breaking news
care immigrants
-
శరణార్థుల ‘సంరక్షణ నగరాలు’!
వాషింగ్టన్/ఫోనిక్స్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయం అక్రమ వలసదారులకు సానుకూలంగా ఉండేలా కనిపిస్తోంది. వలసదారులను సంరక్షణ నగరాలకు (శాంక్చురీ సిటీస్) పంపే యోచనను ట్రంప్ తీవ్రంగా చేస్తున్నారు. ఈ సంరక్షణ నగరాలకు ప్రజలను పంపడం ద్వారా వారు అమెరికాలోనే ఉండేందుకు అవకాశం కలగనుంది. తమపై నమోదైన వలస కేసులకు సంబంధించి మరింత ఎక్కువగా న్యాయ సహాయం పొందే అవకాశం కూడా అక్రమ వలసదారులకు కలుగుతుంది. షికాగో, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో న్యాయ నిపుణులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అయితే ఈ సంరక్షణ నగరాల్లో జీవన వ్యయం ఎక్కువగా ఉండనుండటం అక్రమ వలసదారులకు ప్రతికూలాంశం. అదే సందర్భంలో ఇతర నగరాల్లోని అక్రమ వలసదారులతో పోలిస్తే సంరక్షణ నగరాల్లో నివసించే అక్రమ వలసదారులు అరెస్టయ్యే అవకాశాలు 20 శాతం తక్కువ. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ న్యాయవాది జార్జ్ గాస్కన్ మాట్లాడుతూ సంరక్షణ నగరాల్లోని అక్రమ వలసదారులు నేరాలకు పాల్పడేందుకు అవకాశం తక్కువనీ, అయితే ఇది రాజకీయ ప్రేరేపణతో తీసుకున్న, ప్రజల జీవితాలతో ఆడుకునే నిర్ణయమని అన్నారు. మెక్సికో సరిహద్దు నుంచి వలసదారులు అమెరికాలోకి ప్రవేశిస్తుండటం ట్రంప్ను తీవ్రంగా కలవరపెడుతుండటం తెలిసిందే. అక్రమవలసదారులను సంరక్షణ నగరాలకు తరలించాలన్న ప్రతిపాదన పాతదే. ఇప్పటికే రెండుసార్లు ట్రంప్ యంత్రాంగం దీనిని తిరస్కరించింది. అయితే ట్రంప్ శుక్రవారం ఓ ట్వీట్ చేస్తూ ఈ ప్రతిపాదన ఇంకా తమ పరిశీలనలో ఉందని వెల్లడించడం గమనార్హం. మరోవైపు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ మాట్లాడుతూ అక్రమ వలసదారుల విషయంలో తమ ముందు ఉన్న అనేక మార్గాల్లో ఈ సంరక్షణ నగరాలు ఒకటి మాత్రమే పేర్కొన్నారు. ఏమిటీ సంరక్షణ నగరాలు? సంరక్షణ నగరాలకు ప్రత్యేకంగా నిర్వచనమేదీ లేదు. ఒక్కమాటలో స్థూలంగా చెప్పాలంటే కొన్ని అంశాల్లో, ప్రత్యేకించి అక్రమ వలసల విషయాల్లో స్థానిక పోలీసులు అమెరికా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించలేరు. దీనిపై పరిమితులుంటాయి. అక్రమవలసదారులను నిర్బంధించాలని అమెరికా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కోరినా దాదాపు 200 పట్టణాలు ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. అంటే అవి సంరక్షణ పట్టణాల కిందకు వచ్చినట్లే. న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజిలస్, శాన్ఫ్రాన్సిస్కో వంటి నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. -
ప్రవాసుల భద్రతకు పెద్దపీట
⇒ ఆపద వస్తే తక్షణం స్పందిస్తాం ⇒ విదేశాంగమంత్రి సుష్మ ప్రకటన న్యూఢిల్లీ: అమెరికాలో జాతి విద్వేషపు దాడులకు భారతీయులు బలైన నేపథ్యంలో దీనిపై బుధవారం లోక్సభలో చర్చ జరిగింది. ప్రవాసుల సంరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. ఈ విషయంలో అమెరికా భద్రతా సంస్థల అధికారులు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ప్రవాసులు ఆపదలో ఉన్నట్టు తెలిస్తే 24 గంటల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని సుష్మ పేర్కొన్నారు. ఇటీవల అమెరికాలో దాడికి గురైన కూచిభొట్ల శ్రీనివాస్, దీప్రాయ్ గురించి ఆమె ప్రకటన చేశారు. వారిద్దరి కుటుంబాలతో మాట్లాడినట్లు ఆమె చెప్పారు. అనారోగ్యానికి చికిత్స పొందాక తొలిసారి సభకు వచ్చిన సుష్మకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. రూ.12.52 లక్షల కోట్లు జమయ్యాయి.. పెద్దనోట్ల రద్దు తరువాత డిసెంబరు 10 వరకు బ్యాంకుల్లో రూ.12.52 లక్షల విలువైన పాత నోట్లు జమయ్యాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యసభకు తెలిపారు. నోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది కాబట్టి పూర్తి వివరాలు ఇంకా అందుబాటులో లేవన్నారు. కొత్త రూ.500 నోటు ప్రింటింగ్కు రూ.2.87 నుంచి రూ.3.09 వరకు, కొత్త రూ.2000 నోటు ముద్రణకు రూ.3.54 నుంచి రూ.3.77 మేర ఖర్చవుతోందని చెప్పారు. అయితే ప్రింటింగ్ ఇంకా కొనసాగుతున్నందున మొత్తం ఖర్చు వివరాలు ప్రస్తుతం వెల్లడించడం సాధ్యం కాదన్నారు. 2017 ఫిబ్రవరి 24 నాటికి దేశంలో రూ.11.64 లక్షల కోట్ల కరెన్సీ చెలామణీలో ఉందని మేఘవాల్ వివరించారు. ఏటీఎంలలో కరెన్సీ లభ్యతకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పలుసార్లు రాజ్యసభ వాయిదా మణిపూర్, గోవాలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి బీజేపీ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ సభ్యులు నిరసనలకు దిగడంతో రాజ్యసభ మూడుసార్లు వాయిదాపడింది. సమావేశాలు మొదలవడంతో కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినదించారు. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను వాయిదావేశారు. తిరిగి సమావేశం అయిన తరువాత కూడా ఆందోళనలు ఆగలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజాభీష్టాన్ని బీజేపీ లెక్క చేయలేదని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ఆరోపించారు. ఈ రెండు చోట్లా తమకే మెజారిటీ వచ్చింది కాబట్టి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే హక్కు తమకే ఉందని స్పష్టం చేశారు. ముత్తుకృష్ణన్ కేసులో న్యాయం చేస్తాం : ప్రభుత్వం ఢిల్లీ జేఎన్యూ పరిశోధన విద్యార్థి ముత్తుకృష్ణన్ ఆత్మహత్యపై లోక్సభలో చర్చ జరిగింది. ఈ కేసు ఎఫ్ఐఆర్ దాఖలయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణన్ మృతిపైS పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంతకుమార్ సంతాపం ప్రకటించారు. ఈ ఘటన అందరికీ బాధ కలిగించిందని, ఆయన మృతికి కారణం తెలిశాక, ఢిల్లీ పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. లోక్సభ, రాజ్యసభలో అన్నాడీఎంకే సభ్యులు ముత్తుకృష్ణన్ ఆత్మహత్య అంశాన్ని లేవనెత్తారు. సభలో ‘జై శ్రీరాం’ నినాదాలు యూపీలో బీజేపీ భారీ విజయం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్సభలో ఆయన సొంత పార్టీ సభ్యుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఆయన సభలోకి అడుగు పెడుతుండగా.. బీజేపీ ఎంపీలు ‘జై శ్రీరాం’, ‘మోదీ.. మోదీ’ అంటూ నినదించారు. సాధారణంగా ప్రముఖ నాయకులు ఎవరైనా సభలోకి వస్తున్నప్పుడు గౌరవ సూచకంగా లేచి నిలబడటం, నమస్కారం పెట్టడం వంటివి కనిపిస్తాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రెండు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించి, మరో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. మోదీని అభినందించేందుకు బీజేపీ ఎంపీలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల మరణించిన లోక్సభ మాజీ సభ్యుడు, టీడీపీ నాయకుడు భూమా నాగిరెడ్డి మృతికి ఎంపీలు సంతాపం తెలిపారు.