పన్ను కట్టకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించిన భారతీయ సంతతి దంపతులకు న్యూజిలాండ్లో శిక్ష పడింది.
మెల్ బోర్న్: పన్ను కట్టకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించిన భారతీయ సంతతి దంపతులకు న్యూజిలాండ్లో శిక్ష పడింది. వారిని దాదాపు ఎనిమిది నెలలపాటు ఇంట్లోనే నిర్బంధంలో ఉంచేలా కోర్టు శిక్ష విధించింది. తరుణ్, షేతల్ ఖురానా హోవిక్ అనే ప్రాంతంలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నారు. చాలా కాలంగా వారు తమ అమ్మకాలకు సంబంధించిన పన్ను కట్టడం లేదని, మొత్తం ఒక మిలియన్ డాలర్లు(రూ.64లక్షలు) బకాయి పడ్డారని, వీటి విషయంలో స్పందన కూడా తెలియజేయకపోవడంతో వారిపై అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా, తమ రెస్టారెంట్లో పనిచేసే వారికి జీతభత్యాలు కూడా పెద్ద మొత్తంలో చెల్లించకుండా వచ్చిన ఆదాయమంతా వ్యక్తిగతంగానే ఉంచుకున్నారని కోర్టు స్పష్టం చేస్తూ శిక్ష విధించింది. వారిపై మొత్తం నాలుగు అభియోగాలు మోపి శిక్షను ఖరారు చేశారు. ప్రభుత్వ వ్యవస్థను మోసం చేస్తూ పన్ను ఎగవేయొచ్చు అని ఆలోచించేవారందరికీ ఈ తీర్పు గుణపాఠం అవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.