breaking news
doctors transfers
-
వైద్య శాఖలో బదిలీలు ప్రారంభం
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీలు ప్రారంభమయ్యాయి. బదిలీ ఉత్తర్వులు బుధవారం ఆన్లైన్లో జారీ చేశారు. వైద్య విద్యా సంచాలకులు పరిధిలోని వైద్య కళాశాలలు, బోధన ఆసుపత్రుల్లో పనిచేసే 216 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 596 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 41 మంది ట్యూటర్లు బదిలీ అయ్యారు. 206 మంది ప్రొఫెసర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎ కేటగిరీకి చెందిన విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి, కర్నూలు, గుంటూరుల్లోని వైద్య కళాశాలలు, బోధన ఆసుపత్రులు, విజయవాడ, వైఎస్సార్ కడపలోని డెంటల్, అన్ని నర్సింగ్ కళాశాలల్లోని వైద్యులను వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. అదే విధంగా బి కేటగిరీలోని నెల్లూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, ఒంగోలు కళాశాలలకు కొత్తగా కేటాయించిన వైద్యులు వచ్చి చేరేంత వరకూ ఇక్కడ పనిచేసే వారిని రిలీవ్ చేయవద్దని సూచించారు. రిలీవ్ అయిన ఏడు రోజుల్లో కొత్తగా కేటాయించిన చోట విధుల్లో చేరాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ఎ కేటగిరి సంస్థల్లో బుధవారం బదిలీ అయిన వారిని ప్రిన్సిపాళ్లు రిలీవ్ చేశారు. రిలీవ్ అయిన వైద్యులు వారికి కేటాయించిన ప్రదేశాల్లో గురువారం నుంచి జాయిన్ అవుతారు. -
కనీసం 6 నెలలు బదిలీలు ఆపండి
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): వైద్యుల బదిలీల సమయం ఇది కాదని, కనీసం ఆరు నెలలు బదిలీలు అపాలని ఏపీ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.శ్యామ్సుందర్ ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని ఓ హోటల్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. బదిలీల విషయమై పక్షం రోజులుగా ఎటువంటి ఆందోళనలు చేపట్టకుండా, రోడ్లెక్కి నిరసనలు చేయకుండా, శాంతియుతంగా ప్రజా ప్రతినిధులను కలిసి మొర పెట్టుకున్నా స్పందన రాలేదన్నారు. బదిలీల విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య సంఘాలతో చర్చించిన తర్వాతే బదిలీల విషయమై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశాఖ అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్యామ్సుందర్ ఆరోపించారు. కేజీహెచ్లో ఉన్న 300 మందికి పైగా వైద్యులు ఐదేళ్లు పైబడి ఉన్నారని, వారందరినీ ఒకేసారి బదిలీ చేస్తే వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఫలితంగా ప్రజల ప్రాణాలు పోవడమే గాక, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. అసోసియేషన్ విశాఖ అధ్యక్షుడు డాక్టర్ సుందరరాజు, కార్యదర్శి డాక్టర్ బి.రమేష్కుమార్ పాల్గొన్నారు. -
వైద్యశాఖలో బదిలీలకు గ్రీన్ సిగ్నల్
► బదిలీలు పారదర్శకంగా జరుగుతాయి ► 422 వైద్య పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ ► ప్రతి జిల్లా ఆసుపత్రిలో 10 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు ► జిల్లాకు 2 చొప్పున 13 జిల్లాలలో హెల్త్ ఏటీయమ్స్ ఏర్పాటు ► మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి ఏపీ ముఖ్యమంత్రి ఆదేశానుసారం శుక్రవారం నుంచి 10 రోజుల పాటు వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ చేపడుతున్నట్లు ఆ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గురువారం తెలిపారు. బదిలీలు పారదర్శకంగా ఉంటాయన్నారు. డాక్టర్ల పనితీరు, పరస్పర అంగీకారం, భార్య, భర్తలను ఒకే చోట లేదా వీలైనంత దగ్గరగా పనిచేసేలా, ఎంసీఐ నిబంధనలకు లోబడి ఈ బదిలీలు చేస్తామని మంత్రి కామినేని తెలిపారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలతో పాటు ఉచిత సీటీ స్కాన్ పరీక్షలు, తల్లి, బిడ్డ ఎక్స్ ప్రెస్, 108 సేవలు, 102 కాల్ సెంటర్, ఆసుపత్రులలో పరికరాల ఏర్పాటు మొదలైన పథకాల పనితీరు బాగుందని ముఖ్యమంత్రి చెప్పినట్లు మంత్రి కామినేని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా 35 సంవత్సరాల వయస్సు నిండిన మహిళలకు అన్ని రకాల క్యాన్సర్, థైరాయిడ్, డయాబెటిస్, హర్మోన్, స్త్రీ వ్యాధులకు ఉచిత వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 13 వేల మంది ఎఎన్ఎమ్ లకు దీనిపై శిక్షణతో పాటు ట్యాబ్స్ ఇచ్చామని మంత్రి తెలిపారు. ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో అత్యాధునిక నేత్ర పరీక్ష కోసం యంత్ర పరికరాల ఏర్పాటు చేశామని, అన్ని జిల్లా ఏరియా ఆస్పత్రులలో బయోమెట్రిక్ హాజరు విధానం అమలుచేసిన తర్వాత హాజరుశాతం పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఆసుపత్రులల్లో ప్రసవించిన మహిళలకు త్వరలో "బేబీ కిట్స్" ఇవ్వబోతున్నామని, దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ప్రారంబిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక్కొక్క ఆసుపత్రిలో 10 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లాకు 2 చొప్పున 13 జిల్లాలలో హెల్త్ ఏటీయమ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్బన్ హెల్త్ సెంటర్స్ పనితీరు బాగోలేదని వీటిని ఈయుపీహెచ్సీలుగా మార్చి ఆధునీకరిస్తున్నామన్నారు. 422 వైద్య పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని, త్వరలో ప్రభుత్వ వైద్యకళాశాలలో చదివే విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తున్నట్లు మంత్రి కామినేని తెలిపారు. కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించినప్పుడు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాననడం సరికాదని బీజేపీ సభ్యుడిగా పార్టీలోని కార్యకర్తలు, నాయకులను కలుపుకొని వెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మంత్రిగా తన శాఖను, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పనిచేసే బాధ్యత తనపై ఉందన్నారు. కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, స్మృతి ఇరానీల విజ్ఞప్తి మేరకే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశానని, అదికూడా ముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబును సంప్రదించాకేనని చెప్పారు. ప్రత్యేక హోదాపై బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.