breaking news
drinking water bores
-
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాగునీటి కష్టాలను శాశ్వతంగా తొలగించేలా వాటర్ గ్రిడ్ పథకాన్ని హైబ్రిడ్ యాన్యుటీ పద్ధ్దతిలో చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. ► హైబ్రిడ్ యాన్యుటీ పద్ధ్దతి అంటే.. కాంట్రాక్టరుకు నిర్మాణ వ్యయంలో నామమాత్రం మొత్తాన్ని ఇప్పుడు చెల్లించి మిగిలింది సాధారణ బ్యాంకు వడ్డీతోగానీ అంతకంటే తక్కువ వడ్డీరేటుతో లెక్కకట్టి 10–12 ఏళ్ల పాటు చెల్లించడం. ► రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు కూడా అవసరమైన నీటిని అందించేందుకు వీలుగా భారీ వాటర్ గ్రిడ్కు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ► కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల అధిక వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఈ వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రభుత్వం తలపెట్టింది. అంతేకాక, ఫ్లోరైడ్ వంటి సమస్యను పరిష్కరించడంతోపాటు తీర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు ఉప్పునీరు కాకుండా కాపాడినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు. తొలుత ఆరు జిల్లాల్లో.. రోజూ ఒక మనిషికి పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో వంద లీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 150 లీటర్ల నీటిని అందించేలా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం మేర కాంట్రాక్టర్లకు పనులు చేపట్టే సమయంలో, మిగిలిన 70 శాతం నిధులను 12 ఏళ్ల పాటు విడతల వారీగా చెల్లించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా తీవ్ర మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాలతో కలిపి మొత్తం ఆరు జిల్లాల్లో ప్రాజెక్టు పనులను చేపట్టనున్నారు. ఏటా 90 టీఎంసీలు అవసరం – వాటర్ గ్రిడ్లో భాగంగా ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. మొత్తం 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతోపాటు ఎలాంటి మార్పులు లేకుండా వినియోగించుకునేలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ను రూపొందించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ ఏడాది పొడవునా నీటి సరఫరాకు 90 టీఎంసీల నీరు అవసరం కాగా నీటి వనరుల కోసం 52 రిజర్వాయర్లను గుర్తించారు. రూ.12,308 కోట్లతో తొలిదశ – శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో సురక్షిత నీరు లేకపోవడంవల్ల కిడ్నీ వ్యాధులు అత్యధికంగా నమోదవుతున్నాయన్న అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాంతంలో వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటిని అందించనున్నారు. – జీవనది గోదావరి చెంతనే ప్రవహిస్తున్నా.. ఆక్వా సాగుతో సముద్రతీర ప్రాంతాల భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. దీంతో మంచినీటి కోసం తపిస్తున్న ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలను కూడా వాటర్ గ్రిడ్ ద్వారా ఆదుకోనున్నారు. – ఇక.. ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం, వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల ప్రాంతాల్లో ప్రతి ఏటా వందలాది గ్రామాల్లో మంచినీరు దొరకని పరిస్థితి. దీంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తోంది. దీనికి శాశ్వతంగా చెక్ పెట్టాలని సర్కారు భావిస్తోంది. – అలాగే, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో సున్నపు రాయి నిక్షేపాలు, ఫ్లోరైడ్ కారణంగా ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న తాగునీటి కష్టాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. మంచినీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు తొలి విడతలో ఈ ప్రాంతాలను వాటర్ గ్రిడ్లో ఎంపిక చేశారు. తొలి విడత పనులకు రూ.12,308 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఉద్దానంలో 100 శాతం ప్రభుత్వ నిధులతో.. – రాష్ట్రమంతటా వాటర్గ్రిడ్ ప్రాజెక్టును హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపట్టాలని నిర్ణయించినా ఉద్దానం ప్రాంతంలో సురక్షిత నీరు అందుబాటులో లేక పెద్దఎత్తున నమోదవుతున్న కిడ్నీ జబ్బులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మాత్రం వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు. మొదలైన టెండర్ల ప్రక్రియ తొలి విడత వాటర్గ్రిడ్ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను ప్రాథమికంగా మొదలు పెట్టారు. తొలి విడతలో ఆరు జిల్లాలో ఆరు ప్యాకేజీల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపట్టడంపై ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్ అధికారులు ఈఓఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్టŠట్) నోటిఫికేషన్ జారీచేశారు. కాంట్రాక్టర్లు తమ ఆసక్తిని తెలియజేసేందుకు ఏప్రిల్ 22వ తేదీ వరకు గడువు ఉంది. 16లోగా జ్యుడీషియల్ ప్రివ్యూకు వివరాలు వాటర్ గ్రిడ్ పనులకు టెండర్లు నిర్వహించేందుకు తొలుత జ్యుడీషియల్ ప్రివ్యూకు ఈనెల 16లోగా వివరాలు పంపాలని నిర్ణయించారు. జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి అనుమతి రాగానే జూన్ మొదటి వారం కల్లా టెండర్లు నిర్వహించి ఆ తర్వాత పనులను ప్రారంభించేందుకు ఏపీ తాగునీటి సరఫరా కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
కొంటేనే నీళ్లు!
- మదనపల్లెలో జోరుగా నీటి వ్యాపారం - ఒక్కో ట్యాంకర్ నీళ్లు రూ.700లు - రోజుకు 650 ట్రిప్పుల నీళ్ల కొనుగోళ్లు - నెలకు రూ.83 లక్షల ఖర్చు జిల్లాలో పడమటి మండలాల ప్రజలు గుక్కెడు నీళ్లు దొరకక అల్లాడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ట్యాంకర్ల యజమానులు రోజుకో రేటు చొప్పున అడ్డం గా దోచేస్తున్నారు. మదనపల్లె పట్టణంలో నెలకు రూ.7.3 కోట్ల మేర నీటి వ్యాపారం సా గుతోందంటే ఇక్కడి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చే సుకోవచ్చు. మదనపల్లె : మదనపల్లె పట్టణంలో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. నాలుగేళ్లుగా వర్షాలు లేకపోవడంతో మంచినీటి బోర్లు, బావులన్నీ దాదాపుగా ఎండిపోయాయి. పట్టణవాసులు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుగోలుచేసి గొంతుతడుపుకోవాల్సి వస్తోంది. మదనపల్లెలో పట్టణంలో మొత్తం 300 ప్రైవేట్ ట్యాంకులు ఉన్నాయి. ఇందులో మున్సిపల్ అధికారులు 112 ట్యాంకులు వినియోగించుకుంటున్నారు. రోజుకు 650 ట్రిప్పులను 13 సంపులకు నింపుతున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.430 చొప్పున ప్రైవేటు ట్యాంకర్లకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు దాదాపు రూ.2.79 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. అంటే నెలకు దాదాపుగా రూ.83 లక్షలపైమాటే ఖర్చుచేస్తున్నారు. ట్యాంకర్ల యజమానులకు డబ్బేడబ్బు మదనపల్లె పట్టణంలో దాదాపు 200 దాకా ప్రయివేట్ ట్యాంక ర్లు ఉన్నాయి. ఒక్కో ట్యాంకర్ నీళ్లు రూ.600 నుంచి రూ.700 వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్యాంకరు రోజుకు 15 ట్రిప్పులు వరకూ తోలుతుంటాయి. ఈ లెక్కన 200 ట్యాంకర్లు 3000 ట్రిప్పుల వరకు తోలుతుంటాయి. ఇలా రోజుకు దాదాపు రూ.24 లక్షల వరకు గడిస్తున్నారు. అంటే నెలకు రూ.6.3 కోట్లుదాకా రాబడి వస్తోంది. పట్టణం మొత్తం మీద ఒక్క మంచినీటి కోసమే దాదాపు 7.13 కోట్ల దాకా వెచ్చించాల్సి వస్తోంది. మున్సిపల్ కొళాయిలు ఉన్నా.. మున్సిపల్ పవర్ బోర్లు 264 ఉండగా వాటిలో 70 మాత్రమే పనిచేస్తున్నాయి. 140 హ్యాండ్ బోర్లకుగాను 55 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక కొళాయిలు ఉన్నా అంతంతమాత్రమే. అందులో 10, 15 రోజులకోసారిగానీ నీరు రాని పరిస్థితి. ఎంతకు కొనుగోలు చేస్తారంటే.. ట్యాంకర్ యజమానులు బోర్ల వద్ద ట్యాంకరు నీరు రూ.300 చొప్పున కొనుగోలు చెస్తారు. అదే ట్యాంకరు నీరు కరెంటు లేకపోతే జనరేటర్ ద్వారా నింపితే రూ.350 చొప్పున బోర్ల యజమానులు వసూలు చేస్తుంటారు. అక్కడి నుంచి పట్టణంలో దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల వరకూ నీటిని సరఫరా చేస్తారు. ట్యాంకరు నిర్వాహకులు డ్రైవర్ బత్తా, డీజిల్ ఖర్చు, మెయింటెనెన్స్ కలిపి ట్యాంకరు నీటిని రూ.700 చొప్పున విక్రయిస్తున్నారు. నీళ్లు కొనలేకపోతున్నాం.. ట్యాంకరు నీటికి రూ700 వెచ్చించాల్సి వస్తోంది. తాగునీటి సమస్య కొన్నేళ్లుగా ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదు. పాలకులు, అధికారుల హామీలు నీటిమూటలుగా మారుతున్నాయి. - కుమార్, మదనపల్లె