breaking news
Andhra Pradesh Farmers Association
-
కష్టాలు మాకు..కాసులు మీకా?
సాక్షి, అమరావతి: రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని ప్రతికూల పరిస్థితుల్లోనూ పంట పండిస్తే గిట్టుబాటు ధర లేకుండా చేస్తారా? అన్నదాతా సుఖీభవా అంటూ రైతులకే శఠగోపం పెడతారా? అని మంగళవారం విజయవాడలో జరిగిన అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌర సరఫరాల అధికారులు, మిల్లర్లు మిలాఖత్ అయి ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నారని మండిపడింది. ఒక బస్తా వడ్లు పండించడానికి రైతు రక్తమాంసాలను పణంగా పెడుతుంటే మిల్లర్లు అడుగు కదలకుండా అడ్డగోలు దోపిడీకి పాల్ప డుతున్నారని, అయినా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తింది. ప్రభుత్వ దుర్నీతిని ఎండగట్టేందుకు, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న మోసాల తీరును వివరించేందుకు ఈనెల 27న పౌరసరఫరాల శాఖ కమిషనర్ను కలవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, ప్రముఖ రైతు నాయకుడు ఎర్నేని నాగేంద్రనాధ్, ఏపీ రైతు సంఘం నేత ఆంజనేయులు, ఏపీ కౌలు రైతుల సంఘం నేత విద్యాధరరావు, రైతు నాయకులు అనుమోలు గాంధీ, కొలనుకొండ శివాజీ, అక్కినేని చంద్రరావు, వై.రమేష్, కె.శ్రీనివాసరావు, కొల్లా రాజమోహన్ తదితరులు హాజరయ్యారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతు నాయకులు ఈ సదస్సులో తమ స్వానుభవాలను వివరించారు. 75 కిలోల బస్తాకి 1200 గ్రాముల ధాన్యాన్ని తారం కింద వ్యాపారులు అదనంగా తీసుకునేది చాలదన్నట్టు టన్నుకి మరో 5 కిలోలు అదనంగా తీసుకుంటున్నారని వాపోయారు. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)ను ధాన్యం కొనుగోళ్ల నుంచి ఓ పథకం ప్రకారం తప్పించడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్లకు వచ్చే ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలించి రైతుకు దక్కాల్సిన రవాణా చార్జీలను కూడా మిల్లర్లే తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బియ్యాన్ని తిరిగి మరాడించి మిల్లర్లు లబ్ధి పొందుతుంటే పౌరసరఫరాల అధికారులు అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యంలో తేమ నిబంధన పేరిట రైతుల్ని ఐకేపీ సెంటర్లలో అష్టకష్టాలు పెడుతున్నందునే రైతులు దిక్కుతోచని స్థితిలో ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు రైతులకు ఇస్తామని ప్రకటించిన మొత్తాన్ని ఈ ఖరీఫ్ నుంచే కౌలు రైతులకు కూడా ఇవ్వాలని పలువురు సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నేత నాగిరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లలో వ్యవసాయ రంగ దుస్థితిని వివరించారు. 75 కిలోల బస్తాకి 175 నుంచి 180 రూపాయల మధ్య రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం రైతులు, రైతు సంఘాలతో ఎందుకు చర్చలు జరపడం లేదని నిలదీశారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక్క ధాన్యం విషయంలోనే ఇలా జరగడం లేదని, రైతు పండించే ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళిక ఉండాలని సూచించారు. రైతులు సమైక్యంగా ముందుకు కదిలితే అనుకున్నది సాధించవచ్చని పిలుపునిచ్చారు. సదస్సు తీర్మానాలు... – ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దగాను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలి. – ఈ విషయాన్ని చర్చించేందుకు ఈనెల 27న పౌరసరఫరాల కమిషనర్ను కలవాలి. – రైతు సంఘాలు, మిల్లర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. – రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. – అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల అధికారులపై వేటు వేయాలి. రేపట్నుంచి బాబూ మా పక్కకే ధాన్యం కొనుగోళ్లలో ప్రస్తుత అవకతవకలకు ఇప్పటి వరకు ప్రథమ ముద్దాయిగా ఉన్న చంద్రబాబు రేపట్నుంచి తమ పక్కన చేరి పోరాడాల్సిందేనని రైతు నాయకుడు అనుమోలు గాంధీ అన్నారు. ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉద్యమించక తప్పదన్నారు. 23వ తేదీ తర్వాత రాష్ట్రంలో పెద్ద మార్పు రాబోతోందని ఈనాటి మొదటి ముద్దాయి (ముఖ్యమంత్రి చంద్రబాబు) రేపొద్దున ప్రతిపక్ష నేతగా రైతు సమస్యలపై గళం విప్పక తప్పదన్నారు. ఎవరొచ్చినా కమ్యూనిస్టులు పోరాటం చేయాల్సిందేనని, వాళ్లతో కలిసి మున్ముందు ఇతర రైతు సంఘాలు, పార్టీలు పోరాడక తప్పదని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. -
పత్తిని సీసీఐ అధికారులే కొనాలి
కాశిబుగ్గ, న్యూస్లైన్ : పత్తి కొనుగోలు చేసిన రోజే రైతులకు డబ్బులు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోర్తాల చందర్రావు సీసీఐ అధికారులను కోరారు. సంఘం ఆధ్వర్యం లో గురువారం వరంగల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి నేరుగా పత్తి కొను గోలు చేయాలని ముంబైలో సీసీఐ సీఎండీ, కేంద్ర జౌళిశాఖ మం త్రికి వినతిపత్రం అందజేసినట్లు వివరించారు. తేమ పేరుతో ఇబ్బంది పెట్టొద్దు.. మద్దతు ధరతో పత్తిని నేరుగా కొనుగోలు చేసి రైతులకు గన్నీ సంచుల డబ్బులతో సహా చెల్లించాలని కోరారు. కొనుగోళ్లలో కమీషన్ ఏజెంట్లు(అడ్తిదారులు), ఖరీదుదారులు, జిన్నింగ్ మిల్లు యజమానుల ప్రమేయం లేకుండా చూడాలని సీసీఐ సీఎండీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పత్తి నాణ్యతను పరిశీలించి ధర నిర్ణయించాలని, తూకం, చిట్టాబుక్, తక్పట్టీల ద్వారా చెల్లింపులను రైతులకు తెలియజేయాలన్నారు. అవసరమైతే రైతులకు డబ్బులను అకౌంట్ పేమెంట్ ద్వారా చెల్లించాలని సూచించారు. సీజన్లో రోజుకు సుమారు లక్ష బస్తాల పత్తిని రైతులు మార్కెట్కు తీసుకొస్తారని, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని పేర్కొన్నారు. పత్తి బస్తాలను ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జి మీదనే తూకం వేయించాలని, ప్రైవేట్ వే బ్రిడ్జిల మీద తూకాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని డిమాండ్ చేశారు. క్వింటాలుకు 15 శాతం కమీషన్లు.. రైతులకు అడ్తిదారులు డబ్బులు అదేరోజు అందజేయాలని, రూ.2 కంటే కమీషన్ మించకుండా చూడాలని ఆయన సూచించారు. వరంగల్ మార్కెట్లో అడ్తిదారులు రూ.3 నుంచి రూ.6 వరకు కమీషన్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ వే బ్రిడ్జిల మీద తూకం పేరుతో మరో 4 శాతం దోచుకుంటున్నారని విమర్శించారు. ఖాళీ బస్తాలు, హమాలీ, గుమస్తా, దడువాయి, ఇతర ట్రాన్స్పోర్టు ఖర్చులు కలుపుకుని క్వింటాలుకు రూ.15 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నారని వివరించారు. కమీషన్ల పేరుతో రైతులు మార్కెట్లో రోజుకు 7 నుంచి 8 కోట్ల రూపాయలు నష్టపోతున్నారని వెల్లడించారు. రైతు సంఘం ప్రతినిధు లు వారం రోజులకోసారి మార్కెట్ను సందర్శించి కొనుగోళ్లలో జరిగే లోపాలు, అక్రమాలను బయటపెడతారని ఆయన అడ్తి వ్యాపారులను హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ప్రతిని ధులు ఎం.వాసుదేవరెడ్డి, ఎస్.రోశయ్య, ఓదెల రాజయ్య, జె.జనార్దన్రెడ్డి, కత్తి సుధాకర్ పాల్గొన్నారు.