హైదరాబాద్లో బెంట్లే బెంటేగా..
ఓ టీవీ మీడియా అధిపతి కొనుగోలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అత్యంత ఖరీదైన ఎస్యూవీగా పేరొందిన బెంట్లే బెంటేగా హైదరాబాద్ రోడ్లపైనా హుందా ఒలకబోస్తోంది. ఇప్పటివరకూ దేశంలో ఐదుగురు మాత్రమే ఈ వాహనాన్ని సొంతం చేసుకోగా... వారిలో హైదరాబాద్కు చెందిన ఓ టీవీ చానెళ్ల అధినేత కూడా ఉన్నట్లు తెలిసింది. మిగిలిన నలుగురూ ఇతర రాష్ట్రాల వారే. ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలో ఆవిష్కరించిన బెంటేగా ధర 3.85 కోట్లు. అది కూడా ఢిల్లీలో ఎక్స్షోరూం. ఇక రాష్ట్రానికి తెచ్చేసరికి పన్నులతో కలసి రూ.4.3 - 4.5 కోట్ల దాకా అయ్యే అవకాశముంది. బెంటేగా ఖరీదైనదే కాదు... వేగం కూడా ఎక్కువే.
బ్రిటన్కు చెందిన బెంట్లే సంస్థ తెచ్చిన తొలి ఎస్యూవీ ఇది. 6.0 లీటర్ డబ్ల్యూ12 ఇంజన్ను ఇందులో పొందుపరిచారు. 4.1 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటలో 301 కిలోమీటర్లు ప్రయాణించిన రికార్డుంది. ప్రపంచవ్యాప్తంగా తొలి ఏడాది 3,000 యూనిట్లను మాత్రమే విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది. ఇవన్నీ ఇప్పటికే బుక్ అవడం మరో విశేషం. 2015 సెప్టెంబర్లో ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షోలో బెంటేగా ఆవిష్కరించారు. అదే ఏడాది నవంబర్ నుంచి వీటి ఉత్పత్తి ప్రారంభమయింది.