breaking news
Defence minister parrikar
-
సాక్ష్యాలు చూపాల్సిన అవసరం లేదు
-
సాక్ష్యాలు చూపాల్సిన అవసరం లేదు: పరీకర్
న్యూఢిల్లీః భారత సైన్యం పీవోకే లోని ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ వంద శాతం కచ్చితమైనవని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ మరోసారి నిర్ధారించారు. ఉడీ ఉగ్రదాడి జరిగిన వారం రోజుల తర్వాత భారత జవాన్లు నియంత్రణ రేఖ వెంబడి జరిపిన దాడులను ఆయన కొనియాడారు. ప్రధాని నరేంద్రమోదీ ఛాతి గురించి వ్యతిరేకంగా మాట్టాడిన వారి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరీకర్ అభిప్రాయ పడ్డారు. తీవ్రవాదులే లక్ష్యంగా నియంత్రణ రేఖ వెంబడి ఆర్మీ జరిపిన దాడుల విషయంలో ఎటువంటి కపటం లేదని రక్షణమంత్రి పరీకర్ తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకులు బహిరంగంగా భారత సైనికులను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ గుజరాత్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రభుత్వం హడావుడి చేసిందంటూ వచ్చిన వదంతులను ఆయన ఖండించారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వంపై వ్యాఖ్యానాలు చేయడం సరికాదని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సైన్యాన్ని ప్రశంసిస్తున్నట్లుగా లక్నోలోని బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు అంటించిన పోస్టర్లపై ప్రతిపక్ష పార్టీలు, కొందరు రాజకీయ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేయడం దురదృష్టకరమన్నారు. ఆర్మీ దాడుల విషయంలో ఛాతీ విషయాన్ని లేవనెత్తడంపై బుధవారం ప్రధాని నరేంద్రమోదీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనికులపై అటువంటి అధిక వ్యాఖ్యానాలు చేయొద్దని హెచ్చరికలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి సర్జికల్ స్ట్రైక్స్ 100 శాతం కచ్ఛితమైనవేనని మరోసారి రూఢి పరిచారు. పెద్ద పెద్ద దేశాలు కూడా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినప్పుడు విజయాన్ని పొందలేకపోతాయని, కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీలు జాతీయ వివాదం లేవనెత్తి డిమాండ్ చేసినంత మాత్రాన ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన సాక్ష్యాలు బయట పెట్టాల్సిన అవసరం లేదని పరీకర్ అన్నారు. సైన్యం కార్యకలాపాలను రాజకీయం చేసి మైలేజ్ పొందాలనుకుంటున్న ప్రత్యర్థి పార్టీల విమర్శలను పరీకర్ ఖండించారు. కొందరు నన్ను స్ట్రయిట్ ఫార్వర్డ్ అంటారని.. అయితే దేశ భద్రతకు భరోసా కల్పించాల్సిన విషయంలో రక్షణమంత్రి అలా సూటిగా ఉండడని అన్నారు. వచ్చే మంగళవారం దసరా పండుగ సందర్భంలో ప్రసిద్ధ ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే వేడుకల్లో ప్రధాని మోదీ సైతం పాల్గోవడం లేదని, అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా లక్నోలో జరిగే రావణ దహనం కార్యక్రమంలో ఆయన పాల్టోనున్నట్లు తెలిపారు. సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ కు రావణ దహనంతో నిర్వాహకులు ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించారు. -
దేశ రక్షణలో రాజీపడ్డారు..
కొందరు మాజీ ప్రధానులను ఉద్దేశిస్తూ రక్షణ మంత్రి పారికర్ వ్యాఖ్యలు ముంబై/న్యూఢిల్లీ: కొంత మంది మాజీ ప్రధానమంత్రులు దేశ రక్షణలో రాజీపడ్డారంటూ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వారి పేర్లను తాను వెల్లడించబోవడం లేదని, వారెవరో చాలా మందికి తెలుసని అన్నారు. పారికర్ నేరుగా ఎవరి పేరు చెప్పకపోయినా దివంగత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసినట్లు మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముంబైలో ఓ హిందీ వారపత్రిక ప్రత్యేక సంచిక విడుదల సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పారికర్ మాట్లాడారు. పాక్ వైపు నుంచి భారత్వైపు వచ్చిన ఓ బోటుపై తీర రక్షక దళం చేపట్టిన ఆపరేషన్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తూ కొందరు మాజీ ప్రధానులు దేశ రక్షణకు సంబంధించిన కొన్ని అంశాల్లో రాజీ పడ్డారని పేర్కొన్నారు. వారి పేర్లను తాను వెల్లడించబోవడం లేదని... వారెవరో చాలా మందికి తెలుసని అన్నారు. కాగా ఆయన ఆరోపణలు చాలా దారుణమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా విమర్శించారు. పారికర్ ఆ ఆరోపణలకు ఆధారాలు చూపాలని, ఆ ప్రధానులెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ నేతలు ఇటీవల తమ సాంప్రదాయంగా మార్చుకున్న ‘ఆరోపణలు చేయడం.. వెంటనే తానలా అనలేదంటూ యూటర్న్ తీసుకోవడడాన్ని’ పారికర్ అనుసరించబోరనే ఆశిస్తున్నట్లు ఎద్దేవా చేశారు. మాజీ ప్రధానులపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని.. పారికర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ మరోనేత మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను బీజేపీ తేలిగ్గా తీసుకుంది. పారికర్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పార్టీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.