breaking news
Deccan Infrastructure Limited
-
ల్యాండ్ ఫర్ సేల్!
సాక్షి, హైదరాబాద్: ‘దిల్’మళ్లీ తెరపైకి వచ్చింది. భూముల అమ్మకమే లక్ష్యంగా ఏర్పడ్డ డక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ఈ సంస్థకు ఊపిరిలూదాలని ప్రభుత్వం నిర్ణయించింది. దిల్ పేరిట గతంలో భూ విక్రయాలు/లీజులు చేపట్టిన ఈ సంస్థను మనుగడలోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. దిల్ అంశాన్ని బడ్జెట్ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రస్తావించారు కూడా. ఆర్థిక మాంద్యం నేపథ్యంలోప్రభుత్వ ఖజానా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ప్రధాన ఆదాయార్జన శాఖలు చతికిలపడటంతో భూముల అమ్మకాలతో పన్నేతర ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రియల్టీ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుండటం, కోవిడ్–19తో ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లకు గురవుతున్న తరుణంలో దీని ప్రభావం జీఎస్టీ వసూళ్లపై ఉంటుందని అనుమానిస్తోంది. పదేళ్ల క్రితం ప్రభుత్వ భూముల సేకరణ అమ్మకం/లీజుల్లో క్రియాశీలకంగా పనిచేసిన ‘దిల్’సంస్థకు జవసత్వా లు తీసుకురావాలని నిర్ణయించింది. తద్వారా 2019–20 సవరించిన అంచనాల్లో రూ.12,275 కోట్లు మాత్రమే ఉన్న పన్నేతర ఆదాయాన్ని 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 30,600 కోట్లకు పెంచింది. 2,084 ఎకరాలపైనే ఆశ.. హైదరాబాద్ రాజధాని చుట్టూ 2,084 ఎకరాలను దిల్ సంస్థకు గతంలో ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ భూములను వినియోగిం చుకోవడంలో ఆ సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఇందులో 400 ఎకరాలను రెవెన్యూ శాఖ వెనక్కి తీసుకోగా.. సుమారు 1,584 ఎకరాలు ఆ సంస్థ అధీనంలోనే ఉన్నాయి. ఈ క్రమంలో నిరుపయోగంగా ఉన్న విలువైన భూములను విక్రయించడం ద్వారా ఖజానాను పరిపుష్టం చేసుకోవాలని యోచిస్తోంది. బాచుపల్లిలో 100, గాజుల రామారం 40.33, కుర్మల్గూడ 23.29, కోహెడ 239, అబ్దుల్లాపూర్మెట్ 161, అజీజ్నగర్ 126.29, కొత్వాల్గూడ 265, కొంగరకుర్దు 100, ధర్మారం 65.05, జవహర్నగర్ 60.25, తోలుకట్ట 16.26 ఎకరాలే కాకుండా చాలాచోట్ల దిల్ సంస్థకు భూములు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేసి వేలం వేస్తే పన్నేతర ఆదాయంగా ప్రతిపాదించిన రూ.30,600 కోట్లను సమీకరించడం పెద్దగా కష్టంకాబోదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ఈసారి పన్నేతర ఆదాయాన్ని రూ.18వేల కోట్లకు పైగా పెంచి అంచనాలను ప్రతిపాదించింది. బుద్వేల్ భూములు కూడా... ఇదిలావుండగా, నిధుల సమీకరణలో భాగంగా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో కొన్ని భూములున్నాయి. ఐటీ హబ్ కోసం ప్రతిపాదించిన బుద్వేల్లోని టూరిజం, హెచ్ఎండీఏ భూమిలో 50 ఎకరాలను విక్రయించడం ద్వారా ఖజానాకు కాసుల పంట పండుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, ఖానామెట్ సర్వే నం.41/14లోని 27.04 ఎకరాలను కూడా వేలం వేసేందుకు టీఎస్ఐఐసీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బహిరంగ మార్కెట్లో ఇక్కడ ఎకరా రూ.40–45 కోట్ల వరకు పలుకుతోంది. -
‘దిల్’ భూములు గాలికి..
శంషాబాద్: ప్రభుత్వ హౌసింగ్ బోర్డు అనుబంధ సంస్థగా ఉన్న దిల్ (దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) భూములు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. సర్కారు సీలింగ్ భూములను తీసుకున్న సదరు సంస్థ వాటిని గాలికొదిలేయడంతో క్రషర్, మట్టి మాఫియాతో పాటు కాలుష్యకారక డాంబర్ దందాలతో జంటజలాశయాల్లో ఒకటైన హిమాయత్సాగర్కే ముప్పు తీసుకొస్తున్నారు. శంషాబాద్ మండలం కొత్వాల్గూడలో సర్వేనంబర్లు 56, 57, 58, 59, 60, 61, 62, 63, 66, 69, 70, 71, 72, 73, 74, 76, 77, 78 లలో సుమారు 250 ఎకరాల సీలింగ్ భూములను 8 ఏళ్ల కిందట హౌసింగ్బోర్డు అనుబంధ సంస్థ దిల్కు అప్పగించింది. దిల్ ఆధీనంలోనున్న ఈ భూముల్లో ఏడాదిన్నర కిందటి వరకు సుమారు ఇరవైకి పైగా క్రషర్ యంత్రాలు నడిచేవి. వీటితో పాటు అనుమతులు లేకుండానే భారీ ఎత్తున పేలుడుపదార్థాలతో బ్లాస్టింగ్ కొనసాగించేవారు. పర్యావరణానికి హానికరంగా మారడంతో పాటు హిమాయత్సాగర్కు కలుగుతున్న ముప్పుపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎట్టకేలకు అవి మూతపడ్డాయి. అయితే ఇది కొంతకాలం మాత్రమే. స్థానికంగా దిల్ భూముల్లో ప్రస్తుతం అక్రమ మట్టితవ్వకాలతో పాటు డాంబర్ ప్లాంట్లు, కొన్ని క్రషర్లు కూడా కొనసాగుతున్నాయి. అక్రమ దందాను నియంత్రించడానికి రెవిన్యూ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి. భూములు దిల్ సంస్థ ఆధీనంలో ఉండడంతో వాటిపై కేసులు నమోదు చేయలేని పరిస్థితిని రెవిన్యూ అధికారులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు నివేదించడానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. చెంతనే... ప్రస్తుతం కొత్వాల్గూడ పరిధిలో ఓ క్రషర్ యూనిట్ సాగర్కు అత్యంత చేరువలోనే భారీ ఎత్తున కొనసాగుతోంది. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో మాదిరిగా కొండలను బ్లాస్టింగ్ చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నా ఇంత పెద్ద మొత్తం రాళ్లను రవాణా చేయడం కూడా ఔటర్ రింగురోడ్డుపై ప్రమాదకరంగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలను ఆపుతూనే ఉన్నాం: వెంకట్రెడ్డి, శంషాబాద్ తహసీల్దార్ దిల్ భూముల్లో ఇప్పటివరకు జరుగుతున్న క్రషర్, మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్నాం. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతస్థాయి అధికారులకు కూడా నివేదించనున్నాం. దిల్ సంస్థ పరిధిలో అక్రమార్కులపై ఫిర్యాదులు చేయాల్సి ఉంటుంది.