breaking news
Atmospheric Center
-
గజం గాలిలో 25 కిలోల నీళ్లు..
మనకు నీళ్లు లేనిదే జీవితం గడవదు. భూమ్మీద మూడో వంతు నీళ్లే ఉన్నా.. మనం ఉన్నచోట కరువు ఉంటే మాత్రం బతుకు కష్టమే. ఉన్న నీళ్లలో చాలా వరకు సముద్రాల్లో, కొంతవరకు మంచు రూపంలో ఉన్నాయి. మనకు దిక్కయ్యే నీళ్లు చాలావరకు సరస్సులు, నదులు, ఇతర వనరుల్లోని నీళ్లే. అవీ వాతావరణం నుంచి వాన రూపంలో పడే నీళ్లే. మరి భూమ్మీద వాతావరణంలో మొత్తంగా ఎన్ని నీళ్లు ఉంటాయో, అంతా ఒక్కసారిగా వానలా కురిస్తే ఏమవుతుందో తెలుసా.. ఎక్కువ.. తక్కువ.. భూవాతావరణంలో నీళ్లన్నీ ఆవిరి, అతి సూక్ష్మమైన బిందువుల రూపంలో ఉంటాయి. మొత్తంగా భూమి అంతటా వాతావరణంలో నీళ్లు ఉన్నా.. ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, పీడనం, ఇతర వాయువుల శాతం, సమీపంలో జల వనరులు, సముద్రమట్టంతో పోలిస్తే ఎత్తు వంటివాటికి అనుగుణంగా నీటి శాతంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ కారణంగానే ఓ చోట ఎక్కువగా, మరోచోట తక్కువగా వానలు పడతాయి. - భూమిపైన వాతావరణం వందల కిలోమీటర్ల ఎత్తువరకు ఉన్నా.. నీటి ఆవిరి గరిష్టంగా 16 కిలోమీటర్ల ఎత్తు వరకు మాత్రమే చేరగలుగుతుంది. ఇందులోనే మొత్తంగా 138.6 కోట్ల ఘనపు కిలోమీటర్ల పరిమాణంలో నీళ్లు ఉన్నట్టు అమెరికా జియాలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) అంచనా వేసింది. - ఒక ఘనపు కిలోమీటర్ నీళ్లు అంటే.. కిలోమీటర్ పొడవు, వెడల్పుతో, కిలోమీటర్ లోతు ఉన్న సరస్సులో పట్టేటన్ని నీళ్లు అనుకోవచ్చు. మరి 138.6 కోట్ల కిలోమీటర్ల నీళ్లు అంటే వామ్మో అనిపిస్తుంది కదా.. భూమి అంతటా 3 సెం.మీ. వాన మరి వాతావరణంలోని నీళ్లన్నీ ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా వానలా కురిస్తే.. మొత్తం భూమి అంతటా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. 3 సెం.మీ. అంటే తక్కువే అనిపించొచ్చు. కానీ అంతటా వాన అంటే.. అతిభారీ వరదలతో చాలా ప్రాంతాలు మునిగిపోయి, ఊహించలేని నష్టం జరుగుతుందని కెనడాలోని మెక్గిల్ యూనివర్సిటీ వాతావరణ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఫాబ్రీ తెలిపారు. కిలోమీటర్ మేఘం 500 టన్నులు వాతావరణంలో ఉండే నీటి ఆవిరి ఒకచోట చేరి మేఘాలు గా మారుతుంది. ఆ మేఘాలు చల్లబడి వాన పడుతుంది. మరి గాల్లో తేలిపోతూ ఉండే ఆ మేఘాల బరువెంతో తెలుసా? అమెరికాలోని కొలరా డోలో ఉన్న వాతావరణ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మార్గరెట్ లీమోన్ ఈ లెక్కను శాస్త్రీయంగా తేల్చారు. మేఘాల్లో ని నీటి ఆవిరి బరువు సగటున క్యూబిక్ మీటర్కు అర గ్రాము ఉంటుందని గుర్తించారు. ఒక క్యూబిక్ కిలోమీటర్ పరిమాణం ఉండే క్యుములో నింబస్ తరహా మేఘం బరువు ఏకంగా 500 మెట్రిక్ టన్నులుంటుందని తేల్చారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
తీవ్రరూపం దాల్చిన అల్పపీడనం
-
తీవ్రరూపం దాల్చిన అల్పపీడనం
మరో రెండు రోజులు కుండపోత వర్షాలు - తర్వాత మూడు రోజులు ఓ మోస్తరు వానలు - హైదరాబాద్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం - అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరిక - రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో రెట్టింపు వర్షపాతం నమోదు - హైదరాబాద్లో ఏకంగా 361 శాతం అధిక వర్షపాతం సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. దాని ప్రభావంతో శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తర్వాత మరో మూడు రోజులు ఒక మోస్తరు వానలు పడతాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఊపందుకోవడం, అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్లో హెవీ స్పెల్: హైదరాబాద్ నగరంలో శుక్రవారం తక్కువ సమయంలో అతి భారీ వర్షం (హెవీ స్పెల్స్) కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండు మూడు గంటల వ్యవధిలోనే ఏకంగా 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షం పడుతుందని అంచనా వేస్తున్నారు. రోజు మొత్తం కలిపి 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షం పడితే పెద్దగా ప్రమాదం ఉండదని.. కానీ 2, 3 గంటల్లోనే పడితే నగరం అతలాకుతలం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అవకాశం ఉంటే ఇళ్లలోనే ఉండిపోవాలని, అధికార యంత్రాం గం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. రెట్టింపు వర్షపాతం: నైరుతి రుతుపవనాలు మొదలైన జూన్ నెలలో 50 శాతం అధిక వర్షపాతం నమోదుకాగా.. జూలైలో 3 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. ఆగస్టులో మాత్రం 42 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మళ్లీ ఈ నెల (సెప్టెంబర్) ఒకటో తేదీ నుంచి గురువారం వరకు 22 రోజుల్లో సాధారణం కంటే 120 శాతం అధిక వర్షపాతం నమోదుకావడం గమనార్హం. ఈ 22 రోజుల్లో సాధారణంగా 98.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. 217.2 మిల్లీమీటర్లు రికార్డయింది. హైదరాబాద్లోనైతే ఏకంగా 361 శాతం అధికంగా నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రబీ సీజన్కు ముందు కురుస్తున్న ఈ భారీ వర్షాలతో చెరువులు నిండుతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని.. దీనివల్ల రబీ పంటలకు మరింత ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 26 వేల ఎకరాల్లో పంట నష్టం: భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 26,312 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. ఐదు వేల ఎకరాల్లో పత్తి, 8,365 ఎకరాల్లో కంది, 4 వేల ఎకరాల్లో జొన్న పంట, 2,400 ఎకరాల్లో వరి, 4,500 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. పలుచోట్ల సోయాబీన్, వేరుశనగ, మినుము పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.