బిల్లులో మార్పులు చేయాల్సిందే: కాంగ్రెస్ | Changes must be in the bill: Congress | Sakshi
Sakshi News home page

బిల్లులో మార్పులు చేయాల్సిందే: కాంగ్రెస్

Dec 5 2015 3:32 AM | Updated on Mar 18 2019 7:55 PM

జీఎస్‌టీ బిల్లులో తాము కోరిన సవరణలు చేయాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ పునరుద్ఘాటించింది.

కాంగ్రెస్ అడ్డుకుంటోంది:ఎన్‌సీపీ, బీజేడీ
 

 న్యూఢిల్లీ: జీఎస్‌టీ బిల్లులో తాము కోరిన సవరణలు చేయాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ పునరుద్ఘాటించింది. బిల్లు విషయంలో ప్రధాని మోదీ కొద్ది రోజుల కిందట తమ పార్టీ చీఫ్  సోనియా గాంధీతో చర్చించటం శుభారంభమని, ఈ మార్పు కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్యసింధియా హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో మాట్లాడుతూ.. ఈ బిల్లుపై ప్రతిష్టంభనకు ప్రభుత్వమే కారణమన్నారు. జీఎస్‌టీ పన్నుపై 18 శాతం గరిష్ట పరిమితి విధించాలని, అంతర్రాష్ట్ర విక్రయాలపై ప్రతిపాదిత ఒక శాతం పన్నును తొలగించాలని, వివాదాలను పరిష్కరించటానికి స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని తమ డిమాండ్లను పునరుద్ఘాటించారు.

అలాగే కాంగ్రెస్ హయాం లో ఎమర్జెన్సీ, 1984 సిక్కు అల్లర్లు తప్పని అన్నారు. అయితే.. జీఎస్‌టీ వంటి చట్టాలను కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఎన్‌సీపీ నేత సుప్రియాసూలే, బీజేడీ నేత జేపాండాలు విమర్శించారు. ప్రతిపక్షం తన పాత్రపోషించాల్సి ఉన్నప్పటికీ, దానర్థం  చట్టాలను అడ్డుకోవటం కాదన్నారు. అంతర్రాష్ట్ర అమ్మకాలపై ఒక శాతం పన్ను తొలగింపు డిమాండ్‌కు మద్దతిస్తున్నామని.. అయితే.. జీఎస్‌టీపై 18 శాతం పరిమితిని రాజ్యాంగపరంగా విధించాలనటాన్ని సమర్థించలేమని పాండా అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement