-
ప్రియురాలి కోసం బైక్ల అపహరణ
కర్ణాటక , బనశంకరి:ప్రియురాలితో కలిసి బైక్ల అపహరణకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం కోరమంగల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.6.15 లక్షల విలువైన పది బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆగ్నేయ విభాగం డీసీపీ బోరలింగయ్య తెలిపారు. కోరమంగల పోలీస్స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బైక్ అపహరణలు తీవ్రతరం కావడంతో మడివాళ ఉపవిభాగ అసిస్టెంట్ కమిషనర్ సోమేగౌడ నేతృత్వంలో సీఐ మంజునాథ్తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం గురువారం బొమ్మనహళ్లి హొసపాళ్యకు చెందిన కార్తీక్ను అరెస్ట్ చేసి పది బైక్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి ఓ ప్రియురాలు ఉంది. ఆమెకు బైక్లు అంటే ఇష్టం. దీంతో ఆమెను మెప్పించటానికి ఇతను బైక్లు అపహరణకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. అనంతరం వాటిని విక్రయించి ఆ డబ్బుతో ఇద్దరు జల్సా చేసేవారని తెలిపారు. -
ఈ బాబు... మహా ముదురు బాబూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి చెందిన ఓ మైనర్.. బైకులతో స్టంట్స్ చేయడంలో ఎక్స్పర్ట్.. అందులో మరికొందరికి శిక్షణ కూడా ఇస్తుంటాడు.. మరో ముగ్గురు బాలురతో జట్టు కట్టాడు.. ఈ స్టంట్స్ చేయడానికి, రేసింగ్స్లో పాల్గొనడానికి అవసరమైన బైక్ల కోసం చోరీల బాట పట్టారు. వాటిలో పెట్రోల్ నింపుకోవడానికి మొబైల్ ఫోన్స్ దొంగతనం చేయడం మొదలుపెట్టారు. నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ ముఠాలోని నలుగురిని పట్టుకుని వారి గుట్టు రట్టుచేశారు. ‘సాహసాలు’అంటే మక్కువ.. హైదరాబాద్లోని సిద్ధార్థనగర్కు చెందిన 17 ఏళ్ల బాలుడు ఈసీఐఎల్లోని ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి ఇళ్లల్లో పని చేసుకుంటూ కొడుకును పోషిస్తోంది. బైక్లు నడపటంలో పట్టున్న అతడికి.. స్టంట్స్ చేయడమంటే సరదా. స్నేహితుల వద్ద నుంచి తీసుకున్న బైక్లతో రోడ్లపై స్టంట్స్ చేస్తుంటాడు. కేబీఆర్ పార్క్ వద్ద రేసింగ్స్ చేసేవాడు. ఉప్పల్లోని భగాయత్ ల్యాండ్స్లో ప్రతి శని, ఆదివారాల్లో స్టంట్స్ చేయడంలో యువతకు ‘శిక్షణ’కూడా ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఇతడికి తమ ఏరియాలోనే ఉండే ముగ్గురు మైనర్లతో పరిచయం ఏర్పడింది. ఈ ముఠాకు అతగాడు గ్యాంగ్లీడర్గా మారాడు. స్టంట్స్ చేయడానికి స్పోర్ట్స్బైక్స్.. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు స్టంట్స్ చేయాలంటే సొంతంగా స్పోర్ట్స్ బైక్ ఉండాలని సూత్రధారి భావించాడు. వాటిని ఖరీదు చేసే స్తోమత వారికి లేకపోవడంతో బైక్లను చోరీ చేయాలని పథకం వేశారు. ఇందుకు మరో ముగ్గురు మైనర్లనూ తమతో చేర్చుకున్నారు. వీరంతా కలసి గోల్కొండ, జూబ్లీహిల్స్ ప్రాంతాల నుంచి మూడు బైక్స్ చోరీ చేశారు. వీటిలో రెండు కేటీఎంలు కాగా, మరొకటి పల్సర్. వీటిపై తిరిగేందుకు కావాల్సిన పెట్రోల్ కోసం గోపాలపురం, మహంకాళి, ఎల్బీనగర్లలో సెల్ఫోన్లు దొంగతనం చేశారు. వీరు దొంగిలించిన బైకులకు తప్పుడు నంబర్ప్లేట్లు తగిలించి రోడ్డుపై వెళ్తున్న వారి నుంచి సెల్ఫోన్లు లాక్కుపోయేవారు. మల్కాజ్గిరి పోలీస్స్టేషన్ పరిధిలో మరో రెండు ఫోన్లు దొంగతనం చేశారు. చిక్కినా చెప్పడు... ఈ గ్యాంగ్ సూత్రధారి అయిన మైనర్ చాలా ముదురు. పోలీసులకు చిక్కినా కూడా పూర్తి వివరాలు చెప్పేవాడు కాదు. రెండు సెల్ఫోన్లు దొంగిలించిన కేసులో మల్కాజ్గిరి పోలీసులు గత నెలలో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో చేసిన నేరాలకు సంబంధించి నోరు విప్పలేదు. గత నెల 18న సూత్రధారి సహా ముగ్గురు మైనర్లు ఓ వాహనంపై వచ్చి క్లాక్టవర్ వద్ద సెల్ఫోన్ దొంగిలించారు. దీనిపై గోపాలపురం పోలీస్స్టేషన్లో కేసు నమోదు కావడంతో నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సూత్రధారిని గుర్తించారు. అతడి కదలికలపై ఆరా తీయగా.. వీకెండ్స్లో ఉప్పల్లోని భగాయత్లో, మామూలు రోజుల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. నిఘా పెట్టిన పోలీసులు సూత్రధారితో పాటు నలుగురు మైనర్లను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. -
నలుగురు గజదొంగలు అరెస్టు
విజయవాడ: ఇంటి దొంగతనాలు, బైకులు అపహరణ, స్నాచింగ్లకు పాల్పడే నలుగురు గజదొంగల ముఠాను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 18లక్షల విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలొ నగర కమిషనర్ డి.గౌతం సవాంగ్ వివరాలు వెల్లడించారు. ఈనెల 14వ తేదీ పటమట హైస్కూల్ రోడ్డులో రైతుబజార్ వెనక మారుతీ కాలనీలో ఓ ఇంట్లో చోటుచేసుకున్న దొంగతనం కేసుకు సంబంధించి సీసీఎస్ పోలీసులు అతితక్కువ వ్యవధిలో నిందితులను అరెస్టు చేశారని తెలిపారు. ఈ కేసులో నలుగురు నిందితులను చిట్టీనగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా అదుపులోకి తీసుకుని విచారించగా వారు చేసిన నేరాలు బయటపడ్డాయని వివరించారు. నిందితులో కొందరు క్రికెట్ బెట్టింగ్ మాఫియాతోను, రాజకీయ పార్టీలకు ర్యాలీకు జనసమీకరణ చేస్తుంటారని చెప్పారు. అరెస్టయిన నిందితుల వివరాలు.. విశాఖపట్నానికి చెందిన చింతల పురుషోత్తం అలియాస్ అఖిల్, అచ్యుత్ (23) విజయవాడ కలరా హాస్పిటల్ సమీపంలో నివసించే మహతి బాలదుర్గా ప్రకాష్, అలియాస్ బాలు (20), చిట్టినగర్కు చెందిన షేక్ జానీ బాషా అలియాస్ జానీ (20), గుడివాడకు చెందిన నారగాని హరీష్ అలియాస్ బుడ్డి (22)లను అరెస్టు చేశారు. నిందితులు నలుగురు పటమటలో ఓ ఇంట్లో ప్రవేశించి బీరువాలో రూ.18 లక్షల విలువ చేసే 558 గ్రాముల బంగారం, 2.4 కిలోల వెండి, ల్యాప్టాప్, వీడియో కెమెరా, ఓ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు యవకులే.. కాగా ఈ కేసులో పట్టుపడిన నలుగురు 25ఏళ్ల లోపు యవకులే. నాలుగైదేళ్లుగా నేరాలకు పాల్పడుతున్న నిందితులు జైల్లో పరిచయం అయి ఓ గ్యాంగ్గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా నిందితులపై గతంలో విశాఖ, కృష్ణాజిల్లా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో 48కి పైగా నేరాలు¯న్నాయి. రాజకీయ ర్యాలీల్లో కొత్త కోణం కాగా వివిధ రాజకీయ పక్షాల నాయకులు బైక్ ర్యాలీలకు జన సమీకరణకు కొందరు దొంగలను కూడా ఉపయోగిస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో నిందితుడు బాలదుర్గాప్రకాష్ దొంగతనాలతో పాటు విజయవాడలో రాజకీయ పార్టీల బైక్ ర్యాలీకు జనసమీకరణ చేసి డబ్బు సంపాదిస్తున్నాడు. ర్యాలీల కోసం మనిషికి రూ., 200లు చొప్పున తీసుకుని బైక్ ర్యాలీలకు యువకులను పంపుతుంటాడు. -
ఇద్దరు మిత్రులు.. భలేదొంగలు
జగిత్యాలక్రైం: వారిద్దరూ మిత్రులు. జల్సా మోజులోపడ్డారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు పెడదారిపట్టారు. పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను దొంగిలిస్తూ.. వాటిపై షికారు చేస్తూ జల్సా చేస్తున్నారు. మిత్రుల్లో ఒకరు ఇప్పటికే ఓ దొంగతనం కేసులో జైలుకెళ్లి వచ్చినా.. తన బుద్ధిని మాత్రం పోనిచ్చుకోలేదు. ఇటీవలే ఓ బైక్ను దొంగిలించి షికారు చేస్తుండగా పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన వివరాలను జగిత్యాల ఎస్పీ అనంతశర్మ తన క్యాంపు కార్యాలయంలో గురువారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మల్యాల మండలం కొండగట్టు గ్రామానికి చెందిన ఉప్పు రమణారెడ్డి, గొల్లపల్లి మండలం రంగదామునిపల్లికి చెందిన కీర్తి కమలాకర్ మిత్రులు. ఇద్దరూ కలిసి దొంగతనాలకు అలవాటుపడ్డారు. రమణారెడ్డి వేములవాడ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్రవాహనాలు, వెల్గటూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ద్విచక్రవాహానాన్ని చోరీ చేశాడు. వెల్గటూర్లో ఓ వ్యక్తి ఏటీఎం కేంద్రానికిరాగా.. అతడిని నమ్మించి కార్డుమార్చి రూ.1.40లక్షలు డ్రా చేసుకున్నాడు. వాటితో ఇద్దరు కలిసి జల్సా చేశారు. అలాగే కరీంనగర్ వన్టౌన్లో పరిధిలోనూ ఒక ద్విచక్రవాహనం, ధర్మారం, మల్యాల, జగిత్యాల టౌన్ పీఎస్ పరిధిలో ఒక్కో ద్విచక్రవాహనం చొప్పున మొత్తం ఆరు వాహనాలను దొంగిలించారు. ఓ వాహనంపై రమణారెడ్డి షికారు చేస్తూ.. గురువారం ఉదయం వెల్గటూర్ మండలం గుల్లకోట వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖ పోలీసులకు చిక్కి.. గతంలో ఓ ద్విచక్రవాహనాన్ని దొంగిలించిన రమణారెడ్డి.. దానిపైనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం వెళ్లాడు. అక్కడ నంబర్ప్లేట్పై అనుమానం రావడంతో అక్కడి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో రమణారెడ్డి ఆర్నెల్లు జైలుకు కూడా వెళ్లాడు. తిరిగి వచ్చినా.. అతడిలో మార్పు రాలేదు. మళ్లీ ఆరు ద్విచక్రవాహనాలు దొంగిలించాడు. రమణారెడ్డితోపాటు కమలాకర్ను అరెస్టు చేసి ఆరు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న రూరల్ సీఐ శ్రీనివాస్చౌదరి, రూరల్ ఎస్సై కిరణ్కుమార్, వెల్గటూర్ ఎస్సై మహేందర్ను ఎస్పీ అనంతశర్మ అభినందించారు. -
యువకుడి అరెస్ట్.. 24 బైక్స్ స్వాధీనం
ఏలూరు(పశ్చిమగోదావరి): జల్సాలకు అలవాటుపడి దొంగతనాల బాటపట్టి ద్విచక్రవాహనాలను తస్కరిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మడగల విజయ్కుమార్ గత కొన్ని రోజులనుంచి బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఓ బైక్ అమ్మడానికి యత్నిస్తుండగా.. అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారించగా అసలు విషయాలు బయటకొచ్చాయి. అతని వద్ద నుంచి చోరీ చేసిన 24 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement