‘సెల్’ఫోన్లు!
కడప అర్బన్, న్యూస్లైన్ : కడప కేంద్ర కారాగారంలో సెల్ ఫోన్ల వ్యవహారం షరా మామూలైంది. అధికారులు ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా కొందరు సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా సెల్ఫోన్లు ఖైదీల చెంతకు చేరుతూనే ఉన్నాయి.
తాజాగా మంగళవారం వెలుగుచూసిన సంఘటనే ఇందుకు నిదర్శనం. ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న వారిలో 13 మందిని అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలుకు తరలించే సమయంలో జైలు అధికారులు, పోలీసులు జరిపిన తనిఖీల్లో రెండు సెల్ఫోన్లు, రెండు ఛార్జర్లు, కొంత నగదు బయటపడ్డాయి. దీన్ని చూసిన అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జైలు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం వల్లే ఇంటి దొంగలు ఖైదీలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కేంద్ర కారాగారంలోకి అనేక సార్లు బయటి నుంచి గంజాయి విసిరిన సంఘటనలున్నాయి.
అలాగే సెల్ ఫోన్లు దొరకడం కూడా మామూలైపోయింది. అప్పటి జైలు సూపరింటెండెంట్ ఇండ్ల శ్రీనివాసరావు హయాంలో బయటి నుంచి గంజాయి విసిరేస్తే అప్పట్లో కంచె ఏర్పాటు చేశారు. తర్వాత ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా వ్యవహరించిన గోవిందరాజులు హయాంలో సెల్ ఫోన్లు, జామ్ డబ్బాలో బ్యాటరీ తదితర సామగ్రి బయట పడింది. అయినప్పటికి భద్రతా చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఇలాంటి సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. మంగళవారం వెలుగు చూసిన సంఘటనపై డిప్యూటి సూపరింటెండెంట్ రామక్రిష్ణను వివరణ కోరగా ఓపెన్ ఎయిర్ జైలుకు 13 మందిని తరలిస్తున్న సమయంలోతనిఖీలు చేయగా రెండు సెల్ఫోన్లు, చార్జర్లు, వైర్లు లభించాయని తెలిపారు.