breaking news
Acche Naidu
-
నిమ్మాడ ఘటనలో అచ్చెన్నాయుడు అరెస్ట్
సాక్షి, టెక్కలి: తన సొంత గ్రామం నిమ్మాడలో గత నెల 31వ తేదీ ఆదివారం నామినేషన్ వేసేందుకు వెళ్లిన కింజరాపు అప్పన్న, ఆయనకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ తదితరులపై జరిగిన దౌర్జన్యకాండకు ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఏఎస్పీ శ్రీనివాసరావు, కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, టెక్కలి సీఐ ఆర్.నీలయ్యతో పాటు పోలీస్ బలగాలు నిమ్మాడలో ఆయన ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్కు తరలించి సంఘటనకు సంబంధించి రికార్డులను సిద్ధం చేసి కోటబొమ్మాళి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో కొత్తపేట జంక్షన్ వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు అచ్చెన్నాయుడు ఉన్న పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నాయి. దీంతో పోలీస్ ప్రత్యేక బలగాలు రంగ ప్రవేశం చేసి వారిని నియంత్రించాయి. అనంతరం కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రిలో ఆయనకు కోవిడ్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కోర్టు వద్దకు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని అదుపు చేశారు. కోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత అచ్చెన్నాయుడుకు 14 రోజులు రిమాండ్ విధించగా, మధ్యాహ్నం 3.40 గంటలకు ఆయన్ను జిల్లా జైలుకు తరలించారు. ఎందుకు ఈ కేసు అంటే.. ►నిమ్మాడలో కింజరాపు అప్పన్న సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయడం అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్లకు ఇష్టం లేదు. ►అచ్చెన్నాయుడు గత నెల 30వ తేదీన అప్పన్నకు ఫోన్ చేశారు. ‘అందరం ఒకే దగ్గర ఉంటున్నాం. గతంలో నీకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే. నీ భార్యను ఉద్యోగం నుంచి తీసేయించారన్న విషయం కూడా నాకు తెలుసు. మా అన్నయ్య నోట్ పేపర్ తీసుకొన్న విషయం మాత్రం తెలియదు. అవన్నీ సరే. నువ్వు నష్టపోయావని కూడా తెలుసు. అయినా సరే ఇప్పుడు మాత్రం నువ్వు పోటీ చేయొద్దు. అదేం రాష్ట్రపతి పదవి కాదు’ అని తనదైన శైలిలో చెప్పారు. ‘ఉద్యోగం తీసేయించారు.. మీ వద్దకు 20 సార్లు వచ్చినా పట్టించుకోలేదు..’ అని బాధితుడు చెప్పిన దానికి అవునంటూనే ఎన్నికల్లో పోటీ చేయొద్దని బెదిరించారు. ►తనకు జరిగిన అన్యాయం పట్ల తీవ్రంగా కలత చెందిన అప్పన్న.. పంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడానికే సిద్ధపడ్డారు. ►ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పినా వినకుండా అప్పన్న నామినేషన్ వేయడానికి వెళ్తున్నాడనే సమాచారం తెలుసుకున్న అచ్చెన్నాయుడు.. అతన్ని ఎలాగైనా సరే ఆపండని గత నెల 31న తన సోదరుడిని పురమాయించారు. దీంతో హరిప్రసాద్, సురేష్, టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై బాధితుడు అప్పన్న కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ►ఈ మేరకు క్రైమ్ నంబర్ 44/2021 ప్రకారం 147, 148, 307, 324, 506, 341, 384, 188 రెడ్ విత్ 149, ఐపీసీ సెక్షన్ 123 ఆఫ్ ది పీపుల్ రిప్రజెంట్ చట్టం, సెక్షన్ 212 ఆఫ్ ది ఏపీ పంచాయతీ రాజ్ చట్టం–1995 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితులు కింజరాపు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 22 మందిపై కేసు నమోదు సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో నామినేషన్ వేయకుండా అడ్డుకుని, బెదిరింపులకు పాల్పడిన ఘటనలో 22 మందిపై కేసు నమోదు చేశామని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి రంగారావు తెలిపారు. మంగళవారం ఆయన విశాఖ డీఐజీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనని, శాంతి, సామరస్య ధోరణిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడడం పోలీసులుగా తమ బాధ్యత అన్నారు. ఎన్నికలకు ఆటంకం కలిగించే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. నేను హోంమినిష్టర్ అవుతా.. మిమ్మల్ని విడిచిపెట్టను ‘రేపు అధికారంలోకి మేమే వస్తాం.. చంద్రబాబునాయుడుకు చెప్పి నేను హోమ్ మినిష్టర్ పదవి తీసుకుంటాను.. మీరు ఎక్కడ ఉన్నా విడిచిపెట్టను’ అని కోటబొమ్మాళి ఆస్పత్రి వద్ద కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ ఆర్.నీలయ్య, పోలీసులను అచ్చెన్నాయుడు బెదిరించారు. -
కింజారపు కుటుంబం హత్యారాజకీయాలకు అలవాటు పడింది..
సాక్షి, శ్రీకాకుళం: కింజారపు సోదరుల కుటుంబం హత్యారాజకీయాలకు అలవాటు పడిందని టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. నిమ్మాడలో ప్రతి పంచాయతీ ఎన్నికల్లో హత్యలు చేయించడం కింజారపు కుటుంబానికి పరిపాటిగా మారిందని దువ్వాడ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకుడు కింజారపు అప్పన్న నామినేషన్ వేస్తానంటే, అతని చంపుతామంటూ కింజారపు సోదరుల అనుచరులు ఇంటికి వెళ్లి బెదిరించారన్నారు. అప్పన్నకు తోడుగా తానే వెళ్లి నామినేషన్ వేయిద్దామనుకుంటే, తనపై కూడా కత్తులతో దాడి చేసి చంపాలని ప్రయత్నించారని ఆరోపించారు. తమపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన తన అనుచరులు, పోలీసులపై కూడా కింజారపు సోదరుల అనుచరులు దాడి చేశారన్నారు. ఈ సందర్భంగా వారు తమ వాహనాలు ధ్వంసం చేసి, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు స్వయంగా ఫోన్ చేసి అప్పన్న కుటుంబ సభ్యులను బెదిరించినా, ఎన్నికల కమిషనర్ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. అసలు నాగరిక ప్రపంచంలో ఉన్నామా అనే అనుమానం కలిగేలా అల్లరి మూకలు చెలరేగారన్నారు. అయినప్పటికీ తాము సంయమనంతో వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఇప్పటికే పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని, పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
'మంత్రి డైరెక్షన్లోనే భారీ అవినీతి'
విజయవాడ సెంట్రల్: కార్మికుల రక్తం పీలుస్తున్న కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికశాఖలో అవినీతి అంతా మంత్రి డెరెక్షన్లోనే జరుగుతోందని విమర్శించారు. ఐటీఐ కళాశాలల్లో రూ.7,500లుగా ఉన్న ఫీజును ఏకంగా రూ.16,500కు పెంచేశారని మండిపడ్డారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యం నుంచి వందల కోట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. పరికరాల కొనుగోలు, శిక్షణా తరగతుల నిర్వహణ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని చెప్పారు. కార్మిక, ఉపాధి శాఖ జేడీ మునివెంకటనారాయణ ఇంటిపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో ఆ శాఖ అవినీతి బట్టబయలైందన్నారు. తామేమీ ఆరోపణలు చేయడం లేదని, నైపుణ్యాల శిక్షణ పేరిట తప్పుడు సంస్థలకు బిల్లుల చెల్లింపు, పరికరాల కొనుగోలులో అవినీతి, ప్రైవేటు కళాశాలల యాజమాన్యం నుంచి భారీ వసూళ్లకు పాల్పడ్డారని ఏసీబీ, విజిలెన్స్ దర్యాప్తులో బయటపడిందని గౌతంరెడ్డి చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు కార్మికశాఖలో జరిగిన అవినీతిపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. చీటికి మాటికి ప్రతిపక్షాలపై విమర్శలు చేసే ఆయన తన సొంత శాఖలో జరిగిన అవినీతిపై మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన ‘ఆలీబాబా 40 దొంగల’ కథనుతలపిస్తోందని గౌతంరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకోవాలని చంద్రబాబు 40 మంది దొంగల్ని రాష్ట్రం మీదకు పంపారని ఎద్దేవా చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన సెస్ను చంద్రన్న చలువ పందిళ్లు, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ, వ్యాపారవేత్తలకు సన్మానాలకు ఖర్చు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కార్మికుల బీమా ప్రీమియంను సొంత ప్రచారానికి వాడుకున్నారన్నారు. మంత్రి అచ్చెన్నాయుడుపై మహిళలను వేధించడం, హత్యానేరం కేసులు ఉన్నాయని తెలిపారు. ఇటువంటి మంత్రిని మంత్రివర్గంలో కొనసాగించడం సిగ్గుచేటని, తక్షణమే ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు.