breaking news
delicious recipes
-
వ్యర్థాల నుంచి రుచికరమైన వంటలు తయారు చేస్తున్న పాపులర్ చెఫ్
వంట అందరూ చేస్తారు కానీ, ఎక్కువమంది తినేట్టు, నచ్చేటట్లు చేసిన వారు మాత్రమే చెఫ్గా మారతారు. మరింత రుచికరంగా... ఘుమఘుమలాడేలా వినూత్నంగా ఆహారాన్ని తయారు చేసిన వారు పాపులర్ చెఫ్గా పేరు తెచ్చుకుంటారు. ఇలా పాపులర్ అయిన అతికొద్దిమంది చెఫ్లలో ఒకరే దవీందర్ కుమార్. ప్రొఫెషనల్ చెఫ్గా యాభై ఏళ్లు పూర్తి చేసుకుని వేస్ట్ టు ప్లేట్’ ఐడియాతో ఇండియాలోనే గాక ప్రపంచంలోని చెఫ్లు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చెఫ్ డీకేగా పేరొందిన దవీందర్ కుమార్ ఢిల్లీ యూనివర్శిటీలో కామర్స్ డిగ్రీ పూర్తయ్యాక ప్రొఫెషనల్ డిగ్రీ చేయాలనుకున్నారు. అప్పట్లో పెద్దగా ప్రొఫెషనల్ కోర్సులు అందుబాటులో లేవు. తన స్నేహితుడు ఒబెరాయ్ హోటల్లో పనిచేస్తుండడంతో తను కూడా హోటల్లో చేరాలనుకున్నాడు. ఇంట్లో ఎవరికీ ఇష్టలేకపోయినప్పటికీ ‘ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్’లో చేరాడు. మూడేళ్ల కిచెన్ మేనేజ్మెంట్ డిప్లొమా ప్రోగ్రామ్ పూర్తి చేసిన తరువాత.. ఒబెరాయ్ హోటల్లో పర్మనెంట్ ఉద్యోగి అయ్యాడు. దీంతో దవీందర్ చెఫ్ ప్రయాణం మొదలైంది. ఫ్రెంచ్ భాషపై ఉన్న ఆసక్తితో ఫ్రెంచ్ వంటకాలను సైతం నేర్చుకునేవాడు. ఆసక్తి మరింత ఎక్కువ కావడంతో పారిస్లోని టెక్నిక్ డీ హోటలియర్లో రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నాడు. తనకిష్టమైన వంటలన్నీ నేర్చుకుంటూ, మరోపక్క చెఫ్గా రాణిస్తూ ఒబెరాయ్ గ్రూప్లో 12 ఏళ్ల పాటు పనిచేశాడు. ఆ తరువాత 1985లో ‘లీ మెరిడియన్’లో టీమ్ సభ్యుడిగా చేరాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు మెరిడియన్ హోటల్స్ వైస్ ప్రెసిడెంట్గానేగాక, ఎగ్జిక్యూటివ్ చెఫ్గా పనిచేస్తున్నారు. ఇండియన్ కలినరీ ఫోరమ్కు (ఐసీఎఫ్)కు ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తొక్కలతో... చెఫ్గా ఎంతో అనుభవం ఉన్న దవీందర్ కుమార్ ఒకరోజు టీవీలో వరల్ట్ ఫుడ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు. ‘‘ప్రపంచంలో ఉత్పత్తి అవుతోన్న ఆహారంలో మూడు వంతులు తినకముందే వ్యర్థంగా పోతుంది. ఒక్కో హోటల్లో పండ్లు, కూరగాయల నుంచి తయారు చేసే వంటకాల్లో కనీసం ఐదు నుంచి పది శాతం వ్యర్థంగా పోతుంది’’ అని చెప్పారు. ఇది చూసిన దవీందర్కు వ్యర్థాల నుంచి కూడా ఆహారం తయారు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. అదే వేస్ట్ టు ప్లేట్. అనుకున్న వెంటనే పన్నెండు రెస్టారెంట్లు, ఐదు ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి పండ్లు, కూరగాయ వ్యర్థాలను సేకరించడం మొదలు పెట్టారు. అలా సేకరించిన వాటిని శుభ్రం చేసి రంగు, రుచికి తగ్గట్టుగా వేరు చేసి, పోషకాలతో కూడిన డిష్లను తయారు చేసి కస్టమర్లకు వేడి వేడిగా వడ్డించారు వీటిని తిన్నవారు ఇష్టపడడంతో వేస్ట్ టు ప్లేట్ను కొనసాగిస్తున్నారు. ఈ ఫుడ్ వ్యర్థాల్లో కూరగాయ, పండ్లతొక్కలు, కొమ్మలు, కాడలు, విత్తనాలు కూడా ఉన్నాయి. స్పెషల్ మెనూ.. వ్యర్థాల నుంచి తయారు చేసే రుచికరమైన వంటలతో ఏకంగా స్పెషల్ మెనూని అందిస్తున్నాడు చెఫ్ డీకే. ఈ మెనూలో పనసపండు విత్తనాలు, బాదం హల్వా, సెలేరి, పాలకూర సలాడ్, యాపిల్ పల్ప్ పై, బ్రాకలీ, పుదీనా కాడల ముక్కల చట్నీ, జ్యూస్ తీయగా మిగిలిపోయిన బీట్రూట్తో రసం, క్యారట్ తొక్కల సలాడ్వంటివి ఉన్నాయి. ఈ డిష్లు రుచిగా, శుచిగానేగాక పుష్కలంగా పోషకాలు ఉండేలా వడ్డించడం విశేషం. View this post on Instagram A post shared by Chef Davinder Kumar (@chefdavinderkumar) కుక్ బుక్స్.. కొత్త వంటలని కనిపెట్టడమేగాక తను చేసే వంటలతో చాలా కుక్బుక్స్ను రాశాడు చెఫ్ డీకే. ఈ బుక్స్లో ‘కబాబ్ చట్నీ అండ్ బ్రెడ్’, జస్ట్ కబాబ్: ఫర్365 కబాబ్స్ అండ్ లీప్ ఇయర్’, సూప్స్, ఫోర్ సీజన్స్, సీజనల్ సలాడ్, సెకండ్ మీల్స్ వంటివి ఉన్నాయి. పుస్తకాల్లో కొన్నింటికి గౌరవ సత్కారాలు కూడా అందుకున్నారు. లీ మెరిడియన్ పదో వార్షికోత్సవం సందర్భంగా 7500 కేజీల కేక్ను తయారు చేసి లిమ్కాబుక్ రికార్డుల్లో నిలిచారు. అంతర్జాతీయ మెడల్స్తో పాటు, గోల్డెన్ హ్యాట్ చెఫ్ అవార్డు, భారత పర్యాటక మంత్రిత్వ శాఖతో బెస్ట్ చెఫ్ ఆఫ్ ఇండియా అవార్డు, జాతీయ టూరిజం అవార్డులను అందుకున్నారు. View this post on Instagram A post shared by Trends9 (@trends9official) -
ఢిల్లీషియస్
ఇది ‘ఆప్’ కా మెనూ! ఆమ్ ఆద్మీ పార్టీ మెనూ అనుకునేరు ఆప్ కా అంటే ‘మీ’ మెనూ! ఢిల్లీ మెనూ! చురుగ్గా ఉంటుంది. తళుక్కుమంటుంది. కటుక్కుమంటుంది. ఇక మిగిలిందల్లా గుటుక్కుమనడమే! ఢిల్లీ దర్బార్ నుంచి మీ కోసం తెచ్చాం ఢిల్లీషియస్! మ్యాంగో లస్సీ కావలసినవి: మామిడి పండు ముక్కలు - ఒకటిన్నర కప్పు తాజా పెరుగు - అర కప్పు; పంచదార - 2 టేబుల్ స్పూన్లు తయారీ: మామిడిపండు ముక్కలు, పెరుగును ఫ్రిజ్లో పెట్టి చల్లబడ్డాక తీయాలి. మిక్సర్జార్లో మామిడి పండు ముక్కలు, పెరుగు, పంచదార వేసి బ్లెండ్ చేయాలి. గ్లాసులో పోసి పుదీనా ఆకులు, మామిడిపండు ముక్కలతో అలంకరించి చల్ల చల్లగా వెంటనే అందించాలి. పనీర్ బేగం బహార్ కావల్సినవి: పనీర్ ముక్కలు - కప్పు యాలకులు - 4 దాల్చిన చెక్క - చిన్న ముక్క లవంగాలు - 4 ఎండుమిర్చి - 3 ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగి, మెత్తగా రుబ్బాలి) అల్లం - వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్ టొమాటో తరుగు - ఒకటిన్నర కప్పు (మెత్తగా రుబ్బాలి) కొత్తిమీర తరుగు - టీ స్పూన్ కారం - టీ స్పూన్ ఉప్పు - తగినంత మిరియాల పొడి - చిటికెడు పాల మీగడ - టేబుల్ స్పూన్ వెన్న- టీ స్పూన్ నెయ్యి - టీ స్పూన్ తయారీ ♦ పనీర్ను పెద్ద ముక్కలుగా కట్ చేసి, నూనెలో వేయించి పక్కన ఉంచాలి. ♦ కడాయిలో నెయ్యి వేడయ్యాక చితక్కొట్టిన యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిర్చి వేయించాలి. ♦ ఉల్లిపాయల పేస్ట్, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 4-5 నిమిషాలు వేయించాలి. ♦ దీంట్లో టొమాటో గుజ్జు వేసి మరో 10 నిమిషాలు ఉడికిస్తే మిశ్రమం బాగా చిక్కబడుతుంది. ♦ దీంట్లో వేయించిన పనీర్ ముక్కలు, జీడిపప్పు పలుకులు, కొత్తిమీర ఆకులు, కారం, ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. ♦ మిరియాల పొడి, పాల మీగడ, వెన్న, నెయ్యి వేసి కలిపి దించాలి. క్రిస్పీ స్టఫ్డ్ హరా భరా కావలసినవి: ♦ కాబూలీ చనా (శనగలు) - ముప్పావు కప్పు ♦ బీన్స్, క్యారట్స్ (సన్నగా తరిగినవి) - 2 కప్పులు ♦ పచ్చిబఠాణీలు - అర కప్పు; ♦ మైదా - 2 టేబుల్ స్పూన్లు, ♦ శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు; ♦ ఆవ నూనె - 2 టేబుల్ స్పూన్లు ♦ జీలకర్ర పొడి, యాలకుల పొడి, ♦ దాల్చిన చెక్క పొడి - టీ స్పూన్ ♦ ఛీజ్ - 2 టేబుల్ స్పూన్లు ♦ నిమ్మరసం - అర టీ స్పూన్; ఉప్పు - తగినంత ♦ కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు ♦ కార్న్ఫ్లోర్ - 2 టీ స్పూన్లు ♦ పచ్చిమిర్చి - 5 (సన్నగా తరగాలి) ♦ ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి) తయారీ ♦ శనగలను, పచ్చిబఠాణీలను విడివిడిగా ఉడికించి, గరిటతో కచ్చాపచ్చాగా మెదిపి పక్కన ఉంచాలి. ♦ పెద్ద గిన్నెలో బీన్స్- కార్యట్ తరుగు, పచ్చిబఠాణీ, శనగపిండి, మైదా, ఆవనూనె, సిద్ధం చేసుకున్న గరం వేసి కలపాలి. దీంట్లో కొద్దిగా ఛీజ్ వేయాలి. ♦ బాగా మెదిపిన శనగలు, పచ్చిబఠాణీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలపాలి. ♦ పై వన్నీ కలిపి, తగినంత ఉప్పు వేసి మిక్సర్లో ఒకసారి బ్లెండ్ చేయాలి. లేదంటే రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి. కార్న్ఫ్లోర్ వేసి కలపాలి. ♦ ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు తీసుకొని, అదిమి, కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా బాగా కాల్చాలి. వేడిగా ఉన్నప్పుడే ఈ కబాబ్స్ను సగానికి కట్ చేసి, సన్నగా తరిగిన ఛీజ్ను మధ్యలో కూరాలి. ♦ సన్నగా తరిగిన క్యాబేజీ, క్యారట్, ఉల్లిపాయలతో అలంకరించి... చిలికిన పెరుగుతో వడ్డించాలి. ఛోలే భటురా కావలసినవి: ♦ కాబూలీ చనా (శనగలు) - కప్పు ♦ ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి) ♦ అల్లం-వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్ ♦ ఉప్పు - తగినంత, టొమాటో తరుగు - కప్పు ♦ దానిమ్మ గింజలు - అర కప్పు (మెత్తగా రుబ్బాలి) ♦ పాల మీగడ - 2 టీ స్పూన్లు; నూనె - 3 టేబుల్ స్పూన్లు; కారం - టీ స్పూన్; పచ్చిమిర్చి - 2 ♦ ఎండుమిర్చి - 2; వెన్న - 2 టీ స్పూన్లు ♦ జీలకర్ర, ఆవాలు - టీ స్పూన్; లవంగాలు-3 యాలకులు-3 దాల్చిన చెక్క-చిన్న ముక్క తయారీ ♦ శనగలను టీ స్పూన్ నూనె, పావు టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసి కలిపి ఉడికించి, నీళ్లను వడకట్టి పక్కనుంచాలి. ♦ కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేయించి చల్లారాక పొడి చేసుకోవాలి. ♦ కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో తరుగు, సిద్దం చేసుకున్న మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా ఉడికించాలి. ♦ దీంట్లో ఉడికించిన శనగలను కలపాలి. ♦ టొమాటో, శనగలు బాగా ఉడికాక దీంట్లో మెత్తగా రుబ్బిన దానిమ్మ గింజల పేస్ట్ కలపాలి. ♦ సన్నని మంట మీద ఈ మిశ్రమం 30 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. త్వరగా కావాలంటే కుకర్లో ఉడికించవచ్చు. ♦ శనగల మిశ్రమం బాగా మెత్తగా అయ్యి, మిశ్రమం చిక్కబడ్డాక చిలికిన పాల మీగడ, వెన్నె కలిపి, మరో 10 నిమిషాలు ఉంచి, మిరియాల పొడి చల్లి దించాలి. లాంబ్ చాప్స్.. విత్ మఖనీ సాస్ కావల్సినవి: ♦ లాంబ్ చాప్స్ (ఎముకలున్న గొర్రె మాంసం ముక్కలు) - 4, ఉప్పు - తగినంత ♦ మిరియాల పొడి - చిటికెడు ♦ అల్లం - వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్ ♦ ఆవనూనె - టీ స్పూన్ ♦ పెరుగు - టేబుల్ స్పూన్ ♦ కారం - అర టీ స్పూన్ ♦ ధనియాల పొడి - పావు టీ స్పూన్ ♦ దాల్చిన చెక్క పొడి - చిటికెడు తయారీ: ♦ గిన్నెలో లాంబ్ చాప్స్, ఉప్పు, మిరియాలపొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఆవనూనె, పెరుగు వేసి కలపాలి. దీనిని అర గంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత కారం, ధనియాలపొడి, దాల్చిన చెక్కపొడి వేసి కలిపి రాత్రిమొత్తం ఫ్రిజ్లో ఉంచాలి. ♦ కడాయిలో నూనె వేసి కాగాక బాగా నానిన మాంసం ముక్కలను వేయించాలి. (ఈ ముక్కలను బొగ్గుల కుంపటి మీద గ్రిల్ చేసుకోవచ్చు) దీంట్లో కప్పు నీళ్లు కలిపి ఉడికించాలి. ముక్క మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. మఖనీ సాస్ కోసం... ♦ కడాయిలో టీ స్పూన్ నూనె వేసి టొమాటో గుజ్జు - టేబుల్ స్పూన్, కారం- చిటికెడు, జీడిపప్పు పొడి- అర టీ స్పూన్, చిటికెడు మెంతిపొడి, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. మిశ్రమం బాగా ఉడికాక పాల మీగడ, వెన్న వేసి కలిపి దించాలి. తయారుచేసుకున్న లాంబ్ చాప్స్ని ప్లేట్లో సర్ది, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మఖనీ సాస్ , కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి. రబ్డీ కావలసినవి: ♦ పాలు - 5 కప్పులు; యాలకులు - 4 ♦ పంచదార - 2 టేబుల్ స్పూన్లు ♦ కెవ్డా (మొగలి) ఎసెన్స్/ రోజ్వాటర్ - 3 చుక్కలు ♦ యాలకుల పొడి - చిటికెడు ♦ పిస్తాపప్పు పొడి - చిటికెడు ♦ కుంకుమపువ్వు - 5 రేకలు ♦ ఎడిబుల్ సిల్వర్ ఫాయిల్ తయారీ ♦ మందపాటి పెద్ద గిన్నెలో పాలు పోసి, సన్నని మంట మీద మరిగించాలి. ♦ పాలు బాగా మరిగాక పంచదార, యాలకుల గింజలు వేసి 2 కప్పుల పాలు అయ్యేంత వరకు మరిగించాలి. ♦ మంట తీసేసి ఎసెన్స్/రోజ్వాటర్ కలపాలి. ♦ ఎడిబుల్ సిల్వర్ ఫాయిల్ (ఇది లేకపోయినా ఫర్వాలేదు), యాలకుల పొడి, పిస్తా పొడి, కుంకుమ పువ్వు వేసి వేడిగానూ, చల్లగానూ అందించవచ్చు.