గోదావరి పుష్కరాల్లో వీఐపీ సంస్కృతిపై కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ మండిపాటు
విశాఖపట్నం: గోదావరి పుష్కరాల్లో వీఐపీ సంస్కృతిపై కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ మండిపడ్డారు. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు స్వయంగా నిర్వహిస్తున్న ఈ పుష్కరాల తతంగంపై తాను ఎంతో ఆవేదన చెందుతున్నానన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు ఆయన బహిరంగ లేఖ రాశారు.
పుష్కర భక్తుల కష్టాలపై సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు కాస్తయినా శ్రద్ధ చూపి ఉంటే 29 మంది ప్రాణాలు పోయేవి కావన్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినా కూడా తమ కుటుంబ సభ్యులు, వందిమాగదులతో వీఐపీలు రాజమండ్రికి వస్తూనే ఉన్నారని విమర్శించారు. వారి వల్ల భక్తులకు ఇబ్బందితో పాటు ప్రభుత్వ ఖజానాపై కూడా పెనుభారం పడుతుందని వివరించారు.