breaking news
Emergency pumping system
-
తాగునీటి తంటాలు లేకుండా..
సాక్షి, హైదరాబాద్: వేసవి దృష్ట్యా హైదరాబాద్ మహానగరంలో తాగునీటి ఎద్దడి నివారణకు జలమండలి ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణకు దిగింది. నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో డెడ్స్టోరేజీ వరకు నీటిని పంపింగ్ చేసేందుకు అత్యవసర మోటార్లు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు వేసవిలో తాగునీటి డిమాండ్ పెరగనున్న దృష్ట్యా ప్రస్తుతం సరఫరా చేస్తున్న 565 మిలియన్ గ్యాలన్స్ పర్ డే (ఎంజీడీ)లకు తోడు అదనంగా మరో 15 నుంచి 20 ఎంజీడీల నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లకు సిద్ధమైంది. మహానగరానికి మంచి నీరు అందిస్తున్న నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం రోజు రోజుకు పడిపోతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 516 అడుగులకు చేరింది. నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉండటంతో ముందస్తుగా మోటార్లను బిగించి అత్యవసర పంపింగ్కోసం ఏర్పాట్లు చేస్తోంది. సాగర్ జలాశయంలో మినహా అన్ని రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని జలమండలి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సగం వాటా కృష్ణా జలాలదే.. మహానగరంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అత్యధిక ప్రాంతాలకు సరఫరా అవుతున్న తాగునీటిలో సగం వాటా కృష్ణా జలాలదే. నాగార్జున సాగర్ నుంచి నిత్యం 270 ఎంజీడీల నీటిని నగరానికి తరలిస్తున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాగర్ సమీపంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి పంప్ హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. సాగర్ నీటి మట్టం 510 అడుగులకు పడిపోతే అక్కంపల్లి రిజర్వాయర్లోకి గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించే పరిస్థితి ఉండదు. దీంతో సాగర్ నుంచి కష్ణాజలాల అత్యవసర పంపింగ్ తప్పనిసరి. గత ఐదేళ్ల క్రితం కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తరలించారు. జలాల తరలింపు ఇలా.. హైదరాబాద్ మహా నగరానికి వివిధ జలాశయాల నుంచి ప్రతి నిత్యం సుమారు 565 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం నుంచి 270 ఎంజీడీలు, గోదావరి నుంచి 172 ఎంజీడీలు, సింగూరు, మంజీరాల నుంచి 103, ఉస్మా¯న్ సాగర్ నుంచి 14 ఎంజీడీల నీటిని తరలిస్తున్నారు. హిమాయత్సాగర్ నుంచి ప్రస్తుతం నీటి సేకరణ జరగడం లేదు. డెడ్ స్టోరేజీగా హిమాయత్సాగర్ను ఉంచినప్పటికీ వేసవిలో అవసరాల మేరకు ఈ రిజర్వాయర్ నుంచి పాతనగరానికి నీటిని అందించి కృష్ణా జలాల ప్రాంతాలకు సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గోదావరి నుంచి తరలిస్తున్న 172 ఎంజీడీలో 40 ఎంజీడీలు మిషన్ భగీరథకు మళ్లిస్తున్నారు. దానిని సైతం నగరానికి తరలించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు.. వేసవిని దృష్ట్యా డిమాండ్కు అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సిద్ధమైంది. నగరంలో ఇప్పటికే 72 ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. డిమాండ్ని బట్టి అదనపు ఫిల్లింగ్ స్టేషన్ కోసం జలమండలి చర్యలు చేపట్టింది. -
గ్రేటర్ ప్రజలకు గోదారి నీళ్లు
ఏటూరునాగారం : గ్రేటర్ వరంగల్ ప్రజలకు గోదావరి జలాలు మరో 24గంటల్లో అందనున్నాయి. వేసవిలో నీటి కష్టాలు ఎదుర్కొం టున్న మహా నగర ప్రజలకు ఏటూరునాగా రం మండలంలోని దేవాదుల ఇన్ టేక్వెల్ నుంచి నీరు సరఫరా చేయాలని నిర్ణయిం చగా, కార్పొరేషన్ నుంచి రూ. 8.69 కోట్లు నిధులతో ఎమర్జెన్సీ పంపింగ్ సిస్టం ఏర్పాటు చేసిన విషయం విదితమే. గోదావరి ఒడ్డుపై 70 హార్స్పవర్ సామర్థ్యం కలిగిన 16 మో టార్లు, గోదావరి నది మధ్యలో రెండు ఇనుప పడవలపై 50 హార్స్పవర్ కలిగిన 16 సబ్ మెర్సిబుల్ మోటార్లు అమర్చి వీటి ద్వారా దేవాదుల ఇన్ టేక్వెల్ ఫోర్బేలోకి నీరు పం పింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు క్యూ బిక్ మీటర్ల మేర నీరు చేరడంతో దేవాదుల మొదటి దశలోని ఒక మోటారును మంగళవారం రాత్రి ప్రారంభించారు. 500 హెచ్పీ సామర్థం కలిగిన ఒక్క మోటారు ఒక్క సెకండ్కు ఐదు వేల లీటర్ల నీటిని డెలివరీ చేస్తోంది. ఈ మేరకు నీరు పైపులైన్ ద్వారా భీంఘన్పూర్, పులుకుర్తి, ధర్మసాగర్ రిజర్వాయర్లకు గురువారం నాటికి చేరుతుంది. నిమిషానికి ఆరు క్యూబిక్ మీటర్లు దేవాదుల వద్ద ఏర్పాటు చేసిన 32 మోటార్లతో ఒక నిమిషానికి ఆరు క్యూబిక్ మీటర్ల మే ర నీరు ఇన్ టేక్వెల్కు వెళ్లే కెనాల్లోకి పం పింగ్ చేస్తోంది. ఇలా గోదావరి నీరు అంతా ఇన్టేక్వెల్లోని ఫోర్బేలకు 72 మీటర్ల మేర చేరుకుంది. ఇలా 24 గంటల పాటు నీరు ఫోర్బేలకు చేరడంతో 864 క్యూబిక్ మీటర్లకు నీటి సామర్థ్యం పెరగనుంది. నగర ప్రజలకు కావాల్సిన నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్లో 350 ఎంసీఎఫ్టీ మేర నిల్వ చేసేందుకు 23 రోజుల పాటు దేవాదుల పైపులైన్ నుంచి మోటార్లు ఎత్తిపోయనున్నాయి. ఈక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.