయ్యే నిధులతో వారికి జీతాలు చెల్లిస్తూ వచ్చిన ఆలయ మేనేజర్ చెంబోలు శ్రీనివాసరావు.. నిధుల కొరత వల్ల ఇబ్బందులు ఎదురై సూపరింటెండెంట్ సహాయంతో వారిద్దర్నీ భీమిలి లంగర్ ఖానా చౌట్రీకి, అనంతరం సంగివలస కొత్తఅమ్మవారి దేవాలయానికి బదిలీ చేసేశాడు. ఈ విషయాన్ని క్షుణంగా పరిశీలించి విచారిస్తే చెంబోలు బాగోతం బయటపడిందని సహాయ కమిషనర్ పుష్పవర్థన్ తెలిపారు. విచారణ అనంతరం ప్రాంతీయ సహాయ కమిషనర్ భ్రమరాంబకు ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని, ఆమె సూచన మేరకు నగర పోలీస్ కమిషనర్కు ఈ నెల 20న ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ అవకతవకలకు ప్రధాన బాధ్యుడైన చెంబోలు శ్రీనివాసరావును విధుల నుంచి తొలగించి, సహకరించిన సూపరింటెండెంట్ను సస్పెండ్ చేశామన్నారు. త్వరలోనే మరికొంతమంది జాబితాను వెల్లడిస్తామని సహాయ కమిషనర్ పేర్కొన్నారు.